ప్రధాన మంత్రి కార్యాలయం

కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


నారీ శక్తి వందన అభియాన్ ను ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులకు విజ్ఞప్తి

కొత్త పార్లమెంట్ కేవలం ఒక భవనం మాత్రమే కాదు అది ఒక కొత్త ఆరంభానికి చిహ్నం

“ అనేక మంది మహానుభావుల సేవలు, తోడ్పాటుతో రాజ్యసభ చర్చలు సుసంపన్నం అయ్యాయి. ఈ గౌరవ సభ భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి శక్తిని నింపుతుంది”

"సహకార సమాఖ్యవాదం అనేక క్లిష్టమైన విషయాలపై తన బలాన్ని ప్రదర్శించింది"

"కొత్త పార్లమెంటు భవనంలో మనం స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలను జరుపుకుంటే, అది అభివృద్ధి చెందిన భారతదేశానికి స్వర్ణ శతాబ్ది అవుతుంది."

“మహిళలకు అవకాశాలు రావాలి. వారి జీవితంలో ‘ఇఫ్స్ అండ్ బట్స్’ సమయం ముగిసింది”

"మనం జీవితం సౌలభ్యం గురించి మాట్లాడేటప్పుడు, ఆ సౌలభ్యం మొదటి యోగ్యత మహిళలదే"

Posted On: 19 SEP 2023 3:43PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు నూతన పార్ల‌మెంట్ భ‌వ‌నం లో రాజ్య స‌భ‌నుద్దేశించి ప్ర‌సంగించారు.

నేటి సందర్భం చారిత్రాత్మకమైనదని, చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. ఆయన లోక్‌సభలో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు.  ఈ ప్రత్యేక సందర్భంలో రాజ్యసభలో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షులుకి కృతజ్ఞతలు తెలిపారు.

రాజ్యసభను పార్లమెంటరీ ఎగువ సభగా పరిగణిస్తున్నారని పేర్కొన్న ప్రధాని, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాలను నొక్కిచెప్పారు, ఈ సభ రాజకీయ చర్చలకు మించి దేశానికి మార్గదర్శనం చేసే మేధోపరమైన చర్చలకు కేంద్రంగా మారుతుంది. "ఇది దేశం సహజమైన నిరీక్షణ", దేశానికి ఇటువంటి సేవలు, సభా కార్యక్రమాల  విలువను పెంచుతాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

పార్ల‌మెంట్ అనేది కేవ‌లం శాస‌న వ్యవస్థ మాత్రమే కాద‌ని, చ‌ర్చించే స‌మావేశం అని సర్వేపల్లి రాధాకృష్ణ‌న్‌ను ఉటంకిస్తూ ప్ర‌ధాన మంత్రి అన్నారు. రాజ్యసభలో నాణ్యమైన చర్చలు వినడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని శ్రీ మోదీ అన్నారు. కొత్త పార్లమెంటు కొత్త భవనం మాత్రమే కాదని, కొత్త ప్రారంభానికి ప్రతీక అని ఆయన తెలిపారు. అమృత్‌కాల్ ప్రారంభోత్సవంలో ఈ కొత్త భవనం 140 కోట్ల మంది భారతీయుల్లో కొత్త శక్తిని నింపుతుందని ఆయన అన్నారు.

దేశం ఇకపై వేచి ఉండటానికి సిద్ధంగా లేనందున నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యాలను సాధించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ఆలోచనలు, శైలితో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు పని పరిధిని, ఆలోచనా విధానాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

పార్లమెంటరీ ఉత్క్రుష్టతకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న శాసన సభలకు ఈ సభ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు.

గత 9 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై దృష్టి సారిస్తూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న, సమస్యలకు తగు మార్గం చూపడం చిరస్థాయిగా నిలిచిపోతాయని  ప్రధాని స్పష్టం చేశారు. "రాజకీయ దృక్కోణం నుండి ఇటువంటి అంశాలను స్పృశించడం  చాలా పెద్ద తప్పుగా పరిగణించే" అంశాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ , రాజ్యసభలో తమకు అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వం ఈ దిశగా పెద్ద పురోగతిని సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. దేశ శ్రేయస్సు కోసం సమస్యలను చేపట్టడం, పరిష్కరించడం, సభ్యుల పరిపక్వత, తెలివితేటలకు నిదర్శనమని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. “రాజ్యసభ గౌరవం నిలబెట్టింది సభలోని సంఖ్యాబలం వల్ల కాదు కానీ కుశలత, అవగాహన వల్ల” అని ఆయన అన్నారు. ఈ ఘనత సాధించినందుకు సభలోని సభ్యులందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

ప్ర‌జాస్వామ్య స్థాప‌న‌లో దేశ ప్ర‌యోజ‌నాల‌ను అత్యున్న‌తంగా ఉంచ‌డానికే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
రాష్ట్రాల సభగా రాజ్యసభ పాత్రను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, సహకార సమాఖ్య విధానానికి ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో, దేశం అనేక కీలకమైన విషయాలలో గొప్ప సహకారంతో ముందుకు సాగిందని అన్నారు. కేంద్ర-రాష్ట్ర సహకారానికి కరోనా మహమ్మారి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

