సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సిందూర్: సమగ్ర బలగం ఆవిష్కృతం
భారత సాయుధ దళాల సమన్వయం ప్రస్ఫుటం
Posted On:
18 MAY 2025 5:42PM by PIB Hyderabad
పరిచయం
ఇది బహుళ రంగ యుద్ధ శకం... సరిహద్దులు దాటడంకన్నా ముప్పులు త్వరగా చుట్టుముట్టే కాలం. ఈ పరిస్థితుల నడుమ భారత జాతీయ భద్రత స్వరూపం సమష్టి శక్తికి, వ్యూహాత్మక దూరదృష్టికి ప్రతీకగా నిలిచింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ముష్కరులు 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న తర్వాత 2025 మే 7న ఆపరేషన్ సిందూర్ కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అటుపైన అత్యంత కచ్చితత్వం, అసాధారణ వృత్తి నైపుణ్యం, సంకల్ప బలానికి ప్రతిరూపమైన మన త్రివిధ దళాలు దీటైన ప్రతిస్పందనను ప్రదర్శించాయి. ఆ మేరకు నియంత్రణ రేఖ వెంబడి మాత్రమేగాక, పాకిస్థాన్ లోలోపలి ఉగ్రవాద మౌలిక సదుపాయాల విధ్వంసాన్ని ఒక శిక్షాత్మక, లక్షిత కార్యక్రమంగా ఆపరేషన్ సిందూర్ అమలైంది.
బహళ నిఘా సంస్థల నిర్దిష్ట సమాచారం మేరకు 9 కీలక ఉగ్రవాద రహస్య శిబిరాలు లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కచ్చితమైన ప్రణాళిక, నిఘా నేత్రం నేతృత్వంలోని నిర్దిష్ట విధానం ప్రాతిపదికగా భారత్ ప్రతీకార చర్య అమలైంది. తదనుగుణంగా అన్ని ప్రక్రియలూ ఎలాంటి ప్రభావిత నష్టాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తయ్యాయి. ఈ కార్యాచరణ ప్రధానంగా నైతిక విలువల ఆధారితం కాగా, పౌరులకు హాని కలగకుండా తగు సంయమనం, జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తన సహజ వక్ర రీతిలో భారత్లోని కీలక వైమానిక స్థావరాలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడి చేసింది. ఈ మేరకు వరుసగా డ్రోన్లు, మానవరహిత యుద్ధ వాహనాల (యూసీఏవీ)ను ప్రయోగించింది. కానీ, వీటన్నిటినీ భారత్ సమగ్ర, బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ విజయం వెనుక సమీకృత నిర్వహణ-నియంత్రణ వ్యూహం (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రాటజీ-ఐసీసీఎస్) ఉంది. ఇది బహుళ రంగాల్లో తక్షణ ముప్పుల గుర్తింపు, అంచనా, నిరోధం ప్రక్రియలను సులువు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి ప్రభుత్వం, ఏజెన్సీలు, విభాగాల సంపూర్ణ మద్దతుతో ప్రతి అంశంలోనూ దళాల మధ్య కార్యాచరణ అత్యంత సమన్వయంతో పూర్తయింది.
