ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అవాస్తవాలు - వాస్తవాలు


2022లో భారతదేశంలో దాదాపు 11 లక్షల మంది చిన్నారులు తమ మొదటి తట్టు టీకా డోస్‌కు దూరమయ్యారంటూ వచ్చిన వార్తల్లో సరైన సమాచారం లేదు, సరైనవి కాదు

2022-23 ఆర్థిక సంవత్సరంలో, అర్హత కలిగిన 2,63,84,580 మంది పిల్లల్లో మొత్తం 2,63,63,270 మంది చిన్నారులు తట్టు టీకా మొదటి డోస్‌ పొందారు

పొందలేకపోయిన/మిగిలిన తట్టు టీకా డోసులు అర్హత కలిగిన పిల్లలందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది

Posted On: 18 NOV 2023 11:58AM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ ‍‌(డబ్ల్యూహెచ్‌వో), యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రచురించిన నివేదికల ప్రకారం, 2022లో భారతదేశంలో దాదాపు 11 లక్షల మంది చిన్నారులు తమ మొదటి తట్టు టీకా డోస్‌కు దూరమయ్యారని ఆరోపిస్తూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచరించాయి.

ఈ వార్తలు అవాస్తవాలు, వాటిలో సరైన సమాచారం లేదు. 'డబ్ల్యూహెచ్‌వో యూనిసెఫ్‌ ఎస్టిమేట్స్‌ నేషనల్‌ ఇమ్యునైజేషన్ కవరేజ్' (డబ్ల్యూయూఈఎన్‌ఐసీ) 2022 నివేదికలో ఉన్న అంచనాల ఆధారంగా ఆ వార్తలు రాశారు. ఆ నివేదిక 1 జనవరి 2022 నుంచి డిసెంబర్ 31, 2022 వరకు ఉన్న కాల వ్యవధికి సంబంధించినది.

కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హెచ్‌ఎంఐఎస్‌ ప్రకారం, ఎఫ్‌వై2022-23లో, అర్హత కలిగిన 2,63,84,580 మంది పిల్లల్లో మొత్తం 2,63,63,270 మంది చిన్నారులు మొదటి డోస్ తట్టు టీకా (ఎంసీవీ) పొందారు. ఈ కాలంలో కేవలం 21,310 మంది పిల్లలు తొలి డోస్‌ తీసుకోలేకపోయారు.

ఇది కాకుండా, పొందలేకపోయిన/మిగిలిన తట్టు టీకా డోసులు అర్హత కలిగిన పిల్లలందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది:

  • రోగ నిరోధక శక్తిని పెంచే చర్యల్లో భాగంగా, తట్టు టీకాను తీసుకోవాల్సిన వయస్సును 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 
  • 'ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్' (ఐఎంఐ) 3.0 & 4.0 కార్యక్రమాలను 2021, 2022లో నిర్వహించారు. టీకాలు తీసుకోని/పాక్షికంగా తీసుకున్న పిల్లలందరికీ తగినన్ని డోసులు ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతోపాటు, 5 సంవత్సరాల వయస్సు వరకు చిన్నారులకు ఎంఆర్‌ టీకా ఇచ్చే ప్రత్యేక లక్ష్యంతో ఐఎంఐ 5.0ను 2023లో నిర్వహించారు.
  • ఎంఆర్‌ ప్రచారాన్ని దిల్లీ, పశ్చిమ బంగాల్‌లో నిర్వహించారు. 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయస్సు గల చిన్నారులందరికీ (దిల్లీలో 9 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు) ఎంఆర్‌ వ్యాక్సిన్ టీకాలు వేశారు. టీకాలు పొందిన వాళ్లు రెండు రాష్ట్రాల్లో 95%పైగా ఉన్నారు.
  • అనేక రాష్ట్రాలు అనుబంధ రోగ నిరోధక శక్తిని పెంచే, రోగ వ్యాప్తి ప్రతిస్పందన రోగ నిరోధకత కార్యక్రమాలను నిర్వహించాయి. ఇందులో, మొత్తం 30 మిలియన్ల పిల్లలకు అదనపు మోతాదు ఎంఆర్‌ టీకా ఇచ్చారు.
  • రోగ వ్యాప్తి ప్రతిస్పందన రోగ నిరోధకతపై ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2022 నవంబర్‌లో జారీ చేసింది. 9 నెలల వయస్సు లోపున్న చిన్నారుల్లో తట్టు వ్యాప్తి 10% కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, 6 నెలల నుంచి 9 నెలల వయస్సు గల పిల్లలందరికీ ఎంఆర్‌సీవీ ఒక డోస్‌ తప్పనిసరిగా అందించాలని, ఏ పిల్లవాడు దీనిని కోల్పోకూడదని ఆ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
  • 'నాన్ మీజిల్స్ నాన్ రుబెల్లా' (ఎన్‌ఎంఎన్‌ఆర్‌) తగ్గింపు రేటు 5.8% లోపు ఉంది. ఇది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక స్థాయి. నిఘా యంత్రాంగం పటిష్టంగా పని చేస్తోందని ఇది సూచిస్తుంది.

అంతర్జాతీయ రోగ నిరోధకత కార్యక్రమం కింద దేశంలోని ప్రతి ఒక్క చిన్నారికి టీకా వేయాలన్న భారత ప్రభుత్వ నిబద్ధతను ప్రపంచం గుర్తించింది. ప్రాంతీయ తట్టు & రుబెల్లా కార్యక్రమంలో భారతదేశం ప్రదర్శించిన ఆదర్శప్రాయ నాయకత్వం, స్ఫూర్తిని అమెరికన్ రెడ్‌క్రాస్, బీఎంజీఎఫ్‌, గవి, యూెస్‌ సీడీసీ , యూనిసెఫ్‌, డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలు గుర్తించాయి, గొప్పగా ప్రశంసించాయి. 'మీజిల్స్ & రుబెల్లా పార్ట్‌నర్‌షిప్‌ ఛాంపియన్ అవార్డ్‌'ను భారత్‌ దక్కించుకుంది. ఆ పురస్కారాన్ని, వచ్చే ఏడాది మార్చిలో, వాషింగ్టన్‌లో భారత ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందుకుంటుంది.

 

***


(Release ID: 1977975) Visitor Counter : 76