ప్రధాన మంత్రి కార్యాలయం

2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 18 JUN 2023 12:03PM by PIB Hyderabad

ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. మరోసారి మీ అందరిని ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమాని కి ఆహ్వానిస్తున్నాను. ప్రతి నెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం ఉంటుంది. అయితే, ఈసారి మాత్రం ఒక వారం ముందుగానే జరుగుతోంది. మీకు తెలుసు - నేను వచ్చే వారం అమెరికా లో ఉంటాను. అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది. కాబట్టి నేను అక్కడకు వెళ్ళే ముందే మీతో మాట్లాడాలని అనుకున్నాను. ఇంతకంటే ఉత్తమ మార్గం ఏముంటుంది? జనతా జనార్దన్ ల ఆశీస్సు లు, మీరు ఇచ్చే ప్రేరణ లతో నాలో శక్తి కూడా పెరుగుతూనే ఉంటుంది.

మిత్రులారా, ప్రధాన మంత్రి గా నేను ఈ మంచి పని ని చేశాను, ఇంత గొప్ప పని ని చేశాను అని చాలా మంది అంటారు. చాలా మంది ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం శ్రోత లు వారి ఉత్తరాల లో ఎంతో ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశాను అని చాలా మంది వ్రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశం లోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్ప బలం చూసినప్పుడు పొంగిపోతాను. అతి పెద్దదైనటువంటి లక్ష్యం కావచ్చు, కఠినాతికఠినమైనటువంటి సవాలు కావచ్చు- భారతదేశం ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలు ను పరిష్కరిస్తాయి. రెండు- మూడు రోజుల క్రితం దేశ పశ్చిమ ప్రాంతం లో ఎంత పెద్ద చక్రవాతం వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపర్ జాయ్ చక్రవాతం కచ్ఛ్ లో పెను విధ్వంసాన్ని సృష్టించింది. కచ్ఛ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైనటువంటి గాలివాన ను ఎంతో ధైర్యం తో, సన్నద్ధత తో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాత కచ్ఛ్ ప్రజలు వారి కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకోబోతున్నారు. కచ్ఛ్ లో వర్షాల ప్రారంభాని కి ప్రతీక గా ఆషాఢీ బీజ్‌ ను జరుపుకొంటారు. నేను చాలా సంవత్సరాలు గా కచ్ఛ్ కు వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజల కు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ఛ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి ల గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం అనంతరం ఎన్నటికీ కోలుకోలేదు అని భావించినటువంటి కచ్ఛ్ ప్రస్తుతం దేశం లోనే అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న జిల్లాల లో ఒకటి గా ఉంది. బిపర్ జాయ్ చక్రవాతం కలిగించిన విధ్వంసం నుండి కూడా కచ్ఛ్ ప్రజలు వేగం గా బయటపడతారు అన్న నమ్మకం నాలో ఉంది.

మిత్రులారా, ప్రకృతి వైపరీత్యాల ను గురించి ఎవరూ పెద్ద గా పట్టించుకోరు. కానీ, భారతదేశం గత కొన్ని సంవత్సరాలు గా అభివృద్ధి చేసిన విపత్తు నిర్వహణ తాలూకు బలం నేడు ఒక ఉదాహరణ గా మారుతున్నది. ప్రకృతి వైపరీత్యాల ను ఎదుర్కోవడానికి ఒక గొప్ప మార్గం ఉంది. అదే ప్రకృతి పరిరక్షణ. వర్షాకాలం లో ఈ దిశ లో మన బాధ్యత మరింత పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం దేశం 'క్యాచ్ ద రెయిన్' వంటి ప్రచారాల ద్వారా సామూహిక ప్రయత్నాల ను చేస్తోంది. గత నెల ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం లో నీటి సంరక్షణ కు సంబంధించిన స్టార్ట్ అప్ స్ ను గురించి చర్చించాం. ప్రతి నీటి చుక్క ను పొదుపు చేసేందుకు వారి శక్తి మేరకు కృషి చేస్తున్న ఎందరో వ్యక్తుల గురించి కొందరు లేఖల లో తెలియ జేశారు. అటువంటి ఒక సహచరుడే ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా జిల్లా కు చెందిన తులసీరామ్ యాదవ్ గారు. తులసీరామ్ యాదవ్ గారు లుక్ తరా గ్రామ పంచాయతీ కి సర్పంచ్ గా ఉన్నారు. బాందా మరియు బుందేల్‌ఖండ్‌ ప్రాంతం లో జలం కోసం ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి మీకు తెలుసు. ఈ సవాలు ను అతిగమించేందుకు తులసీరామ్ గారు గ్రామ ప్రజల సహకారం తో ఆ ప్రాంతం లో 40 కి పైగా చెరువుల ను నిర్మించారు. ‘చేను నీరు చేను లో- ఊరి నీరు ఊళ్లో’ అనే నినాదాన్ని తులసీరామ్ గారు తన ప్రచార ఉద్యమాని కి ప్రాతిపదిక గా చేసుకున్నారు. ఆయన కృషి ఫలితంగానే ఆ గ్రామం లో భూగర్భ జలాల మట్టం మెరుగవుతోంది. అంతరించి పోయిన నది ని ఉత్తర్ ప్రదేశ్ లోని హాపుడ్ జిల్లా ప్రజలు సమష్టి కృషి తో పునరుద్ధరించారు. చాలా కాలం క్రితం అక్కడ ‘నీమ్’ అనే నది ఉండేది. ఆ నది కాలక్రమం లో కనుమరుగైంది. కానీ స్థానిక ప్రజల జ్ఞాపకాల్లో, జానపద కథల్లో ఎప్పుడూ దాన్ని ప్రస్తావించే వారు. చివరకు ప్రజలు వారి ఈ సహజ వారసత్వాన్ని పునరుద్ధరించాలి అని నిర్ణయించుకొన్నారు. ప్రజల సమష్టి కృషి వల్ల ఇప్పుడు ‘నీమ్’ నది మళ్లీ జీవం పోసుకోవడం ప్రారంభించింది. నది పుట్టిన స్థలాన్ని అమృత్ సరోవర్‌ లాగా కూడా అభివృద్ధి పరచడం జరుగుతోంది.