యుద్ధ క్షేత్రంలో భూమి, ఆకాశం, సముద్రం అన్నింటా- భారత సైన్యం, వైమానిక, నావికా దళాల మధ్య తిరుగులేని సమన్వయానికి ఈ ఆపరేషన్ ఒక ప్రతీక. పాకిస్థాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై కచ్చితంగా దాడి చేయడంలో వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. తద్వారా నూర్ ఖాన్, రహిమ్యార్ ఖాన్ వైమానిక దళ స్థావరాలను తీవ్ర ప్రభావిత వైమానిక దాడితో ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ అనంతరం అధికారిక సమాచార వెల్లడి సందర్భంగా విలేకరులకు సచిత్ర ఆధారాలను అధికారులు ప్రదర్శించారు. సరిహద్దు ఆవలి నుంచి శత్రువు ప్రతీకార డ్రోన్, ‘యూసీఏవీ’లతో దాడికి పాల్పడినపుడు వాటిని తుత్తునియలు చేస్తూ భారత గగనతల రక్షణలో వైమానిక దళ బలమైన రక్షణ ఛత్రం తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. దేశీయంగా రూపొందించిన ఉపరితల-గగనతల క్షిపణి ఛేదన సామర్థ్యంగల ఆకాష్ క్షిపణి వ్యవస్థతోపాటు పెచోరా, ‘ఓఎస్ఏ-ఏకే’ వంటి వారసత్వ రక్షణ వేదికలను అంచెలావారీ రక్షణ ఛత్రంలో సమర్థంగా ఏకీకృతం చేశారు. వైమానిక దళ ‘ఐసీసీఎస్’ వ్యవస్థ వైమానిక వనరుల తక్షణ సమన్వయాన్ని సుసాధ్యం చేసింది. తద్వారా భారత దళాలు గగగనతల ముప్పులను సమర్థంగా తిప్పికొట్టడానికి, పోరాటం ఆద్యంతం నిర్దిష్ట-కేంద్రీకృత కార్యకలాపాలకు వీలు కలిగింది.
మరోవైపు రక్షణ-ఎదురు దాడి పాత్రలలో భారత సైన్యం తన సంసిద్ధతను, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సైన్యంలోని వైమానిక రక్షణ విభాగాలు వైమానిక దళంతో సంయుక్తంగా కార్యకాపాలు నిర్వహించాయి. భుజం మీదినుంచి పేల్చగల (షోల్డర్-ఫైర్డ్) ‘మాన్ప్యాడ్స్’, దీర్ఘశ్రేణి గగనతల రక్షక భూతల తుపాకులు (ఎల్ఎల్ఎడి) నుంచి ఉపరితల-గగనతల క్షిపణులు (ఎస్ఏఎం) దాకా విస్తృత శ్రేణి వ్యవస్థలను మన బలగాలు మోహరించాయి. పాక్ ప్రయోగించిన వరుస డ్రోన్లను, సంచార ఆత్మాహుతి డ్రోన్ల (లాయిటర్ మ్యునిషన్)ను కుప్పకూల్చడంలో ఇవన్నీ కీలక పాత్ర పోషించాయి. భారత భూభాగంలో విధ్వంసానికి పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేసినా సైనిక, పౌర మౌలిక సదుపాయాల భద్రతకు భరోసా కల్పించడంలో భారత దళాలు తమ సామర్థ్యం రుజువు చేసుకున్నాయి.
‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా భారత నావికాదళం సముద్రాధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. ఈ మేరకు మిశ్రమ నెట్వర్క్ బలగం తరహాలో నావికాదళ ‘మిగ్-29కె’ ఫైటర్ జెట్లు, వైమానిక ముందస్తు హెచ్చరిక హెలికాప్టర్ సహిత ‘క్యారియర్ బాటిల్ గ్రూప్’ (సిబిజి)ను మోహరించింది. సముద్ర రంగమంతటా నిరంతర నిఘా, ముప్పుల తక్షణ గుర్తింపునకు ఇది భరోసా ఇచ్చింది. ఆ మేరకు శక్తిమంతమైన ‘సిబిజి’ వైమానిక రక్షణ ఛత్రం ముఖ్యంగా... మక్రాన్ తీరం వైపునుంచి శత్రు విమాన చొరబాట్లను నిరోధించింది. నావికాదళ ప్రమేయం బలమైన నిరోధక శక్తిని సృష్టించడంతో పాక్ పశ్చిమ సముద్ర తీరం వెంబడి దాని వైమానిక దళాలకు దారి మూసుకుపోయింది. నావికాదళ పైలట్లు 24 గంటలూ యుద్ధ విన్యాసాలు కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో భారత్ సంసిద్ధత, వ్యూహాత్మక పరిధిని శత్రువుకు మరింత స్పష్టం చేశారు. సముద్రాలపై నావికాదళ అసమాన నియంత్రణ శక్తి ఫలితంగా సంక్లిష్ట ముప్పు వాతావరణంలో దాని క్షిపణి-విమాన నిరోధక రక్షణ సామర్థ్యాలు కూడా స్పష్టమయ్యాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్ముకశ్మీర్లోని సాంబా జిల్లా పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ చొరబాటు ప్రయత్నాన్ని సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) సమర్థంగా అడ్డుకుంది. ఈ మేరకు తెల్లవారుజామున ముష్కరుల అనుమానాస్పద కదలికను పసిగట్టిన దళాలు అమిత వేగంగా స్పందించాయి. దుండగులు ఎదురుకాల్పులకు తెగబడగా, ఇద్దరు చొరబాటుదారులను విజయవంతంగా మట్టుబెట్టాయి. అటుపైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతరత్రా యుద్ధసామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ‘బీఎస్ఎఫ్’ అప్రమత్తత, కార్యాచరణ సంసిద్ధత, తీవ్ర ఉద్రిక్తతల సమయాన సరిహద్దు భద్రత పరిరక్షణలో ఆ దళాల కీలక పాత్రను ప్రస్ఫుటం చేసింది.
