ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

చిప్ రూపకల్పన, తయారీ రంగం పురోగతికి కట్టుబడి ఉన్నాం


సెమీకాన్ ఇండియా-2022 బెంగుళూరు సదస్సు

ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన..

రానున్న సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి,
నాయకత్వం భారతదేశానిదేనని స్పష్టీకరణ...


ఎలక్టానిక్స్, సెమీకండక్టర్ల రంగంలో
ప్రపంచ కేంద్రంగా
ఇండియాను తీర్చిదిద్దుతున్నాం.
జాగ్రత్తతో కూడిన ప్రణాళిక,..
భాగస్వామ్య వర్గాల సమీకృత కృషితో
కలలను సాకారం చేస్తాం-
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన..

స్టార్టప్ కంపెనీలే ప్రేరణగా దేశంలో
సాంకేతిక పరిజ్ఞాన నిర్మాణం, పురోగతి.-
కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన

బెంగుళూరులో చిప్ తయారీ పరిశ్రమకోసం
రూ. 1,800కోట్లమేర పెట్టుబడి ప్రతిపాదనలను
ప్రకటించిన అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థ.

Posted On: 29 APR 2022 5:21PM by PIB Hyderabad

   సెమీకండక్టర్ల వ్యవస్థకు సంబంధించి ప్రపంచ స్థాయి సమావేశంగా పేర్కొనదగిన  సెమీకాన్ ఇండియా సమ్మేళనం-2022ను  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కంప్యూటర్లు, స్మార్టు ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో, చిప్.ల రూపకల్పనలో, టెలికమ్యూనికేషన్ రంగంలో విరివిగా ఉపయోగపడే సెమీకండక్టర్లపై ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. సెమీ కండక్టర్ల తయారీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామర్థ్యాలను ప్రదర్శించేందుకు, ఇందుకు సంబంధించిన భాగస్వామ్య వర్గాల ప్రతినిధులను ఒకచోట కలిపేందుకు, ఈ రంగంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలపై చర్చించేందుకు, ఆవిష్కరణలపై ఆలోచనలను పంచుకునేందుకు ఈ సదస్సును రూపొందించారు. భారతదేశపు సెమీ కండక్టర్ల తయారీ వ్యవస్థకు ప్రేరణ, ప్రోత్సాహం కలిగించే లక్ష్యంతో ఈ ఫ్లాగ్ షిప్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో 2022 ఏప్రిల్ 29న మొదలైన ఈ సదస్సు మే నెల 1వరకూ జరుగుతుంది.

 

  సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సెమీకండక్టర్లు ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. “భారతదేశంలో ఉన్న వినియోగదారుల, నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ సిబ్బంది సంఖ్య దృష్ట్యా పరిశీలించినపుడు, సెమీకండక్టర్ల రంగంలో దేశం ప్రభావవంతమైన పాత్రను పోషించే అవకాశం కనిపిస్తోంది.  ఈ రంగంలో సామర్థ్యాలకు అవకాశాల గురించి మన ప్రభుత్వానికి అవగాహన ఉంది. ఎలక్ట్రానిక్ చిప్ నమూనా రూపకల్పన, తయారీ వ్యవస్థను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉంది. అత్యున్నత సాంకేతికత, అత్యున్నత నాణ్యత, అత్యున్నత విశ్వసనీయత- తదితర సూత్రాల ప్రాతిపదికపై ఈ సెమీకండక్టర్ల వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిజిటలీకరణ ప్రక్రియను అనుసరించిన పద్ధతిని బట్టే డిజిటల్ వ్యవస్థపై మన అవగాహనా ధోరణిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున చెల్లింపులకు కావలసిన ప్రభావవంతమైన మౌలిక వ్యవస్థగా యు.పి.ఐ. నిలిచింది. ప్రభుత్వ పరిపాలనా ప్రక్రియా రూపాలన్నింటినీ పరవర్తన చెందించేందుకు మనం డిజిట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఆరోగ్య, సంక్షేమ రంగాలనుంచి సాధికారత వరకూ అన్ని జీవన రంగాల్లోనూ ఈ పరిజ్ఞానాన్ని విరివిగా వాడుతున్నాం.  ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని, పారిశ్రామిక రంగాన్ని పరస్పరం మరింత చేరువ చేసేందుకు ఈ సదస్సు ఒక ముందడుగు, సాంకేతిక పరిజ్ఞానపు తదుపరి విప్లవంలో భారతదేశం అగ్రగామిగా నిలిచేలా చేసేందుకు అవసరమైన ఆలోచనలపై చర్చింది, తగిన విధానాలను రూపొందించేందుకు ఈ సదస్సను ఏర్పాటు చేశాం. ఈ తరుణంలో సులభతర వాణిజ్యం, సాధికారతా విధానాలు, పోస్టల్ జీవిత బీమా తదితర పథకాలకు ఆర్థికపరంగా మద్దతు ఇచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అలాగే,  ఈ రంగానికి దేశంవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అవసరమైన ప్రతిభను అందించేందుకు వీలుగా యువతకు నైపుణ్యాలు, తగిన శిక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం.