మిత్రులారా, ఈ నదులు, కాలువ లు, సరస్సు లు కేవలం నీటి వనరులు కాదు. జీవితం లోని వర్ణాలు, భావోద్వేగాలు కూడా వాటితో ముడిపడి ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర లో ఇటువంటి దృశ్యమే కనిపించింది. ఈ ప్రాంతం ఎక్కువ గా కరువు కోరల లో చిక్కుకొంది. ఐదు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ఇక్కడ నిల్ వండే ఆనకట్ట తాలూకు కాలవ పనులు పూర్తి అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పరీక్షించేందుకు కాలవలో నీటి ని విడుదల చేశారు. ఈ స‌మ‌యం లో వ‌చ్చిన చిత్రాలు భావోద్వేగభరితం గా ఉన్నాయి. హోలీ-దీపావళి పండుగ ల సందర్భాల లో చేసినట్టు ఊరి జనం నృత్యాలు చేశారు.

మిత్రులారా, పరిపాలన విషయాని కి వస్తే ఈ రోజు న నేను ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ను కూడా గుర్తు కు తెచ్చుకొంటాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం తో పాటు ఆయన పరిపాలన, నిర్వహణ నైపుణ్యాల నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ముఖ్యం గా నీటి నిర్వహణ, నౌకాదళం విషయాల లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కార్యాలు ఇప్పటికీ భారతదేశం చరిత్ర యొక్క గౌరవాన్ని పెంచుతాయి. ఆయన కట్టిన జల దుర్గాలు ఇన్ని శతాబ్దాల తరువాత కూడాను సముద్రం మధ్య లో సగర్వం గా కొలువై ఉన్నాయి. ఈ నెల మొదట్లోనే, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పట్టాభిషేక ఘట్టాని కి 350 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పెద్ద పండుగ లా జరుపుకొంటున్నారు. ఈ సందర్భం లో మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ కోట లో దీనికి సంబంధించిన భారీ కార్యక్రమాల ను నిర్వహించారు. నాకు గుర్తుంది- చాలా సంవత్సరాల క్రితం 2014 లో ఆ పుణ్యభూమి కి నమస్కరించడానికి రాయగఢ్ కు వెళ్లే అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్వహణ నైపుణ్యాలను తెలుసుకోవడం, వాటి నుండి ఎన్నో విషయాలను గ్రహించడం మనందరి కర్తవ్యం. ఇది మన వారసత్వం పట్ల మన లో గర్వాన్ని నింపుతుంది. భవిష్యత్తు కోసం మన కర్తవ్యాల ను నిర్వర్తించడానికి కూడా మనలను ప్రేరేపిస్తుంది.