ఆపరేషన్ సిందూర్ కేవలం వ్యూహాత్మక విజయం కాదు... అదొక వ్యూహాత్మక సామర్థ్య ప్రదర్శన. అత్యంత కచ్చితత్వంతో భూమి, ఆకాశం, సముద్రం అంతటా సమన్వయ సహిత సైనిక చర్య సామర్థ్యాన్ని భారత్ స్పష్టంగా ప్రదర్శించింది. రక్షణ సంసిద్ధతపై ఏళ్ల తరబడి చూపిన శ్రద్ధ, చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన తిరుగులేని విధాన-బడ్జెట్ పరమైన మద్దతుతో ఈ ఆపరేషన్ సాధ్యమైంది. ఈ మేరకు సందేశం విస్పష్టంగా ఉంది: హేతుబద్ధత, దౌత్యంపై విజ్ఞప్తులకు నిరంతర దుందుడుకు స్పందన ఎదురవుతున్నపుడు నిర్ణయాత్మక ప్రతిస్పందన సమర్థనీయం, అత్యావశ్యకం. మొత్తంమీద, భారత రక్షణ రంగ చరిత్రలో ఆపరేషన్ సిందూర్ ఒక నిర్ణయాత్మక మలుపుగా గుర్తుండిపోతుంది. సైనిక కచ్చితత్వం, దళాల మధ్య అంతర్గత సహకారం, జాతీయ సంకల్ప శక్తికి ఇదొక చిరస్మరణీయ చిహ్నం. ఇది ఉగ్రవాద ముప్పులను విజయవంతంగా నిర్మూలించింది... భారత్ ప్రాంతీయ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. అదే సమయంలో సరిహద్దు ఉగ్రవాదాన్ని అదుపులో పెడుతూనే... దాన్ని దృఢమైన ప్రతిస్పందనతో దీటుగా ఎదుర్కొంటామనే బలమైన సందేశాన్నిచ్చింది.
సాయుధ దళాల మధ్య సమన్వయం దిశగా ప్రభుత్వ సారథ్యంలో కృషి
1. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి సృష్టి
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని సృష్టించేందుకు 2019 డిసెంబరు 24న కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిం. ఇది ‘ఫోర్-స్టార్’ జనరల్ హోదా... ఈ మేరకు ‘సీడీఎస్’ సైనిక వ్యవహారాల విభాగం (డీఎంఏ)కి నాయకత్వం వహించడంతోపాటు త్రివిధ దళాల సంబంధిత అంశాల్లో రక్షణశాఖ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు.
సీడీఎస్ ప్రధాన విధులు:
· సైన్యం, నావికా-వైమానిక దళాలతోపాటు ప్రాదేశిక సైనిక బలగంపైనా పర్యవేక్షణ.
· కొనుగోళ్లు, శిక్షణ, సిబ్బంది నియామకం, కమాండ్ పునర్నిర్మాణంలో ఉమ్మడి తత్వాన్ని ప్రోత్సహించడం.
· సైబర్, అంతరిక్ష కమాండ్స్ సహా త్రివిధ దళ సంస్థలకు నాయకత్వం వహించడం.
· న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి సలహాలివ్వడం, రక్షణ ప్రణాళిక సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం.