   భారతదేశంపు సెమీ కండక్టర్ల తయారీ పథకం కోసం 10 బిలియన్ల అమెరికన్ డాలర్లను మేం కేటాయించాం. దేశంలో చైతన్యవంతమైన సెమీ కండక్టర్ల సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసి, భవితవైపుగా భారతదేశాన్ని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాం.”

 

    ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటి పథకాలతో ఈ సదస్సు మమేకమైంది. భారతదేశపు సెమీకండక్టర్ల పథానికి (ఐ.ఎస్.ఎం.కు)  ప్రారంభ వేదికగా ఈ సదస్సు ఉపయోగపడబోతోంది. సెమీ కండక్టర్ల రంగంలో అగ్రరాజ్యంగా రూపుదిద్దుకోవాలన్న భారతదేశం ఆకాంక్షలను సాకారం చేసేందుకు సెమీ కండక్టర్ల రంగంలోని క్రియాశీలకమైన మేధావులందరినీ ఈ సదస్సు ద్వారా ఒక తాటిమీదకు తెచ్చారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు, భారతదేశపు సెమీకండక్టర్ల తయారీ వ్యూహానికి మరింత ఊపు తీసుకురానుంది. పరిశ్రమ ప్రగతి, కార్యాచరణపై భవిష్య ప్రణాళిక ఈ సదస్సులోనే రూపుదిద్దుకోనుంది.

   సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశం ప్రతిభావంతమైన సిబ్బందిని, ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయమైన సిబ్బందిని కలిగి ఉండటమే దేశం ప్రత్యేకతగా చెప్పవచ్చని అన్నారు. “ఎలక్ట్రానిక్ చిప్ రూపకల్పన, తయారీ రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా కృషి జరుగుతోంది. జాగరూకతతో కూడిన ప్రణాళిక, భాగస్వామ్య వర్గాల సమీకృత కృషి వంటివి మా కలల సాకారానికి తోడ్పడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల పరిశ్రమకు ప్రపంచస్థాయి కేంద్రంగా భారతదేశాన్ని రూపుదిద్దేందుకు భాగస్వామ్య వర్గాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ వస్తున్నాయి. సెమీ కండక్టర్ల పరిశ్రమకోసం సుశిక్ష్తులైన 85వేలమంది సిబ్బందిని సృష్టించేందుకు వీలు కలిగించే పాఠ్యాంశాల రూపకల్పన కోసం వివిధ విద్యాసంస్థలతో, ప్రపంచ స్థాయి సంస్థలతో మేం కలసి పనిచేస్తున్నాం. సెమీ కండక్టర్ల రంగం దీర్ఘకాల వృద్ధియే లక్ష్యంగా ఇకపై కూడా పరిశ్రమ వర్గాలతో మరింత సన్నిహితంగా పనిచేయగలమని మేం పునరుద్ఘాటిస్తున్నాం.“ అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

