గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఇండోర్ లో ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్ కాంటెస్ట్ (ఐఎస్ ఎసి) 2022 విజేతలను సన్మానించిన రాష్ట్రపతి


ఉత్తమ విధానాలను అమలు చేయడంలో, వృద్ధి చెందగలవ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడంలో స్మార్ట్ సిటీస్ మిషన్ సేవలు చాలా ముఖ్యం: శ్రీమతి ద్రౌపది ముర్ము

స్మార్ట్ సిటీ మిషన్ భారతదేశ పట్టణ పర్యావరణ వ్యవస్థలలో సృజనాత్మకతను ప్రేరేపిస్తుంది: శ్రీ హర్దీప్ ఎస్ పూరి

Posted On: 27 SEP 2023 2:18PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2023, సెప్టెంబర్ 27) ఇండోర్ లో  ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్ కాంటెస్ట్ (ఐఎస్ ఎసి) 2022 నాల్గవ ఎడిషన్ విజేతలను సత్కరించారు. 2018 నుంచి భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఐఎస్ఎసి ని నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ సి పటేల్, ఎం ఒ హెచ్ యుఎ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఎం ఒ హెచ్ యుఎ   సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్, మధ్యప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర సింగ్ తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో దేశ పెట్టుబడులు పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పట్టణాభివృద్ధిలో మన దేశం మొత్తం పెట్టుబడులు గత దశాబ్దంలో మునుపటి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. “ఉత్తమ విధానాలను అమలు చేయడంలో, వృద్ధి చెందగల వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడంలో స్మార్ట్ సిటీస్ మిషన్ పాత్ర  చాలా ముఖ్యమని” ఆమె అన్నారు.

పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై జీ-20 దృష్టి సారించడం గురించి రాష్ట్రపతి ప్రస్తావించారు. “జి 20 ఉప సమూహమైన అర్బన్ 20, నగరాల మధ్య కనెక్టివిటీ స్థిరమైన అభ్యాసాన్ని స్థాపించడానికి ప్రయత్నించిందని ఆమె చెప్పారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంలో నగరాల నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందనే సమిష్టి సందేశాన్ని కూడా దీని ద్వారా ఇచ్చారు. అందువల్ల, ప్రపంచంలోని ఉత్తమ నిర్వహణ నగరాల ఉత్తమ పద్ధతులు ,వ్యాపార నమూనాల నుండి మనం నేర్చుకోవాలి . అలాగే మన విజయవంతమైన ప్రయత్నాలను ఇతర దేశాలతో పంచుకోవాలి. సంపూర్ణ, సుస్థిర అభివృద్ధికి స్థానిక ,అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరం " అని రాష్ట్రపతి  అన్నారు.

స్మార్ట్ సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల (ఐసిసిసి) ప్రాముఖ్యతను ప్రస్తావించిన రాష్ట్రపతి, మొత్తం 100 స్మార్ట్ సిటీలలో ఐసిసిసిలు ఉన్నాయని, ఇవి డేటాను ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటున్నాయని అన్నారు. శాంతిభద్రతల బలోపేతానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. “ముఖ్యంగా మహిళల భద్రత కోసం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 100 స్మార్ట్ సిటీలలో చేస్తున్న ప్రయత్నాలు మన 4800 కి పైగా పట్టణాలు ,నగరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను" అని రాష్ట్రపతి అన్నారు.

ఈ సందర్భంగా దేశంలోని వివిధ నగరాల మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు కొత్త ఆత్మవిశ్వాసంతో, కొత్త శక్తితో ముందుకు సాగాలని రాష్ట్రపతి కోరారు. "మీరందరూ మీ నగరాలలో ఈ సదస్సులో పంచుకున్న విజయవంతమైన ప్రయత్నాల సమాచారాన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇలా చేయడం ద్వారా మీరందరూ ఈ కార్యక్రమాన్ని మరింత అర్థవంతంగా మారుస్తారు", అని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరివర్తనాత్మక దార్శనికతను పంచుకున్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ 'న్యూ అర్బన్ ఇండియా' కోసం గౌరవ ప్రధాన మంత్రి దార్శనికతను ప్రతిబింబిస్తుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారతదేశ లక్ష్యంలో ఇది ఒక కీలక భాగమని ఆయన వివరించారు.

స్మార్ట్ సిటీస్ మిషన్ భారతదేశ పట్టణ పర్యావరణ వ్యవస్థలలో సృజనాత్మకతను ప్రేరేపించిందని, అదే సమయంలో భారతదేశంలోని 100 అతిపెద్ద నగరాల్లో ప్రధాన మౌలిక సదుపాయాలను కల్పించి,  సేవలను బలోపేతం చేసిందని శ్రీ పురి అన్నారు. ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు, భాగస్వామ్య నగరాలు, విద్యారంగం, పారిశ్రామిక రంగాలతో లోతైన భాగస్వామ్యాలను పెంపొందించుకుందని ఆయన చెప్పారు.

మరీ ముఖ్యంగా, ప్రత్యేక ప్రయోజన వాహనాల (ఎస్ పివి) ద్వారా చాలా అవసరమైన సాంకేతిక , నిర్వహణ మద్దతును అందించడం ద్వారా దేశంలో మూడవ స్థాయి పాలనను సాధికారం చేసిందని, ఇది పౌర-కేంద్రీకృత, భవిష్యత్తు సన్నద్ధ సామాజిక, ఆర్థిక, సంస్థాగత ,భౌతిక మౌలిక సదుపాయాల నిర్మాణానికి దారితీసిందని మంత్రి వివరించారు.

