ప్రధాన మంత్రి కార్యాలయం

దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేసిన


ప్రధాన మంత్రి: "కొత్త శక్తి, ప్రేరణలు , సంకల్పాల వెలుగులో రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం"

“నేడు ప్రపంచం చూపు మొత్తం భారత్ పైనే ఉంది. భారత్ పట్ల ప్రపంచ దేశాల వైఖరి మారింది‘‘

ఇన్ని స్టేషన్ల ఆధునీకరణ వల్ల దేశంలో అభివృద్ధికి కొత్త వాతావరణం
ఏర్పడుతుంది”

“ఈ అమృత్ రైల్వే స్టేషన్ లు వారసత్వం పట్ల గర్వపడటానికి, ప్రతి పౌరుడిలో గర్వాన్ని నింపడానికి చిహ్నంగా నిలుస్తాయి”

“భారతీయ రైల్వేలను ఆధునిక, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాం”

"ఇప్పుడు రైలును మెరుగైన గుర్తింపు, ఆధునిక భవిష్యత్తుతో అనుసంధానించడం మా బాధ్యత"

“నవభారతంలో అభివృద్ధి యువతకు కొత్త అవకాశాలకు బాటలు వేస్తోంది; దేశాభివృద్ధికి యువత కొత్త రెక్కలు ఇస్తోంది “

'ఆగస్టు నెల క్రాంతి మాసం, కృతజ్ఞత, కర్తవ్యం. భారతదేశ చరిత్రకు కొత్త దిశానిర్దేశం చేసిన అనేక చారిత్రక ఘట్టాలు ఆగస్టులో జరిగాయి.’

‘మన స్వాతంత్ర్య దినోత్సవం మన త్రివర్ణ పతాకం పట్ల, దేశ పురోగతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించే సమయం. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగుర వేయాలి‘

Posted On: 06 AUG 2023 12:57PM by PIB Hyderabad

ఒక చారిత్రాత్మక చర్యగా, ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో

కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో పునారాభివృద్ది చేసే ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున ఉన్నాయి.  జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.

 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వికసిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా పయనిస్తున్న నవ భారత దేశం అమృత్ కాల్ ప్రారంభం పైనే ఉందని అన్నారు.. "కొత్త శక్తి, కొత్త ప్రేరణలు కొత్త సంకల్పాలు ఉన్నాయి" అని ప్రధాన మంత్రి అన్నారు, ఇది భారతీయ రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అని స్పష్టం చేశారు. దేశంలోని దాదాపు 1300 ప్రధాన రైల్వే స్టేషన్లను 'అమృత్ భారత్ స్టేషన్లు'గా ఆధునికతతో పునర్నిర్మించి కొత్త జీవం పోస్తామని తెలిపారు. 1300 రైల్వే స్టేషన్లలో సుమారు రూ.25,000 కోట్ల వ్యయంతో 508 అమృత్ భారత్ స్టేషన్ల ఆధునికీకరణకు నేడు శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రైల్వేలు,  సామాన్య పౌరులతో పాటు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ రీడెవలప్ మెంట్ ప్రాజెక్టు ఒక బృహత్తర ప్రచారమని ఆయన ఉద్ఘాటించారు.. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టు సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖకు , ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రపంచంలో భారత దేశానికి పెరుగుతున్న ఖ్యాతిని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. భారత దేశంపై ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని ప్రధాన మంత్రి

ప్రస్తావించారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలను ఆయన పేర్కొన్నారు. మొదటిది, భారత ప్రజలు సుస్థిరమైన పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, రెండవది, ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకొని వారి ఆకాంక్షలకు అనుగుణంగా వారి అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేయడం - అని తెలిపారు. భారతీయ రైల్వేలు కూడా దీనికి ప్రతీక అని ఆయన ఉద్ఘాటించారు.దీని ప్రయోజనాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేస్తామని పేర్కొన్న ప్రధాని, ఉత్తరప్రదేశ్‌లో సుమారు రూ. 4,000 కోట్లతో 55 అమృత్ స్టేషన్‌లను అభివృద్ధి చేస్తామని, రాజస్థాన్‌లో కూడా 55 స్టేషన్లు అమృత్ స్టేషన్‌లుగా, 34 స్టేషన్లుగా మారనున్నాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో సుమారు రూ. 1,000 కోట్లతో, మహారాష్ట్రలో 1,500 కోట్లతో 44 స్టేషన్‌లు, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలోని ప్రధాన రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేయనున్నారు. తన అభిప్రాయాలను వివరించడానికి రైల్వే రంగం విస్తరణకు సంబంధించిన వాస్తవాలను ఆయన సమర్పించారు.

