ప్రధాన మంత్రి కార్యాలయం

ఢిల్లీలోని భారత్ మండపంలో అఖిల భారతీయ శిక్షా సమాగమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి: పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధుల విడుదల


12 భారతీయ భాషల్లోకి అనువదించిన విద్య, నైపుణ్య పాఠ్య ప్రణాళిక పుస్తకాల విడుదల .

“21వ శతాబ్దపు భారతదేశం ఏ లక్ష్యాలతో ముందుకు వెళ్తోందో ఆ లక్ష్యాలను సాధించడంలో మన విద్యావ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది”

“ఎన్ ఇ పి లో సంప్రదాయ విజ్ఞానం, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలకు సమాన ప్రాధాన్యం”

“మాతృభాషలో విద్య భారతదేశంలో విద్యార్థులకు కొత్త న్యాయానికి నాంది పలుకుతోంది. సామాజిక న్యాయం దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు''

“విద్యార్థులు ఒక భాషపై నమ్మకంతో ఉంటే వారి నైపుణ్యాలు, ప్రతిభ ఎలాంటి ఆంక్షలు లేకుండా బయటపడతాయి”

“రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాలం లో శక్తివంతమైన కొత్త తరాన్ని సృష్టించాలి: బానిసత్వ మనస్తత్వం లేని, ఆవిష్కరణల కోసం ఆరాటపడే , కర్తవ్య భావంతో నిండిన ఒక తరాన్ని సృష్టించాలి”

"విద్యలో సమానత్వం అంటే ప్రదేశం, వర్గం లేదా ప్రాంతం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు"

“5జీ యుగంలో పి ఎం - శ్రీ స్కూళ్లు ఆధునిక విద్యా మాధ్యమంగా మారతాయి”

“జాంజిబార్, అబుదాబిలో ఐఐటీ క్యాంపస్ లు ప్రారంభమయ్యాయి. అనేక ఇతర దేశాలు కూడా తమ దేశాల్లో ఐఐటీ క్యాంపస్ లను తెరవాలని కోరుతున్నాయి.”

Posted On: 29 JUL 2023 12:37PM by PIB Hyderabad

జాతీయ విద్యావిధానం- 2020 మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని బారత్ మండపంలో అఖిల భారత శిక్షా సమాగమాన్ని ప్రారంభించారు. పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధులను కూడా ఆయన విడుదల చేశారు. 6207 పాఠశాలలకు మొదటి విడతగా రూ.630 కోట్లు అందాయి.12 భారతీయ భాషల్లోకి అనువదించిన విద్య, నైపుణ్య పాఠ్య ప్రణాళిక పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని వీక్షించారు.

 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి

ప్రసంగిస్తూ,  దేశ భవిష్యత్ ను మార్చగలిగే అంశాల్లో విద్య ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. "21 వ శతాబ్దం భారతదేశం ఏ లక్ష్యాలతో ముందుకు వెళ్తోందో ఆ లక్ష్యాలను సాధించడంలో మన విద్యా వ్యవస్థ పెద్ద పాత్ర పోషిస్తుంది" అని ఆయన అన్నారు.

అఖిల భారతీయ శిక్షాసమాగమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, విద్యకు చర్చ, సంప్రదింపులు ముఖ్యమని అన్నారు. గత అఖిల భారతీయ శిక్షా సమాగం వారణాసిలో నూతనంగా నిర్మించిన రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో జరిగిందని, ఈ సారి ఢిల్లీ లో సరికొత్త భారత్ మండపంలో జరుగుతోందని ప్రధాన మంత్రి తెలిపారు.  భారత్ మండపం లాంఛనంగా ప్రారంభమైన తర్వాత మండపంలో జరిగే తొలి కార్యక్రమం ఇదే కావడం విశేషం.

 

కాశీ రుద్రాక్ష నుంచి ఆధునిక భారత్ మండపం వరకు ప్రాచీన, ఆధునిక మేళవింపుతో అఖిల భారతీయ శిక్షా సమాగం ప్రయాణంలో ఒక రహస్య సందేశం దాగి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఒకవైపు భారతదేశ విద్యావిధానం దేశ ప్రాచీన సంప్రదాయాలను పరిరక్షిస్తోందని, మరోవైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం శరవేగంగా పురోగమిస్తోందని అన్నారు.

