ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 8న వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి మాటామంతీ


దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్న వేలాది లబ్ధిదారులు

Posted On: 07 JAN 2024 7:34PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 8వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగాగల వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులు వేలాది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థాని సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు.

   దేశవ్యాప్తంగా ఈ యాత్ర 2023 నవంబరు 15న ప్రారంభమైన నాటినుంచి ప్రధానమంత్రి లబ్ధిదారులతో క్రమం తప్పకుండా సంభాషిస్తున్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా నాలుగు సార్లు (నవంబరు 30, డిసెంబరు 9, 16, 27 తేదీల్లో) లబ్ధిదారులతో ఆయన మమేకమయ్యారు. మరోవైపు గత నెలలో వారణాసి పర్యటన సందర్భంగా వరుసగా రెండు రోజులు (డిసెంబరు 17-18తేదీల్లో) లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాటామంతీ నిర్వహించారు.

   దేశంలో అర్హులైన లక్షిత లబ్ధిదారులందరికీ ఈ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా చూడటం ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధన లక్ష్యంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర చేపట్టబడింది.

   ఈ నేపథ్యంలో 2024 జనవరి 5నాటికి యాత్రలో పాలుపంచుకున్న వారి సంఖ్య 10 కోట్లకు చేరడం ద్వారా మైలురాయిని అధిగమించింది. యాత్ర మొదలయ్యాక కేవలం 50 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో విజయవంతం కావడం విశేషం. తద్వారా వికసిత భారత సమష్టి దృక్పథం దిశగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంలో ఈ యాత్ర సామర్థ్యం, దాని ఎనలేని ప్రభావం స్పష్టమవుతున్నాయి.

****



(Release ID: 1994043) Visitor Counter : 189