ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని కచ్‌లో ‘బిపోర్‌జోయ్’ తుపాను సన్నద్ధత చర్యలపై సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ


సన్నాహ కార్యక్రమాలు పరిశీలించడానికి భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి

ఆసుపత్రుల్లో అత్యవసర సన్నద్ధతను అంచనా వేసిన ఆరోగ్య మంత్రి మాండవీయ

కచ్‌లోని 108 అంబులెన్స్ డ్రైవర్లతో ముఖాముఖి మాట్లాడిన కేంద్ర మంత్రి

Posted On: 14 JUN 2023 4:02PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, ఈ రోజు, కచ్‌లో బిపోర్‌జోయ్‌ తుపాను సన్నద్ధత కార్యక్రమాలను సమీక్షించారు. "చాలా తీవ్ర తుపాను"గా మారిన బిపోర్‌జోయ్‌, ఇవాళ గుజరాత్‌ తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు.

 

 

భారత వైమానిక దళానికి చెందిన 'గరుడ' అత్యవసర స్పందన బృందం చేసిన సన్నాహాలను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ రోజు భుజ్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. "తుపాను వల్ల ప్రాణ & ఆస్తి నష్టం జరక్కుండా చూసేందుకు మన జవాన్లు పూర్తి సిద్ధంగా ఉన్నారు" అని సమీక్ష తర్వాత ఆయన వెల్లడించారు.

సమీక్ష తర్వాత, అత్యవసర సన్నద్ధతను అంచనా వేయడానికి భుజ్‌లోని కె.కె.పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని డా.మాండవీయ పరిశీలించారు. కచ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు, ఆ ప్రాంతంలోని ఇతర ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర చికిత్స పడకల అందుబాటుపైనా వివరాలు తెలుసుకున్నారు.

తుపాను తర్వాత, అవసరమైతే తక్షణమే అందుబాటులోకి వచ్చే ఆరోగ్య సౌకర్యాల సన్నాహాలను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించారు.

 

కచ్‌లోని 108 అంబులెన్స్‌ డ్రైవర్లతో డా.మాండవీయ ముఖాముఖి సంభాషించారు. "వారి ఉత్సాహం, మద్దతు విశ్వాసాన్ని పెంచింది" అని చెప్పారు.

 

"బిపోర్‌జోయ్‌ తీవ్ర తుపానును ఎదుర్కోవడానికి, గౌరవనీయ ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు  అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి" అని కేంద్ర ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారు.

****



(Release ID: 1932674) Visitor Counter : 102