ప్రియమైన నా దేశ వాసులారా, రామాయణంలో రామసేతు నిర్మాణం లో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన చిన్న ఉడుత ను గురించి మీరు తప్పక విని ఉంటారు. ఉద్దేశ్యం సుస్పష్టం గా ఉండి, ప్రయత్నాలలో నిజాయతీ ఉన్నప్పుడు ఏ లక్ష్యం కష్టం గా ఉండదు అని ఉడుత సహాయం చాటి చెప్తుంది. భారతదేశం కూడా ఈ ఉదాత్తమైన ఉద్దేశ్యం తో నేడు భారీ సవాలు ను ఎదుర్కొంటోంది. ఈ సవాలు టి.బి. దీన్నే ‘క్షయవ్యాధి అని కూడా అంటారు. 2025 వ సంవత్సరాని కల్లా టీబీ కి తావు ఉండని అటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే లక్ష్యం ఖచ్చితం గా చాలా పెద్దదే. ఒకప్పుడు టీబీ ని గురించి తెలిసిన తరువాత కుటుంబ సభ్యులు కూడా దూరం అయ్యే వారు. కానీ ఇప్పుడు టీబీ రోగుల ను తమ కుటుంబం లో సభ్యుని గా చూస్తూ సహకరిస్తున్నారు. ఈ క్షయ వ్యాధి ని మూలాల నుండి తొలగించడానికి నిక్షయ మిత్రులు ముందుకు వచ్చారు. దేశం లో పెద్ద సంఖ్య లో వివిధ సామాజిక సంస్థ లు నిక్షయ మిత్రగా మారాయి. వేలాది మంది ముందుకు వచ్చి టి.బి. రోగుల ను దత్తత తీసుకున్నారు. టిబి రోగుల కు సహాయం చేయడానికి చాలా మంది పిల్లలు ముందుకు వచ్చారు. ఈ ప్రజా భాగస్వామ్యమే ఈ ప్రచారాని కి అతి పెద్ద బలం. ఈ భాగస్వామ్యం కారణం గా ప్రస్తుతం దేశం లో 10 లక్షల మంది కి పైగా టీబీ రోగుల ను దత్తత తీసుకొన్నారు. సుమారు 85 వేల మంది నిక్షయ మిత్రులు ఈ స్వచ్ఛంద సేవ కు నడుం కట్టారు. దేశం లోని ఎందరో సర్పంచులు, గ్రామపెద్దలు వారి గ్రామం లో టీబీ వ్యాధి అంతరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాకు సంతోషం గా ఉంది.