 

  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో ప్రపంచం యావత్తు అత్యంత ప్రతికూల పరిస్థితులను, గడ్డుకాలాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. ” వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఆంక్షలతో భారతదేశానికి 150 బిలియన్లనుంచి 2000 బిలియన్ డాలర్లవరకూ ఆర్థిక నష్టం వాటిల్లింది. అయినా, ఆర్థికంగా ఎన్ని విఘాతాలు ఎదురైనా మనం తిరిగి బలం పుంజుకున్నాం. సువిశాల విస్తీర్ణం, భారీ జనాభా కారణంగా, భారతదేశం ప్రతికూల పరిస్థితిని గట్టిగా ప్రతిఘటించింది. ప్రత్యేకించి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎంతో ముందంజ వేసింది. పౌరులకు ఆరోగ్యరక్షణ, ఆర్థిక మద్దతు, సంక్షేమ పథకాల అమలులో ఎంతో పురోగమించింది. బృహత్తరమైన ఈ కార్యక్రమ సాధనలో ప్రభావవంతమైన పరిపాలనా ప్రక్రియ, పటిష్టమైన విధానాలు కీలకపాత్ర పోషించాయి.

  వైరస్ మహమ్మారి విస్తృతి నేపథ్యంలో డిజిటలీకరణను అతివేగంగా చేపట్టవలసిన ఆవశ్యకతను మేం ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూనే వచ్చాం. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనడంలో మేం ప్రదర్శించిన ప్రతిఘటనను ప్రపంచం యావత్తూ అభినందించింది. ఈ రోజున, మా సాంకేతిక పరిజ్ఞాన ప్రతిభ ఎంత గొప్పదో ప్రపంచమే గుర్తించింది. మా స్టార్టప్ వ్యవస్థలో ఎన్నో భారీ స్థాయి స్టార్టప్ కంపెనీలు రూపుదిద్దుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. సెమీ కండక్టర్ల రూపకల్పన, తయారీ రంగం మా తదుపరి అభివృద్ధిలో ఎంతో కీలకమైన దశగా చెప్పవచ్చు. ఈ అభివృద్ధికి ప్రేరణ కలిగించే లక్ష్యంతో మేం ఎంతో ప్రణాళికబద్ధమైన రోడ్ మ్యాప్.ను అమలు చేస్తున్నాం. సానుకూల విధానాలు, పరిశ్రమతో సహకారం, సమీకృత కృషి వంటివి ఇందుకు దోహదపడ్డాయి. మనం కలసికట్టుగా కృషి చేస్తే, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న ప్రధానమంత్రి కలలను సాకారం చేయవచ్చు. సబ్ కా సాత్, సబ్ కా ప్రయాస్ నినాదం స్ఫూర్తితో ప్రధాని కలలను సాకారం చేయగలం.“ అని అన్నారు.

   సదస్సు ప్రారంభోత్సవానికి పారిశ్రామిక వర్గంనుంచి పెద్దసంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. దేశ విదేశాల్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్నారు. దేశాన్ని సెమీ కండక్టర్ల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ప్రదర్శించిన దార్శనికతను, తీసుకున్న చర్యలను పారిశ్రామిక వర్గ ప్రతినిధులంతా అభినందించారు.

   మైక్రాన్ టెక్నాలజీ సంస్థ ప్రెసిడెంట్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) సంజయ్ మెహ్రోత్రా మాట్లాడుతూ, స్వావలంబన లక్ష్యంగా ఆత్మనిర్భర భారత్ సాధనలో సెమీ కండక్టర్ల రంగం పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. పారిశ్రామిక వర్గం, విద్యా సంస్థలు, ప్రభుత్వం కలసికట్టుగా కృషిచేసినపుడే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు.

