సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్-2025 వేదికగా భారత్ నేతృత్వంలో ప్రపంచ వినోద విప్లవం కోసం దార్శనికతను ఆవిష్కరించిన ముఖేశ్ అంబానీ
భారత్ను ప్రపంచానికి ఆశావహ సందేశంగా నిలపనున్న వేవ్స్: ముఖేశ్ అంబానీ
మీడియా-వినోదం భారత సాఫ్ట్ పవర్ మాత్రమే కాదు... ఇది భారత నిజమైన పవర్: అంబానీ
Posted On:
01 MAY 2025 8:32PM
|
Location:
PIB Hyderabad
ఈరోజు ముంబయిలో ప్రారంభమైన మార్గదర్శక ప్రపంచ మీడియా- వినోద రంగాల శిఖరాగ్ర సమావేశం వేవ్స్ 2025లో కీలకోపన్యాసం చేస్తూ... "భారత్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు. ఇది కథల నాగరికత, ఇక్కడ కథ చెప్పడం ఒక జీవన విధానం" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముఖేష్ అంబానీ అన్నారు.
ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ను ఉటంకిస్తూ.... శ్రీ అంబానీ భారతదేశాన్ని "మానవ జాతికి పుట్టినిల్లుగా, మానవ వాక్కుకు జన్మస్థలంగా, చరిత్రకు తల్లిగా, పురాణగాథలకు అమ్మమ్మగా, సంప్రదాయాలకు ముత్తాతగా" అభివర్ణించారు. కథ చెప్పడం భారతీయ జీవితాలతో ముడిపడి ఉందనీ, "మన అమూల్య ఇతిహాసాల నుంచి పౌరాణిక కథల వరకు, కథ చెప్పడం మన వారసత్వం. కంటెంట్దే ప్రధాన పాత్ర - మంచి కథలు ఎల్లప్పుడూ అమ్ముడవుతుంటాయి. ఈ కాలాతీత సూత్రం ప్రపంచ వినోదానికి పునాది" అని అన్నారు.
"భారత్ నుంచి తదుపరి ప్రపంచ వినోద విప్లవాన్ని నిర్మించడం" గురించి ఉత్తేజకరంగా, ముందుచూపుతో ప్రసంగించిన అంబానీ... ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మార్పునకు ప్రేరణగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ఆయన ప్రశంసించారు. ఆ దిశలో వేవ్ సమ్మిట్ ఒక చారిత్రాత్మక ముందడుగని ప్రశంసించారు. "మీడియా - వినోదం భారత సాఫ్ట్ పవర్ అని ప్రజలు అంటారు. నేను దానిని భారత నిజమైన శక్తి అంటాను" అని అంబానీ పేర్కొన్నారు. ప్రపంచ వినోదంలో మన దేశ సృజనాత్మక, సాంస్కృతిక, సాంకేతిక బలాన్ని వేవ్స్ ప్రదర్శిస్తుందన్నారు.
సృజనాత్మకతను పునర్నిర్మించే రెండు టెక్టోనిక్ మార్పులైన భౌగోళిక-ఆర్థిక, సాంకేతికతలను ఆయన ప్రస్తావించారు. ప్రపంచ జనాభాలో 85 శాతం మంది నివసిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాల ఆర్థిక సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ, కంటెంట్ సృష్టి, వినియోగంలో ఈ ప్రాంత పాత్ర కూడా పెరుగుతోంది. అదే సమయంలో, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలు కంటెంట్ సృష్టి నుంచి పంపిణీ వరకు వినోద రంగ వాల్యూ చెయిన్లోని ప్రతి దశలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. “ఊహకు, అమలుకు మధ్య సరిహద్దులను ఏఐ చెరిపేస్తోంది. ఒక శతాబ్దం కిందట సినిమా కోసం మూకీ కెమెరా చేసిన దానికంటే నేడు వినోదం కోసం ఏఐ చేస్తున్నది మిలియన్ రెట్లు ఎక్కువ మార్పులు కలిగిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
భారత ప్రత్యేక బలాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, దేశం బలమైన కంటెంట్, డైనమిక్ డెమోగ్రఫీ, సాంకేతిక నాయకత్వం అనే మూడు ప్రాథమిక ఆధారాలతో వినోద విప్లవానికి దేశం నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని అంబానీ అన్నారు. "భారత డిజిటల్ విప్లవం కేవలం ఒక స్థాయి కథ కాదు. ఇది ఆకాంక్ష, ఆశయం, పరివర్తనల కథ" అని ఆయన ప్రకటించారు.
“పోలరైజ్డ్, అనిశ్చిత ప్రపంచంలో, ప్రజలు ఆనందం, సంబంధం, ప్రేరణను కోరుకుంటారు. ప్రపంచ వినోద ఆకాంక్షలను భారత్ నెరవేరుస్తుంది. భారత్ను ప్రపంచానికి ఆశావహ సందేశంగా వేవ్స్ నిలపనుంది.” అంటూ అంబానీ తన కీలక ప్రసంగాన్ని ముగించారు.
***
Release ID:
(Release ID: 2126013)
| Visitor Counter:
24