నైనీతాల్‌ లోని ఒక గ్రామాని కి చెందిన నిక్షయ మిత్ర శ్రీమాన్ దీకర్ సింహ్ మేవారీ గారు ఆరుగురు టీబీ రోగుల ను దత్తత తీసుకొన్నారు. ఇదే విధం గా కిన్నౌర్ గ్రామ పంచాయితీ అధినేత, నిక్షయ మిత్ర శ్రీమాన్ జ్ఞాన్ సింహ్ గారు వారి బ్లాకు లో టీబీ రోగుల కు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడం లో నిమగ్నమై ఉన్నారు. భారతదేశాన్ని టీబీ రహితం గా చేసే ప్రచారం లో పిల్లలు, యువ స్నేహితులు కూడా వెనుకబడి లేరు. హిమాచల్ ప్రదేశ్‌ లోని ఊనా కు చెందిన ఏడేళ్ల చిన్నారి నళిని సింహ్ చేసిన అద్భుతమైన పని ని చూడండి. చిన్నారి నళిని తన పాకెట్ మనీ నుండి టి.బి. రోగుల కు సహాయం చేస్తోంది. డబ్బు ను పొదుపు చేసుకోవడం లో ఉపయోగించే పిగ్గీ బ్యాంకుల ను పిల్లలు ఎంతగా ఇష్టపడతారో మీకు తెలుసు. మధ్య ప్రదేశ్ లోని కట్ నీ జిల్లా కు చెందిన పదమూడేళ్ల వయసు ఉన్న మీనాక్షి, పశ్చిమ బంగాల్‌ లోని డాయమండ్ హార్బర్‌ కు చెందిన పదకొండేళ్ల వయసున్న బష్వర్ ముఖర్జీ .. వీరు ఇద్దరూ ఈ విషయం లో మిగతా వారి కన్న భిన్నం గా ఉండే చిన్నారులు. ఈ బాలలు వారి పిగ్గీ బ్యాంకు డబ్బు ను టీబీముక్త్ భారత్ ప్రచారాని కి అందజేశారు. ఈ ఉదాహరణలు భావోద్వేగాలతో నిండి ఉండడమే కాకుండా, చాలా స్ఫూర్తిదాయకం గా కూడా ఉన్నాయి. చిన్న వయసు లో పెద్ద గా ఆలోచిస్తున్న ఈ పిల్లలందరిని హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా, కొత్త ఆలోచనల ను స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధం గా ఉండడం భారతీయులమైన మన స్వభావం. మనం మన వస్తువుల ను ప్రేమిస్తాం. కొత్త విషయాల ను కూడా స్వీకరిస్తాం. కలుపుకొంటాం. దీనికి ఉదాహరణ జాపాన్ టెక్నిక్ మియావాకీ. ఎక్కడైనా మట్టి సారవంతం గా లేకపోతే ఆ ప్రాంతాన్నిమళ్ళీ సస్యశ్యామలం చేయడానికి మియావాకీ టెక్నిక్ చాలా మంచి మార్గం. మియావాకీ సాంకేతికత ను ఉపయోగించే అడవులు వేగం గా విస్తరించి, రెండు మూడు దశాబ్దాల లో జీవ వైవిధ్యానికి కేంద్రం గా మారుతాయి. ఇప్పుడు భారతదేశం లోని వివిధ ప్రాంతాల లో ఇది చాలా వేగం గా విస్తరిస్తోంది. కేరళ కు చెందిన శ్రీమాన్ రాఫీ రాంనాథ్ అనే ఉపాధ్యాయుడు ఈ టెక్నిక్‌ తో ఒక ప్రాంత రూపురేఖల ను మార్చివేశారు. నిజానికి రాంనాథ్ గారు ఆయన యొక్క విద్యార్థుల కు ప్రకృతి, పర్యావరణం గురించి లోతు గా వివరించాలి అనుకొన్నారు. అందుకోసం ఒక మూలిక ల తోట ను సిద్ధం చేశారు. ఆయన తోట ఇప్పుడు బయోడైవర్సిటీ జోన్‌ గా మారిపోయింది. ఈ విజయం ఆయన లో మరింత స్ఫూర్తి ని నింపింది. దీని తరువాత రాఫీ గారు మియావాకీ టెక్నిక్‌ తో చిన్నపాటి అడవి నే తయారు చేశారు. దానికి ‘విద్యావనం’ అనే పేరు ను పెట్టారు. ఇంత అందమైన ‘విద్యావనం’ అనే పేరు ను కేవలం ఒక ఉపాధ్యాయుడే పెట్టగలరు. 115 రకాల కు చెందిన 450 కి పైగా మొక్కల ను రాంనాథ్‌ గారి కి చెందిన ఈ ‘విద్యావనం’ లో తక్కువ స్థలం లో నాటారు. వాటి నిర్వహణ లో రాంనాథ్ యొక్క విద్యార్థులు కూడాను ఆయన కు సహాయం చేస్తారు. సమీపం లోని పాఠశాలల విద్యార్థులు, సాధారణ పౌరులు ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్య లో వెళ్తున్నారు. మియావాకీ అడవుల ను నగరాల తో సహా ఎక్కడైనా సులభం గా పెంచవచ్చును. కొంతకాలం క్రితం నేను గుజరాత్‌ లోని కేవడియా లో గల ఏక్ తా నగర్ లో మియావాకీ అడవుల ను ప్రారంభించాను. కచ్ఛ్ లో కూడా 2001 భూకంపం వల్ల మరణించిన వారి జ్ఞాపకార్థం మియావాకీ శైలి లో స్మృతి వనాన్ని నిర్మించారు. కచ్ఛ్ వంటి ప్రదేశం లో దీని విజయం అత్యంత కఠినమైన సహజ వాతావరణం లో కూడా ఈ సాంకేతికత ఎంత ప్రభావవంతం గా ఉందో చూపిస్తుంది. అదేవిధం గా అంబాజీ, పావాగఢ్ లలో కూడా మియావాకీ పద్ధతి లో మొక్కల ను నాటారు. లఖ్ నవూ లోని అలీగంజ్‌ లో కూడాను మియావాకీ ఉద్యానాన్ని తయారు చేస్తున్నట్టు నాకు తెలిసింది. గత నాలుగు సంవత్సరాల లో ముంబయి లో, ఆ నగర పరిసర ప్రాంతాల లో ఇటువంటి 60 కంటే ఎక్కువ అడవుల పై కృషి జరిగింది. ఇప్పుడు ఈ సాంకేతికత ను ప్రపంచవ్యాప్తం గా ఇష్టపడుతున్నారు. సింగపూర్, పేరిస్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి అనేక చోట్ల దీనిని విరివిగా వాడుతున్నారు. మియావాకీ విధానాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయండి అంటూ దేశ ప్రజల కు-ముఖ్యంగా నగరాల లో నివసించే వారికి నేన విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. దీని ద్వారా మీరు మన భూమి ని, ప్రకృతి ని పచ్చగాను, పరిశుభ్రంగాను మార్చడంలో అమూల్యమైన సహకారాన్ని అందించవచ్చు.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈ రోజుల లో మన దేశం లో జమ్ము- కశ్మీర్ గురించి చాలా చర్చ లు జరుగుతున్నాయి. కొన్నిసారులు పెరుగుతున్న పర్యటకం కారణంగా, కొన్నిసారులు జి-20 లో భాగం గా జరుగుతున్న అద్భుతమైన సదస్సు ల కారణం గా. కశ్మీర్‌ లోని ‘నాదరూ’ ను దేశం వెలుపల కూడా ఎలా ఇష్టపడుతున్నారో కొంతకాలం క్రితం ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం లో మీకు నేను వివరించాను. ఇప్పుడు జమ్ము- కశ్మీర్ లోని బారామూలా జిల్లా ప్రజలు అద్భుతమైన కార్యాన్ని చేసి చూపించారు. బారామూలా లో చాలా కాలం గా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇక్కడ పాల కొరత ఉండేది. బారామూలా వాసులు ఈ సవాలు ను అవకాశం గా తీసుకున్నారు. పెద్ద సంఖ్య లో ప్రజలు ఇక్కడ డెయరీ పనుల ను ప్రారంభించారు. ఇక్కడి మహిళ లు ఈ పని లో ముందంజ లో ఉన్నారు. ఉదాహరణ కు ఇశ్ రత్ నబీ అనే ఒక సోదరి ని గురించి ప్రస్తావించుకొందాం. పట్టభద్రురాలు అయిన ఇశ్ రత్ ‘మీర్ సిస్టర్స్ డెయరీ ఫార్మ్’ ను ప్రారంభించారు. ఆమె డెయరీ ఫార్మ్ నుండి ప్రతి రోజూ దాదాపు 150 లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయి. సోపోర్ లో అటువంటి మరో సహచరుడు శ్రీ వసీం అనాయత్ ఉన్నారు. వసీమ్ కు రెండు డజన్ లకు పైగా పశువులు ఉన్నాయి. ఆయన ప్రతి రోజూ రెండు వందల లీటర్లకు పైగా పాల ను విక్రయిస్తాడు. మరో యువకుడు శ్రీ ఆబిద్ హుసైన్ కూడా డెయిరీ పనుల ను చేస్తున్నారు. ఆయన పని కూడా చాలా ముందుకు సాగుతోంది. అటువంటి వారి కృషి వల్ల బారామూలా లో రోజు కు ఐదున్నర లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు యావత్ బారామూలా కొత్త శ్వేత విప్లవానికి చిహ్నం గా మారుతోంది. గత రెండున్నర- మూడు సంవత్సరాల లో ఐదు వందల కు పైగా డెయరీ యూనిట్ లు ఇక్కడ కు వచ్చాయి. మన దేశం లోని ప్రతి ప్రాంతం అవకాశాల తో నిండి ఉందనడానికి బారామూలా లోని పాడి పరిశ్రమ యే ఒక నిదర్శన గా ఉంది. ఒక ప్రాంతం ప్రజల యొక్క సమష్టి సంకల్పం ఏ లక్ష్యాన్ని అయినా సాధించి చూపిస్తుంది.

