ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో తొలి బోడోలాండ్ మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
15 NOV 2024 9:46PM by PIB Hyderabad
ఖులుంబాయ్. (నమస్తే)
అసోం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు, వీడియో అనుసంధానం ద్వారా మనతో కలిసిన ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, వేదిక మీద ఉన్న విశిష్ట అతిథులు, సోదరులు, సోదరీమణులారా,
ఈ రోజు కార్తీక పూర్ణిమ, దేవ్ దీపావళి జరుపుకుంటున్న శుభ సందర్భం. ఈ పండుగ సందర్భంగా దేశంలోని పౌరులందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. గురు నానక్ దేవ్ జీ 55వ ప్రకాశ్ పర్వ్ కూడా ఈ రోజే. ఈ ముఖ్యమైన రోజున దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సిక్కు సోదరులకు, సిక్కు సోదరీమణులకు నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి తోడు, పూర్తి దేశం గిరిజన గౌరవ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ రోజు ఉదయం బీహార్లోని జముయిలో నిర్వహించిన భగవాన్ బిర్సా ముండా 150 జయంతి ఉత్సవంలో నేను పాలుపంచుకొన్నాను. ఇప్పుడు ఈ సాయంత్రం ఇక్కడ మొదటి బోడో మహోత్సవ్ను మనం ప్రారంభించుకొంటున్నాం. తొలి బోడోలాండ్ ఉత్సవంలో పాల్గొనడానికి అసోం సహా వివిధ రాష్ట్రాలకు చెందిన బోడోలంతా తరలి వచ్చారు. ఇక్కడ శాంతి, సంస్కృతి, సమృద్ధితో విలసిల్లే ఒక నవ శకాన్ని సంబరంలా జరుపుకోవడానికి విచ్చేసిన బోడో మిత్రులందరికీ నేను స్నేహపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
నా మిత్రులారా,
ఈ సందర్భం నాలో ఎంతటి ఉద్వేగాన్ని కలిగిస్తోందో మీరు ఊహించలేరు. ఈ క్షణాలు నా లోపల భావోద్వేగాలను కుదిపి వేస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్-కండిషన్ సదుపాయం ఉన్న గదులలో కూర్చొని ఉండి సిద్ధాంతాలను రూపొందించే వారు, దేశ ఘటనలను వివరించే వారు ఈ సందర్భానికి ఉన్నటువంటి అంతు లేని ప్రాముఖ్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోవచ్చు. యాభై ఏళ్ళ పాటు కొనసాగిన రక్తపాతం, హింస మూడు నాలుగు తరాల యువతను బలి తీసుకున్నాయి. ఎన్నో దశాబ్దాలు గడచిన తరువాత బోడో ప్రజ ఈ రోజు పండుగ చేసుకుంటున్నది. రణచండి నృత్యం ఒక్కటి చాలు... బోడో ప్రజానీకంలో వ్యక్తమవుతున్న ఉత్సాహం ఎంతటిదో తెలుసుకోవడానికి. ఢిల్లీలో ఉన్న వారు ఈ కార్యక్రమాల గాఢతను నిజంగా అర్థం చేసుకోగలరేమో నాకైతే ఇదమిత్థంగా తెలియదు. ఈ విజయం రాత్రికి రాత్రి సిద్ధించ లేదు. ఓరిమితో, సంఘర్షణ చిక్కుముడులను ఒక్కటొక్కటిగా పట్టుపట్టి విడదీసి మరీ చక్కదిద్దడమైంది. ప్రస్తుతానికి మీరంతా కలిసికట్టుగా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాయడానికి మీ వంతు తోడ్పాటును అందించారు.