· వనరుల గరిష్ఠ వినియోగం, పోరాట సామర్థ్యం పెంపు, వృథా తగ్గింపు దిశగా సంస్కరణలకు సారథ్యం.
· బహుళ-సంవత్సర రక్షణ కొనుగోళ్ల ప్రణాళికల అమలు, అంతర్-దళ అవసరాలకు ప్రాధాన్యమివ్వడం.
‘సిడిఎస్’ పదవి ఏకీకృత నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది... మరింత సమన్వయ సహిత ఆధునిక భారతీయ సైన్యం దిశగా ఏకీకరణకు దోహదం చేస్తుంది.
2. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ (ఐటీసీ)
సాయుధ దళాల ఆధునికీకరణ, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్, ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్ ఏర్పాటు ద్వారా బలగాల పునర్నిర్మాణ కృషి సాగుతోంది. ఈ సంస్కరణలు భౌగోళికత, సామర్థ్యం ప్రాతిపదికన సైన్యం, నావికా-వైమానిక దళ సామర్థ్యాల ఏకీకరన ద్వారా కార్యాచరణ సంసిద్ధత గరిష్ఠీకరణ దీని లక్ష్యం. ఈ మేరకు సాయుధ దళాల ప్రధాన కార్యాలయ స్థాయిలో సమన్వయం, పోరాట ప్రభావాల పెంపు, భూ సరిహద్దులు, సముద్ర, ఉమ్మడి/ఇంటిగ్రేటెడ్ గగనతల రక్షణ థియేటర్ కమాండ్స్ కోసం వివిధ అధ్యయనాల ద్వారా అన్వేషణ చురుగ్గా సాగుతోంది. ఈ మేరకు ఐటీసీల కోసం సమష్టి తత్వం, ఏకీకరణ అత్యంత అవశ్యమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. పరిపాలన, ‘రైజ్-ట్రైయిన్-సస్టెయిన్’ విధులతో పోలిస్తే కార్యాచరణలో పాత్రను ఇది స్పష్టంగా వేరు చేస్తుందన్నారు. తద్వారా భద్రత, కార్యకలాపాలపై కమాండర్లు దృష్టి పెట్టే వీలు కల్పిస్తుంది. బహుళ-రంగ కార్యకలాపాల వైపు విస్తృత సంస్కరణల ఆరంభాన్ని ‘ఐటీసీ’లు సూచిస్తాయి. అంతరిక్షం, సైబర్ ప్రపంచాలను సంప్రదాయ రంగాలతో అనుసంధానించడం, డిజిటలీకరణ, డేటా-కేంద్రక యుద్ధరీతిని ముందుకు తీసుకెళ్లడం ఇందులో భాగంగా ఉంటాయి.
3. సైనిక వ్యవహారాల విభాగం (డీఎంఏ)
త్రివిధ దళాల మధ్య వనరుల సముచిత వినియోగం, ఉమ్మడి తత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా 2020లో ‘సీడీఎస్’ కార్యదర్శిగా సైనిక వ్యవహారాల విభాగం (డీఎంఏ) ఏర్పాటైంది. ‘డీఎంఏ’కి అప్పగించిన అంశాలు కిందివిధంగా ఉన్నాయి:
· కేంద్ర సాయుధ దళాలు- సైన్యం, నావికాదళం, వైమానిక దళం.
· ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాలు, రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయాలతో కూడిన రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సమగ్ర ప్రధాన కార్యాలయం.
· ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల సంబంధిత కార్యకలాపాలు.
· సంయుక్త ప్రణాళిక, అవసరాల ఏకీకరణ ద్వారా త్రివిధ దళాల కోసం కొనుగోళ్లతోపాటు శిక్షణ, సిబ్బంది నియామకంలో ఉమ్మడి తత్వాన్ని ప్రోత్సహించడం.
· ఉమ్మడి/థియేటర్ కమాండ్ల ఏర్పాటు ద్వారా కార్యకలాపాలలో సమష్టి తత్వాన్ని ప్రోదిచేయడం, తద్వారా వనరుల సముచిత వినియోగం దిశగా సైనిక కమాండ్ల పునర్నిర్మాణ సౌలభ్యం కల్పన.
4. ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) చట్టం-2023
భారత సాయుధ దళాల్లో ఉమ్మడి తత్వాన్ని ప్రోదిచేయడమే ‘ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) చట్టం-2023 లక్ష్యం. ఈ మేరకు త్రివిధ దళాల కమాండర్లకు సిబ్బందిపై ఇది అధికారం కల్పిస్తుంది. తద్వారా మూడు దళాల క్రమశిక్షణ శ్రేణి ఏకీకృతమై నిర్ణయాత్మకతలో వేగంతోపాటు కార్యాచరణ, సాంస్కృతిక ఏకీకరణకు దోహదం చేస్తుంది. వ్యక్తిగత సేవా గుర్తింపు ప్రభావితం కాకుండా కమాండ్ క్రమబద్ధీకరణ ద్వారా ఈ చట్టం భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు చట్టపరమైన పునాది వేస్తుంది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
· ఏకీకృత కమాండ్: ‘ఐఎస్ఒ’ కమాండర్లు అన్నిరకాల సిబ్బందికీ ఒకే అధికార ఛత్రం కింద క్రమశిక్షణను అమలు చేయవచ్చు.
· ప్రక్రియలు వేగవంతం: ఇంటర్-సర్వీస్ సమన్వయంలో జాప్యం తగ్గుతుంది.
· ఉమ్మడి సంస్కృతి: క్రాస్-సర్వీస్ సమన్వయం, ఉమ్మడి బాధ్యతను ప్రోత్సహిస్తుంది.
· థియేటర్ కమాండ్లకు చట్టపరమైన ప్రాతిపదిక: భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ కార్యకలాపాలకు మద్దతు.
· సర్వీస్ గుర్తింపు కొనసాగింపు: ప్రతి దళానికీ సంబంధించిన ప్రత్యేక నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి.
5. ఉమ్మడి రవాణా కేంద్రాలు (జాయింట్ లాజిస్టిక్ నోడ్స్-జేఎల్ఎన్)
మూడు సైనిక విభాగాల మధ్య రవాణా సమన్వయం కోసం ముంబయి, గౌహతి, పోర్ట్ బ్లెయిర్లో మూడు ఉమ్మడి సరకు రవాణా కేంద్రాలు - జాయింట్ లాజిస్టిక్ నోడ్ (జేఎల్ఎన్) లను ఏర్పాటు చేశారు. ఇవి 2021 నుంచి పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలు సాయుధ దళాలకు చిన్న ఆయుధ మందుగుండు సామగ్రి, ఆహారం, ఇంధనం, కిరాణా, పౌర రవాణా సేవలు, వైమానిక దుస్తులు, విడిభాగాలు, ఇంజినీరింగ్ సహాయాన్ని సమగ్రంగా అందించడానికి పనిచేస్తున్నాయి. తద్వారా వారి కార్యకలాపాలను సమన్వయం చేయడంలో సహాయపడుతున్నాయి. ఈ చొరవ వల్ల మానవ వనరుల పొదుపు, సమర్థవంతంగా వనరుల వినియోగంతో పాటు నిధుల పొదుపు వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
6. ఉమ్మడి శిక్షణ కోర్సులు, సదస్సులు, విన్యాసాలు
త్రివిధ దళాల భవిష్యత్ యుద్ధ సంబంధిత (వార్ఫేర్) కోర్సు: రక్షణ దళాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ప్రారంభించిన ఈ వినూత్న కోర్సును మేజర్ జనరల్స్ నుంచి మేజర్స్ వరకు, ఇంకా ఇతర విభాగాల సమాన స్థాయి అధికారుల కోసం ర్యాంక్ తో సంబంధం లేకుండా రూపొందించారు. ఈ కోర్సు, అధునాతన యుద్ధతంత్రాల పైన, సాంకేతిక అంశాల పైన అధికారులకు పరిజ్ఞానం కల్పిస్తుంది. ఆధునిక యుద్ధ స్వరూపం వేగంగా మారిపోతుండటం, సాంకేతిక అభివృద్ధులు, మారుతున్న ప్రపంచ పరిణామాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో మూడు సైనిక విభాగాల అధికారుల కోసం ఈ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్సు అవసరం ఏర్పడింది. అనుభవజ్ఞులైన, ప్రస్తుతం సేవలందిస్తున్న విషయ నిపుణుల సహాయంతో హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఈ కోర్సును రూపొందించింది.మొదటి ఎడిషన్ ను 2024 సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు న్యూఢిల్లీ లో నిర్వహించారు. రెండో ఎడిషన్ ను 2025 ఏప్రిల్ 21 నుంచి మే 9 వరకు న్యూఢిల్లీ లోని మాణేక్షా సెంటర్లో నిర్వహించారు. రెండో ఎడిషన్లో సైనిక కార్యకలాపాలపై మరింత మెరుగైన పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో నిర్దిష్ట యుద్ధాభివృద్ధులపై లోతైన అవగాహన కల్పించే అంశాలను చేర్చారు.