గత తొమ్మిదేళ్లలో దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, పోలాండ్, యు కె , స్వీడన్ దేశాల ఉమ్మడి రైల్వే నెట్వర్క్ కంటే మన దేశంలో వేసిన ట్రాక్ పొడవు ఎక్కువగా ఉందన్నారు. భారత రైల్వేల విస్తరణ స్థాయిని చూస్తే, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా సంయుక్త రైల్వే నెట్ వర్క్ ల కంటే గత ఏడాదిలోనే భారత్ ఎక్కువ రైల్వే ట్రాక్ లు వేసిందని ప్రధాన మంత్రి అన్నారు. రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. "రైలు నుండి స్టేషన్ వరకు సాధ్యమైనంత ఉత్తమ అనుభవాన్ని అందించడానికి ఈ ప్రయత్నం" అని ఆయన అన్నారు. ప్లాట్ ఫాంలపై మెరుగైన సీటింగ్, అప్ గ్రేడ్ చేసిన వెయిటింగ్ రూమ్ లు, వేలాది స్టేషన్లలో ఉచిత వైఫై గురించి ప్రస్తావించారు.

 

భారత రైల్వేలో చోటు చేసుకున్న అనేక జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, ఏ

ప్రధాన మంత్రి అయినా ఎర్రకోట నుంచి ఈ విజయాల గురించి

మాట్లాడాలను కుంటారని అన్నారు.అయితే, ఈ రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం వల్ల తాను రైల్వే సాధించిన విజయాలను ఈ రోజే చాలా వివరంగా ఆవిష్కరిస్తున్నానని ప్రధాన మంత్రి తెలిపారు.

 

రైల్వేలు దేశ జీవనాడి అని, దీనితో పాటు నగరాల గుర్తింపు కూడా రైల్వే స్టేషన్లతో ముడిపడి ఉందని, ఇవి కాలం గడుస్తున్న కొద్దీ నగరానికి గుండెకాయగా మారాయని ప్రధాని అన్నారు. దీంతో స్టేషన్లకు ఆధునిక రూపాన్ని అందించడం అనివార్యమైందని చెప్పారు.

 

ఇన్ని స్టేషన్లను ఆధునీకరించడం వల్ల దేశంలో అభివృద్ధికి కొత్త వాతావరణం ఏర్పడుతుందని, సందర్శకుల్లో మంచి తొలి సద్భావన ఏర్పడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. అప్ గ్రేడ్ చేసిన స్టేషన్లు పర్యాటకాన్ని పెంచడమే కాకుండా సమీప ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇస్తాయని అన్నారు.  వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం కళాకారులకు ఉపయోగపడుతుందని, జిల్లా బ్రాండింగ్ కు దోహదపడుతుందన్నారు.

 

ఆజాదీ కా అమృత్ కాల్ లో వారసత్వం పట్ల దేశం గర్వించే సంకల్పం కూడా తీసుకుందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. "ఈ అమృత్ రైల్వే స్టేషన్లు ఆయా ప్రాంతాల వారసత్వం పట్ల గర్వించడానికి,  ప్రతి పౌరుడిలో గర్వాన్ని నింపడానికి చిహ్నంగా ఉంటాయి" అని శ్రీ మోదీ అన్నారు. అమృత్ స్టేషన్ లు భారతదేశ సాంస్కృతిక, స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. జైపూర్ రైల్వే స్టేషన్లలో రాజస్థాన్ కు చెందిన హవా మహల్ అమెర్ కోట దృశ్యాలు ఉంటాయని, జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ తావి రైల్వే స్టేషన్ ప్రసిద్ధ రఘునాథ్ మందిర్ నుండి ప్రేరణ పొందుతుందని, నాగాలాండ్ లోని దిమాపూర్ స్టేషన్ ఈ ప్రాంతానికి చెందిన 16 విభిన్న తెగల స్థానిక వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