నా బోడో సోదరులూ, సోదరీమణులారా,
బోడో శాంతి ఒప్పందం 2020లో కుదిరిన తరువాత నేను కోక్రాఝార్ కు వెళ్లే అదృష్టానికి నోచుకొన్నాను. మీరంతా నాపై కురిపించిన ఆప్యాయత, స్నేహం నేను మీలో ఒకడిని అన్న భావన కలిగింది. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ నా మనసులో ఉంచుకుంటాను. ఒక ప్రదేశంలోని వాతావరణంగానీ, లేదా కొన్ని సందర్భాలు గానీ తరచుగా మన మీద ఒక మరచిపోలేనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. అయితే, ఇక్కడ నాకు ఎదురైన అనుభవం మరో విధంగా ఉంది.. నాలుగేళ్ళు గడచినా సరే అదే ప్రేమ, అదే ఉత్సాహం, అదే వాత్సల్యం. మరి, ఇది ఒకరి గుండెను ఎలా తాకుతుందో చెప్పడం చాలా కష్టం. ఆ రోజున, బోడోలాండ్లో శాంతి, సౌభాగ్యాల ప్రభాత కిరణాలు ప్రసరించాయని నేను నా బోడో సోదరులకు, సోదరీమణులకు చెప్పాను. అవి డొల్ల కబుర్లేమీ కాదు. ఆయుధాలను విడచిపెట్టి, హింస జోలికి పోం అంటూ శాంతి కోసం మీరెంతగా తపించిపోయారో అక్కడి వాతావరణాన్ని గమనించాక నాకు బోధపడింది. అది నన్ను కదలించివేసింది. నేను లోలోపల నిజంగా ఎంతో విచలితుడినైపోయాను. బోడోలాండ్లో ఎట్టకేలకు సమృద్ధి తప్పక ఉదయిస్తుందన్న భావన నాలో జనించింది. ఈ రోజున మీ ముఖాలలో ఉత్సుకత, సంతోషం చూస్తూ ఉంటే, బోడో ప్రజల ఉజ్వల భవితకు ఒక బలమైన పునాది పడిందన్న మాటలను నేను రూఢిగా చెప్పగలను.
గత నాలుగేళ్ళుగా బోడోలాండ్లో నమోదైన ప్రగతి నిజంగా ప్రశంసనీయం అనాలి. శాంతి ఒప్పందం కుదిరినప్పటి నుంచీ, ఈ ప్రాంతంలో అభివృద్ధి నవ తరంగం ఎగసింది. బోడో శాంతి ఒప్పందం సానుకూల ప్రభావాలను నేను ఈ రోజు గ్రహించిన ప్రకారం మీ జీవనాలను అది ఎంతగా మార్చివేసిందో తెలుసుకొంటే, నాలో కలిగిన గొప్ప సంతృప్తి భావం, ఆనందం.. వీటిని గురించి మిత్రులారా, నేను మాటలలో చెప్పలేక పోతున్నాను. ఇది నా హృదయంలో ఎంతటి ప్రసన్నతను నింపిందో మీరు ఊహించ లేరు. ఒకసారి ఇలా ఊహించండి.. ఒక తల్లి, ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఆ బాలుడిని ఆమె అల్లారుముద్దుగా పెంచి, తన ప్రేమను పంచింది. అయితే ఆ పిల్లవాడు తన దోస్తులతో కలసి, ఆయుధాలు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోయాడు. హింస మార్గంలో ముందుకు ముందుకు వెళ్లిపోతూ, తల్లి నుంచి ఎడంగా సుదూరం సాగిపోయాడు. తల్లి తోడనేది ఎరుగక, నిరాశలో కాలాన్ని వెళ్ళదీస్తోంది. ఒక రోజున, తన బిడ్డ ఆయుధాలు వదలిపెట్టి తిరిగి ఇంటికి వచ్చాడన్న సంగతి ఆమెకు తెలియవచ్చింది. ఆ రోజున ఆ మాతృమూర్తి ఎంత సంతోషంతో పొంగిపోతుందో ఒక్క సారి ఊహించండి. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే విధమైన ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను. నా సొంత ప్రజలు, నా యువ మిత్రులు నేను ఇచ్చిన పిలుపును పట్టించుకొని, వారి ఆయుధాలను పక్కకు పడేసి, భారత్ కోసం ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి నాతో పాటు పని చేస్తున్నారు. ఇది నా జీవనంలో చాలా ముఖ్యమైనటువంటి క్షణాల్లో ఒక క్షణం. ఈ ఘట్టం నాలో ఎంతో సంతృప్తిని మిగిల్చింది. మరి ఈ విషయంలో మీ అందరినీ అభినందిస్తున్నాను. పైపెచ్చు, బోడో శాంతి ఒప్పంద ప్రయోజనాలు ఒక్క ఈ ప్రాంతానికే కాకుండా చాలా ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. ఈ ఒప్పందం మరెన్నో ఒప్పందాలకు బాటను పరిచింది. ఇది ఒక దస్తావేజుగానే ఉండిపోయిన పక్షంలో, బహుశా శాంతి సంభావ్యత పట్ల ఇతరులు నమ్మకం పెట్టుకొనే ఉండేవాళ్ళు కాదేమో. అయితే, మీరు ఆ మాటలకు ప్రాణం పోశారు. ఒప్పందంలోని అంశాలు క్షేత్ర స్థాయిలో వాస్తవ రూపాన్ని దాల్చేటట్టు చూసి, ప్రజల మనసుల్ని గెలుచుకొన్నారు. మీరు చేసిన ప్రయత్నాలు, మీరు తీసుకొన్న చొరవల కారణంగానే శాంతికి కొత్త దారులు తెరుచుకొన్నాయి. ఈశాన్య ప్రాంతాలన్నిటా ఆశాజ్యోతి కాంతులీనింది. మీరు నిజంగా ప్రేరణాత్మక నిదర్శనాన్ని అందించారు.
