ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచల్ గ్రామంలో ప్రతిధ్వనిస్తున్న వికసిత భారతం-2047 సందేశం


రాష్ట్రంలోని నాంశై గ్రామ లబ్ధిదారుతో ముచ్చటించిన ప్రధానమంత్రి

Posted On: 30 NOV 2023 1:26PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో 10,000వ జనౌషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 20 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

    స్వయం సహాయ సంఘాల మహిళలకు డ్రోన్ల పంపిణీతోపాటు జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25,000కు పెంచుతామని, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనాటి హామీలు నేటి కార్యక్రమంతో నెరవేరాయి.

    ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ లోని నాంశై గ్రామానికి చెందిన లకర్ పలెంగ్ ప్రధానితో మాట్లాడుతూ, ప్రభుత్వ సహాయంతో తనకు పక్కా ఇల్లు సమకూరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా తమ జీవితాల్లో ఎంతో పరివర్తన వచ్చిందని తెలిపారు. 

   ప్రధానమంత్రి కనిపించగానే 'జై హింద్' అంటూ అభివాదం చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ... అరుణాచల్ లో ఈ నినాదం సుపరిచితమని, ఈ రాష్ట్ర ప్రజలతో ముచ్చటించడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నారు.

   వికసిత భారతం సంకల్ప యాత్ర గురించి శ్రీలకర్ కు వారి గ్రామపంచాయతీ సమాచారం ఇచ్చింది. అంతేకాకుండా 2047 నాటికి దేశాన్ని వికసిత భారతంగా రూపుదిద్దాలన్న యాత్ర అంతర్గత సందేశం ఆయనకు పూర్తిగా అవగతమైంది. చివరగా ప్రధాని మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలు 5 బృందాలుగా ఏర్పడి పొరుగునగల ఐదు గ్రామాలకు వెళ్లి, వికసిత భారతం సంకల్ప యాత్ర వాహనం 'మోదీ హామీ'తో  వస్తున్నదనే  సమాచారం చేరవేయాలని కోరారు.

 

***



(Release ID: 1981348) Visitor Counter : 92