సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

భారతదేశం జీ20 అధ్యక్షతన, కర్ణాటకలోని హంపిలో ముగిసిన 3వ సంస్కృతిక కార్యవర్గ సమావేశం


గత రెండు సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఏకాభిప్రాయం సాధించడంపై దృష్టి పెట్టిన 3వ సీడబ్ల్యూజీ సమావేశం

Posted On: 12 JUL 2023 12:37PM by PIB Hyderabad

భారతదేశం జీ20 అధ్యక్షతన, 3వ సంస్కృతిక కార్యవర్గ సమావేశం కర్ణాటకలోని హంపిలో ఇవాళ ముగిసింది. 3వ సంస్కృతి కార్యవర్గ సమావేశం చర్చలను ఈ నెల 11న ముగించారు. వారణాసిలో ఆగస్టు 26న నిర్వహించనున్న జీ20 సాంస్కృతిక మంత్రుల సమావేశానికి అనుబంధంగా ఉండే అంశాలు, నవీకరణలతో 3వ సీడబ్ల్యూజీ ఆఖరి అంకం ముగిసింది.

భారతదేశం జీ20 అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూజీ విధాన రూపకల్పనల్లో సంస్కృతికి పెద్ద పీట వేసేలా చేస్తుంది. ఖజురహో, భువనేశ్వర్‌లో నిర్వహించిన గత రెండు సీడబ్ల్యూజీ సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఏకాభిప్రాయం సాధించడంపై 3వ సీడబ్ల్యూజీలో దృష్టి పెట్టారు.

హంపిలోని హజార రామ మందిరంలో ఇవాళ జరిగిన యోగా కార్యక్రమంలో జీ20 ప్రతినిధులు పాల్గొన్నారు.

   

నిన్న, హంపిలోని చారిత్రాత్మక రాణి గారి స్నానఘట్టం వద్ద మొక్కలు నాటారు. హంపిలో పర్యటించిన ప్రతినిధులు, ఆ ప్రాంతంలోని గొప్ప వారసత్వం, అద్భుత నిర్మాణాలను ప్రశంసించారు. పర్యటన అనంతరం, విరూపాక్ష దేవాలయం ఎదురుగా ఉన్న యెడూరు బసవన్న మంటపం వద్దకు ప్రతినిధులు చేరుకున్నారు. అక్కడ, దక్షిణ భారతదేశానికి చెందిన నాలుగు విభిన్న నృత్య రీతులను తిలకించారు. అవి, తమిళనాడుకు చెందిన భరతనాట్యం, కేరళకు చెందిన మోహినియాట్టం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి, ఒడిశాకు చెందిన ఒడిస్సీ. హంపి స్మారక చిహ్నాల మధ్య జరిగిన ఈ ప్రదర్శన ప్రతినిధులను మంత్రముగ్ధులను చేసింది.

అంతకుముందు, ఈ నెల 10న కర్ణాటకలోని హంపిలో జీ20 మూడో సంస్కృతిక కార్యవర్గ సమావేశం (సీడబ్ల్యూజీ) ప్రారంభమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.

"మనం నాలుగు ప్రాధాన్యతలను గుర్తించడం, చర్చించడం స్థాయి నుంచి కార్యాచరణ సిఫార్సులపై ఏకాభిప్రాయం సాధించడం వరకు వచ్చాం. ఇది, విధానాల రూపకల్పనలో సంస్కృతికి ప్రాముఖ్యతను అందిస్తుంది" అని కేంద్ర మంత్రి చెప్పారు. నాలుగు ప్రాధాన్య అంశాలు, సాంస్కృతిక ఆస్తుల రక్షణ & పునరుద్ధరణ; సుస్థిర భవిష్యత్‌ కోసం వారసత్వాన్ని ఉపయోగించుకోవడం; సంస్కృతిని సృజనాత్మక పరిశ్రమలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం; సంస్కృతి పరిరక్షణ, ప్రోత్సాహం కోసం డిజిటల్ సాంకేతికతల వినియోగాన్ని పెంచడం.

జులై 10వ తేదీ సాయంత్రం, విజయ విఠల దేవాలయం, రాజు-రాణి నివాస ప్రాంతాలు,  యెడూరు బసవన్న మంటపం వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ప్రతినిధులకు పర్యటన ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో కూడా తెప్పలపై విహారయాత్రకు తీసుకువెళ్లారు.

ప్రముఖ సంగీత విద్వాంసుడు విక్కు వినాయక్‌రామ్‌ ఇచ్చిన సంగీత ప్రదర్శనను ప్రతినిధులు ఆస్వాదించారు. విజయ విఠల ఆలయ సముదాయంలో, అద్భుత శిల్పకళా భంగిమలను స్ఫురింపజేస్తూ, భరతనాట్యం కళాకారులు ఇచ్చిన 30 నిమిషాల ప్రదర్శన విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్ల ముందుకు తీసుకువచ్చింది.

*****



(Release ID: 1938959) Visitor Counter : 152