మిత్రులారా,
ఈ ఒప్పందాల చలవతో, ఒక్క అసోం లోనే 10,000 కన్నా ఎక్కువ మంది యువత వారి ఆయుధాలను విడచిపెట్టి, హింస మార్గాన్ని వదలివేసి అభివృద్ధి పథంలోకి అడుగు పెట్టారు. ఈ సంఖ్యను నేను మీకు మరోసారి చెప్పనివ్వండి. 10,000 కన్నా ఎక్కువ మంది వింటున్నారా..? ఈ సంగతి ఢిల్లీలో ఉన్న నిపుణులు అని చెప్పుకొంటున్న వారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. కార్బీ ఆంగ్లోంగ్ ఒప్పందం, బ్రు-రియాంగ్ ఒప్పందం, ఎన్ఎల్ఎఫ్టీ-త్రిపుర ఒప్పందం ఏనాటికైనా వాస్తవ రూపం దాల్చుతాయని ఎవరైనా అనుకున్నారా!. అయితే ఇదంతా, నా స్నేహితులారా, మీరు ఇచ్చిన మద్దతుతోనే సాధ్యపడింది. మరి ఈ రోజు మొత్తం దేశంలో గిరిజనుల గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవడంతోపాటు భగవాన్ బిర్సా ముండా జయంతిని మనం స్మరించుకోవడం ఇందుకేనన్నమాట. మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీకు ధన్యవాదాలు చెప్పడానికి నేను బయలుదేరి వచ్చాను. మీ కుటుంబాలకు నా నమస్కారాలు తెలియజేయడానికే నేను వచ్చాను. మన కలలు మన కళ్ళెదుటే నెరవేరినప్పుడు మన గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుంది. దీనికి మించిన ధన్యవాదాలు మీకు నేను వ్యక్తం చేయజాలను. ఇప్పటికీ ఇంకా నక్సలిజం దోవలోనే వెళుతున్న ఈ దేశ యువత నా బోడో మిత్రుల నుంచి పాఠాన్ని నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. తుపాకీని పారేయండి. హింస మార్గాన్ని, ఆయుధాలను వదలి వేయండి. అవి ఎన్నటికీ నిజమైన ఫలితాలను అందించవు. బోడో ప్రజ చూపించిన దారియే శాశ్వత ఫలితాల గమ్యానికి తీసుకు పోయే రహదారి.
మిత్రులారా,
నేను మీ దగ్గరికి వచ్చి, మీరంటే చూపించిన నమ్మకాన్ని మీరు గౌరవించారు. నేను చెప్పిన మాటలపైన మీరు ఆదరం ఉంచారు. నేను చెప్పిన మాటలకు మీరు ఎంత శక్తిని సంతరించారంటే అవి ఒక చిరకాల వాగ్దానంగా మారిపోయి, తరాల తరబడి రాతి మీద చెక్కిన అక్షరాల్లా నిలిచిపోతున్నాయి. మీ అభివృద్ధి కోసమని అసోం ప్రభుత్వంతోపాటే మా ప్రభుత్వం విశ్రాంతి అనేదే లేకుండా పని చేస్తోంది.
మిత్రులారా,
బోడో టెరిటోరియల్ రీజియన్ (బోడోప్రాదేశిక క్షేత్రం.. బీటీఆర్)లో బోడోల అవసరాలకు, ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వంతోపాటు అసోం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నాయి. బోడోలాండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లతో ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకు వచ్చింది. అసోం ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని రూపొందించింది. బోడోలాండ్ లో విద్య, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి రంగాల్లో మౌలిక వసతి, సదుపాయాలను మెరుగు పరచడానికిగాను రూ.700 కోట్ల కన్నా ఎక్కువ నిధులను ఇప్పటికే ఖర్చు చేశారు. హింసకు స్వస్తి పలికి ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చిన వారి మనఃస్థితిని మేం పూర్తి సానుకూల ధోరణితో అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకొన్నాం. బోడోలాండ్ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంటుకు చెందిన 4,000 కన్నా ఎక్కువ మంది పూర్వ సభ్యులకు పునరావాసాన్ని కల్పించడంతోపాటు, చాలా మంది యువజనులకు అసోం పోలీస్ విభాగంలో ఉద్యోగాలు కల్పించాం. దీనికి అదనంగా, బోడో పోరాటం వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అసోం ప్రభుత్వం సమకూర్చింది. బోడోలాండ్ అభివృద్ధి కోసం అసోం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.800 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెడుతోందని తెలిస్తే మీరు సంతోషిస్తారు.