ఆపద సమయంలోనే కాకుండా ఉత్సవ వాతావరణంలో కూడా భారతదేశం ప్రపంచాన్ని ఆకట్టుకుందని ప్రధాని అన్నారు. ఈ గొప్ప దేశం వైవిధ్యాన్ని 60కి పైగా నగరాల్లో జరిగిన జి-20 ఈవెంట్‌లు, ఢిల్లీలో జరిగిన సమ్మిట్‌లో ప్రదర్శించినట్లు ఆయన చెప్పారు. ఇదీ కోఆపరేటివ్ ఫెడరలిజం శక్తి అన్నారు. కొత్త భవనం అమరికలో రాష్ట్రాల నుండి వచ్చిన కళాఖండాలకు ప్రాముఖ్యత ఉన్నందున కొత్త భవనం సమాఖ్య స్ఫూర్తిని కూడా సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దైనందిన జీవితంలో సాంకేతికతకు సంబంధించి పెరుగుతున్న ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, 50 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టిన పురోగతిని ఇప్పుడు కొన్ని వారాల్లోనే చూడగలమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. పెరుగుతున్న సాంకేతిక పురోగతికి అనుగుణంగా క్రియాశీలక  మార్గంలో తనను తాను మలుచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. 

సంవిధాన స‌ద‌న్‌లో 75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్ర వేడుక‌లు జ‌రుపుకున్నామ‌ని, 2047లో నూత‌న భ‌వ‌నంలో స్వాతంత్య్ర శ‌తాబ్ది ఉత్స‌వాలు జ‌ర‌గ‌న‌ప్పుడు, అది వికసిత భార‌త్‌లో వేడుక‌గా ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పాత భవనంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరంగా మనం 5వ స్థానానికి చేరుకున్నామని ఆయన అన్నారు. "కొత్త పార్లమెంట్‌లో మనం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో భాగమవుతామని నాకు నమ్మకం ఉంది" అని ఆయన అన్నారు. "పేదల సంక్షేమం కోసం మేము అనేక చర్యలు తీసుకున్నాం. కొత్త పార్లమెంట్‌లో ఆ పథకాలు  చిట్టచివరి వరకు అందరికీ అందేలా చూస్తాం" అని ఆయన తెలిపారు.

ఈ డిజిట‌ల్ యుగంలో సాంకేతిక‌త‌ను మ‌న జీవితంలో భాగం చేసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావిస్తూ, కొత్త శక్తి మరియు ఉత్సాహంతో దేశం ఈ ప్రయత్నాన్ని అత్యంత సద్వినియోగం చేసుకుంటోందని ప్రధాన మంత్రి అన్నారు.

లోక్‌సభలో సమర్పించిన నారీశక్తి వందన్ అధినియమ్ గురించి ప్రస్తావిస్తూ, జీవిత సౌలభ్యం గురించి మాట్లాడేటప్పుడు, ఆ సౌలభ్యం మొదటి హక్కు మహిళలదేనని ప్రధాని అన్నారు. అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యానికి భరోసా కల్పిస్తున్నామన్నారు. “మహిళలకు అవకాశాలు రావాలి. వారి జీవితాల్లో ‘ఇఫ్స్ అండ్ బట్స్’ కాలం ముగిసింది”, అని ప్రధాన మంత్రి అన్నారు.
బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ప్రజల కార్యక్రమంగా మారిందన్నారు. జన్‌ధన్‌, ముద్రా యోజనలో మహిళల భాగస్వామ్యం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఉజ్వల, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళల భద్రత కోసం పటిష్టమైన చట్టాలను ఆయన ప్రస్తావించారు. జి20లో మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనేది అతిపెద్ద చర్చనీయాంశమని ఆయన అన్నారు.

పార్లమెంట్‌లో మహిళలకు రిజర్వేషన్ల అంశం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారని ప్రధాని పేర్కొన్నారు. ఈ బిల్లును తొలిసారిగా 1996లో ప్రవేశపెట్టారని, అటల్‌జీ హయాంలో అనేక చర్చలు, సమాలోచనలు జరిగాయని, అయితే సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లు వెలుగులోకి రాలేదని, ఇక చివరకు బిల్లు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త భవనం కొత్త శక్తితో దేశ నిర్మాణానికి చట్టం, 'నారీ శక్తి'ని నిర్ధారిస్తుంది. లోక్‌సభలో చర్చకు రానున్న నారీ శక్తి వందన్ అధినియమ్‌ను రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి ఆయన తెలియజేశారు. రాజ్యసభ సభ్యులు బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని, తద్వారా దాని శక్తి, విస్తరణ పూర్తి స్థాయిలో విస్తరించాలని కోరుతూ ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ముగించారు.



(Release ID: 1958964) Visitor Counter : 93