పునర్నిర్మాణ రైల్వే స్టేషన్ పురాతన వారసత్వంతో పాటు దేశ ఆధునిక ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను, తీర్థయాత్రలను కలిపే 'భారత్ గౌరవ్ యాత్ర రైళ్ల'ను బలోపేతం చేయడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

 

దేశ ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడంలో రైల్వేల పాత్రను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, రైల్వేల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈ ఏడాది రైల్వేకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ లభించిందని , 2014తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ అని తెలిపారు. నేడు సమగ్ర దృక్పథంతో రైల్వేను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో లోకోమోటివ్ ఉత్పత్తి 9 రెట్లు పెరిగింది. నేడు 13 రెట్లు ఎక్కువ హెచ్ ఎల్ బీ బోగీలు తయారవుతున్నాయి.

 

ఈశాన్యంలో రైల్వే విస్తరణ గురించి ప్రస్తావిస్తూ, లైన్ల డబ్లింగ్, గేజ్ మార్పిడి, విద్యుదీకరణ, కొత్త మార్గాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. త్వరలో ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ రైల్వే నెట్ వర్క్ ద్వారా అనుసంధానం అవుతాయని మోదీ చెప్పారు. వందేళ్ల తర్వాత నాగాలాండ్ కు రెండో స్టేషన్ లభించిందన్నారు. "ఈ ప్రాంతంలో కొత్త రైల్వే లైన్ల ప్రారంభం మూడు రెట్లు పెరిగింది" అని ఆయన చెప్పారు.

 

గడచిన తొమ్మిదేళ్లలో 2200 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను నిర్మించామని, దీనివల్ల గూడ్స్ రైలు ప్రయాణ సమయం తగ్గిందని ప్రధాని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్సిఆర్ నుండి పశ్చిమ ఓడరేవులకు సరుకులు 24 గంటల్లో చేరుతాయి, ఇది 72 గంటలు పట్టే పని. ఇతర మార్గాల్లో కూడా 40 శాతం సమయం తగ్గడం పారిశ్రామికవేత్తలు, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది.

 

రైల్వే వంతెనలు లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించిన ప్రధాన మంత్రి, 2014కు ముందు 6000 కంటే తక్కువ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు ఉండేవని, కానీ నేడు ఆ సంఖ్య 10,000 దాటిందని తెలిపారు. పెద్ద రైల్వే లైన్లలో మానవరహిత లెవల్ క్రాసింగ్ ల సంఖ్య ఇప్పుడు సున్నాకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకుల సౌలభ్యం గురించి ప్రస్తావిస్తూ, వృద్ధులు, దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ప్రధాన మంత్రి చెప్పారు.

 

"భారతీయ రైల్వేలను ఆధునికంగా,  పర్యావరణ హితంగా మార్చడంపై మా దృష్టి ఉంది" అని ప్రధాన మంత్రి చెప్పారు, అతి త్వరలోనే 100 శాతం రైలు మార్గం విద్యుదీకరణ పూర్తి అవుతుందని, దీని ఫలితంగా భారతదేశంలోని అన్ని రైళ్లు కేవలం విద్యుత్తుతో మాత్రమే నడుస్తాయని ఆయన తెలియజేశారు. సోలార్ ప్యానెళ్ల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే స్టేషన్ల సంఖ్య గత తొమ్మిదేళ్లలో 1200కు పైగా పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ప్రతి రైల్వే స్టేషన్ నుంచి గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. 70 వేల కోచ్ లలో

ఎల్ ఇ డి లైట్లు ఏర్పాటు చేశామని, రైళ్లలో బయో టాయిలెట్ల సంఖ్య 2014తో పోలిస్తే 28 రెట్లు పెరిగిందని అన్నారు.  అన్ని అమృత్ స్టేషన్లను హరిత భవనాల ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తామని శ్రీ మోదీ చెప్పారు. "2030 నాటికి, భారతదేశం నికర జీరో ఉద్గారాలతో రైల్వే నెట్వర్క్ నడిచే దేశంగా మారుతుంది" అని ఆయన అన్నారు.