మిత్రులారా,
ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నైపుణ్యాభివృద్ధితోపాటు, యువతీ యువకులు, మహిళలు వారి వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సరిపడా అవకాశాలు వారికి అందడం ముఖ్యం. హింసకు చోటు లేనప్పుడు బోడోలాండ్లో అభివృద్ధి అనే ‘‘మర్రి చెట్టు’’ను నాటాల్సి వచ్చింది. ఈ దృష్టికోణంతో ఎస్ఈఈడీ మిషన్కు పునాదిని వేశారు. ఎస్ఈఈడీ మిషన్ అంటే నైపుణ్యాలకు పదును పెట్టడం, ఔత్సాహిక పారిశ్రామికత్వం, ఉద్యోగాల కల్పన అన్నమాట. బోడో యువత దీని నుంచి ఎంతో లబ్ధిని పొందుతోంది.
మిత్రులారా,
ఒకప్పుడు తుపాకులు పట్టుకొని తిరిగిన యువత ప్రస్తుతం క్రీడా మైదానంలో రాణిస్తుండడం చూసి నాకు పట్టరాని సంతోషం కలుగుతోంది. కోక్రాఝార్ లో నిర్వహించిన డురాండ్ కప్ రెండు సంచికలలో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ జట్లు కూడా పాలుపంచుకొన్నాయి. ఇది ఈ ఆటల పోటీలో చరిత్రకు నాందీ ప్రస్తావన అయింది. శాంతి ఒప్పందం కుదిరిన నాటి నుంచీ బోడోలాండ్ సాహితీ ఉత్సవాన్ని కోక్రాఝార్ లో గత మూడేళ్ళుగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికిగాను సాహిత్య పరిషత్ కు నేను ప్రత్యేకంగా కృతజ్ఞుడినై ఉంటాను. బోడో సాహిత్యానికి ఇది ఎంతో పెద్ద సేవ అని చెప్పాలి. ఈ రోజు బోడో సాహిత్య సభ 73వ ఆవిర్భావ దినోత్సవం కూడా. బోడో సాహిత్యాన్ని, భాషను సమాదరించుకోవడానికే ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. రేపు ఒక సాంస్కృతిక ర్యాలీని కూడా నిర్వహించనున్నట్లు నా దృష్టికి తీసుకు వచ్చారు. ఆ కార్యక్రమం సఫలం కావాలని నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రజలు చూస్తున్నారంటే మొత్తం దేశ ప్రజలు దీనిని చూసే అవకాశాన్ని అందుకొంటున్నారన్నమాటే. ఢిల్లీకి రావాలని, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయాలని మీరు తెలివైన నిర్ణయాన్ని తీసుకొన్నారు.
మిత్రులారా,
ఇటీవలే ఇక్కడ ఒక ప్రదర్శనను నేను చూశాను. అందులో బోడో కళ, బోడో చేతివృత్తిదారుల కళారూపాలు ప్రదర్శించారు. అవి ఎంతో ఘనంగా ఉన్నాయి. ఆరోనాయి, దోఖోనా, గామ్సా, కరై-దఖినీ, థోర్కా, జావు గిశీ, ఖామ్ వంటి అనేక సాంప్రదాయిక ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. ఈ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. దీని అర్థం ఈ ఉత్పత్తులు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అవి బోడోలాండ్ తోను, బోడో సంస్కృతితోను ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని సూచిస్తాయి.
పట్టు పరిశ్రమ బోడో సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఒక అంతర్భాగంగా ఉంది. మరి, ఈ కారణంగానే మా ప్రభుత్వం బోడోలాండ్ సెరికల్చర్ మిషన్ను నడుపుతున్నది. నేత వృత్తి ప్రతి ఒక్క బోడో కుటుంబంలో ఎంతో శ్రద్ధాసక్తులతో అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాల్లో ఒక సంప్రదాయం. ఈ విశిష్ట సాంస్కృతిక పారంపర్యాన్ని ప్రోత్సహించడానికి బోడోలాండ్ హేండ్లూమ్ మిషన్ ప్రయత్నిస్తోంది.
