సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కార్యక్రమం 2.0ని ప్రారంభించిన పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ


2023 నవంబర్ ఐ నుంచి 31 వరకు అమలు కానున్న కార్యక్రమం

అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 100 నగరాల్లో 500 ప్రాంతాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం నిర్వహణ
సంబంధిత వర్గాలను ఒక ఒకే వేదికపైకి తెచ్చి 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' విధానంలో కార్యక్రమం

ముఖ గుర్తింపు ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి పెన్షనర్లకు సౌకర్యం

Posted On: 02 NOV 2023 10:31AM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు జీవన  సౌలభ్యాన్ని అందించేందుకు అమలు చేస్తున్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించడానికి కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు జీవన  సౌలభ్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్న పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 2014లో బయోమెట్రిక్ విధానంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి వ్యవస్థ అభివృద్ధి చేసింది. పెన్షనర్లు మరింత సులువుగా, ఇబ్బందులు లేకుండా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ముఖ గుర్తింపు విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఆధార్ వివరాలు ఆధారంగా పనిచేసే ముఖ గుర్తింపు విధానాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ,యూఐడీఏఐ కలిసి మంత్రిత్వ శాఖ కృషి ప్రారంభించింది. ఈ విధానం వల్ల ఆండ్రాయిడ్  ఆధారిత స్మార్ట్ ఫోన్ నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం సాధ్యమవుతుంది. నూతనంగా అభివృద్ధి చేసిన విధానం కింద ముఖ గుర్తింపు ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలు ఉపయోగించి  డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సిద్ధం అవుతుంది. 2021 నవంబర్ నెలలో అందుబాటులోకి వచ్చిన నూతన విధానం వల్ల  బయోమెట్రిక్ పరికరాలపై పెన్షనర్లు  ఆధారపడటాన్ని తగ్గించింది. స్మార్ట్‌ఫోన్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి  పనిచేసే విధానాన్ని ప్రజలు సులువుగా ఎక్కువగా వాడేందుకు వీలుగా ఉంటుంది. 

ముఖ గుర్తింపు ద్వారా  డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి అందుబాటులోకి తెచ్చిన విధానం పట్ల కేంద్ర ప్రభుత్వ పింఛను దారులందరితో పాటు పెన్షన్ పంపిణీ చేసే అధికారులందరికీ అవగాహన కల్పించడానికి  2022 నవంబర్  నెలలో 37 నగరాల్లో దేశవ్యాప్తంగా అవగాహన  కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో  35 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేశారు.నూతన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానానికి మరింత ప్రచారం కల్పించడానికి మరోసారి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయించింది.  పెన్షన్ పంపిణీ చేస్తున్న 17 బ్యాంకులు, మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, పెన్షనర్ల సంక్షేమ సంఘం, యూఐడీఏఐ  సహకారంతో 50 లక్షల మంది పెన్షనర్లకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా  100 నగరాల్లో 500 ప్రాంతాల్లో  2023 నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుంది. 

డిజిటల్ విధానంలో  లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం వల్ల ప్రయోజనాలు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పెన్షనర్లతో  సూపర్ సీనియర్/ వ్యాధి బారిని పడినవారు  / అంగవైకల్యం ఉన్న  పెన్షనర్‌లకు కూడా చేరేలా  చూడాలని లక్ష్యంతో కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కార్యక్రమం నిర్వహణ కోసం  వివరణాత్మక మార్గదర్శకాలతో కూడిన సమగ్ర సర్క్యులర్ జారీ అయ్యింది. కేంద్ర  ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు, పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు ,పెన్షనర్ల సంఘాలు కార్యక్రమంలో పాల్గొంటాయి.కార్యక్రమం నిర్వహణకు  నోడల్ అధికారుల నియామకం,  కార్యాలయాలు,బ్యాంక్ శాఖలు/ ATMలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్  కార్యక్రమం ప్రచారం నిర్వహించడం, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్  విధానాన్ని ఉపయోగించే విధానం తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్గించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయించింది.  డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్న చోట పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి బ్రాంచ్‌ను సందర్శించినప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు బ్యాంక్ బ్రాంచ్‌లలో ప్రత్యేక సిబ్బందిని నియమించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. 

డిఎల్‌సి సమర్పణ కోసం పింఛనుదారుల కోసం శిబిరాలు నిర్వహించేందుకు పింఛనుదారుల సంక్షేమ సంఘాలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. కార్యక్రమం అమలు జరుగుతున్న సమయంలో  పింఛను, పెన్షనర్ల సంక్షేమ శాఖ అధికారులు దేశంలోని ప్రధాన ప్రాంతాలను సందర్శించి  జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి అందుబాటులోకి తెచ్చిన  వివిధ డిజిటల్ విధానాలపై  పెన్షనర్లకుఅవగాహన కల్పిస్తారు. 

 

***



(Release ID: 1974146) Visitor Counter : 48