విద్యారంగం ఇప్పటి వరకు సాధించిన పురోగతికి దోహదపడిన వారిని ప్రధాని అభినందించారు. ఈ రోజు జాతీయ విద్యావిధానం మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, దీనిని ఒక మిషన్ గా తీసుకొని అపారమైన పురోగతికి దోహదపడిన మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులకు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నైపుణ్యాలు, విద్య, సృజనాత్మక పద్ధతుల ప్రదర్శనను ప్రముఖంగా వివరించారు. చిన్న పిల్లలు ఆట పాటల ద్వారా ఉల్లాసకరమైన అనుభవాల ద్వారా విద్య నేర్చుకుంటున్న దేశంలో విద్య , పాఠశాల విద్య మారుతున్న ముఖచిత్రాన్ని ఆయన స్పృశించారు . దానిపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ ను వీక్షించాలని ఆయన అతిథులను కోరారు.

 

పాత పద్ధతుల మార్పులకు కొంత సమయం పడుతుందని ప్రధాన మంత్రి చెప్పారు. ఎన్ ఇ పి ప్రారంభోత్సవం సందర్భంగా కవర్ చేయాల్సిన విశాలమైన కాన్వాస్ ను గుర్తు చేసిన ప్రధాన మంత్రి, భాగస్వాములందరి కొత్త భావనలను స్వీకరించడానికి,  అంకితభావం సంసిద్ధతను ప్రశంసించారు. ఎన్ ఇ పి లో సంప్రదాయ విజ్ఞానం, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రాథమిక విద్యలో నూతన పాఠ్యప్రణాళిక, ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, ఉన్నత విద్య, దేశంలో పరిశోధనా వ్యవస్థ బలోపేతానికి విద్యారంగానికి చెందిన భాగస్వాములు చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు.

ప్రస్తుతం 10+2 వ్యవస్థ స్థానంలో 5+3+3+4 విధానం అమలులో ఉందని విద్యార్థులు అర్థం చేసుకుంటున్నారన్నారు. దేశమంతటా ఏకరూపత తీసుకురావడంతో 3వ ఏటనే విద్య ప్రారంభమవుతుందని అన్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు.  ఎన్ ఇ పి  కింద నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ త్వరలో రానుంది. 3-8 ఏళ్ల విద్యార్థులకు ఫ్రేమ్ వర్క్ సిద్ధమైంది. దేశం మొత్తం ఒకే రకమైన సిలబస్ ను కలిగి ఉంటుంది ఎన్ సిఇఆర్ టి దీని కోసం కొత్త కోర్సు పుస్తకాలను సిద్ధం చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో విద్యను అందించడం వల్ల 3 నుంచి 12వ తరగతి వరకు 22 భాషల్లో సుమారు 130 వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కొత్త పుస్తకాలు వస్తున్నాయని ప్రధాని తెలిపారు.

 

ఏ విద్యార్థి నైనా వారి సామర్థ్యాల ఆధారంగా కాకుండా వారి భాష ఆధారంగా గుర్తించడమే అతి పెద్ద అన్యాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు. “మాతృభాషలో విద్య భారతదేశంలో విద్యార్థులకు కొత్త న్యాయానికి నాంది పలుకుతోందని, సామాజిక న్యాయం దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ప్రపంచంలో ఉన్న అనేక భాషలను, వాటి ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ,

ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థానిక భాష వల్ల

గుర్తింపు పొందాయని నొక్కి చెప్పారు.

ఐరోపాను ఉదాహరణగా చూపుతూ, చాలా దేశాలు తమ స్వంత స్థానిక భాషలను ఉపయోగిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశంలో అనేక స్థాపిత భాషలు ఉన్నప్పటికీ, అవి వెనుకబాటుతనానికి చిహ్నంగా చూపబడుతున్నాయని, ఆంగ్లం మాట్లాడలేని వారిని విస్మరించారని, వారి ప్రతిభను గుర్తించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల పిల్లలే ఎక్కువగా ప్రభావితమయ్యారని ప్రధాన మంత్రి తెలిపారు. జాతీయ విద్యావిధానం రాకతో దేశం ఇప్పుడు ఈ నమ్మకాన్ని విడనాడడం ప్రారంభించిందని ఆయన ఉద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితిలో కూడా తాను భారతీయ భాషలోనే మాట్లాడతానని మోదీ అన్నారు.

 

సోషల్ సైన్స్ నుంచి ఇంజినీరింగ్ వరకు సబ్జెక్టులను ఇకపై భారతీయ భాషల్లో బోధిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. "విద్యార్థులు ఒక భాషపై నమ్మకంతో ఉన్నప్పుడు, వారి నైపుణ్యాలు , ప్రతిభ ఎటువంటి పరిమితులు లేకుండా బయట పడతాయి " అని శ్రీ మోదీ అన్నారు. స్వప్రయోజనాల కోసం భాషను రాజకీయం చేయాలనుకునే వారు ఇకపై దుకాణాలు మూసేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జాతీయ విద్యావిధానం దేశంలోని ప్రతి భాషకు సముచిత గౌరవం, గుర్తింపు ఇస్తుందన్నారు.