 

‘రైలు మన ప్రియమైన వారితో మనం అనుసంధానం కావడానికి దశాబ్దాలుగా పనిచేస్తోంది. దేశాన్ని అనుసంధానించడానికి ఇది

పనిచేసింది. ఇప్పుడు రైలును మెరుగైన గుర్తింపు, ఆధునిక భవిష్యత్తుతో అనుసంధానించడం మా బాధ్యత.‘ అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం, కర్తవ్య మార్గం, యుద్ధ స్మారక చిహ్నం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రాజెక్టులపై వ్యతిరేకత దురదృష్టకరమని అన్నారు. అయినా “నెగెటివ్ పాలిటిక్స్ కు దూరంగా దేశాభివృద్ధిని ఒక మిషన్ గా తీసుకున్నామని, ఓటు బ్యాంకు, పార్టీ రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధికి పెద్దపీట వేశామని” చెప్పారు.

 

ఒక్క రైల్వేనే 1.5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిందని, మౌలిక సదుపాయాలపై లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధిని కూడా సృష్టిస్తున్నామని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రోజ్ గార్ మేళా ద్వారా 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోందన్నారు. "ఇది మారుతున్న భారతదేశ చిత్రం, ఇక్కడ అభివృద్ధి యువతకు కొత్త అవకాశాలకు దారితీస్తోంది.  యువత దేశ అభివృద్ధికి కొత్త రెక్కలను ఇస్తోంది" అని ఆయన అన్నారు.

 

ఈ కార్యక్రమంలో పలువురు స్వాతంత్ర్య సమరయోధులు, పలువురు పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొనడం అభినందనీయమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి ఆగస్టు నెల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ఇది విప్లవం, కృతజ్ఞత , కర్తవ్యాల మాసం అని, అనేక చారిత్రాత్మక సందర్భాలతో నిండి ఉందని, ఇది భారతదేశ చరిత్రకు కొత్త దిశను ఇచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు.

ఆగస్టు 7న జరుపుకునే జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ,  స్వదేశీ ఉద్యమానికి అంకితం చేశారు. "వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పాన్ని ప్రతి భారతీయుడు పునరుద్ఘాటించాల్సిన రోజు ఆగస్టు 7" అని శ్రీ మోదీ అన్నారు. పవిత్రమైన వినాయక చవితి పండుగను ప్రస్తావిస్తూ, వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  పర్యావరణ హిత  మెటీరియల్ తో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించాలని ప్రధాని సూచించారు. స్థానిక చేతివృత్తులు, హస్తకళలు, చిన్న పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు.

 

ఆగస్టు 9వ తేదీ గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది క్విట్ ఇండియా ఉద్యమం మొదలయిన చారిత్రాత్మక తేదీ అని, ఇది భారత దేశ స్వాతంత్ర సంగ్రామంలో కొత్త ఉత్తేజాన్ని సృష్టించిందని అన్నారు. దీని నుంచి స్ఫూర్తి పొంది, ప్రతి చెడుకు, అవినీతికి, వంశపారంపర్యానికి, బుజ్జగింపులకు నేడు దేశం మొత్తం క్విట్ ఇండియా అని గర్జిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.