కెమెరాలు, ఐ ఒ టి పరికరాలు, సెన్సర్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం ద్వారా సరైన సమయం లో నిర్ణయాలు (రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్) సామర్థ్యాలను అందించే 100 ఆపరేషనల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు (ఐసిసిసిలు) మహమ్మారి సమయంలో నగర పాలకులకు సమాచారాన్ని సేకరించడానికి, వ్యూహాలను అభివృద్ధి చేయడానికి , పౌర విధులను నిర్వహించడానికి 'వార్ రూమ్స్'గా పనిచేశాయని ఆయన చెప్పారు.

స్మార్ట్ సిటీస్ మిషన్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, రూ.1,71,044 కోట్ల విలువైన మొత్తం 7,934 ప్రాజెక్టులు మంజూరయ్యాయని, మిషన్ కింద రూ.1,10,794 కోట్ల విలువైన 6,069 ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. రూ.60,250 కోట్ల విలువైన మరో 1,865 ప్రాజెక్టులు 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుచెప్పారు. “అంతేకాక, సుమారుగా. ఇప్పటివరకు రూ.25,000 కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు అందించాం. మిషన్ కింద 2,700 కిలోమీటర్లకు పైగా స్మార్ట్ రోడ్లు నిర్మించాము. దాదాపు 7,000 స్మార్ట్ తరగతి గదులను నిర్మించారు. 50 లక్షలకు పైగా ఎల్ఈడీ/సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. 300కు పైగా స్మార్ట్ హెల్త్ సెంటర్లను నిర్మిం చారు” అని తెలిపారు.  ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు 1,884 ఎమర్జెన్సీ కాల్ బాక్స్ లు, 3,000 పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇండోర్ నగరం పట్టణ పరిపాలనలో అత్యుత్తమంగా ఉందని అభినందించిన శ్రీ హర్దీప్ ఎస్ పూరి, ఇండోర్ అనేది అవార్డులు ప్రశంసలు గెలుచుకోవడానికి పర్యాయపదమని అన్నారు. వ్యర్థాల నిర్వహణ, కార్బన్ క్రెడిట్స్, డిజిటల్ టెక్నాలజీ, పబ్లిక్ ఓపెన్ స్పేస్ లలో నూతన ఆవిష్కరణలకు ఇది మార్గదర్శకంగా నిలిచింది. ఇండోర్ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా నగరాలకు పట్టణ పాలన పౌర భాగస్వామ్యానికి ఒక నమూనాగా ఉందని, స్థిరత్వానికి ఈ సిటీ కొత్త కొలమానాన్ని నిర్దేశించిందని ఆయన అన్నారు.

ప్రాజెక్టులు, కార్యక్రమాలకు అవార్డులు అందుకున్న 31 నగరాలను మంత్రి అభినందించారు. "మీ గుర్తింపు అర్హత కలిగినది: అవార్డుల కోసం ఈ ఏడాది 840కి పైగా దరఖాస్తులు వచ్చాయి” అని మంత్రి తెలిపారు.

ఇండోర్ తరువాత నగరాల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సూరత్, ఆగ్రా లను, రాష్ట్రాలలో తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లను మంత్రి ప్రశంసించారు.

అంతకుముందు మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ సి పటేల్ ఈ క్రింది 4 పత్రాలను విడుదల చేశారు, అవి: (ఎ) ఐసాక్ అవార్డులు 2022 సంకలనం, (బి) ఎస్ సిఎమ్ న్యూస్ లెటర్ సంకలనం, (సి) ఐక్యరాజ్యసమితి హాబిటాట్ నివేదిక: స్మార్ట్ సిటీస్ మిషన్ - స్థానికీకరణ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు  (డి) ఐసాక్ అవార్డులు 2023 బ్రోచర్ (ఇ-రిలీజ్).

పట్టణ ఆవిష్కరణలలో ముందంజలో ఉండటం ద్వారా నగరాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులకు నాయకత్వం వహిస్తున్న మొత్తం 100 స్మార్ట్ సిటీలు ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం మిషన్ కింద నగరాలు చేసిన ఆదర్శవంతమైన పనిని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే కాకుండా, పీర్-పీర్ లెర్నింగ్ , ఉత్తమ పద్ధతులను వ్యాప్తి చేయడానికి కూడా వీలు కల్పించింది.

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద నగరాలు చేపట్టిన అవార్డుల ప్రదాన కార్యక్రమాలను విస్తృతంగా ప్రదర్శించిన ఈ సదస్సును 2,000 మందికి పైగా సందర్శించారు. 5 స్టేట్/యూటీ స్టాల్స్, 13 సిటీ స్టాల్స్, 15కి పైగా ప్రాజెక్ట్ మోడల్స్ ఉన్నాయి. వాకింగ్ వీధులు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టం (ఐటీఎంఎస్ ), స్మార్ట్ సైనేజీలతో స్మార్ట్ స్ట్రీట్ ను రూపొందించారు. ఇండోర్, సూరత్, చండీగఢ్, అహ్మదాబాద్, బెళగావి, రాంచీ వంటి నగరాలకు చెందిన అవార్డు గ్రహీత నగర సి ఇ ఒ లతో చర్చలు జరిపారు. ఉత్తేజకరమైన చర్చలు పీర్-టు-పీర్ లెర్నింగ్ కు దారితీసే విధంగా కూడా నిర్వహించబడింది.

 

***



(Release ID: 1961537) Visitor Counter : 99