ప్రియమైన నా దేశప్రజలారా, ఈ నెల లో భారతదేశానికి క్రీడా ప్రపంచం నుండి చాలా గొప్ప వార్త లు వచ్చాయి. మహిళ ల జూనియర్ ఏశియా కప్‌ ను తొలిసారి గా గెలిచి భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం వైభవాన్ని పెంచింది. ఈ నెల లో మన పురుషుల హాకీ జట్టు జూనియర్ ఏశియా కప్‌ ను కూడా గెలుచుకొంది. దీంతో ఈ టౌర్నమంట్ చరిత్ర లో అత్యధిక విజయాల ను సాధించిన జట్టు గా కూడా నిలచాం. జూనియర్ శూటింగ్ ప్రపంచ కప్‌ లో కూడా మన జూనియర్ జట్టు అద్భుతాలు చేసింది. ఈ టోర్నీ లో భారత జట్టు మొదటి స్థానాన్ని సాధించింది. ఈ టోర్నీ లో మొత్తం బంగారు పతకాల లో 20 శాతం ఒక్క భారతదేశం ఖాతా లోనే చేరాయి. ఈ జూన్‌ లో ఏశియా అండర్ ట్వంటీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ శిప్ కూడా జరిగింది. ఇందులో 45 దేశాల లో భారతదేశం పతకాల పట్టిక లో మొదటి మూడు స్థానాల లో నిలచింది.