 

వచ్చే 25 సంవత్సరాల అమృత్ కాల్ లో ఒక శక్తివంతమైన కొత్త తరాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. బానిస మనస్తత్వ భావాలు లేని తరం, ఆవిష్కరణల కోసం ఆరాటపడుతూ, సైన్స్ నుంచి క్రీడల వరకు అన్ని రంగాల్లో కీర్తిప్రతిష్టలు తీసుకురావడానికి సిద్ధంగా ఉండి 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తమను తాము నైపుణ్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న తరం, కర్తవ్య భావంతో నిండిన ఈ కొత్త తరం సృష్టి లో ఎన్ ఇ పి  కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.

 

నాణ్యమైన విద్యకు సంబంధించిన వివిధ పారామీటర్లలో సమానత్వం కోసం భారతదేశం చేస్తున్న పెద్ద ప్రయత్నమని ప్రధాన మంత్రి అన్నారు. "భారతదేశంలోని ప్రతి యువకుడు ఒకే విద్యను , విద్యకు ఒకే అవకాశాన్ని పొందాలనేది ఎన్ఇపి ప్రాధాన్యత" అని ఆయన అన్నారు. ఇది పాఠశాలలు తెరవడానికి మాత్రమే పరిమితం కాదని నొక్కి చెప్పారు.  విద్యతో పాటు వనరులకు సమానత్వం కల్పించాలని ఆయన ఉద్ఘాటించారు. అంటే ప్రతి పిల్లవాడికి వారి ఇష్టం, సామర్ధ్యం ఆధారంగా అవకాశాలు రావాలని అన్నారు.  "విద్యలో సమానత్వం అంటే ప్రదేశం, వర్గం, ప్రాంతం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకుండా ఉండడం ", అని ఆయన అన్నారు. పీఎం శ్రీ స్కీం కింద వేలాది పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. "5 జి యుగంలో, ఈ ఆధునిక పాఠశాలలు ఆధునిక విద్యా మాధ్యమంగా ఉంటాయి" అని ఆయన అన్నారు. గిరిజన గ్రామాల్లో ఏకలవ్య పాఠశాలలు, గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు, దీక్ష, స్వయం, స్వయంప్రభ వంటి మార్గాల ద్వారా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ఆయన ప్రస్తావించారు. "ఇప్పుడు, భారతదేశంలో, విద్యకు అవసరమైన వనరుల అంతరాన్ని వేగంగా భర్తీ చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

 

వృత్తి విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడానికి తీసుకుంటున్న చర్యలు, విద్యను మరింత ఆసక్తికరంగా, ఇంటరాక్టివ్ గా మార్చే మార్గాలను ప్రధాన మంత్రి వివరించారు.

గతంలో ల్యాబ్ లు, ప్రాక్టికల్స్ సదుపాయం కొన్ని పాఠశాలలకు మాత్రమే పరిమితమైందని, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో 75 లక్షల మందికి పైగా విద్యార్థులు సైన్స్, ఇన్నోవేషన్ గురించి నేర్చుకుంటున్నారని ప్రధాని గుర్తు చేశారు.

"సైన్స్ ప్రతి ఒక్కరికీ తనను తాను సరళీకృతం చేసుకుంటోంది. ఈ యువ శాస్త్రవేత్తలే గణనీయమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించడం ద్వారా దేశ భవిష్యత్తును రూపొందిస్తారు.  భారతదేశాన్ని ప్రపంచ పరిశోధన కేంద్రంగా మారుస్తారు", అని ఆయన అన్నారు.

 

"ఏ సంస్కరణకైనా ధైర్యం అవసరం, ధైర్యసాహసాలు ఉండటం కొత్త అవకాశాల పుట్టుకకు దారితీస్తుంది" అని శ్రీ మోదీ అన్నారు, ప్రపంచం భారతదేశాన్ని కొత్త అవకాశాల నర్సరీగా చూస్తోందని ఆయన నొక్కి చెప్పారు.