  ఇంటెల్ ఫౌండ్రీ సర్వీసెస్ సంస్థ ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ సదస్సులో ప్రధాన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వదేశీ సెమీ కండక్టర్ల రంగం నిర్వహించే కీలక పాత్రను పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక ప్రగతి, ఆర్థిక భద్రత కోసం ఈ రంగం తన కృషిని కొనసాగిస్తుందని అన్నారు. సెమీకండక్టర్లు అనేవి ఈ డిజిటల్ యుగాన్ని నడిపించే కొత్త ఇంధనం వంటివని అన్నారు. స్వదేశీ ఇంక్యుబేటర్లకు ప్రోత్సహం ఇవ్వడం, ప్రపంచ స్థాయి సంస్థలకు దేశంలో పెట్టుబడులకు అవకాశం ఇవ్వడం తదితర చర్యలతో దేశంలో రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞాన రంగం మరింత ప్రగతిని సాధించే సూచనలున్నాయని.అన్నారు. టెంటోరెంట్స్ సంస్థ సి.ఇ.ఒ. జిమ్ కెల్లర్ మాట్లాడుతూ, మన దైనందిన జీవితంలో విస్తరించిన సెమీకండక్టర్ల విస్తృత స్వభావాన్ని ప్రస్థావించారు.  వినియోగదారుల సంఖ్య, సమాచార పరిమాణం అత్యంత వేగంగా పెరుగుతున్నందున సెమీకండక్టర్ల వ్యవస్థ అవసరం క్రమంగా పెరుగతూ వస్తుందన్నారు.

    ఈ సమ్మేళనం సందర్భంగా పారిశ్రామిక రంగంతో తన భాగస్వామ్యాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేసుకుంది. కలలను సాకారం చేసుకునేందుకు, లక్ష్యాలను వాస్తవాలుగా మార్చుకునేందుకు భాగస్వామ్య వర్గాలతో కలసి పనిచేసేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. సదస్సు నేపథ్యంలో ఈ దిగువన పేర్కొన్న అవగాహనా ఒప్పందాలను (ఎం.ఒ.యు.లను) కుదుర్చుకున్నారు:

 

   భారతదేశంలో సెమీకండక్టర్ల వ్యవస్థను ప్రోత్సహించేందుకు సెమీ (ఎస్.ఇ.ఎం.ఐ.), ఎల్సినా (ఇ.సి.ఎల్.ఐ.ఎన్.ఎ.) మధ్య అవగాహనా ఒప్పందం.

 

  సెమీ కండక్టర్లలో భాగస్వామ్యం కోసం సి-డాక్ (సి.డి.ఎ.సి.) క్వాల్ కామ్ మధ్య అవగాహనా ఒప్పందం. పోస్టల్ జీవిత బీమా (పి.ఎల్.ఐ.) పథకానికి అనుగుణంగా సెమీకండక్టర్ల నమూనా రూపకల్పనకు సంబంధించిన స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేయడం లక్ష్యం

 

  అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎ.ఐ.సి.టి.ఇ.), సెమీ (ఎస్.ఇ.ఎం.ఐ.), ఐఎస్.ఎం. మధ్య అవగాహనా ఒప్పందం. సెమీకండక్టర్ల రంగంలో సాంకేతిక పరిజ్ఞాన సిబ్బందికి శిక్షణ, నైపుణ్యాలను అందించడం లక్ష్యం.

   

  ఈ సదస్సు సందర్భంగా ‘సెమీకండక్టర్ తయారీ సరఫరా వ్యవస్థ – ప్రపంచ మార్కెట్లో భారతదేశానికి అవకాశాలు” అన్న అంశంపై ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐ.ఇ.ఎస్.ఎ.) ఒక పారిశ్రామిక నివేదికను ఆవిష్కరించింది.

