సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ : వేవ్స్ 2025లో కథలు, ఉత్సుకత, ప్రయోజనాల సమ్మేళనం
ముఖ్యమైన కథల ద్వారా సంస్కృతి, సమాజం, సంభాషణలను రూపొందిస్తున్న క్రియేటర్ల ప్రతిభను చాటిచెప్పిన వేవ్స్ 2025
Posted On:
01 MAY 2025 7:21PM
|
Location:
PIB Hyderabad
అల్గారిథంను అధిగమించే పనితీరు, అభిరుచిని మెరుగుపరిచే కథలు ఉన్న ఈ కంటెంట్ ప్రపంచంలో ‘‘ది బిజినెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్: క్రియేటర్స్ షేపింగ్ గ్లోబల్ కల్చర్’’ అనే అంశంపై వేవ్స్ 2025లో చర్చను నిర్వహించారు. ఇది ప్రామాణికత, ఆసక్తి, సమాజాల శక్తిమంతమైన మేళవింపుతో తీర్చిదిద్దిన కాన్వాస్గా నిలిచింది. ఈ కార్యక్రమానికి యూట్యూబ్ ఏపీఏసీ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ ఆనంద్ అనుసంధాన కర్తగా వ్యవహరించారు. ఈ చర్చలో అసాధారణ ప్రతిభావంతులైన నలుగురు క్రియేటర్లు పాల్గొన్నారు. వారు డిజిటల్ ప్రపంచ రూపురేఖలను ప్రయోజనకరంగా మార్చేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
వేవ్స్ ఆరంభ కార్యక్రమంలో బిలియన్ల మంది భారతీయుల స్వరాన్ని ప్రతిఫలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను తెలియజేస్తూ.. ఈ కార్యక్రమాన్ని గౌతమ్ ఆనంద్ ప్రారంభించారు. వైవిధ్యభరితమైన, అవగాహనతో కూడిన, సరిహద్దులను దాటి విస్తరించే కథనాలను రూపొందిస్తున్న క్రియేటర్లను యూట్యూబ్కు హృదయంగా వర్ణించారు.
ప్రజాదరణ పొందిన ‘మేయో జపాన్’ ఛానల్ నిర్వహిస్తున్న జపాన్ క్రియేటర్ మేయో మురసాకీ పరిచయంతో ఈ చర్చ ప్రారంభమైంది. ఆమె హిందీని అనర్గళంగా మాట్లాడతారు. హిందీ నేర్చుకోవడం, భారత్లో ఏడాది గడిపిన అనుభవంతో తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబర్గా మారారు. జపాన్ ప్రేక్షకులకు భారత్ గురించి వివరించడం తనకు ఎలా ఆనందాన్నిస్తుందో, బాధ్యతాయుతంగా ఉండేలా తనను ఎలా మార్చిందో వివరించారు. ‘‘ఇతర దేశాల గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు’’ అని ఆమె అన్నారు. ‘‘నేను బాగా పరిశోధన చేస్తాను. సాధారణంగా భారత్ గురించి విదేశాల్లో చూపించే విధానంలో కాకుండా.. అసలైన భారత్ను చూపించేందుకు ప్రయత్నిస్తాను’’ అని తెలిపారు.
పాకశాస్త్ర నిపుణుడు, యూట్యూబ్ సంచలనం షెఫ్ రణ్వీర్ బ్రార్ వంటల్లో ‘మూమెంట్ ఆఫ్ ట్రూత్’ గురించి మాట్లాడారు. ‘‘ప్రజలు తమ ఆహారంలో ఆదివారాన్ని అన్వేషించాలి’’ అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏదైనా బ్రాండ్తో భాగస్వామ్యం కుదుర్చుకొనేటప్పుడు దాని ప్రామాణికతే ముఖ్యమని అన్నారు. ‘‘అనుంబంధమే ముందు. లావాదేవీలు తర్వాత. ఇదే నా విధానం’’ అని పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని సులభతరం చేయడం, సుస్థిరంగా మార్చడం గురించి ‘ఇండియన్ ఫార్మర్’ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆకాశ్ జాదవ్ వివరించారు. నీటిపారుదల, వ్యవసాయం గురించి ఆచరణాత్మక చిట్కాలను తన ఛానల్ అందిస్తుంది. ‘‘వ్యవసాయం మనం ఇష్టపడే అంశం. ఇది మట్టితో ముడిపడి ఉంది. మనవారి కోసమే మనం సాగు చేస్తాం’’ అని అన్నారు. ‘‘టేబుల్పై శుభ్రమైన ఆహారం, రైతుల సంక్షేమం’’ ఇదే ఆకాశ్ లక్ష్యం.