సాఫ్ట్ వేర్ టెక్నాలజీ, స్పేస్ టెక్ కు ఉదాహరణలు చెప్పిన ప్రధాన మంత్రి, భారతదేశ సామర్థ్యంతో పోటీ పడటం అంత సులభం కాదని అన్నారు. డిఫెన్స్ టెక్నాలజీ గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారత దేశ 'తక్కువ ఖర్చు', ‘ఉత్తమ నాణ్యత’  నమూనా విజయవంతం కావడం ఖాయమని అన్నారు. భారత పారిశ్రామిక ఖ్యాతి, స్టార్టప్ గ్రోత్ ఎకోసిస్టమ్ పెరగడంతో ప్రపంచంలో భారత విద్యావ్యవస్థపై గౌరవం గణనీయంగా పెరిగిందని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారతీయ ఇన్ స్టిట్యూట్ ల సంఖ్య పెరుగుతోందని, జాంజిబార్, అబుదాబిలో రెండు ఐఐటీ క్యాంపస్ లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. "అనేక ఇతర దేశాలు కూడా తమ దేశాలలో ఐఐటి క్యాంపస్ లను తెరవాలని కోరుతున్నాయి" అని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో వస్తున్న సానుకూల మార్పుల కారణంగా అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ క్యాంపస్ లను తెరవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో రెండు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్ లను ప్రారంభించబోతున్నాయని ఆయన తెలిపారు. విద్యా సంస్థలను నిరంతరం బలోపేతం చేయాలని, వాటిని భవిష్యత్తుకు సిద్ధం చేసే దిశగా కృషి చేయాలని ఆయన ఉద్ఘాటించారు.

భారతదేశ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను ఈ విప్లవానికి కేంద్రంగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

 

సమర్ధులైన యువతను తయారు చేయడమే బలమైన దేశ నిర్మాణానికి అతిపెద్ద హామీ అని, ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,  విద్యార్థులను ఆత్మవిశ్వాసం, ఊహాశక్తికి సిద్ధం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తుపై ఓ కన్నేసి ఉంచాలని, భవిష్యత్ మనస్తత్వంతో ఆలోచించాలన్నారు. పుస్తకాల ఒత్తిడి నుంచి పిల్లలను విముక్తం చేయాలి' అని ఆయన అన్నారు.

 

బలమైన భారతదేశం పట్ల పెరుగుతున్న ప్రపంచ ఆసక్తి మనపై ఉంచిన బాధ్యత గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు.  యోగా, ఆయుర్వేదం, కళలు, సాహిత్యం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. 2047లో ' వికసిత్ భారత్' గా భారత్ ప్రయాణంలో ప్రస్తుత తరంవిద్యార్థుల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు గుర్తు చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

 

ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా, అమృత్ కాల్ లో దేశాన్ని నడిపించడానికి యువతను తీర్చిదిద్దడానికి , వారిని సిద్ధం చేయడానికి ఎన్ ఇ పి  2020 ని ప్రారంభించారు.  ప్రాథమిక మానవ విలువలకు కట్టుబడి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వారిని సన్నద్ధం చేయడమే దీని లక్ష్యం. ఈ విధానం అమలు లోకి వచ్చిన మూడేళ్లలో పాఠశాల, ఉన్నత, నైపుణ్య విద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకువచ్చింది.

 

జూలై 29, 30 తేదీల్లో జరుగుతున్న ఈ రెండు రోజుల కార్యక్రమం- విద్యావేత్తలు, విద్యా రంగ నిపుణులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రతినిధులు, పాఠశాలలు, ఉన్నత విద్య, నైపుణ్య సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్ ఇ పి  2020 అమలులో తమ అంతర్దృష్టులు, విజయగాథలు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వ్యూహాలను రూపొందించడానికి ఒక వేదికను కల్పిస్తుంది.

 

అఖిల భారతీయ శిక్షా సమాగం లో పదహారు సెషన్లు ఉంటాయి, ఇందులో నాణ్యమైన విద్య , పాలనకు ప్రాప్యత, సమాన - సమ్మిళిత విద్య, సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, విద్య అంతర్జాతీయీకరణ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.

 

ఈ సందర్భంగా ప్రధాని పి ఎం శ్రీ స్కీమ్ కింద తొలి విడత నిధులను విడుదల చేశారు. జాతీయ విద్యావిధానం (ఎన్ ఇ పి ) 2020 ప్రకారం సమానమైన, సమ్మిళిత, బహుళ సమాజాన్ని నిర్మించడానికి ఈ పాఠశాలలు విద్యార్థులను నిమగ్నం చేసే, ఉత్పాదక దోహదపడే పౌరులుగా తీర్చిదిద్దుతాయి

12 భారతీయ భాషల్లోకి అనువదించిన విద్య, నైపుణ్య పాఠ్య ప్రణాళిక పుస్తకాలను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు.

 

***

DS/TS



(Release ID: 1944102) Visitor Counter : 115