 

రాబోయే విభజన భయానక స్మృతి దినాన్ని ప్రస్తావిస్తూ, విభజనకు భారీ మూల్యం చెల్లించిన అసంఖ్యాక వ్యక్తులను మనం స్మరించుకుంటున్నామని, షాక్ తర్వాత తమను తాము కూడగట్టుకుని దేశాభివృద్ధికి దోహదపడుతున్న ప్రజల సహకారాన్ని గుర్తించామని ప్రధాన మంత్రి అన్నారు. మన ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ రోజు మనకు ఇస్తుందని ఆయన అన్నారు." మన త్రివర్ణ పతాకం పట్ల, మన దేశ పురోగతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించే సమయం మన స్వాతంత్ర్య దినోత్సవం. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి‘ అన్నారు.

సోషల్ మీడియాలో, ఫ్లాగ్ మార్చ్ లలో ప్రజల ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ప్రతి ఒక్కరూ ప్రచారంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

 

పౌరులలో తాము చెల్లించే పన్ను అవినీతిలో వృథా అవుతుందనే భావనను ప్రభుత్వం మార్చిందని, నేడు తమ డబ్బును దేశ నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారనే విశ్వాసం ప్రజలలో బలపడిందని ప్రధాన మంత్రి చెప్పారు. పెరుగుతున్న సౌకర్యాలు, జీవన సౌలభ్యం కారణంగా పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

 

దేశంలో రూ.2 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండేదని, ప్రస్తుతం రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదని ప్రధాని పేర్కొన్నారు. అయినప్పటికీ దేశంలో ఆదాయపు పన్ను వసూళ్లు పెరుగుతున్నాయని, దేశంలో మధ్యతరగతి పరిధి నిరంతరం పెరుగుతోందని స్పష్టమైన సందేశాన్ని పంపిందని ప్రధాని అన్నారు. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 16 శాతం పెరిగిందని, ఇది ప్రభుత్వంపై విశ్వాసం పెరగడానికి, దేశంలో జరుగుతున్న ఆవిష్కరణలకు నిదర్శనమన్నారు. నేడు దేశంలో రైల్వేలు ఎలా పునరుత్తేజితం అవుతున్నాయో, మెట్రో ఎలా విస్తరిస్తుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. కొత్త ఎక్స్ ప్రెస్ వేలు, విమానాశ్రయాల అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నవ భారతదేశం అభివృద్ధి చెందుతోందనే భావనను ఇటువంటి మార్పులు ధైర్యాన్నిస్తాయని ఆయన అన్నారు. "ఈ 508 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కూడా ఈ దిశలో తీసుకున్న ఒక అడుగు. అమృత్ భారత్ స్టేషన్లు భారతీయ రైల్వేల మార్పును కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని lప్రధాన మంత్రి ప్రసంగాన్ని ముగించారు.

 

నేపథ్యం

 

అత్యాధునిక ప్రజారవాణా సదుపాయం కల్పించడంపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు రైల్వేలు ఇష్టమైన రవాణా మార్గమని పేర్కొన్న ఆయన, రైల్వే స్టేషన్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ దార్శనికతకు మార్గదర్శకత్వం వహించి, దేశవ్యాప్తంగా 1309 స్టేషన్లను పునర్నిర్మించడానికి అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించారు.

 

ఈ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో ఈ స్టేషన్లను పునర్నిర్మించనున్నారు. నగరానికి ఇరువైపులా సక్రమంగా అనుసంధానం చేస్తూ ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్లు'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ విధానం రైల్వే స్టేషన్ చుట్టూ కేంద్రీకృతమైన నగరం మొత్తం పట్టణ అభివృద్ధి సమగ్ర దార్శనికత ద్వారా నడపబడుతుంది.

 

ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో.22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున స్టేషన్లు హరియాణాలో 15, కర్ణాటకలో 13 ఆధునికీకరణ జాబితాలో ఉన్నాయి. 

 

ఈ పునర్నిర్మాణం ప్రయాణీకుల కు ఆధునిక సౌకర్యాలను అందించడంతో పాటు బాగా డిజైన్ చేయబడిన ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్ , ప్రయాణీకుల మార్గదర్శకత్వం కోసం సైనేజ్ లను అందిస్తుంది. స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం స్ఫూర్తితో స్టేషన్ భవనాల డిజైన్ ఉంటుంది.

 

 

***

DS/TS



(Release ID: 1946247) Visitor Counter : 171