 

  ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రూపకల్పన, తయారీకి ప్రపంచ స్థాయి కేంద్రంగా భారతదేశాన్ని తయారుచేయాలన్న లక్ష్యాన్ని మరింత క్రియాశీలం చేసేందుకు ఈ సదసస్సును ఒక ప్రయోగ వేదికగా రూపొందించారు. సదస్సు తొలి రోజున సెమీ ప్రెసిడెంట్, సి.ఇ.ఒ. అజిత్ మనోచా ప్రసంగించారు. మిలియన్ల సంఖ్యలో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ చిప్స్.ను బిలియన్ల సంఖ్యలోకి పెంచడంలో భారతదేశం పురోగతిని గురించి మనోచా ప్రస్తావించారు.

   ఈ సదస్సు సందర్భంగా భారతదేశానికి ఐదు ప్రపంచ స్థాయి భారీ సెమీ కండక్టర్ల నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. దేశంలో సెమీకండక్టర్ల ఫ్యాబ్ సంస్థలను ఏర్పాటుకు సంబంధించి ఈ ప్రతిపాదనలు అందాయి. వినియోగ వస్తువులు, ఆటోమోటివ్ పరికరాలు, పర్సనల్ ఎలక్ట్రానిక్స్ తో సహా విభిన్న రకాలైన ఉత్పత్తుల్లో వాడే చిప్.ల తయారీకి సంబంధించి ఈ పెట్టుబడి ప్రతిపాదనలు మన దేశానికి అందాయి. ఇప్పటివరకూ గ్రీన్ ఫీల్డ్ సెమీ కండక్టర్ చిప్ తయారీ విభాగానికి సంబంధించి  20.5 బిలియన్ డాలర్ల మేరకు ప్రతిపాదనలు అందాయి.

   భారతదేశంలో దాదాపు రూ. 1,800కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, సెమీకండక్టర్ పరికరాల తయారీ సంస్థ అయిన అప్లయిడ్ మెటీరియల్స్ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి తయారీ యూనిట్.ను ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీ ఇప్పటికే బెంగుళూరులో స్థలాన్ని కూడా సేకరించింది.

  

   -భవిష్యత్తుకోసం సెమీకండక్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా భారతదేశానికి గల సామర్థ్యం, పురోగమనం- అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చా గోష్టిలో ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.  బరుణ్ దత్తా (ఐ.ఎం.ఇ.సి.), ఎరెజ్ ఇంబెర్మన్ (టవర్ సెమీకండక్టర్స్), రాజ్ కుమార్ (ఐ.జి.ఎస్.ఎస్. వెంచర్స్) రాజేశ్ నాయర్ (గ్లోబల్ ఫౌండ్రీస్) తదితరులు ఈ చర్చాగోష్టిలో పాల్గొన్నారు. సెమీ కండక్టర్ల రంగం ప్రగతిలో తదుపరి దశను చేరుకునేందుకు అవసరమైన సమీకృత కృషి గురించి చర్చలో పాల్గొన్న ప్రతినిధులంతా ప్రధానంగా ప్రస్తావించారు. భారీ స్థాయిలో ఇంజినీరింగ్ ప్రతిభకు అవకాశాలు కల్పించేందుకు తగిన ఆకర్షణీయ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల వ్యవస్థ ప్రగతికి తోడ్పడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.  ఈ సదస్సు సందర్భంగా ముఖ్యమైన చిప్, మైక్రో ప్రాసెసర్ తయారీ దార్లు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, నూతన యుగపు టెక్నాలజీ స్టార్టప్ కంపెనీల భాగస్వామ్యంతో ఒక ప్రదర్శనను (ఎగ్జిబిషన్.ను) కూడా నిర్వహించారు. -సెమీ కండక్టర్ల రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామర్థ్యం, కొత్త ఆవిష్కరణలకు భవష్యత్తులో అవకాశం- అన్న అంశంపై ఈ ఎగ్జిబిషన్ లో దృష్టిని కేంద్రీకరించారు.

 

***



(Release ID: 1821494) Visitor Counter : 189