ప్రధాన మంత్రి కార్యాలయం
వీరబాల దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
26 DEC 2024 3:30PM by PIB Hyderabad
భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అన్నపూర్ణాదేవి గారు, సావిత్రి ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, ఇతర ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులు, ప్రియమైన చిన్నారులారా...
నేడు మనం మూడో ‘వీరబాల దివస్’ను జరుపుకొంటున్నాం. వీరులైన సాహిబ్ జాదాల త్యాగాన్ని చిరస్మరణీయం చేసేలా మన ప్రభుత్వం మూడేళ్ల కిందట వీరబాల దివస్ నిర్వహించడం ప్రారంభించింది. ఇప్పుడీరోజు కోట్లాది మంది దేశ ప్రజల్లో, యావద్దేశంలో జాతీయతా స్ఫూర్తిని నింపే వేడుకైంది. ఈ రోజు దేశంలోని అసంఖ్యాకులైన చిన్నారులు, యువతలో స్ఫూర్తిని రగిలిస్తూ తిరుగులేని ధైర్యసాహసాలను నింపుతోంది. ధైర్యసాహసాలు, ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతికతలు, క్రీడలు, కళల్లో సాధించిన గణనీయమైన విజయాలకు గాను దేశవ్యాప్తంగా 17 మంది చిన్నారులు నేడు సన్మానం అందుకున్నారు. వీరంతా భారత్ లోని చిన్నారులు, యువత అద్భుత సామర్థ్యాన్ని చాటారు. ఈ సందర్భంగా మన గురువులు, వీరులైన సాహిబ్ జాదాలకు పాదాభివందనాలు. పురస్కారాలు పొందిన చిన్నారులు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు. దేశ ప్రజలందరి తరఫునా వారందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను.
మిత్రులారా,
నేడు మీతో మాట్లాడుతుంటే, వీరులైన సాహిబ్ జాదాలు అత్యున్నత త్యాగం చేసిన నాటి పరిస్థితులూ నాకు గుర్తొస్తున్నాయి. నేటి యువతరం కూడా వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఈ ఘటనలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. దాదాపు 325 సంవత్సరాల కిందట డిసెంబర్ 26న యోధులైన సాహిబ్ జాదాలు చిన్న వయస్సులోనే ప్రాణత్యాగం చేశారు. సాహిబ్ జాదాలు జోరావర్ సింగ్, ఫతేసింగ్ వయస్సులో చిన్నవారైనా, వారి ధైర్యసాహసాలకు ఆకాశమే హద్దు. మొఘలుల ప్రలోభాలన్నింటినీ వారు తిరస్కరించారు... దారుణమైన హింసను కూడా భరించారు. వారిని సజీవంగా కాల్చివేయమని వజీర్ ఖాన్ ఆదేశిస్తే ఎంతో ధైర్యంగా దానిని స్వీకరించారు. గురు అర్జన్ దేవ్, గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ శౌర్యాన్ని ఆ క్రూరులకు సాహిబ్ జాదాలు గుర్తు చేశారు. వారి ధైర్యమే మన విశ్వాసానికి స్ఫూర్తినిచ్చే శక్తి. సాహిబ్ జాదాలు మరణాన్నీ అంగీకరించారు తప్ప నమ్మిన మార్గం నుంచి వెనుకడుగు వేయలేదు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, సమయం ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశం, దేశ సంక్షేమం కన్నా ఏదీ గొప్పది కాదని ఈ వీరబాల దివస్ నుంచి మనం నేర్చుకోవాలి. దేశం కోసం చేసే ప్రతి పనీ.. ధైర్యసాహసాలకు ప్రతీక. దేశం కోసం బతికే చిన్నారులు, యువత అందరూ వీర బాలకులే.
మిత్రులారా,
ఈ ఏడాది వీరబాల దివస్ మరింత ప్రత్యేకమైనది. భారత్ గణతంత్రంగా అవతరించి, మన రాజ్యాంగం అమలై 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 75వ సంవత్సరంలో దేశ పౌరులంతా వీర సాహిబ్ జాదాల నుంచి స్ఫూర్తిని పొంది దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేస్తున్నారు. ఆ వీరుల ధైర్యసాహసాలు, త్యాగాల పునాదులపైనే నేడు భారత్ గర్వించే బలమైన ప్రజాస్వామ్యం నిర్మితమైంది. ‘అంత్యోదయ’ (సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి చెందాలన్న లక్ష్యం) కోసం పనిచేసేలా మన ప్రజాస్వామ్యం స్ఫూర్తినిస్తుంది. దేశంలో ఎవరూ అధికులూ అల్పులూ కారని రాజ్యాంగం బోధిస్తుంది. గురువులకు మంత్రప్రదమైన ‘సర్బత్ దా భలా (సర్వజనుల సంక్షేమం)’ను కూడా ఈ విధానం, స్ఫూర్తీ ప్రతిబింబిస్తాయి. అందరినీ సమానంగా చూడాలని గురు సంప్రదాయం మనకు నేర్పింది. రాజ్యాంగమూ అదే సూత్రాన్ని బోధించింది. దేశ సమగ్రత, విలువల విషయంలో రాజీ పడొద్దని వీర సాహిబ్ జాదాల జీవితం మనకు బోధిస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగమూ దేశ సార్వభౌమత్వం, ఏకతను అత్యున్నత సూత్రాలుగా నిలిపింది. ఒక విధంగా.. విస్తృతమైన మన ప్రజాస్వామ్యంలో గురువుల బోధనలు, యోధులైన సాహిబ్ జాదాల త్యాగాలు, మంత్రప్రదమైన దేశ ఐక్యత ఇమిడి ఉన్నాయి.
