ప్రధాన మంత్రి కార్యాలయం

ఢిల్లీ-కర్ణాటక సంఘ అమృత మహోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ‘‘బారిసు కన్నడ దిమ్ దిమవ’’ను ప్రారంభించిన ప్రధానమంత్రి


‘‘కర్ణాటక వాటా లేకుండా భారతదేశ గుర్తింపు, సాంప్రదాయాలు, స్ఫూర్తిని నిర్వచించడం అసాధ్యం’’

‘‘పురాతన కాలం నుంచి కర్ణాటక భారతదేశంలో హనుమాన్ పాత్ర పోషించింది’’

‘‘అయోధ్యలో ప్రారంభమై రామేశ్వరం చేరిన ఒక శకాన్ని మార్చివేసిన సంఘటన కూడా కర్ణాటక చేరిన తర్వాతనే బలం పుంజుకుంది’’

‘‘భగవాన్ బసవేశ్వర ‘అనుభవ మంటప’ ద్వారా చేసిన బోధనలు భారతదేశానికి కాంతి పుంజాన్ని చూపిస్తాయి’’

‘‘కర్ణాటక సాంప్రదాయాలు, సాంకేతికతకు మారుపేరైన భూమి. దానికి చారిత్రకమైన సంస్కృతి, ఆధునిక కృత్రిమ మేథ రెండు ఉన్నాయి’’

‘‘2009 నుంచి 2014 మధ్యన ఐదేళ్ల కాలంలో కర్ణాటకకు రూ.4 వేల కోట్ల విలువ గల రైల్వే ప్రాజెక్టులు వచ్చాయి. ఈ ఏడాది బడ్జెట్లో కర్ణాటకలోని రైల్వే మౌలిక వసతుల్లో రూ.7 వేల కోట్లు కేటాయించారు’’

‘‘కన్నడిగేతరుల్లో కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కర్ణాటక గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష వారిలో ఏర్పడింది. ఈ ఆకాంక్షను మరింతగా ఉపయోగించుకోవాలి’’

Posted On: 25 FEB 2023 7:55PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ‘బారిసు కన్నడ దిమ్ దిమవ’ సాంస్కృతికోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను కూడా ఆయన వీక్షించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  లో భాగంగా కర్ణాటక సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రను ప్రతిబింబించే ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సభకు హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ సముజ్వలమైన వారసత్వాన్ని ఢిల్లీ-కర్ణాటక సంఘం ముందుకు నడుపుతున్నదని అన్నారు. దేశం భారత  స్వాతంత్ర్య దినోత్సవ 75 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని అమృత్ మహోత్సవ్  నిర్వహించుకుంటున్న సమయంలోనే ఢిల్లీ-కర్ణాటక సంఘం 75వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం విశేషమని చెప్పారు. 75 సంవత్సరాల క్రితం నాటి సంఘటనలు విశ్లేషించుకున్నట్టయితే అజరామరమైన భారతదేశం ఆత్మను వీక్షించగలుగాతారని ఆయన తెలిపారు. ‘‘తొలి సంవత్సరాల్లో జాతిని పటిష్ఠం చేయడానికి ప్రజల కట్టుబాటుకు కర్ణాటక సంఘం ఏర్పాటు ఒక నిదర్శనం. నేడు అమృత కాలంలో కూడా అదే శక్తి, అంకితభావం కనిపిస్తున్నాయి’’ అన్నారు. కర్ణాటక సంఘం 75 సంవత్సరాల ప్రయాణంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరినీ ఆయన అభినందించారు.

‘‘కర్ణాటక వాటా లేకుండా భారతదేశ గుర్తింపు, సాంప్రదాయాలు, స్ఫూర్తిని నిర్వచించడం సాధ్యం కాదు’’ అని ప్రధానమంత్రి అన్నారు. ‘పురాణ కాలం’లో భగవాన్ హనుమాన్ పాత్రను ప్రస్తావిస్తూ భారతదేశ యానంలో కర్ణాటక కూడా అదే తరహా పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. అయోధ్యలో ప్రారంభమై రామేశ్వరం చేరిన ఒక శకాన్ని మార్చివేసిన సంఘటన కూడా కర్ణాటక చేరిన తర్వాతనే బలం పుంజుకుంది’’ అని చెప్పారు.

