రాష్ట్రపతి సచివాలయం
లిస్బన్లో ‘సిటీ కీ ఆఫ్ ఆనర్’ను స్వీకరించిన భారత్ రాష్ట్రపతి
• పోర్చుగల్ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన విందుకు హాజరైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
• మేం జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్కున్న బలాలను ఉపయోగించుకోవడంలో పోర్చుగల్ను మా భాగస్వామిగా భావిస్తాం: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
Posted On:
08 APR 2025 11:44AM by PIB Hyderabad
పోర్చుగల్లోని లిస్బన్ లో గల సిటీ హాలులో నిన్న (2025 ఏప్రిల్ 7న) నిర్వహించిన ఒక కార్యక్రమంలో లిస్బన్ మేయరు చేతులమీదుగా ‘సిటీ కీ ఆఫ్ ఆనర్’ను భారత్ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అందుకొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఈ సన్మానానికి మేయరుకు, లిస్బన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. లిస్బన్ దాపరికం లేని ఆలోచనలకు, ప్రజల ఆప్యాయతకు, సహనశీలత్వానికి, భిన్నత్వం పట్ల గౌరవానికి, సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందిందని ఆమె అన్నారు. లిస్బన్ నగరం సాంకేతిక మార్పు, నవకల్సన, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పరివర్తన రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న ప్రపంచ నగరం అని తెలుసుకొని తాను సంతోషిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ రంగాల్లో భారత్, పోర్చుగల్ మరింత సహకరించుకొనే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు.
పోర్చుగల్ అధ్యక్షుడు శ్రీ మార్సెలో రెబెలో డి సూసా నిన్న సాయంత్రం పలసియో డా అజుడాలో రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విందు కార్యక్రమంలో శ్రీమతి ముర్ము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, మన రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు శతాబ్దాల నాటివని, ఈ సంబంధాలు మన సామూహిక భావనపై చెరగని ముద్ర వేశాయన్నారు. వాటిలో మన రెండు దేశాల గత కాలం ఒక భాగంగా ఉందని, ఇది వాస్తుకళ, చారిత్రక స్థలాలు, భాషలే కాక మన వంట పద్ధతుల్లో ప్రతిబింబిస్తోందన్నారు.
ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, ఇండియా-పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాలు 50వ సంవత్సరాన్ని పూర్తి చేసుకొంటున్న ఘట్టాన్ని మనం ఈ ఏడాదిలోనే పండుగలా జరుపుకొంటున్నామని రాష్ట్రపతి తెలిపారు. మన ఉభయ దేశాల మధ్య సహజ అనుబంధానికి తోడు అనేక రంగాల్లో సహకారానికి గల అవకాశాలు, మన చారిత్రక సంబంధాలు ఒక చైతన్యభరిత, దార్శనిక భాగస్వామ్యంలా రూపొందే దిశలో పురోగమిస్తున్నాయని ఆమె అన్నారు. సైన్, టెక్నాలజీ, రక్షణ, ఐటీ, అంకుర సంస్థలు, పరిశోధన, విద్యారంగ సహకారంతోపాటు సాంస్కృతిక సహకారం సహా వివిధ రంగాలలో భారత్, పోర్చుగల్ల మధ్య సహకారం నిరంతరాయంగాను, ప్రగతిశీల దృక్పథంతోను వృద్ధి చెందుతున్నందుకు రాష్ట్రపతి శ్రీమతి ముర్ము సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ అందరికీ ప్రయోజనాలు దక్కే సమ్మిళిత, నిరంతర అభివృద్ధి నమూనాను ఆవిష్కరించడానికి సైన్, టెక్నాలజీ, సమాచార, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంకుర సంస్థలు, నవకల్పన వంటి రంగాల్లో తనకున్న బలాలను ఉపయోగించుకొంటోందని రాష్ట్రపతి అన్నారు. ఈ ప్రయత్నాల్లో పోర్చుగల్ను భారత్ తన భాగస్వామిగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఐరోపా సంఘంతో భారత్ సంబంధాలను ప్రోత్సహించడంలో పోర్చుగల్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి ప్రశంసించారు. ఈయూకు పోర్చుగల్ అధ్యక్ష పదవీబాధ్యతలను నిర్వహించిన కాలంలోనే ఇండియా-ఈయూ మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సును నిర్వహించారని, 2021 మే నెలలో మరోసారి పోర్చుగల్ అధ్యక్షతన చారిత్రక ‘‘ఇండియా-ఈయూ ప్లస్ 27’’ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు సైతం పోర్చుగల్లో చోటు చేసుకొందని రాష్ట్రపతి గుర్తు చేశారు.
(Release ID: 2120050)
Visitor Counter : 36