ప్రధాన మంత్రి కార్యాలయం

"బాలల కోసం పీఎం కేర్స్" పథకం కింద మే 30న ప్రయోజనాలను విడుదల చేయనున్న ప్రధానమంత్రి

Posted On: 29 MAY 2022 11:47AM by PIB Hyderabad

"బాలల కోసం పీఎం కేర్స్" పథకం కింద ప్రయోజనాలను 2022 మే 30న ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రధాని బదిలీ చేస్తారు. అదే సమయంలో "బాలల కోసం పీఎం కేర్స్" పథకం పాస్ బుక్, ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డును కూడా బాలలకు అందజేస్తారు.

"బాలల కోసం పీఎం కేర్స్" పథకాన్ని 2021 మే 29న ప్రధానమంత్రి ప్రారంభించారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను లేదా చట్టబద్ధ సంరక్షకులను లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు చేయూతనిచ్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. కాగా, 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య అనాథలైన పిల్లలు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు. అటువంటి పిల్లలకు సమగ్ర సంరక్షణ, భద్రతతోపాటు భోజన, నివాస సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యం. తద్వారా ఉపకార వేతనం,  విద్యాభ్యాసం ద్వారా వారికి సాధికారత కల్పిస్తారు. ఆ విధంగా వారు తమ కాళ్లమీద తాము నిలబడగలిగే ఆత్మవిశ్వాసం ఇవ్వబడుతుంది. ఇందుకోసం వారికి 23 సంవత్సరాలు వచ్చేదాకా రూ.10 లక్షల నిధి సమకూరుస్తుంది. అంతేకాకుండా వారి శ్రేయస్సు కోసం ఆరోగ్య బీమా కూడా కల్పిస్తుంది. ఈ పథకం కింద బాలలు  పేర్లు నమోదు చేసుకోవడం కోసం pmcaresforchildren.in పోర్టల్ ఏర్పాటు చేయబడింది. ఇది ఏకగవాక్ష వ్యవస్థ కాగా.. బాలలకు ఆమోద ప్రక్రియ సహా  ఇతరత్రా సహకారం అందిస్తుంది.

         

 ***



(Release ID: 1829205) Visitor Counter : 223