రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇండో-మయన్మార్ సరిహద్దులో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న అసోం రైఫిల్స్

Posted On: 29 APR 2024 9:55PM by PIB Hyderabad

నాగాలాండ్‌లో అసోం రైఫిల్స్‌ అతి భారీ కుట్రను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఇండో-మయన్మార్ సరిహద్దులో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కచ్చితమైన నిఘా సమాచారంతో, 29 ఏప్రిల్ 2024 తెల్లవారుజామున సోదాలు జరిపిన అసోం రైఫిల్స్‌, మోన్ జిల్లాలోని ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో విధ్వంసకర ఆయుధాలను జప్తు చేశారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తిని కూడా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 11 మోర్టార్ ట్యూబ్‌లు (81 ఎంఎం), 04 ట్యూబ్‌లు (106 ఎంఎం) 10 పిస్టల్‌లు, 198 చేతి రేడియో సెట్‌లు, ఒక శాటిలైట్ ఫోన్, ఒక ద్విచక్ర వాహనం, ఒక బొలెరో వాహనం ఉన్నాయి.

సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో ఇంత భారీ స్థాయిలో శక్తిమంతమైన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. దేశ సరిహద్దుల్ని పటిష్టం చేస్తూ అస్సాం రైఫిల్స్ చేపట్టిన ఆపరేషన్‌లో పెద్ద విజయం దక్కింది. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న విద్రోహ శక్తుల కుతంత్రాలకు ఇది ఎదురు దెబ్బ.

పట్టుకున్న వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను అసోం రైఫిల్స్‌ నాగాలాండ్ పోలీసులకు అప్పగించారు. అత్యంత అప్రమత్తతతో వ్యవహరించిన అసోం రైఫిల్స్, విద్రోహ శక్తుల హింసాత్మక ప్రణాళికలను విజయవంతంగా తిప్పికొట్టారు.

 ***



(Release ID: 2019142) Visitor Counter : 66