మిత్రులారా,
భారత పర్యటన రంగంలో అసోం ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఈ కోణంలో చూస్తే బోడోలాండ్ కు ఒక ముఖ్యపాత్ర ఉంది. అసోం పర్యటన ఆకర్షక బిందువులలో బోడోలాండ్కు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మానస్ జాతీయ ఉద్యానం, రాయిమోనా జాతీయ ఉద్యానం, సిఖ్నా ఝలావో జాతీయ ఉద్యానాల దట్టమైన అటవీప్రాంతాలు అవాంఛనీయ కార్యకలాపాలకు తావులుగా మారిన కాలమంటూ ఒకటి ఉండింది. ఈ అడవులు ఒకప్పుడు దాక్కొనే స్థలాలుగా ఉన్నవి కాస్తా, ఇప్పుడు మన యువత మహత్వాకాంక్షలను నెరవేర్చే నిలయాలుగా మారుతూ ఉండడం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. బోడోలాండ్లో పర్యటన రంగం వర్ధిల్లిందా అంటే గనక అది ఇక్కడి యువతకు లెక్కలేనన్ని ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టించ గలుగుతుంది.
మిత్రులారా,
ఈ రోజున మనం ఈ ఉత్సవాన్ని నిర్వహించుకొంటున్నామంటే, ఈ సందర్భంలో బోడోఫా ఉపేంద్ర నాథ్ బ్రహ్మను, గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మను స్మరించుకోవడం స్వాభావికమైందేనని చెప్పాలి. భారత్ సమగ్రతను నిలబెట్టడానికి, బోడో ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి బోడోఫా ఎల్లప్పటికీ ప్రజాస్వామిక మార్గాలను అనుసరించాలని చెబుతూ వచ్చారు. గురుదేవులు కాళీచరణ్ బ్రహ్మ అహింస, ఆధ్యాత్మిక వాదాల మార్గంలో ముందుకు సాగిపోతూ, ఈ ప్రజల్ని ఏకం చేశారు. ఇవాళ బోడో మాతృమూర్తుల, బోడో సోదరీమణుల కళ్ళలో ఉజ్వల భవిత వెలుగులే తప్ప కన్నీళ్ళు ఉబికి రాకపోవడం చూస్తూ ఉంటే నాకు ఎంత సంతృప్తి కలుగుతోందో. బోడో సముదాయంలో విజేతలుగా నిలిచిన వారిని చూసి స్ఫూర్తిని తెచ్చుకొని, ప్రతి ఒక్క బోడో కుటుంబం తమ సంతానానికి ఒక మేలైన భవిష్యత్తును ఇవ్వాలని కోరుకొంటోంది. బోడో ప్రజల్లోని విశిష్ట వ్యక్తులు అనేక మంది ప్రముఖ బాధ్యతలను వహించి, జాతికి సేవ చేశారు. వారిలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి శ్రీ హరిశంకర్ బ్రహ్మ, మేఘాలయ మాజీ గవర్నరు శ్రీ రంజిత్ శేఖర్ ముశహరీల వంటి వారు ఎన్నదగ్గ వ్యక్తులు. వారు బోడో ప్రజల పేరు ప్రతిష్టలను పెంచారు. బోడోలాండ్లో యువత ప్రస్తుతం చక్కని ఫలితాలు ఖాయంగా ప్రసాదించే ఉద్యోగ జీవనం గడపాలని కలలుగంటూ ఉన్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈ సన్నివేశాలన్నింటిలోను మా ప్రభుత్వం.. అది కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రతి బోడో కుటుంబాన్ని వెన్నంటి ఒక భాగస్వామిగా నిలబడుతుంది.
మిత్రులారా,
నాకు సంబంధించినంత వరకు అసోం సహా పూర్తి ఈశాన్య ప్రాంతాలు భారత్ కు ‘అష్టలక్ష్ములే’. ఇక అభివృద్ధి ప్రభాత కిరణాలు తూర్పు నుంచే, అంటే భారతదేశంలోని తూర్పు ప్రాంతాల నుంచే ప్రసరించి, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) ఆశయానికి కొత్త ఊపిరులను ఊదుతాయి. ఈ కారణంతోనే మేం ఈశాన్య ప్రాంతాలలో చిరస్థాయి శాంతిని నెలకొల్పడానికి అలుపు అనేదే ఎరుగకుండా కృషి చేస్తున్నాం. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలన్నింటి మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు స్నేహపూర్వక పరిష్కారాలను కనుగొనడానికి చురుకుగా పనిచేస్తున్నాం.
