ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కీర్ స్టార్మర్ తో సంభాషించిన ప్రధాన మంత్రి; యుకె ప్రధాని గా ఎన్నికైనందుకు శ్రీ కీర్ స్టార్మర్ కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశం-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తతపరచుకోవాలనే అంశంపై ఇద్దరు నేతలు వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు

పరస్పరం ప్రయోజనకరమైన విధంగా ఎఫ్ టిఎ ను త్వరగా కొలిక్కి తెచ్చే దిశ లో కృషి చేయనున్న ఇరు పక్షాలు

భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ప్రధాని శ్రీ కీర్ స్టార్మర్ ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి


Posted On: 06 JUL 2024 3:06PM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ కీర్ స్టార్మర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాట్లాడారు.

 

యుకె కు ప్రధానిగా పదవీబాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆయనకు, ఎన్నికలలో అసాధారణమైన గెలుపును సాధించిన లేబర్ పార్టీకి అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

రెండు దేశాల మధ్య గల చరిత్రాత్మక సంబంధాలను నేతలు ఇరువురు గుర్తుకు తెచ్చుకొన్నారు. భారతదేశానికి, యుకెకు మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతపరచడం తో పాటు ముందుకు తీసుకుపోవాలన్న వారి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.  భారతదేశం-యుకె  స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాన్ని ఉభయ పక్షాలకు ప్రయోజనకరం గా ఉండే విధంగా త్వరగా కొలిక్కి తీసుకు వచ్చే దిశ లో కృషి చేద్దామంటూ నేతలు ఇద్దరూ వారి అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

 

యుకె లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కై భారతీయ సముదాయం అందిస్తున్నటువంటి సకారాత్మకమైన తోడ్పాటులను ప్రశంసిస్తూ, ఇరు పక్షాలు ప్రజల మధ్య పరస్పర సంబంధాలను ప్రోత్సహించడాన్ని ఇకమీదట కూడా కొనసాగించడానికి సమ్మతి ని తెలిపాయి.

 

భారతదేశాన్ని సందర్శించేందుకు వీలయినంత త్వరలో బయలుదేరి రావాలంటూ ప్రధాని శ్రీ కీర్ స్టార్మర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.

 

ఇద్దరు నేతలు ఒకరితో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండడాన్ని ఇకమీదట కూడా కొనసాగించాలని అంగీకరించారు.

 



(Release ID: 2031330) Visitor Counter : 152