రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నౌకాదళ సిబ్బందికి మెరుగైన శిక్షణ కోసం కోచిలో సమీకృత సిమ్యులేటర్ల సముదాయం ‘ధృవ్’ను ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 21 JUN 2023 11:33AM by PIB Hyderabad

రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఇవాళ, కోచిలోని దక్షిణ నౌకాదళ స్థావరంలో సమీకృత సిమ్యులేటర్ల సముదాయం (ఐఎస్‌సీ) 'ధృవ్'ను ప్రారంభించారు. ఐఎస్‌సీ 'ధృవ్'లో అత్యాధునిక స్వదేశీ నిర్మిత సిమ్యులేటర్‌లు ఉన్నాయి. నౌకాదళ సిబ్బంది శిక్షణను ఇవి గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఈ సిమ్యులేటర్లు నౌకా ప్రయాణం, యుద్ధ నౌకల కార్యకలాపాలు, వ్యూహాల్లో వాస్తవ అనుభవాన్ని అందిస్తాయి. మిత్ర దేశాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు.

‘ధృవ్’ సముదాయంలో ఏర్పాటు చేసిన సిమ్యులేటర్లలో, మల్టీ స్టేషన్ హ్యాండ్లింగ్ సిమ్యులేటర్ (ఎంఎస్‌ఎస్‌హెచ్‌ఎస్‌), ఎయిర్ డైరెక్షన్ అండ్‌ హెలికాప్టర్ కంట్రోల్ సిమ్యులేటర్ (ఏడీహెచ్‌సీఎస్‌), ఆస్ట్రోనావిగేషన్ డోమ్‌ను రక్షణ మంత్రి పరిశీలించారు. న్యూదిల్లీకి చెందిన అరి ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించిన షిప్ హ్యాండ్లింగ్ సిమ్యులేటర్లు 18 దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇన్ఫోవిజన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన ఆస్ట్రోనావిగేషన్ డోమ్, భారత నౌకాదళానికి అందిన ఈ తరహా తొలి వ్యవస్థ ఇది.

ఏడీహెచ్‌సీఎస్‌ను, డీఆర్‌డీవో పరిశోధనశాల అయిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ రూపొందించింది. ఇది, శిక్షణార్ధులకు వాస్తవ సమయ కార్యాచరణ వ్యవస్థను కళ్ల ముందుకు తెస్తుంది. ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ‘ఆత్మనిర్భర్ భారత్’కు నిదర్శనంగా నిలుస్తున్నాయి, రక్షణ రంగ ఎగుమతుల్లో దేశ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. సముదాయంలో, దేశీయంగా అభివృద్ధి చేసిన సిమ్యులేటర్లలో యుద్ధ పోరాటాల నిర్వహణ వ్యవస్థ, మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ ల్యాబ్ కూడా ఉన్నాయి.

‘ధృవ్’ ప్రారంభోత్సవం సందర్భంగా, సిమ్యులేటర్ల రూపకల్పనలో పాల్గొన్న సంస్థల సీనియర్ అధికారులతోనూ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సంభాషించారు.

 ***



(Release ID: 1933972) Visitor Counter : 111