భారతీయుల ఇళ్లకు చదరంగం నిశ్శబ్దంగా ఎలా తిరిగి వస్తోందో ‘చెస్ టాక్’ని నిర్వహిస్తున్న జితేంద్ర అద్వానీ తెలిపారు. ‘‘చిన్నారులు, తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు అందరూ మళ్లీ చెస్ ఆడుతున్నారు’’ అని వివరించారు. హాస్యం, సరళత్వం ఆయన బోధనా విధానంలో కలగలసి ఉంటాయి. ఆటను మరింత ఆసక్తిగా మార్చడానికి క్రికెట్, సంస్కృతికి సంబంధించిన అంశాలను ఉపయోగిస్తారు. ‘‘నేను చాలా సరళంగా, ప్రేమతో వివరిస్తాను’’ అని జితేంద్ర తెలిపారు.
అంతర్జాతీయంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలపై కొనసాగిన ఈ చర్చలతో తమ కంటెంట్ భాషను, భౌగోళిక సరిహద్దులను ఎలా అధిగమించిందో క్రియేటర్లు వివరించారు. కంటెంట్ హిందీలో ఉన్నప్పటికీ తన ప్రేక్షకుల్లో సింహభాగం విదేశీయులేనని ఆకాశ్ జాదవ్ తెలిపారు. ‘‘ఆహారం అందరినీ ఒక్కటి చేస్తుంది’’ అనే వాస్తవానికి ఇది నిదర్శనమని తెలిపారు. ‘‘చదరంగానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంది’’ అని జితేంద్ర అన్నారు.
వివిధ రకాల బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నప్పుడు తమ ప్రామాణికతను ఎలా నిలబెట్టుకుంటారని క్రియేటర్లను గౌతమ్ ఆనంద్ ప్రశ్నించారు. ‘‘నేనెప్పుడూ నో అన్న పదంతోనే ప్రారంభిస్తాను’’ అని బ్రార్ తెలిపారు. ‘‘నేను పాటిస్తున్న విలువలకు అనుగుణంగా బ్రాండ్ ఉంటేనే ముందుకు వెళతాను’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్చలో ఏఐ కూడా ప్రస్తావనకు వచ్చింది. కంటెంట్ సంబంధించిన అంశాల రూపకల్పనకు ఏఐ సహకరిస్తుందని, కొన్ని సందర్భాల్లో ప్రమాదకారిగానూ మారుతుందని మేయో మురసాకి అభిప్రాయపడ్డారు. సబ్ టైటిళ్లు, క్రియేటివ్ టూల్స్కు సంబంధించి ఏఐతో ప్రయోగాలు చేస్తూనే పనిలో మానవ ప్రమేయం ఉండాల్సిన అవసరం గురించి రణ్వీర్ బ్రార్, జితేంద్ర, ఆకాశ్ జాదవ్ మాట్లాడారు.
ప్రేక్షకుల్లో ఉన్న ఔత్సాహిక క్రియేటర్లకు ఎలాంటి సలహాలు ఇస్తారని అడిగినప్పుడు వక్తలు మనస్ఫూర్తిగా సమాధానమిచ్చారు. ‘‘అల్గారిథంను కాదు మీ కలలను అనుసరించండి’’ అని రణ్వీర్ బ్రార్ చెప్పారు. ‘‘నిలకడగా, ప్రామాణికంగా ఉండండి. మీరు రూపొందించే అంశాన్ని అధిగమించి ఆలోచించండి’’ అని ఆకాశ్ జాదవ్ తెలిపారు. ‘‘మీకు ఇష్టమైన అంశంతోనే మీ ప్రయాణం మొదలుపెట్టండి’’ అని జితేంద్ర కోరారు. ‘‘మీరు నిజాయతీని అనుసరిస్తే.. మిగిలనవన్నీ మీ వెనకే వస్తాయి’’ అని మేయో మురసాకి తెలిపారు.
కార్యక్రమాన్ని ముగించే ముందు చర్చలో పాల్గొన్న వక్తలకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే వైరల్ అవ్వడం మాత్రమే కాదని ఈ చర్చా కార్యక్రమం తెలియజేసింది. ఇది స్వరాలు, హృదయం, ప్రపంచంలో మార్పులు తీసుకురావడం, నిజాయతీతో కూడిన కథలకు సంబంధించినది.
***
Release ID:
(Release ID: 2126316)
| Visitor Counter:
9