మిత్రులారా,
చరిత్ర కాలం నుంచీ నేటి వరకూ భారత పురోగతిలో యువశక్తిదే కీలకపాత్ర. స్వాతంత్య్ర పోరాటం నుంచి 21వ శతాబ్దపు ఉద్యమాల వరకు, ప్రతి విప్లవంలో దేశ యువత భాగస్వామ్యముంది. శక్తిమంతులైన మీలాంటి యువకులే అందుకు కారణం. మీవల్లే యావత్ ప్రపంచమూ ఆశగా, ఎన్నో అంచనాలతో భారత్ వైపు చూస్తోంది. నేడు అంకుర సంస్థల నుంచి వైజ్ఞానిక రంగం వరకు, క్రీడల నుంచి వ్యవస్థాపన వరకు.. భారత్ లో కొత్త విప్లవాలకు యువత నాంది పలుకుతోంది. అందుకే యువతను సాధికారులను చేయడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యంగా మా విధానాలను రూపొందిస్తాం. అంకుర సంస్థలకు అనువైన పరిస్థితులు, భవిష్యత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ, క్రీడలూ దేహదారుఢ్య రంగాలు, ఆర్థిక సాంకేతికత, తయారీ పరిశ్రమలు, లేదా నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు... ఇలా ఏవైనా యువతే కేంద్రంగా అన్ని విధానాలనూ రూపొందించాం. వారి ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దాం. దేశాభివృద్ధితో ముడిపడి ఉన్న ప్రతి రంగంలోనూ యువతకు నేడు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. వారి ప్రతిభకు, ఆత్మవిశ్వాసానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
నా యువ మిత్రులారా,
శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో అవసరాలు, అంచనాలు కొత్తవి. భవిష్యత్ దిశా నిర్దేశమూ కొత్తగానే జరగాలి. ఈ శకం యంత్రాలను దాటి మెషీన్ లెర్నింగ్ రంగం దిశగా పురోగమిస్తున్నది. సాంప్రదాయక సాఫ్ట్ వేర్ స్థానంలో కృత్రిమమేధ వినియోగం పెరుగుతున్నది. ప్రతి రంగంలోనూ కొత్త మార్పులు, సవాళ్లను మనం గమనించవచ్చు. కాబట్టి, మన యువతను భవిష్యత్తు కోసం సిద్ధం చేయాలి. మీరు గమనిస్తే, దీని కోసం చాలా కాలం కిందటే దేశంలో సన్నాహాలు మొదలయ్యాయి. కొత్త జాతీయ విద్యావిధానాన్ని మేం ప్రవేశపెట్టాం. విద్య పరిధిని విస్తృతం చేస్తూ ఆధునికీకరించాం. మన యువత కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఉండేందుకు అన్నివిధాలా కృషిచేస్తున్నాం. చిన్నారులను సృజనాత్మకంగా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా అటల్ టింకరింగ్ ప్రయోగశాలల్ని ఏర్పాటు చేశాం. విద్యతో పాటు ఆచరణాత్మక అవకాశాలను కల్పించడానికి, మన యువతలో సమాజం పట్ల బాధ్యతా భావాన్ని పెంపొందించడానికి ‘మేరా యువభారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించాం.
సోదరీ సోదరులారా,
దేహదారుఢ్యం... నేడు దేశం ప్రధానంగా దృష్టి సారించాల్సిన మరో అంశం. దేశ యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం శక్తిమంతంగా, బలంగా తయారవుతుంది. అందుకే ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. ఇవి దేశ యువతలో ఫిట్నెస్ పై అవగాహన పెంచుతున్నాయి. ఆరోగ్యవంతమైన యువతరమే ఆరోగ్యవంతమైన భారతదేశానికి పునాది. ఇదే లక్ష్యంతో ‘సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్’ (పల్లెల్లో పౌష్టికాహారం) కార్యక్రమాన్ని నేడు ప్రారంభిస్తున్నాం. పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. గ్రామాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతో గ్రామాలను వికసిత భారతానికి పునాదిగా మలచడం ద్వారా పౌష్టికాహార లోపం లేని భారత్ ను సాకారం చేయడం మా లక్ష్యం.
మిత్రులారా,
వీరబాల దివస్ మనలో స్ఫూర్తిని నింపి నవసంకల్పం దిశగా మనల్ని ప్రేరేపిస్తుంది. ఎర్రకోట నుంచి నేను చెప్పినట్టు.. శ్రేష్టతే మనకిప్పుడు ప్రామాణికం. తమతమ రంగాలను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని యువతను కోరుతున్నాను. మనం మౌలిక సదుపాయాలపై పనిచేస్తే మన రోడ్డు, రైలు వ్యవస్థలు, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు ప్రపంచంలో అత్యుత్తంగా ఉండేలా చూసుకోవాలి. తయారీ విషయంలో మనం పనిచేస్తే మన సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ప్రపంచంలో అత్యున్నతమైనవిగా ఉండేలా చూసుకోవాలి. పర్యాటకరంగంపై దృష్టి పెడితే మన పర్యాటక ప్రాంతాలు, ప్రయాణ సౌకర్యాలు, ఆతిథ్యాలను ప్రపంచంలో సాటిలేనివిగా తీర్చిదిద్దాలి. మనం అంతరిక్ష రంగంలో పనిచేస్తే మన ఉపగ్రహాలు, నావిగేషన్ సాంకేతికత, ఖగోళ శాస్త్ర పరిశోధనలు ప్రపంచ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఆ ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకునే ప్రేరణ, మనోబలాన్ని సాహిబ్ జాదాల ధైర్యసాహసాలు మనకందిస్తాయి. పెద్ద లక్ష్యాలే ఇప్పుడు మన సంకల్పాలు. మీ సామర్థ్యంపై దేశానికి పూర్తి నమ్మకముంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు నాయకత్వం వహించగల, తమ ఆవిష్కరణలతో ఆధునిక ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల, ప్రతీ ముఖ్య దేశంలోనూ ప్రతీ రంగంలోనూ తమ నైపుణ్యాన్ని చాటగల భారత యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని దేశం కోసం నమ్మశక్యం కాని అద్భుతాలు చేయగలదని నాకు తెలుసు. అందుకే వికసిత భారత్ లక్ష్యాన్ని నిశ్చయంగా సాధించబోతున్నాం. ‘ఆత్మనిర్భర భారత్’ తప్పక సాకారమవుతుంది.
మిత్రులారా,
కాలం ప్రతీ దేశ యువతకూ తమ దేశ గతిని మార్చే అవకాశాన్నిస్తుంది. ధైర్యసాహసాలు, శక్తిసామర్థ్యాలతో యువత దేశాన్ని మార్చగల తరుణమిది. స్వాతంత్ర్య పోరాటంలో దేశ యువత దురహంకారంతో కూడిన పరాయి పాలనను విచ్ఛిన్నం చేసింది. నిర్దేశిత లక్ష్యాలను నాటి యువత దృఢ సంకల్పంతో సాధించింది. ‘వికసిత భారత్’ను సాకారం చేయడం నేటి యువత ముందున్న లక్ష్యం. రాబోయే 25 సంవత్సరాలలో వేగవంతమైన పురోగతికి ఈ దశాబ్దంలో మనం పునాది వేయాలి. అందువల్ల భారత యువత ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి రంగంలోనూ వారు పురోగమిస్తూ దేశాన్ని ముందుకు నడిపించాలి. క్రియాశీలక రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలకు చెందని లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నట్టు ఈ ఏడాది మొదట్లో నేను ఎర్రకోటపై నుంచి చెప్పాను. వచ్చే 25 ఏళ్ల కోసం ఇది ముఖ్యమైన ఆరంభం. ఈ ఉద్యమంలో భాగం కావడం ద్వారా దేశ రాజకీయాల్లో కొత్త తరాన్ని సృష్టించాలని యువతకు నేను పిలుపునిస్తున్నాను. ఇదే లక్ష్యంతో వచ్చే ఏడాది మొదట్లో, 2025లో స్వామి వివేకానుందుడి జయంతి సందర్భంగా ‘ది డెవలప్డ్ ఇండియా యంగ్ లీడర్స్ డైలాగ్’ను నిర్వహించబోతున్నాం. దేశవ్యాప్తంగా గ్రామాలు, నగరాలు, పట్టణాల నుంచి లక్షలాదిగా యువత ఇందులో పాల్గొంటున్నారు. ‘వికసిత భారత్’ లక్ష్యం, దానికోసం అనుసరించాల్సిన ప్రణాళికపై ఈ కార్యక్రమంలో చర్చిస్తారు.
మిత్రులారా,
‘అమృత్ కాల’ తీర్మానాలను నెరవేర్చడానికి ఈ దశాబ్దంలో వచ్చే ఐదేళ్లు చాలా కీలకం. ఈ సమయంలో దేశ యువశక్తిని పూర్తి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంది. మీ మద్దతు, సహకారం, శక్తితో భారత్ అద్వితీయ శిఖరాలను అధిరోహిస్తుందన్న నమ్మకం నాకుంది. ఈ సంకల్పాన్ని మనసులో ఉంచుకుని మన గురువులు, వీరులైన సాహిబ్ జాదాలు, మాతా గుజ్రీ ఎదుట మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించుగా చేసిన అనువాదం. వాస్తవ ప్రసంగం హిందీలో ఉంది.
***
(Release ID: 2106595)
Visitor Counter : 27