సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

‘జీవన్ ప్రమాణ్’ ద్వారా పింఛనుదారులకు డిజిటల్ మాధ్యమం పరంగా సాధికారిత కల్పనకు ఉద్దేశించిన ‘డీఎల్‌సీ ప్రచార ఉద్యమం 3.0’ ను 2024 నవంబరు 1 నుంచి నవంబరు 30 వరకు నిర్వహించనున్నారు


భారతదేశంలో జిల్లా తపాలా కార్యాలయాలన్నింటిలో ‘డీఎల్‌సీ ప్రచార ఉద్యమం 3.0’ ను విజయవంతంగా నిర్వహించడానికి తపాలా విభాగంతోను, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తోను కలసి పనిచేయనున్న పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం

Posted On: 13 SEP 2024 12:02PM by PIB Hyderabad

పింఛను - పింఛనుదారుల సంక్షేమ విభాగం ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్’ (డీఎల్‌సీ) సంబంధిత ప్రచార ఉద్యమాలను 2022 వ, 2023 వ సంవత్సరాలలో విజయవంతంగా నిర్వహించింది.  దీనికి గాను ఈ విభాగం పింఛనును పంపిణీ చేస్తున్న బ్యాంకులతో, పింఛనుదారు సంక్షేమ సంఘాలతో, యుఐడిఎఐ, ‘జీవన్ ప్రమాణ్’ తో కలసి పనిచేయనుంది.  2023లో ‘డీఎల్‌సీ ప్రచార ఉద్యమం 2.0’ను  100 నగరాల్లో నిర్వహించగా, 1.45 కోట్ల మంది పింఛనుదారులు వారి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించారు.  ‘డీఎల్‌సీ ప్రచార ఉద్యమం 3.0’ను ఈ సంవత్సరంలో నవంబరు 1వ తేదీ మొదలు నవంబరు 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పింఛను-పింఛనుదారుల సంక్షేమ విభాగం ప్రకటించింది.  ‘డీఎల్‌సీ క్యాంపెయిన్ 3.0’ను భారతదేశం అంతటా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో, ప్రధాన  నగరాలలో నిర్వహించనున్నారు.  పింఛనును అందిస్తున్న బ్యాంకులు, పింఛనుదారు సంక్షేమ సంఘాలు, యుఐడిఎఐలతో పాటు ‘జీవన్ ప్రమాణ్’ లు 157 నగరాల్లో డీఎల్‌సీ ప్రచార ఉద్యమాన్ని నిర్వహించనున్నాయి. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో ‘డీఎల్‌సీ క్యాంపెయిన్ 3.0’ను నిర్వహించడానికి పింఛను- పింఛనుదారుల సంక్షేమ విభాగం ఇటు తపాలా విభాగంతోను, అటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపిపిబి)తోను కలసి పనిచేయనుంది.  డీఎల్‌సీ క్యాంపెయిన్ 3.0 ను దేశవ్యాప్తంగా అన్ని జిల్లా తపాలా కార్యాలయాలలో నిర్వహించనున్నారు. 

అన్ని జిల్లా తపాలా కార్యాలయాల్లో డీఎల్‌సీ ప్రచార ఉద్యమం 3.0 నిర్వహణ సంబంధి రూపురేఖలను తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ఒక సన్నాహక సమావేశాన్ని కార్యదర్శి (పి&పిడబ్ల్యు) శ్రీ వి. శ్రీనివాస్ నిన్నటి రోజున నిర్వహించారు. ఈ సమావేశంలో తపాలా సేవల డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ శరణ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్‌ స్ శ్రీమతి రాజుల్ భట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ఎమ్‌డి & సిఇఒ శ్రీ ఆర్. విశ్వేశ్వరన్, ఐపిపిబి సిజిఎమ్ శ్రీ గురు శరణ్ రాయ్ బన్సల్ లు పాల్గొన్నారు. పింఛను- పింఛనుదారుల సంక్షేమ విభాగంలో ఉన్నతాధికారులైన  సంయుక్త కార్యదర్శి శ్రీ ధ్రుబజ్యోతి సేన్ గుప్త,  డైరెక్టర్ శ్రీ రవి కిరణ్  ఉబాలే ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.  ‘డీఎల్‌సీ క్యాంపెయిన్ 3.0’ను జిల్లా తపాలా కార్యాలయాలలో నిర్వహించడానికి పింఛనుదారు సంక్షేమ సంఘాలకు, పింఛనును అందిస్తున్న బ్యాంకులకు, యుఐడిఎఐ కి, ‘జీవన్ ప్రమాణ్’ కు జిల్లా తపాలా కార్యాలయాలు తోడ్పాటును అందించాలని అంగీకారం కుదిరింది.  పింఛనుదారులు ఏండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ముఖ ప్రమాణీకరణ (ఫేస్ ఆథెంటికేషన్)ను ఉపయోగించి ‘జీవన్ ప్రమాణ్’ ను జిల్లా తపాలా కార్యాలయాలలో దాఖలు చేయవచ్చు. పెద్ద వయస్సుగల వారికి వారి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ (డీఎల్‌సీ)లను నిబంధనల మేరకు దాఖలు చేయాలని చెప్పి, ఆ పనిని పూర్తి చేయడంలో సహకరించేందుకు పింఛనుదారు ఇంటికే తపాలా విభాగం వారు వెళ్ళి సేవలను అందించే వెసులుబాటు కూడా ఉంది. బేనర్ లను ప్రదర్శించడం, సామాజిక ప్రసార మాధ్యమాల వేదికను ఉపయోగించుకోవడం, సంక్షిప్త సందేశ సేవ (ఎస్ఎమ్ఎస్), ఇంకా చిన్న వీడియోల ద్వారా డీఎల్‌సీ 3.0 ప్రచార ఉద్యమాన్ని గురించిన చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి ప్రచారాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించనున్నారు.  శిబిరాల నిర్వహణ లో అవసరమైన సాంకేతిక సమర్థనను యుఐడిఎఐ, ఎలక్ట్రానిక్స్- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ (MeitY)లు అందించనున్నాయి.  వివిధ విభాగాల మధ్య ఈ విధమైన తోడ్పాటు పింఛనుదారులకు డిజిటల్ మాధ్యమం పరంగా సాధికారితను కల్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ముమ్మరం చేయడంలోను, పింఛనుదారులకు జీవన సౌలభ్యాన్ని ఇప్పటికన్నా మరింత ఎక్కువ స్థాయికి పెంచడంలోను దోహదం చేయగలదని ఆశిస్తున్నారు.

 

***



(Release ID: 2054529) Visitor Counter : 39