విదేశీ దురాక్రమణదారులు మధ్య యుగంలో భారతదేశంపై దండయాత్ర జరిపి సోమనాథ్ వంటి క్షేత్రాల్లో శివలింగాలను ధ్వంసం చేస్తున్న సమయంలో కూడా దేవర దసిమయ్య, మదర చెన్నయ్య, దోహార కక్కయ్య, భగవాన్ బసవేశ్వర వంటి పరిత్యాగులు తమ విశ్వాసానికి అనుగుణంగా ప్రజాబలం పొందగలిగారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. అదే విధంగా రాణి అబక్క, ఒనాక్ ఓబవ్వ, రాణి చెన్నమ్మ, క్రాంతివీర సంగోలి రాయన్న వంటి పోరాటయోధులు దీటుగా విదేశీ శక్తులను ఎదుర్కొన్నారని చెప్పారు. స్వాతంత్ర్యానంతరం సైతం కర్ణాటకకు చెందిన ప్రముఖులు దేశాన్ని ఉత్తేజపరుస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు.

కర్ణాటక ప్రజలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్  మంత్రంతోనే జీవిస్తున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. కవి కువెంపు ‘నాద గీతే’ గురించి మాట్లాడుతూ సర్వత్రా ప్రతిధ్వనించిన ఆ పాటలో జాతీయ భావాలను చక్కగా వ్యక్తీకరించారని చెప్పారు. ‘‘ఈ పాటలో భారత నాగరికత ప్రతిబింబించిందని;  కర్ణాటక పాత్ర, ప్రాధాన్యతను వివరించారు. ఈ పాట స్ఫూర్తిని మనం అర్ధం చేసుకుంటే మనకి అందులో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సారం కనిపిస్తుంది’ అన్నారు.

జి-20 వంటి ప్రపంచ స్థాయి సంస్థకు నాయకత్వం వహిస్తున్న సమయంలో కూడా భారతదేశం ప్రజాస్వామ్య మాతృక ఆదర్శాలను పాటిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. భగవాన్ బసవేశ్వర ‘అనుభవ మంటప’లో ప్రవచించిన ప్రజాస్వామిక సూత్రాలు, ప్రతినలను భారతదేశానికి ఒక కాంతికిరణంగా కనిపించాయని ఆయన చెప్పారు. లండన్ లో భగవాన్ బసవేశ్వర విగ్రహాన్ని, ఆయన పలు భాషల్లో చేసిన ప్రతినలను విడుదల చేసే అవకాశం తనకు కలగడం పట్ల ప్రధానమంత్రి ఆనందం ప్రకటించారు. ‘‘ కర్ణాటక ఆదర్శాలు, ప్రభావాలు అజరామరం అనేందుకు ఇది నిదర్శనం’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