మిత్రులారా, గతం లో మనం అంతర్జాతీయ పోటీల ను గురించి తెలుసుకొనే వాళ్ళం. వాటి లో భారతదేశం భాగస్వామ్యం ఉండేది కాదు. కానీ ఈ రోజున నేను గత కొన్ని వారాల విజయాల ను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. అయినా కూడా జాబితా చాలా పొడవు గా ఉంటుంది. ఇదే మన యువత అసలైన బలం. భారతదేశం మొదటి సారి గా తన ఉనికి ని చాటుతున్న ఇటువంటి అనేక క్రీడ లు, పోటీ లు ఉన్నాయి. ఉదాహరణ కు లాంగ్ జంప్‌ లో శ్రీశంకర్ మురళి పేరిస్ డాయమండ్ లీగ్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ లో దేశం కోసం కాంస్యం సాధించారు. ఈ పోటీల లో భారతదేశానికి ఇదే తొలి పతకం. కిర్గిస్తాన్‌ లో మన అండర్ 17 విమెన్ రెస్ లింగ్ టీమ్ కూడా అటువంటి విజయాన్ని నమోదు చేసింది. దేశం లోని ఈ క్రీడాకారులు, వారి తల్లితండ్రులు, కోచ్‌ ల యొక్క కృషి కి నేను అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా, అంతర్జాతీయ ఈవెంట్ లలో దేశం సాధించిన ఈ విజయం వెనుక జాతీయ స్థాయి లో మన క్రీడాకారుల కృషి ఉంది. నేడు దేశం లోని వివిధ రాష్ట్రాల లో కొత్త ఉత్సాహం తో క్రీడల ను నిర్వహిస్తున్నారు. ఆడేందుకు, గెలిచేందుకు, ఓటమి నుండి నేర్చుకొనేందుకు ఈ క్రీడల లో ఆటగాళ్ల కు అవకాశం లభిస్తుంది. ఉదాహరణ కు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఇప్పుడే ఉత్తర్ ప్రదేశ్‌ లో జరిగాయి. యువత లో ఎంతో ఉత్సాహం, అభిరుచి కనిపించాయి. ఈ క్రీడల లో మన యువత పదకొండు రికార్డుల ను బద్దలు కొట్టింది. పంజాబ్ యూనివర్సిటీ, అమృత్‌సర్‌ లోని గురు నానక్ దేవ్ యూనివర్సిటీ, కర్నాటక లోని జైన్ యూనివర్సిటీ పతకాల పట్టిక లో మొదటి మూడు స్థానాల్లో నిలచాయి.

మిత్రులారా, ఇటువంటి టూర్నామెంట్ ల లో ఒక ప్రధాన అంశం ఏమిటంటే, యువ ఆటగాళ్లకు సంబంధించిన అనేక స్ఫూర్తిదాయకమైన కథలు తెరపైకి వస్తాయి. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో రోయింగ్ ఈవెంట్‌ లో అసమ్ లోని కాటన్ యూనివర్సిటీ కి చెందిన రాజ్‌ కుమార్ ఇందులో పాల్గొన్న మొదటి దివ్యాంగ క్రీడాకారుని గా నిలచారు. బర్కతుల్లా యూనివర్సిటీ కి చెందిన నిధి పవైయ్య గారు మోకాలి గాయం తో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడాను షాట్‌పుట్‌ లో బంగారు పతకాన్ని సాధించారు. చీలమండ గాయం కారణం గా గత ఏడాది బెంగళూరు లో నిరాశ కు గురైన సావిత్రి బాయి పులే పూణే యూనివర్సిటీ కి చెందిన శుభం భండారే ఈసారి స్టీపుల్‌చేజ్‌ లో బంగారు పతకం విజేత గా నిలిచారు. బుర్ద్వాన్ యూనివర్సిటీ కి చెందిన సరస్వతి కుండూ గారు కబడ్డీ జట్టు కు కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో కష్టాల ను దాటుకొని ఆమె ఈ దశ కు చేరుకొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన ను కనబరిచిన చాలా మంది క్రీడాకారులు కూడా టిఒపిఎస్ స్కీము నుండి చాలా సహాయాన్ని పొందుతున్నారు. మన ఆటగాళ్లు ఎంత ఎక్కువ గా ఆడితే అంత గా వికసిస్తారు.

ప్రియమైన నా దేశవాసులారా, జూన్ 21 కూడా వచ్చింది. ఈసారి కూడా అంతర్జాతీయ యోగ దినోత్సవం కోసం ప్రపంచం లోని నలుమూల ల ప్రజలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం యోగ దినోత్సవం యొక్క ఇతి వృత్తం ‘వసుధైవ కుటుంబానికి యోగ’. అంటే 'ఒకే ప్రపంచం-ఒకే కుటుంబం' రూపం లో అందరి సంక్షేమం కోసం యోగ. అందరి ని ఏకం చేసి, ముందుకు తీసుకు పోవడం అనే యోగ స్ఫూర్తి ని ఇది వ్యక్తపరుస్తుంది. ప్రతిసారి మాదిరే ఈసారి కూడా దేశం లోని నలుమూల ల యోగ కు సంబంధించిన కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుంది.

మిత్రులారా, ఈసారి న్యూయార్క్‌ లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం లో జరిగే యోగ దినోత్సవ కార్యక్రమం లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. సామాజిక మాధ్యాల లో కూడా యోగ దినోత్సవం పై అద్భుతమైన ఉత్సాహం కనిపించడం నేను చూస్తున్నాను.

మిత్రులారా, యోగ ను మీ జీవనం లో తప్పనిసరి గా పాటించాలి, దానిని మీ దినచర్య లో భాగం చేసుకోవాలి అంటూ మీ అందరిని నేను కోరుతున్నాను. మీరు ఇప్పటికీ యోగ తో అనుసంధానం కాకపోతే జూన్ 21 వ తేదీ ఈ సంకల్పాని కి ఒక గొప్ప అవకాశం. యోగ లో పెద్ద గా శ్రమ అవసరం లేదు. మీరు యోగ తో ముడిపడ్డారు అంటే మీ జీవనం లో ఎంతో పెద్ద మార్పు వస్తుందో గమనించండి.

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఎల్లుండి అంటే జూన్ 20 వ తేదీ చరిత్రాత్మకమైనటువంటి రథ యాత్ర జరిగే రోజు. ప్రపంచం అంతటా రథ యాత్ర కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. భగవాన్ జగన్నాథుని రథ యాత్ర దేశం లో వివిధ రాష్ట్రాల లో అట్టహాసం గా జరుగుతుంది. ఒడిశా లోని పురీ లో జరిగే రథ యాత్ర అద్భుతం. నేను గుజరాత్‌ లో ఉన్నప్పుడు అహమదాబాద్‌ లో జరిగే భారీ రథ యాత్ర కు హాజరు అయ్యే అవకాశం వచ్చేది. ఈ రథయాత్రల లో దేశం నలుమూలల నుండి ప్రతి సమాజం, ప్రతి వర్గాని కి చెందిన ప్రజలు తరలివస్తున్న తీరు ఆదర్శప్రాయం. ఈ విశ్వాసం తో పాటు ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ కు ప్రతిబింబం కూడా. ఈ పునీతమైనటువంటి సందర్భం లో మీ అందరికి చాలా చాలా శుభాకాంక్షలు. భగవాన్ జగన్నాథుడు దేశ ప్రజలందరికి మంచి ఆరోగ్యాన్ని, సుఖం, సమృద్ధుల ఆశీస్సుల ను అందించాలి అని నేను కోరుకొంటున్నాను.

మిత్రులారా, భారతీయ సంప్రదాయం, సంస్కృతిలకు సంబంధించిన పండుగ లను గురించి చర్చిస్తున్నప్పుడు దేశం లోని రాజ్ భవన్‌ల లో జరిగే ఆసక్తికరమైన కార్యక్రమాల ను కూడా నేను ప్రస్తావించాలి. ఇప్పుడు దేశం లోని రాజ్‌భవన్‌ లు సామాజిక, అభివృద్ధి కార్యక్రమాల తో గుర్తింపు ను పొందుతున్నాయి. ఈరోజు న మన రాజ్ భవన్ లు టి.బి. ముక్త్ భారత్ ప్రచారానికి, ప్రాకృతిక వ్యవసాయాని కి సంబంధించిన ప్రచారాని కి మార్గదర్శనం చేస్తున్నాయి. గతం లో గుజరాత్, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, సిక్కిమ్ మొదలైన వివిధ రాజ్‌భవన్‌ లు తమ స్థాపన దినోత్సవాల ను జరుపుకొన్న ఉత్సాహమే ఇందుకు ఉదాహరణ. 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి ని సశక్తం చేసే గొప్ప కార్యక్రమం ఇది.

మిత్రులారా, భారతదేశం ప్రజాస్వామ్యాని కి జనని గా ఉంది. మనం ప్రజాస్వామ్య ఆదర్శాల ను ప్రధానమైనవి గా పరిగణిస్తాం. మన రాజ్యాంగాన్ని ప్రధానమైంది గా పరిగణిస్తాం. కాబట్టి, జూన్ 25 వ తేదీ ని మనం ఎప్పటికీ మరచిపోలేం. మన దేశం లో అత్యవసర పరిస్థితి ని విధించిన రోజు అది. భారతదేశం చరిత్ర లో అది ఒక చీకటి కాలం. ఎమర్జెన్సీ ని లక్షల కొద్దీ ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. ఆ సమయం లో ప్రజాస్వామ్య మద్దతుదారుల ను ఎంతగా హింసించారో, ఎన్ని వేదనల కు గురిచేశారో తలుచుకొంటే ఈనాటికీ నా మనసు కంపిస్తుంది. ఈ అఘాయిత్యాల పై; పోలీసులు, పరిపాలకులు విధించిన శిక్షల పై ఎన్నో పుస్తకాల లో రచయితలు వ్రాశారు. అప్పట్లో ‘సంఘర్ష్ మే గుజరాత్’ అనే పుస్తకాన్ని వ్రాసే అవకాశం కూడా నాకు లభించింది. ఎమర్జెన్సీ పై రాసిన ‘టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా’ అనే మరో పుస్తకం కొద్ది రోజుల కిందట నా ముందుకు వచ్చింది. అప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షకుల పట్ల అత్యంత క్రూరం గా ఎలా వ్యవహరించిందో ఎమర్జెన్సీ కాలం లో ప్రచురితమైన ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం లో చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ రోజు మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవాల ను జరుపుకొంటున్నప్పుడు దేశ స్వేచ్ఛ ను ప్రమాదం లో పడేసిన ఇటువంటి అపరాధాలను కూడా తప్పకుండా గమనించాలి అని నేను కోరుకొంటున్నాను. దీని వల్ల ప్రజాస్వామ్యం యొక్క అర్థాన్ని, ప్రాముఖ్యాన్ని అవగాహన చేసుకోవడం నేటి యువతరాని కి సులభతరం అవుతుంది.

ప్రియమైన నా దేశవాసులారా, ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం రంగురంగు ల ముత్యాల తో అలంకరించినటువంటి ఒక అందమైన దండ. ప్రతి ముత్యం దానికి అదే ప్రత్యేకమైంది. అమూల్యమైంది. ఈ కార్యక్రమం లోని ప్రతి భాగం చాలా వైవిధ్యం గా ఉంటుంది. సామూహిక భావన తో పాటు సమాజం పట్ల కర్తవ్యాన్ని, సేవాభావాన్ని మనలో నింపుతుంది. మనం సాధారణం గా చదవడం, వినడం తక్కువ గా ఉండే విషయాలపై ఇక్కడ బహిరంగం గా చర్చ జరుగుతుంది. ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం లో ఒక అంశాన్ని ప్రస్తావించిన తరువాత ఎంత మంది దేశస్థులు కొత్త స్ఫూర్తి ని పొందారో మనం తరచు గా చూస్తూనే ఉంటాం. ఇటీవలే నాకు దేశం లోని ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ఆనందా శంకర్ జయంత్ గారి నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ లేఖ లో మనం కథల ను చెప్పడం గురించి చర్చించిన ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం ఎపిసోడ్ ను గురించి వ్రాశారు. ఆ రంగాని కి సంబంధించిన వ్యక్తుల ప్రతిభ ను మనం ఆ కార్యక్రమం లో పేర్కొన్నాం. ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం నుండి ప్రేరణ ను పొంది ఆనందా శంకర్ జయంత్ గారు ‘కుట్టి కహానీ’ ని రూపొందించారు. ఇది వివిధ భాషల లో బాలల కోసం గొప్ప కథల సేకరణ. మన పిల్లల కు వారి సంస్కృతి పట్ల ఉన్న అనుబంధాన్ని మరింత గా పెంచే ఈ ప్రయత్నం చాలా బాగుంది. ఈ కథల కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోల ను కూడా ఆమె తన యూట్యూబ్ చానల్‌ లో అప్‌లోడ్ చేశారు. దేశ ప్రజల మంచి పనులు ఇతరుల కు కూడా ఎలా స్ఫూర్తి ని ఇస్తున్నాయో చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే ఆనందా శంకర్ జయంత్ గారు చేసిన ఈ ప్రయత్నాన్ని నేను ప్రత్యేకం గా ప్రస్తావించాను. ఎందుకంటే దీని నుండి నేర్చుకొని తమ నైపుణ్యాలతో దేశానికి, సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఇతరులు కూడా ప్రయత్నిస్తారు. ఇది భారతదేశ ప్రజల సమష్టి శక్తి. ఇది దేశ పురోగతి లో కొత్త శక్తి ని నింపుతోంది.

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈసారి నాతో ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం ఇంతే. వచ్చే సారి కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఇది వర్ష కాలం. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత గా చూసుకోండి. సంతులిత ఆహారం తీసుకోండి. ఆరోగ్యం గా ఉండండి. అవును, యోగ ను తప్పక అభ్యసించండి. ఇప్పుడు చాలా పాఠశాలల్లో వేసవి సెలవు లు కూడా ముగుస్తున్నాయి. చివరి రోజు వరకు హోం వర్క్ పెండింగు లో ఉంచవద్దని పిల్లల కు కూడా చెప్తాను. పని ని పూర్తి చేయండి. నిశ్చింత గా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.

 

***



(Release ID: 1933243) Visitor Counter : 226