*డిఫెన్స్ సర్వీసెస్ టెక్నికల్ స్టాఫ్ కోర్సు: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, మిత్రదేశాలకు చెందిన 166 మంది అధికారులతో డిఫెన్స్ సర్వీసెస్ టెక్నికల్ స్టాఫ్ కోర్సు (డీఎస్టీఎస్సీ) 2024 జూన్ 10న పుణెలోని మిలిట్ లో జరిగింది. తొలిసారిగా త్రివిధ దళాల సంయుక్త శిక్షణా బృందాలు ఈ కోర్సును నిర్వహించాయి, ఇది సమైక్యత, బహుళ రంగాల నిర్వహణ సంసిద్ధత దిశగా ఒక ప్రధాన ముందడుగుగా నిలిచింది. అధికారులకు అభివృద్ధిలో సాంకేతికతలు, రక్షణ వ్యూహం, భౌగోళిక రాజకీయ అవగాహనపై శిక్షణ ఇచ్చారు. అలాగే, ప్రత్యక్ష విన్యాసాలు, రక్షణ పరిశోధన- అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లకు పరిచయం చేశారు. సైనిక సామర్థ్యంలో టెక్నో-నాయకత్వం, ఆత్మనిర్భరత వైపు ఇది సాహసోపేతమైన ముందడుగు.
*మార్పుపై మేధో సదస్సు: త్రివిధ దళాల సదస్సు - పరివర్తన్ చింతన్ - 8 ఏప్రిల్ 2024 న న్యూఢిల్లీలో జరిగింది. సాయుధ దళాల్లో ఐక్యతను, సమగ్రతను మరింత ముందుకు తీసుకు వెళ్లేవిధంగా కొత్త ఆలోచనలు, చొరవలు, సంస్కరణలను సృష్టించడానికి మేధోమథనం, ఆలోచనాత్మక చర్చగా ఈ సదస్సును నిర్వహించారు. భారత రక్షణ దళాలు “భవిష్యత్కు సిద్ధంగా” ఉండే విధంగా అభివృద్ధి చెందుతున్న సంయుక్త సంస్కరణల దిశగా ఐక్యత, సమగ్రత అనేవి మౌలిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి.
*వైమానిక, నౌకాదళ సమన్వయం - హిందూ మహాసముద్ర ప్రాంతంలో పోరాట శక్తిని పెంపొందించడం: దక్షిణ ప్రాంత వైమానిక దళం ప్రధాన కార్యాలయం, సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (సీఏపీఎస్) సహకారంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో వైమానిక, నౌకాదళ సమన్వయం హిందూ మహాసముద్ర ప్రాంతంలో పోరాట శక్తిని పెంపొందించడం -అనే అంశంపై 2025, ఫిబ్రవరి 25 న ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో రెండు సెషన్లు నిర్వహించారు. ఇవి హెడ్క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, హెడ్క్వార్టర్స్ సదర్న్ ఎయిర్ కమాండ్, భారత సైన్యం, భారత నౌకా దళం, సిఎపిఎస్ నుంచి సేవలో ఉన్న, రిటైర్ అయిన సీనియర్ అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. ఈ సదస్సులో పాల్గొన్నవారు నావిక , వైమానిక కార్యకలాపాల సమన్వయం, యుద్ధ సామర్థ్యం పెంపుదలపై చర్చించారు. సంయుక్త విన్యాసాల సామర్థ్యాలను బలోపేతం చేయడానికి విలువైన ఆలోచనలను, అభిప్రాయాలను వారు పంచుకున్నారు.