మిత్రులారా,
గడచిన పదేళ్ళలో అసోంలోను, ఈశాన్య ప్రాంతాలలోను అభివృద్ధి స్వర్ణ యుగం మొదలైంది. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో గత పది సంవత్సరాలలో 25 కోట్ల మంది పేదరికం వలయంలో నుంచి బయటకు వచ్చారు. వారిలో అసోంలో ఎంతో మంది పేదరికంతో పోరాడి, విజేతలుగా నిలిచారు. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అసోం అభివృద్ధి మార్గంలో కొత్త విజయాలను అందుకొంటోంది. ఆరోగ్య రంగంలో ప్రాథమిక సదుపాయాలను అందించడానికి మేం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొన్నాం. గడచిన ఏడాదిన్నర కాలంలో అసోం నాలుగు ప్రధాన ఆసుపత్రులను నజరానాలుగా అందుకొంది. గౌహతి ఎఐఐఎమ్ఎస్, కోక్రాఝార్, నల్బాడీ, నాగాఁవ్ వైద్య కళాశాలల వంటి సదుపాయాలు ఎందరికో ఆరోగ్య సంరక్షణ సవాళ్ళ బారి నుంచి విముక్తిని కలిగించాయి. అసోమ్లో ఒక కేన్సర్ ఆసుపత్రిని తెరవడంతో ఈశాన్య ప్రాంతాల రోగులకు ఎక్కడలేని ఊరట కూడా లభించింది.
అసోంలో 2014 కన్నా వెనుకటి కాలంలో ఆరు మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఇవాళ, ఇది రెండింతలై 12కు చేరుకొన్నాయి. మరో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అసోమ్లో వైద్య సంస్థల ఎదుగుదల మన యువతీ యువకులకు అవకాశాల తలుపులను ఎన్నింటినో తెరుస్తున్నాయి.
మిత్రులారా,
బోడో శాంతి ఒప్పందంలో సూచించిన మార్గం ఈశాన్య ప్రాంతాలన్నింటి సమృద్ధి సాధనకు దారిని పరుస్తోంది. బోడోలాండ్ అంటే అది వందల ఏళ్ళ సంస్కృతికి ఒక ఖజానాగా నేను భావిస్తాను. ఈ సంపన్న సంస్కృతితోపాటు, బోడో సంప్రదాయాలను పెంచి పోషించి, మనమందరం వాటిని పటిష్టం చేసి తీరాలి. ఒక ఉల్లాస భరితమైన బోడోలాండ్ ఉత్సవం అనుభూతులు మీకందరికీ దక్కాలని నేను మనస్ఫూర్తిగా మరో సారి కోరుకుంటున్నాను. ఇక్కడ పెద్ద సంఖ్యలో గుమికూడిన మీ అందరినీ చూసి, ఢిల్లీలోకి మీకందరికీ స్వాగతం చెప్పే భాగ్యం కలగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మరి, నేను నా రెండు చేతులను చాచి మరీ మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మీరందరూ నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు, మీరంతా నాకు పంచిన ప్రేమకు, మీ కళ్ళల్లో నేను చూస్తున్న కలలకుగాను మీరు అంతా నన్ను నమ్మండి.. మీ ఆశలను, ఆకాంక్షలను తీర్చడానికి నేను విశ్రాంతి అనేదే లేకుండా శ్రమిస్తాను.
మిత్రులారా,
నా అంకితభావానికి ఉన్న ఒకే ఒక మహత్తర కారణం ఏదంటే, అది - మీరు నా మనస్సును గెలుచుకొన్నారనేదే. ఈ కారణంగా, నేను ఎప్పటికీ మీ వాడినే. మీ విషయంలో నేను భక్తిశ్రద్ధలతో పని చేస్తాను. మీరంటే నాకు ఎంతో ప్రేరణ. మీకందరికీ ఇవే నా శుభాకాంక్షలు. మీకు అనేకానేక ధన్యవాదాలు.
ఇప్పుడిక, నాతో కలిసి మీ శక్తి కొద్దీ పలకండి..
‘భారత్ మాతా కీ జై.’
‘భారత్ మాతా కీ జై.’
‘భారత్ మాతా కీ జై.’
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 2077775)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam