ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రైవేట్ టీకా కేంద్రాల ద్వారా 18 ఏళ్ళ వయస్సు పైబడిన జనాభాకు 2022 ఏప్రిల్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్న - ముందస్తు జాగ్రత్త టీకా మోతాదు


అర్హులైన జనాభాకు మొదటి, రెండవ మోతాదు తో పాటు, ఆరోగ్య కార్యకర్తలు, ముందు వరుసలో సేవలందిస్తున్న కార్యకర్తలు, 60 ఏళ్ళ వయస్సు పైబడిన వృద్దులకు ముందస్తు జాగ్రత్త టీకా మోతాదు కోసం ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా మరింత వేగంగా కొనసాగుతున్న - ఉచిత టీకా కార్యక్రమం


దేశంలో 15 ఏళ్ళు పైబడిన మొత్తం జనాభా లో 96 శాతం మందికి కనీసం ఒక కోవిడ్-19 టీకా మోతాదు అందగా, 83 శాతం మంది రెండు మోతాదులు వేసుకున్నారు.

Posted On: 08 APR 2022 3:01PM by PIB Hyderabad

ప్రైవేట్ టీకా కేంద్రాల ద్వారా 18 ఏళ్ళ వయస్సు పైబడిన జనాభాకు కోవిడ్-19 ముందస్తు జాగ్రత్త టీకా మోతాదులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.  ప్రైవేట్ టీకా కేంద్రాల ద్వారా 18 ఏళ్ళ పైబడిన జనాభాకు ముందస్తు జాగ్రత్త మోతాదును అందించే కార్యక్రమం 2022 ఏప్రిల్, 10వ తేదీ (ఆదివారం) నుంచి ప్రారంభమవుతుంది.  18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, రెండవ మోతాదు టీకా వేసుకున్న తర్వాత 9 నెలలు పూర్తయిన వారందరూ ఈ ముందస్తు జాగ్రత్త టీకా మోతాదు వేసుకోడానికి అర్హులు.  ఈ సదుపాయం అన్ని ప్రైవేట్ టీకా కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.

 

ఇప్పటివరకు, దేశంలోని 15 ఏళ్ళు పైబడిన మొత్తం జనాభా లో 96 శాతం మందికి కనీసం ఒక కోవిడ్-19 టీకా మోతాదు అందగా, 83 శాతం మంది రెండు మోతాదులు వేసుకున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ముందు వరుసలో సేవలందిస్తున్న కార్యకర్తలతో పాటు 60 ఏళ్ళ వయస్సు పైబడిన  వృద్దులలో కూడా మొత్తం 2.4 కోట్ల కంటే ఎక్కువ మందికి ముందస్తు జాగ్రత్త మోతాదులు అందించడం జరిగింది.    12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారిలో 45 శాతం మంది కూడా మొదటి టీకా మోతాదును పొందారు.  అర్హులైన జనాభాకు మొదటి, రెండవ మోతాదు తో పాటు, ఆరోగ్య కార్యకర్తలు, ముందు వరుసలో సేవలందిస్తున్న కార్యకర్తలు, 60 ఏళ్ళ వయస్సు పైబడిన వృద్దులకు ముందస్తు జాగ్రత్త టీకా మోతాదు కోసం ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా కొనసాగుతున్న ఉచిత టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడం జరిగింది. 

 

*****



(Release ID: 1815121) Visitor Counter : 260