‘‘కర్ణాటక సాంప్రదాయాలు, సాంకేతికతలకు పట్టుగొమ్మ వంటి భూమి. దానికి చారిత్రక  సంస్కృతితో పాటు ఆధునిక కృత్రిమ మేథ కూడా ఉంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. తాను ఈ రోజు ఉదయం జర్మన్  చాన్సరల్ ఒలోఫ్ షుల్జ్  తో సమావేశమైన విషయం ప్రస్తావిస్తూ రేపు ఆయన తదుపరి  కార్యక్రమం బెంగళూరులో ఉన్నదని చెప్పారు. అత్యంత ప్రధానమైన జి-20 సమావేశం కూడా బెంగళూరులోనే జరుగుతున్నదని ఆయన తెలిపారు. తాను ఏ అంతర్జాతీయ ప్రతినిధిని కలిసినా భారతదేశ ప్రాచీన, ఆధునిక  సంస్కృతి గురించి తెలియచేస్తానని ఆయన తెలియచేశారు. సాంప్రదాయం, సాంకేతికత నవభారత చిహ్నాలని ఆయన పునరుద్ఘాటించారు.  భారతదేశం అభివృద్ధి, వారసత్వం, పురోగతి, సాంప్రదాయాలను కలగలిపి పురోగమిస్తున్నదని ఆయన చెప్పారు. భారతదేశం ఒకపక్క పురాతన దేవాలయాలు, సాంస్కృతిక కేంద్రాలను పునరుద్ధరించుకుంటూనే డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ నాయకత్వం వహిస్తున్నదని ఆయన నొక్కి చెప్పారు. నేడు భారతదేశం అపహరణకు గురైన శతాబ్దాల నాటి కళాఖండాలను విదేశాల నుంచి వెనక్కి తెస్తున్నదని, అదే సమయంలో రికార్డు స్థాయిలో ఎఫ్ డిఐలను తెస్తున్నదన్నారు. ‘‘మనని అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే లక్ష్యంతో భారతదేశం నడుస్తున్న అభివృద్ధి బాట ఇదే’’ అని చెప్పారు.

‘‘నేడు కర్ణాటక అభివృద్ధి జాతి, కర్ణాటక ప్రభుత్వ ప్రాధాన్యత’’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. 2009-2014 సంవత్సరాల మధ్య కాలంలో కేంద్రం కర్ణాటకకు రూ.11 వేల కోట్లు ఇస్తే 2019-2023 సంవత్సరాల మధ్య కాలంలో రూ.30 వేల కోట్లు ఇచ్చింది. 2009-2014 సంవత్సరాల మధ్య కాలంలో కర్ణాటక రైల్వే ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తే  ఈ ఏడాది బడ్జెట్ లో కర్ణాటక రైల్వే మౌలిక వసతులకు రూ.7 వేల కోట్లు కేటాయించారు. అంతే కాదు, 2009-2014 సంవత్సరాల మధ్య కాలంలో జాతీయ రహదారుల కోసం కర్ణాటక రూ.6 వేల కోట్లు అందుకుంటే గత 9 సంవత్సరాల కాలంలో హైవేల కోసం ప్రతీ ఏడాది రూ.5 వేల కోట్లు అందుకుంటోంది’’ అని ప్రధానమంత్రి వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం కర్ణాటకకు చెందిన దీర్ఘకాలిక డిమాండు భద్ర ప్రాజెక్టును అమలుపరుస్తోందన్నారు. ఇవన్నీ కర్ణాటక  అభివృద్ధి గతిని మార్చేస్తున్నాయని ఆయన చెప్పారు.

ఢిల్లీ-కర్ణాటక సంఘం 75వ సంవత్సర వేడుకలు అభివృద్ధి, విజయాలు, జ్ఞానం వంటి ఎన్నో కీలక సంఘటనలను ముందుకు తెస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే 25 సంవత్సరాల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ఢిల్లీ-కర్ణాటక సంఘం రాబోయే 25 సంవత్సరాల అమృత కాలంలో తీసుకోవలసిన చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు. కన్నడ భాష, సమున్నతమైన సాహిత్యం  సౌందర్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ జ్ఞానం, కళలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కర్ణాటక భాష పాఠకులు చాలా ఎక్కువగా ఉంటారంటూ అందుకే ప్రచురణకర్తలు ఏ పుస్తకాన్ని అయినా కొన్ని వారాల వ్యవధిలోనే పునర్ముద్రించాల్సి వస్తూ ఉంటుందన్నారు.

