సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025 సమ్మిట్కు ఆతిథ్యమివ్వనున్న ముంబయి!
ఉన్నత స్థాయి సమావేశానికి సహాధ్యక్షత వహించిన మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి
* వేవ్స్ 2025 సమ్మిట్ను విజయవంతం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి మద్దతు: ముఖ్య కార్యదర్శి సుజాతా సౌనిక్
* వేవ్స్ శిఖరాగ్ర సదస్సు మీడియా, వినోద రంగానికొక ప్రపంచ స్థాయి వేదిక: సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజూ
Posted On:
07 MAR 2025 5:05PM by PIB Hyderabad
ముంబయి వేవ్స్ 2025 శిఖరాగ్ర సదస్సు ( WAVES 2025 Summit )కు ఆతిథ్యమివ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమం భారత్ను ప్రపంచ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో అన్ని దేశాల కన్నా ముందుభాగాన నిలపడానికి పటిష్టంగా రూపుదిద్దుకుంటోంది. వేవ్స్ 2025ను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో ఈ రోజు (మార్చి 7న) ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుజాతా సౌనిక్తోపాటు కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజూ సహాధ్యక్షత వహించారు. వేవ్స్ శిఖరాగ్ర సదస్సు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చరిత్రాత్మకమైన రీతిలో నిర్వహించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను, ఆతిథ్యాన్ని, రవాణా వ్యవస్థను సమకూర్చడానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చింది.
ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహణ కోసం ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుజాతా సౌనిక్ ఆదేశించారు. శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేయడానికి పాలనలోని ప్రతి ఒక్క విభాగం చక్కని సమన్వయంతో పనిచేస్తుందని కూడా ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, ‘‘మీడియా, వినోద రంగానికి ఈ శిఖరాగ్ర సదస్సు ఒక ప్రపంచ శ్రేణి వేదికను అందుబాటులోకి తీసుకు వస్తోంది. భారతీయ మీడియా, వినోద (ఎం అండ్ ఈ) రంగానికి ప్రపంచ మీడియా సహపాత్రధారులతో సంధానాన్ని ఏర్పరిచి మన ఎం అండ్ ఈ రంగాన్ని వృద్ధిలోకి తీసుకురావాలన్నదే ఈ శిఖరాగ్ర సదస్సు ముఖ్యోద్దేశం’’ అన్నారు.
ఒక సంయుక్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం, రవాణా వ్యవస్థతోపాటు అవుట్డోర్ పబ్లిసిటీకి పక్కాగా ఏర్పాట్లు చేయడం వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఒక విస్తృత ప్రచార ప్రణాళికను కూడా రూపొందించారు. దీనిలో సమాచార, ప్రసార శాఖ ప్రపంచ నేతలను, ప్రముఖ వ్యక్తులను, పరిశ్రమ ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానించడానికి చొరవ తీసుకుంది. అధికారులు కార్యక్రమానికి హాజరయ్యే ప్రతినిదులు అందరికీ భద్రత, అత్యవసర సేవలు, అంతరాయానికి తావు ఉండని తరహా సంధాన సదుపాయాన్ని కల్పించే విషయంలో ప్రత్యేకంగా దృష్టిని సారించారు. కార్యక్రమం సాఫీగా సాగిపోయేటట్టు పూచీపడడానికి ఒక ప్రత్యేక సీనియర్ నోడల్ అధికారి సమన్వయ ప్రయత్నాలను పర్యవేక్షించనున్నారు.
రవాణా, ఆతిథ్యం, సాంస్కృతిక కార్యకలాపాలు, పాలనకు సంబంధించిన సహాయం.. వీటిలో నిరంతర సమన్వయం నెలకొనేటట్లు చూడటానికి, కార్యక్రమాల నిర్వహణలోనూ, ప్రపంచ దేశాల భాగస్వామ్యంలోనూ అత్యున్నత ప్రమాణాలను ఏర్పరచడానికి కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ప్రిన్పిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓఝా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ యోగేశ్ బవేజా, సమాచార, ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శులు శ్రీ సంజీవ్ శంకర్, శ్రీ సి. సెంథిల్ రాజన్, శ్రీ అజయ్ నాగభూషణ్లతోపాటు పీఐబీ, భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ, ఆకాశవాణి, దూరదర్శన్, వేవ్స్ కౌన్సిళ్లకు చెందిన నోడల్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులలో బృహన్ ముంబయి నగరపాలిక సంస్థ మున్సిపల్ కమిషనరు, సాంస్కృతిక వ్యవహారాల అదనపు ముఖ్య కార్యదర్శి, పర్యటన విభాగం ప్రధాన కార్యదర్శి, ఎంఐడీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారితోపాటు వివిధ ప్రధాన విభాగాల సీనియర్ అధికారులు హాజరయ్యారు.
సమావేశం ముగిసిన తరువాత, వేవ్స్ 2025కు సంబంధించిన సన్నాహాలన్నింటిని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శితోపాటు సీనియర్ అధికారులు సమీక్షించడానికి ముందస్తు ఏర్పాట్లపై విస్తృత సమీక్షను చేపట్టారు.
ఈ అపూర్వ శిఖరాగ్ర సదస్సుపై దృష్టిని సారించండి. ఈ సదస్సులో పరిశ్రమకు చెందిన దిగ్గజాలు డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుకు రూపురేఖలను తీర్చిదిద్దడానికి ఏకం కానున్నారు. https://wavesindia.org/
***
(Release ID: 2109344)
Visitor Counter : 11