మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జీవితంలో మొదటి 1000 రోజులు: పోషణ్ పఖ్వాడా-2025లో ముఖ్య ఇతివృత్తం
Posted On:
09 APR 2025 4:19PM by PIB Hyderabad
పోషకాహారంపై అవగాహన పెంచడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సామాజిక సాధికారత సాధించడం లక్ష్యంగా మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పోషణ్ పఖ్వాడా-2025 జాతీయ స్థాయి పక్షోత్సవాలను నిర్వహిస్తోంది. సామాజిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు వ్యక్తిగత, సామాజిక సాధికారతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించే ‘మిషన్ పోషణ్ 2.0’లో ఈ కార్యక్రమం ఓ భాగం.
జీవితంలో మొదటి 1000 రోజులపై శ్రద్ధ వహించడమన్నది పోషణ్ పఖ్వాడా-2025 ప్రధాన ఇతివృత్తాల్లో ఒకటి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు జీవితంలో మొదటి 1000 రోజుల్లో పోషకాహారం ఆవశ్యకతపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది. జీవితాంతం ఆరోగ్యం, వికాసాలకు పునాది వంటి కీలకమైన దశ ఇది. గర్భధారణ సమయంలో, బాల్యంలోని తొలి దశలో తగినంత పోషకాహారం తీసుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలుంటాయి, ఉత్పాదకత పెరుగుతుంది, యుక్తవయస్సులోనూ మంచి ఆరోగ్య ఫలితాలుంటాయి. ఈ సమయంలో పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తరాల నుంచి వస్తున్న పోషకాహార లోపాన్ని మనం అధిగమించవచ్చు.
గతేడాది మార్చి 9 నుంచి 23 వరకు నిర్వహించిన పోషణ్ పఖ్వాడా కార్యక్రమం.. పోషణ్ భీ పఢాయీ భీ (పీబీపీబీ), గర్భిణుల ఆరోగ్యం, శిశువులు - చిన్నపిల్లలకు ఆహారం పెట్టే పద్ధతులు (ఐవైసీఎఫ్), తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. పోషకాహారానికి ప్రాధాన్యమిస్తూ సత్ఫలితాలనిచ్చే కార్యకలాపాలపై ప్రధానంగా పోషణ్ పఖ్వాడా-2025 దృష్టి సారించింది. క్రియాశీలమైన సామాజిక భాగస్వామ్యంతో పోషకాహార సంబంధిత సేవలను బలోపేతం చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించి సంక్షేమాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
***
(Release ID: 2120749)