సంయుక్త విన్యాసాలు
*ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్ 2025: భారత రక్షణ దళాలు అరుణాచల్ ప్రదేశ్లోని ఉత్తర సరిహద్దుల్లో ఉన్న హిమాలయాల ఎత్తైన భూభాగంలో “ప్రచండ ప్రహార్” అనే త్రివిధ దళాల సమగ్ర బహుళ రంగాల యుద్ధ విన్యాసాన్ని నిర్వహించాయి. ఈ మూడు రోజుల విన్యాసాలు మార్చి 25 నుంచి 27, 2025 వరకు జరిగాయి. దీనిలో సైన్యం, వైమానిక, నౌకాదళాల సమన్వయ ఆపరేషన్లపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రచండ ప్రహార్ ను నవంబర్ 2024లో నిర్వహించిన పూర్వీ ప్రహార్ యుద్ధాభ్యాసానికి కొనసాగింపుగా చేపట్టారు. అప్పుడు విమానయాన ఆస్తుల సమగ్ర వినియోగంపై దృష్టి పెట్టారు. పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితిలో త్రివిధ దళాల మధ్య సమగ్ర ప్రణాళిక, కమాండ్ అండ్ కంట్రోల్, నిఘా, ఫైర్పవర్ ప్లాట్ఫామ్ల నిరంతర అమలు సామర్ధ్యాలను ఈ విన్యాసాల ద్వారా ప్రదర్శించారు.
*ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ 2025: భారత వాయుసేన జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో 2025 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు “ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ 2025” పేరుతో త్రివిధ దళాల ప్రత్యేక విభాగాల సమగ్ర విన్యాసం నిర్వహించింది. ఈ విన్యాసంలో భారత సైన్యం నుంచి ఎలైట్ పారా (ప్రత్యేక దళాలు), భారత నౌకాదళం నుంచి మెరైన్ కమాండోస్, భారత వాయుసేన నుండి గరుడ్ (ప్రత్యేక దళాలు) కలసి ఒక అనుకరణ యుద్ధ వాతావరణంలో పాల్గొన్నాయి. ఆధునిక భద్రతా సవాళ్లకు వేగంగా, సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు మూడు ప్రత్యేక దళాల యూనిట్ల మధ్య పరస్పర పనితీరు, సహకారం, సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ తీవ్రస్థాయి విన్యాసాన్ని ఉద్దేశించారు.
7. సాంకేతిక సమన్వయం- నెట్వర్క్-సెంట్రిక్ వార్ఫేర్
*డిఫెన్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ (డీసీఎన్): డీసీఎన్ ఒక వ్యూహాత్మక, ప్రత్యేకమైన, సురక్షితమైన, అత్యాధునిక కమ్యూనికేషన్ నెట్వర్క్. దీని అమలు భారతీయ పరిశ్రమ సామర్ధ్యానికి నిదర్శనంగా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పేదిగా ఉంది. త్రివిధ దళాలు, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మధ్య నెట్వర్క్ కేంద్రీకరణకు దోహదపడేదిగా డిసిఎన్ ఒక ప్రధాన అడుగు.ఈ నెట్ వర్క్ తగినంత సురక్షితమైన వ్యవస్థ ఆధారంగా త్రివిధ దళాలకు అవసరం మేరకు ఏకీకృత వాయిస్, డేటా, వీడియో సేవలను అందిస్తుంది.
*ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఐఏసీసీఎస్): భారత వాయుసేనకు చెందిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఐఏసీసీఎస్) అనేది వాస్తవ పరిస్థితుల సమన్వయానికి ఆధారంగా నిలిచే వ్యవస్థగా పనిచేస్తుంది. సైన్యం, నౌకాదళం, వాయుసేనకు చెందిన అనేక విభాగాల మధ్య సమకాలిక స్పందనలను సాధించడానికి అనుకూలంగా ఉండే విధంగా దీనిని రూపొందించారు. ఈ వ్యవస్థ ఇటీవల ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ అనంతరం ఏర్పడిన ఉద్రిక్తతల సమయంలో తన సామర్థ్యాన్ని ఘనంగా ప్రదర్శించింది. ఐఎసిసిఎస్ సమయోచిత సమన్వయం, సమగ్ర ప్రతిస్పందన ద్వారా వివిధ దళాల మద్య సమర్ధవంతమైన కార్యకలాపాలను నిర్వహించడంలో కీలక పాత్ర వహించింది.
