రక్షణ మంత్రిత్వ శాఖ
మూడు లక్షల మంది కేడెట్లతో ఎన్సీసీ విస్తరణ...శ్రీ సంజయ్ సేఠ్ ప్రకటన
Posted On:
03 JUN 2025 1:14PM by PIB Hyderabad
నేషనల్ కేడెట్ కోర్ (ఎన్సీసీ) ప్రత్యేక సంయుక్త రాష్ట్రాల ప్రతినిధులు, అడిషనల్ లేదా డెప్యుటీ డైరెక్టర్స్ జనరల్ (జేఎస్ఆర్-ఏ/డీ) సమావేశాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్ భోపాల్లో ఈ రోజు ప్రారంభించారు. ఎన్సీసీని ఒక పథకం ప్రకారం విస్తరించడానికి దేశమంతటా మూడు లక్షల మంది కేడెట్లను చేర్చుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. దీనికోసం అనేక రాష్ట్రాలు ఇప్పటికే వాటి అంగీకారాన్ని తెలియజేశాయని, శిక్షణనివ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతమైన వృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ సంజయ్ సేఠ్ ప్రసంగిస్తూ, దేశ నిర్మాణంలోనూ, యువతను తీర్చిదిద్దడంలోనూ ఎన్సీసీ భూమికను పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిలో పూర్వ సైనికులను ఎన్సీసీ బోధకులుగా చేర్చుకోవడం, వారికి ఉపాధి తాలూకు నూతన అవకాశాలను కల్పించడం వంటివి భాగంగా ఉన్నాయి. స్వచ్ఛ్ భారత్ ఉద్యమం, నయా సవేరా పథకం, నషా ముక్తి ఉద్యమం వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్రియాశీల భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. మౌంట్ ఎవరెస్టును ఈ నెల 18న ఎన్సీసీ దళ సభ్యులు విజయవంతంగా అధిరోహించినందుకు రక్షణ శాఖ సహాయ మంత్రి అభినందనలు తెలిపారు. ధైర్య-సాహసాలతో పాటు కేడెట్ల సామర్థ్యానికి ఇది ఒక శక్తిమంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు.
కేంద్ర-రాష్ట్రాల సహకారం కొనసాగాలని శ్రీ సంజయ్ సేఠ్ పిలుపునిచ్చారు. ఎన్సీసీ విస్తరణకు తోడ్పడడానికి అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం వంటి తమ వాగ్దానాలను రాష్ట్రాలు నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల యువత భవితకు రూపురేఖలను ఇవ్వడంలోనూ, దేశాన్ని సురక్షితంగా ఉంచడంలోనూ ఈ సంస్థ పోషిస్తున్న ముఖ్య పాత్రకు బలం సమకూరుతుందన్నారు.
కోర్ విజయాలను, ముందున్న మార్గాన్ని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ వివరించారు. దీనిలో దేశవ్యాప్తంగా పటిష్టమైన శిక్షణ-శిబిరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ తీసుకున్నారు. సంస్థలో యువత మరింత ఎక్కువ స్థాయిలో పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించడంతో పాటు కేడెట్ల పనితీరును మెరుగుపరచాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, యువజన వ్యవహారాలు-క్రీడల శాఖ మంత్రులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్రాల విభాగాల ప్రతినిధులు, అన్ని రాష్ట్రాల ఎన్సీసీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 2133544)