కళారంగంలో కర్ణాటక సాధించిన అసాధారణ విజయాలను ప్రధానమంత్రి లోతుగా ప్రస్తావిస్తూ కంసాలే నుంచి కర్ణాటక సంగీతం వరకు;  భరతనాట్యం నుంచి యక్షగానం వరకు కర్ణాటక అటు సాంప్రదాయిక కళల్లోను, ప్రజాప్రాచుర్యం పొందిన కళల్లోను సమున్నతమైనదని అన్నారు. ప్రాచుర్యం పొందిన ఈ కళలను ముందుకు నడిపించడంలో కర్ణాటక సంఘం ప్రయత్నాలను ప్రశంసిస్తూ వాటిని తదుపరి స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు ఢిల్లీ కన్నడిగ కుటుంబాలతో పాటు కన్నడిగేతర కుటుంబాలను కూడా తీసుకురావలసిన అవసరం ఉన్నదన్నారు. కొన్ని చలనచిత్రాలు కన్నడ సంస్కృతికి కన్నడిగేతరుల్లో ప్రాచుర్యం తెచ్చాయని, కర్ణాటక గురించి మరింత తెలుసుకోవాలనే ఆకాంక్షను రగిలించాయని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ ఆకాంక్షను మరింతగా సానుకూలంగా వినియోగించుకోవలసిన అవసరం ఉంది’’ అని చెప్పారు. జాతీయ యుద్ధ స్మారకం, ప్రధానమంత్రి సంగ్రహాలయ, కర్తవ్య పథ్ లను సందర్శించాలని ఈ కార్యక్రమానికి హాజరవుతున్న కళాకారులు, పండితులను ఆయన సూచించారు.

‘‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’’ గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. కర్ణాటక భారత చిరుధాన్యాలు ‘‘శ్రీ ధాన్య’’కు ప్రధాన కేంద్రమని ఆయన చెప్పారు.  ‘‘శ్రీ అన్న రాగి కర్ణాటక సంస్కృతి, సామాజిక గుర్తింపులో భాగం’’ అని ప్రధానమంత్రి అన్నారు. యడ్యూరప్ప కాలం నుంచి కూడా కర్ణాటకలో ‘‘శ్రీ ధాన్య’’ను ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం జరిగిందని ఆయన చెప్పారు. యావద్దేశం కన్నడిగల బాటను అనుసరిస్తోందని, ‘‘శ్రీ అన్న’’ ముతక ధాన్యాల వినియోగం ప్రారంభించిందని తెలిపారు. యావత్  ప్రపంచం సైతం శ్రీ అన్న ప్రయోజనాలు గుర్తిస్తోందని, రాబోయే కాలంలో వాటి డిమాండు పెరుగుతుందని, తద్వారా కర్ణాటక రైతులు ప్రయోజనం పొందుతారని ఆయన చెప్పారు.

2047 సంవత్సరంలో దేశం స్వాతంత్ర్య శతవార్షికోత్సవాలకు చేరి, అభివృద్ధి చెందిన జాతిగా నిలిచే సమయానికి ఈ అమృత కాలంలో ఢిల్లీ కర్ణాటక సంఘం అందించిన సేవల గురించి కూడా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి అన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్  జోషి, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్  బొమ్మాయ్, ఆదిచుంచనగరి మఠం స్వామీజీ శ్రీ నిర్మలానందనాథ, వేడుకల సంఘం అధ్యక్షుడు శ్రీ సిటి రవి, ఢిల్లీ-కర్ణాటక సంఘం అధ్యక్షుడు శ్రీ సిఎం నాగరాజ, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

పూర్వాపరాలు

ప్రధానమంత్రి ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ విజన్ కు దీటుగా కర్ణాటక సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రను తెలియచేస్తూ ‘‘బారిసు కన్నడ దిమ్ దిమవ’’ సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఛత్రం కింద ఈ వేడుకలు నిర్వహించారు. నాట్యం, సంగీతం, కవితలు సహా కర్ణాటక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వందలాది కళాకారులకు అవకాశం లభించింది. 

 

 

***

DS/TS



(Release ID: 1902710) Visitor Counter : 175