8. రక్షణ రంగ సంస్కరణల సంవత్సరం-2025
రక్షణ శాఖలో 2025 ను ‘సంస్కరణల సంవత్సరం’ గా పాటించాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కార్యదర్శులందరితో కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.ప్రధానంగా భారత రక్షణ దళాలను సాంకేతికపరంగా ఆధునికంగా మారుస్తూ, బహుళ రంగాల్లో సమగ్రంగా ఆపరేషన్లు నిర్వహించగల యుద్ధ సిద్ధ దళాలుగా మార్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు..2025లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడానికి గుర్తించిన విస్తృత రంగాలలో కిందివి కొన్ని.
*సమన్వయం, సమగ్రత కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ల ఏర్పాటును సులభతరం చేయడం సంస్కరణల లక్ష్యంగా ఉండాలి.
*త్రివిధ దళాల మధ్య సహకారం, శిక్షణ ద్వారా ఇంటర్ సర్వీస్ కోఆపరేషన్ నిర్వహణపరమైన అవసరాలు, సంయుక్త చర్యల సామర్థ్యాల గురించి పరస్పర అవగాహనను పెంపొందించడం.
ముగింపు
భూమి, సముద్రం, ఆకాశం అంతటా బలాన్ని ప్రదర్శించే భారతదేశ సామర్థ్యం ఇకపై సైద్ధాంతికమైనది కాదు- ఇది నిర్మాణాత్మకమైనది, సమన్వయంతో కూడినది. ఇంకా లోతైన సమగ్రతను కలిగి ఉంది.దేశ త్రివిధ దళాలు ఇప్పుడు సంఘటిత శక్తిగా పనిచేస్తున్నాయి. ఆధునిక సవాళ్లు సాంప్రదాయిక సరిహద్దులను చెదరగొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఘటిత శక్తి ఎత్తైన హిమాలయాలపై దురాక్రమణను ఎదుర్కోవడం అయినా, సముద్ర సరిహద్దులను రక్షించడం అయినా, వైమానిక చొరబాట్లను తిప్పికొట్టడం అయినా భారతదేశం ఇప్పుడు సిద్ధంగా, స్థిరంగా, ఐక్యంగా ఉందని చాటుతోంది. సంఘటిత త్రివిధ దళాల చేతుల్లోనే జాతీయ భద్రత భవిష్యత్ పదిలంగా ఉంది. భారతదేశం ఇప్పటికే ఆ దిశగా ధృఢ సంకల్పంతో, స్పష్టమైన దిశలో అడుగులు వేస్తోంది.
References
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2107177
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2023710
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1597425
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2057584
https://mod.gov.in/sites/default/files/AR_0.pdf
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2021210
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2122831
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2106207
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2089184
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=198903
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1601812
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1708998
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2017419
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2128748
https://ddnews.gov.in/en/indian-armed-forces-conduct-tri-services-exercise-prachand-prahar/
https://ddnews.gov.in/en/akash-missile-iaccs-and-drones-drive-indias-defence-success-in-operation-sindoor/
https://www.mea.gov.in/media-briefings.htm?dtl/39474/Transcript+of+Special+Briefing+on+OPERATION+SINDOOR+May+07+2025
https://www.mea.gov.in/media-briefings.htm?dtl/39482/Transcript_of_Special_briefing_on_OPERATION_SINDOOR_May_09_2025
https://sansad.in/getFile/loksabhaquestions/annex/178/AU4977.pdf?source=pqals
https://ddnews.gov.in/en/bsf-foils-major-infiltration-bid-along-international-border-in-samba/
https://www.mod.gov.in/sites/default/files/0201202402.pdf
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=146663
Click here to see in PDF
***
(Release ID: 2130442)