మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రేపు రాజ్ ఘాట్లో లోక్ సంవర్ధన్ పర్వ్ ప్రారంభం
ఇది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధాన పథకాలు, కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రదర్శించే సమగ్రాభివృద్ధి వేడుక
Posted On:
10 JUN 2025 11:58AM by PIB Hyderabad
సాధికారత, సమ్మిళితత్వం, సాంస్కృతిక పురోగతితో ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్ సంవర్ధన్ పర్వ్ ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని 2025, జూన్ 11 నుంచి 15 వరకు న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లోని గాంధీ దర్శన్ వద్ద ఉన్న బిర్సా ముండా లాన్లో నిర్వహిస్తారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ దార్శనికతలో భాగంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు, కార్యక్రమాలు, విజయాలను ప్రదర్శించే సమ్మిళిత అభివృద్ధి వేడుకగా దీనిని నిర్వహిస్తారు. మైనారిటీ సమాజాల్లో ముఖ్యంగా చేతివృత్తుల వారు, సంప్రదాయ కళాకారులకు ఆర్థిక సాధికారత అందించే దిశగా మంత్రిత్వ శాఖ నిరంతరం చేపడుతున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంది.
ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మంది కళాకారులకు మంచి వేదికను ఈ లోక్ సంవర్దన్ పర్వ్ కార్యక్రమం అందిస్తుంది. ఇక్కడ వారు తమ సంప్రదాయ కళా ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకోవచ్చు. అలాగే కొనుగోలుదారులతో సంభాషించడంతో పాటు మార్కెట్ సంబంధాలను ఏర్పరచుకోవచ్చు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణలు:
పీఎం వికాస్ (ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్), ఎన్ఎండీఎఫ్సీ పథకాలు, విజయగాథలతో సహా మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కళాకారులు, పాకశాస్త్ర నిపుణులు పాల్గొంటారు.
లక్క గాజులు, చెక్క పెయింటింగ్లు, నీల వర్ణంలోని కుండలు, ఎంబ్రాయిడరీ, బనారసీ బ్రొకేడ్, ఫుల్కారీ, తోలు కళాకృతులు, కార్పెట్, నగలు, చెక్క కళాకృతులు తదితర సంప్రదాయ, హస్తకళలను ప్రదర్శించి, విక్రయిస్తారు.
దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శనలతో సహా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
మైనారిటీ సమాజాల సాంస్కృతిక వారసత్వం, పారిశ్రామిక స్ఫూర్తిని తెలియజేస్తూనే.. మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి ప్రయత్నాలపై అవగాహన పెంచడమే ఈ ఉత్సవ లక్ష్యం. సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించడం, దేశీయ కళారూపాలను పరిరక్షించడం, స్థిరమైన జీవన విధానాలను అందించే విస్తృత ప్రయత్నాల్లో ఇది ఓ భాగం.
వైవిధ్యం, స్థిరత్వం, అభివృద్ధిని ప్రదర్శించే ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందరినీ ఆహ్వానిస్తోంది.
***
(Release ID: 2135400)