వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

గత 3 సంవత్సరాలలో ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ ద్వారా సేకరణలో 10 రెట్లు వృద్ధి : కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


ఈ వృద్ధికి తోడ్పడిన ప్రభుత్వ ఈ-మార్కెట్‌ ప్లేస్ వాటాదారులందరినీ శ్రీ గోయల్ ప్రశంసించారు

దేశంలోని ప్రభుత్వ సేకరణ విధానంలో పరివర్తన మార్పు కోసం ప్రభుత్వ ఈ-మార్కెట్‌ ప్లేస్ అవార్డు గ్రహీతల ప్రయత్నాలను గోయల్ కొనియాడారు


ప్రభుత్వ ఈ-మార్కెట్‌ ప్లేస్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేయడం ద్వారా ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల కోసం ఆ నిధులు మరింత మెరుగ్గా ఉపయోగపడుతున్నాయి : శ్రీ గోయల్

Posted On: 27 JUN 2023 2:25PM by PIB Hyderabad

గత మూడేళ్లలో ప్రభుత్వ  -మార్కెట్‌ప్లేస్ (జి.ఈ.ఎం) ద్వారా సేకరణ ''10 రెట్లు'' వృద్ధి సాధించినట్లు, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, పేర్కొన్నారు.  నిన్న న్యూఢిల్లీ లో జి.ఈ.ఎం. నిర్వహించిన ‘క్రేతా-విక్రేత గౌరవ్ సమ్మాన్ సమారోహ్-2023 ’లో ఆయన మాట్లాడుతూ, ఈ వృద్ధి కి తోడ్పడిన జి.ఈ.ఎం. వాటాదారులందరినీ మంత్రి అభినందించారు. 

అవార్డు గ్రహీతల ప్రయత్నాలను శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించారు, వారి సహకారం దేశంలోని ప్రభుత్వ సేకరణ విధానంలో పరివర్తన మార్పును తీసుకువచ్చింది.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా సాంకేతికత, విశ్లేషణలను ఉపయోగించుకోవడం ద్వారా ఏకీకృత, పారదర్శకమైన, సమర్థవంతమైన సేకరణ వ్యవస్థను సాధించేందుకు జి.ఈ.ఎం. ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  గత 7 సంవత్సరాలలో ఈ వృద్ధి ప్రయోజనాలను జి.ఈ.ఎం. ఎలా ప్రారంభించిందో, బహుముఖ వృద్ధిని ఎలా సాధించిందో ఆయన ప్రత్యేకంగా వివరించారు. 

కేంద్ర, రాష్ట్ర శాఖలు వస్తువులు, సేవల సేకరణ కోసం జి.ఈ.ఎమ్‌. ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బు ఆదా అవుతోంది. ఫలితంగా, ప్రజా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోడానికి ఆ నిధులు అందుబాటులో ఉంటున్నాయని, శ్రీ పీయూష్ గోయల్ వివరించారు.   2022-23 లో ప్రభుత్వ పోర్టల్ జి.ఈ.ఎం. నుండి మొత్తం వస్తువులు, సేవల సేకరణ ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు దాటినందున 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది, 3 లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిరంతరం ప్రయత్నిస్తోందని మంత్రి తెలియజేశారు.  ఇందుకోసం, మరింత సమకాలీనంగా, ఆధునికమైనదిగా,  కార్యకలాపాల సౌలభ్యం కోసం మరిన్ని అంశాలతో ఉండే, ఒక కొత్త వ్యవస్థను, జి.ఈ.ఎం. లో అభివృద్ధి చేస్తున్నట్లు శ్రీ గోయల్ చెప్పారు.   కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కొనుగోలుదారులు, అమ్మకందారులకు సహాయపడటానికి కొత్త విధానంలో విశ్లేషణాత్మక సమాచారం అందుబాటులో ఉంటుందని, ఆయన తెలియజేశారు.  ప్రభుత్వ సేకరణ పోర్టల్ జి.ఈ.ఎం. నిర్వహణ కోసం కాంట్రాక్టును భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు టి.సి.ఎస్. గెలుచుకున్నట్లు శ్రీ గోయల్ తెలిపారు.

ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్,  జి.ఈ.ఎం. ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ పి.కె.సింగ్ తో పాటు,  కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా విజేతలను శ్రీ పీయూష్ గోయల్, శ్రీమతి అనుప్రియా పటేల్ సన్మానించారు. 

జి.ఈ.ఎం. ద్వారా ప్రభుత్వ సేకరణ ప్రక్రియలో ప్రభుత్వ కొనుగోలుదారులు, అమ్మకందారుల అత్యుత్తమ పనితీరును గుర్తించేందుకు జి.ఈ.ఎం. 'క్రేత-విక్రేత గౌరవ సమ్మాన్ సమారోహ్-2023' ని నిర్వహించింది.  2022-23 ఆర్ధిక సంవత్సరంలో సేకరణ ప్రక్రియ కోసం జి.ఈ.ఎం. ను ఉపయోగించడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ప్రభుత్వ కొనుగోలుదారులు, విక్రేతల ప్రయత్నాలకు గుర్తింపుగా "కొనుగోలుదారు-విక్రేత అవార్డుల" ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేసింది. 

భారతదేశంలో ప్రభుత్వ సేకరణ విధానాన్ని మార్చడంలో జి.ఈ.ఎం. కీలకపాత్ర పోషించింది.  దేశంలో ప్రభుత్వ సేకరణ విధానంలో ఒక నమూనా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో 2016 లో జి.ఈ.ఎం. ని స్థాపించడం జరిగింది.  సేకరణ ప్రక్రియలో పారదర్శకత, సమర్థతతో పాటు, వ్యయ-సమర్థతను జి.ఈ.ఎం. మెరుగు పరిచింది. కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా విక్రేతల నుండి వస్తువులు, సేవలను పొందడాన్ని జి.ఈ.ఎం. సులభతరం చేసింది.

2023 మార్చి, 31వ తేదీ నాటికి, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జి.ఈ.ఎం. స్థూల వాణిజ్య విలువ (జి.ఎం.వి) 2 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యింది.  జి.ఈ.ఎం. దాని వాటాదారుల మద్దతుతో దాని ప్రారంభం నుండి ఇప్పటివరకు జి.ఎం.వి. మొత్తం విలువ  4 లక్షల 29 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా నమోదయ్యింది.   జి.ఈ.ఎమ్‌. లో మొత్తం లావాదేవీల సంఖ్య కూడా 1.54 కోట్లు దాటింది.  69,000 పైగా ప్రభుత్వ కొనుగోలుదారుల సంస్థల విభిన్న సేకరణ అవసరాలను జి.ఈ.ఎం. తీరుస్తోంది.  జి.ఈ.ఎమ్‌. పోర్టల్‌ లో 11,800 కంటే ఎక్కువ ఉత్పత్తి కేటగిరీలతో పాటు, 280 కంటే ఎక్కువ సేవా విభాగాలు కూడా ఉన్నాయి.  వివిధ అధ్యయనాల ఆధారంగా, ఈ ప్లాట్‌ ఫారమ్‌ ద్వారా కనీసం 10 శాతం ఆదా అవుతుంది. అంటే, అది సుమారుగా 40,000 కోట్ల రూపాయల విలువైన ప్రజాధనాన్ని ఆదా చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఆన్‌ లైన్‌ లో వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వీలుగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016 ఆగస్టు, 9వ తేదీన ప్రభుత్వ ఈ-మార్కెట్ (జి.ఈ.ఎం) పోర్టల్‌ ను ప్రారంభించింది.  జి.ఈ.ఎం. 63,000 కంటే ఎక్కువ ప్రభుత్వ కొనుగోలుదారుల సంస్థలను కలిగి ఉంది. అదేవిధంగా, 62 లక్షల మంది విక్రేతలు, సేవా ప్రదాతలు జి.ఈ.ఎం. ద్వారా విస్తృత శ్రేణిలో ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నారు. 

*****



(Release ID: 1935761) Visitor Counter : 148