యు పి ఎస్ సి
పూజ మనోరమ దిలీప్ ఖేడ్ కర్ పై చర్య తీసుకోవడం మొదలుపెట్టిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి)
Posted On:
19 JUL 2024 2:08PM by PIB Hyderabad
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022 కు తాత్కాలికంగా ఎంపిక అయిన పూజ మనోరమ దిలీప్ ఖేడ్ కర్ తప్పిదానికి ఒడిగట్టిన ఘటనలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) క్షుణ్నమైన, విస్తృతమైన దర్యాప్తును ముగించింది. ఈ దర్యాప్తు లో ఆమె తన పేరును, తన తల్లితండ్రుల పేర్లను, ఫొటో/ సంతకం ,ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబరు, చిరునామాలను మార్చివేసి తన గుర్తింపు విషయంలో మోసానికి పాల్పడి, పరీక్షల నియమాలను ఉల్లంఘిస్తూ అనుమతించిన పరిమితి కన్నా ఎక్కువ సార్లు పరీక్షకు మోసపూర్వకంగా హాజరైనట్లు తేలింది.
2. ఈ కారణంగా, యుపిఎస్సి ఆమెకు వ్యతిరేకంగా పోలీసు అధికారుల వద్ద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను దాఖలు చేసి నేర పరమైన అభియోగాన్ని విచారించాలని కోరడం, సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022 లో ఆమె అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ సంజాయిషీ నోటీసు (ఎస్సిఎన్)ను ఇవ్వడం, ఇకమీదట జరిగే పరీక్షలలో/ఎంపికలలో పాల్గొనకుండా ఆమెపై నిషేధాన్ని విధించడం వంటి పలు చర్యలను తీసుకోవడం ఆరంభించింది.
3. రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన బాధ్యతలను నెరవేర్చడంలో యుపిఎస్సి తనకు అప్పగించిన ఆదేశాలను అన్నింటిని తు.చ. తప్పక పాటిస్తున్నట్లు, పరీక్షల నిర్వహణ సహా అన్ని ప్రక్రియలలోనూ అత్యున్నత స్థాయి తత్పరత ను చాటుకొంటూ ఎలాంటి రాజీకి తావు ఇవ్వకుండా పయనాన్ని సాగిస్తున్నట్లు నిర్ద్వందంగా స్పష్టం చేసింది. యుపిఎస్సి అత్యంత నిష్పాక్షికతతో, నియమావళిని కచ్చితంగా పాటిస్తూ అన్ని పరీక్షల నిర్వహణ ప్రక్రియలకు పవిత్రతను, చిత్తశుద్ధిని జతపరచింది.
4. ప్రజల వద్ద నుంచి, ప్రత్యేకించి అభ్యర్థుల వద్ద నుంచి చాలా అత్యున్నత స్థాయి నమ్మకాన్ని, విశ్వసనీయతను యుపిఎస్సి సంపాదించుకొంది. ఆ తరహా ఉన్నత వ్యవస్థ ను పదిలపరచాలని, ఏ కారణంగానూ రాజీ పడకుండా ఉండాలని కమిషన్ కంకణం కట్టుకొంది.
***
(Release ID: 2034559)