మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘బేటీ బచావో బేటీ పఢావో’ పదో వార్షికోత్సవానికి మహిళా - శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అదే తరహా కార్యక్రమాలు.. ఈ నెల 22, 26, మార్చి 8న ప్రత్యేక కార్యక్రమాలు
ఈ నెల 22 నుంచి మార్చి 8 వరకు పదో వార్షికోత్సవం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ముగింపు
‘వికసిత భారత్’ దిశగా దేశ నిబద్ధతను చాటిన ‘బేటీ బచావో బేటీ పఢావో’ పదేళ్ల ప్రస్థానం: మహిళలు కేవలం లబ్ధిదారులే కాదు.. మార్పునకు వారే సారథులు
Posted On:
21 JAN 2025 12:33PM by PIB Hyderabad
దేశంలో బాలికల రక్షణలో, వారిని విద్యావంతులను చేయడంలో, సాధికారులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ దశాబ్ద కాలపు కృషికి గుర్తుగా.. బేటీ బచావో బేటీ పఢావో (బీబీబీపీ) పథకం పదో వార్షికోత్సవాన్ని మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నిర్వహించనుంది. వికసిత భారత్ 2047 దార్శనికతకు, ‘మహిళల అభివృద్ధి’ నుంచి ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ దిశగా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించారు. జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సందర్భంగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యమివ్వగా, ప్రస్తుతం బ్రెజిల్ అధ్యక్షతన జీ20 ఆ విధానాన్నే అవలంబిస్తోంది.
ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
సాయుధ బలగాలు, పారా మిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మహిళా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన డిప్యూటీ సెక్రటరీ, ఆపై స్థాయిల్లో ఉన్న మహిళా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థినులు (మైభరత్ వలంటీర్లు), అంగన్ వాడీ సూపర్ వైజర్లు/వర్కర్లు, రాష్ట్రాలు - జిల్లాల ప్రతినిధులనూ కార్యక్రమంలో పాల్గొంటారు.
యూనిసెఫ్, యూఎన్ ఉమెన్, యూఎన్ డీపీ, యూఎన్ఎఫ్ పీఏ, ప్రపంచ బ్యాంకు, జర్మన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జీఐజెడ్) వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ నెల 22 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 వరకు ఈ పదో వార్షికోత్సవాలను నిర్వహించనున్నారు. విజ్ఞాన భవన్ లో జరిగే ప్రారంభోత్సవంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఉత్తమ విధానాలను సంగ్రహంగా వివరించే సంకలనాన్నీ ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పోర్టల్ లను కూడా ప్రారంభిస్తారు.
అవే కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహిస్తారు. మొదటి రోజుతోపాటు గణతంత్ర దినోత్సవం, మార్చి 8న ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానోత్సవాలతోపాటు సంకల్ప్: మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థినులు, పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు, సామాజిక బృందాలను ఇందులో భాగస్వాములను చేస్తారు.
వార్షికోత్సవాలు కొనసాగినన్ని రోజులూ పత్రికలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే జాతీయ స్థాయి ప్రచారం ఈ పథకం సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సుస్థిర విధానాలకు అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.
దేశంలో లింగ అసమానత్వం, బాలల లింగ నిష్పత్తి (సీఎస్ఆర్)లో క్షీణత సమస్యను పరిష్కరించడం కోసం 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘బేటీ బచావో బేటీ పఢావో’ పథకాన్ని ప్రారంభించారు. పైన పేర్కొన్న ప్రమాదకర ధోరణులను తిప్పికొడుతూ.. ఈ పథకం విధానపరమైన కార్యక్రమం నుంచి జాతీయ స్థాయి ఉద్యమంగా ఎదిగింది.
లింగ వివక్ష సమస్యను పరిష్కరించడంతోపాటు ఆడపిల్లలకు విలువనివ్వడం, వారికి హక్కులూ అవకాశాలను అందించేలా సాంస్కృతిక పరివర్తనను ప్రోత్సహించడంలో - ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజం, ప్రసార మాధ్యమాలు, ప్రజలను బేటీ బచావో బేటీ పడావో పథకం ఏకీకృతం చేసింది. 2014-15లో జనన స్థాయిలో జాతీయ లింగ నిష్పత్తి (ఎస్ ఆర్ బీ) 918గా ఉండగా, 2023-24 నాటికి 930కి పెరిగింది. సెకండరీ స్థాయిలో బాలికల స్థూల నమోదు నిష్పత్తి 2014-15లో 75.51% ఉండగా, 2023-24 నాటికి 78%కి పెరిగింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు 61% నుంచి 97.3%కి పెరిగాయి. మొదటి మూడు నెలల్లో ప్రసవానంతర సంరక్షణ కోసం చేసుకున్న నమోదులు గణనీయమైన స్థాయిలో 61% నుంచి 80.5%కి పెరిగాయి. ఇవన్నీ బేటీ బచావో బేటీ పఢావో పథకం సాధించిన కీలకమైన విజయాలు.
మహిళా సాధికారతను చాటేలా యశస్వినీ బైక్ సాహసయాత్ర, బడి బయట ఉన్న లక్ష మందికిపైగా బాలికలను తిరిగి బడిలో చేర్పించడం కోసం కన్యా శిక్షా ప్రవేశ్ ఉత్సవ్, ఆడపిల్లలను వదిలేయకుండా అవగాహన కల్పించేలా డోరీ టీవీ షోతో భాగస్వామ్యం... ఇలా పలు ప్రభావవంతమైన కార్యక్రమాలను బేటీ బచావో బేటీ పఢావో చేపట్టింది. శ్రామిక శక్తిలో భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన జాతీయ నైపుణ్య కార్యక్రమం: బేటియా బనే కౌశల్ వంటి ఇతర కార్యక్రమాలనూ ఈ పథకం కింద చేపట్టారు.
భాగస్వామ్య మంత్రిత్వ శాఖల సహకారంతో.. లింగ సమానత్వాన్ని పెంపొందించడం, బాలికా సాధికారతనుసాధించడంలో తన నిబద్ధతను మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తోంది. మహిళలు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాక, వారే మార్పునకు సారథులుగా నిలిచే వికసిత భారత్ ను నిర్మించడంలో దేశ అంకితభావాన్ని బేటీ బచావో బేటీ పఢావో ఈ పదేళ్ల ప్రస్థానం స్పష్టంచేస్తోంది. ఈ పథకం ఆడపిల్లలకు మరింత ఉజ్వలమైన, సమ్మిళితమైన భవిష్యత్తును అందిస్తోంది. దేశవ్యాప్తంగా సానుకూల మార్పునకు బేటీ బచావో బేటీ పఢావో భరోసా ఇస్తోంది.
***
(Release ID: 2095003)
Visitor Counter : 67