ప్రధాన మంత్రి కార్యాలయం

డెహ్రాడూన్‌లో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - ప్రధాన మంత్రి


“ఈ రోజు, భారతదేశం ఆధునిక మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది. భారతదేశ విధానం 'గతిశక్తి', రెండు లేదా మూడు రెట్లు వేగంగా పనిచేయడం."

“మన పర్వతాలు మన విశ్వాసం, మన సంస్కృతి యొక్క బలమైన కోటలు మాత్రమే కాదు, అవి మన దేశ భద్రతకు కూడా పటిష్టమైన కోటలు. ఆ పర్వతాలలో నివసించే ప్రజల జీవితాలను సులభతరం చేయడం దేశ ముఖ్య ప్రాధాన్యతల్లో ఒకటి”


''ఈ రోజు ప్రభుత్వం ఏ దేశ ఒత్తిడికి గురి కాదు. దేశమే ప్రధమం. ఎల్లప్పుడూ ప్రధమం. అనే మంత్రాన్ని అనుసరించే వ్యక్తులం మనం."


“మనం ఎలాంటి పథకాలు తీసుకువచ్చినా, వివక్ష లేకుండా అందరికీ అందిస్తాం. ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రాతిపదికగా కాకుండా, ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చాము. దేశాన్ని బలోపేతం చేయడమే మా విధానం”

Posted On: 04 DEC 2021 3:17PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ డెహ్రాడూన్‌లో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వాటిలో -  ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ (తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌ వే జంక్షన్ నుండి డెహ్రాడూన్ వరకు);   ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ నుండి హల్గోవా, సహరాన్‌పూర్ నుండి భద్రాబాద్, హరిద్వార్‌లను కలుపుతూ, గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్ ప్రాజెక్టు;  హరిద్వార్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు;  డెహ్రాడూన్ - పౌంటా సాహిబ్ (హిమాచల్ ప్రదేశ్) రహదారి ప్రాజెక్టు;  నజీబాబాద్-కోట్‌ ద్వార్ రహదారి విస్తరణ ప్రాజెక్టు;  లక్ష్మణ్  ఝులా పక్కన గంగా నదిపై వంతెన మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయి.   వీటితో పాటు - డెహ్రాడూన్‌ లోని చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ ప్రాజెక్టు;  డెహ్రాడూన్‌ లో నీటి సరఫరా, మురుగునీటి సరఫరా, రహదారుల వ్యవస్థ అభివృద్ధి;  శ్రీ బద్రీనాథ్ ధామ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు;  గంగోత్రి-యమునోత్రి ధామ్;  హరిద్వార్‌ లో ఒక వైద్య కళాశాల వంటి ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

 

ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న కొండచరియల సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడంపై దృష్టి సారించే ఏడు ప్రాజెక్టులను;  దేవప్రయాగ నుండి శ్రీకోట్ వరకు అదేవిధంగా  జాతీయ రహదారి ఎన్.హెచ్-58 పై బ్రహ్మపురి నుంచి కొడియాల వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు;   యమునా నదిపై నిర్మించిన 120 మెగా వాట్ల వ్యాసి జల విద్యుత్ ప్రాజెక్టు;  డెహ్రాడూన్‌ లో హిమాలయ సాంస్కృతిక కేంద్రం;  డెహ్రాడూన్‌లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లాబొరేటరీ (సుగంధ మొక్కల కేంద్రం) ప్రాజెక్టులను  ఆయన ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటైన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ కేవలం విశ్వాసానికి కేంద్రంగా మాత్రమే కాదు, కృషి, సంకల్పానికి కూడా ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.  అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన ‘డబుల్ ఇంజన్‌ ప్రభుత్వం’లో రాష్ట్రాభివృద్ధి అత్యంత ప్రధానమైనదని, ఆయన స్పష్టం చేశారు. ఈ శతాబ్దం ప్రారంభంలో, అటల్ జీ భారతదేశంలో అనుసంధానత పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన ఉద్ఘాటించారు.  అయితే, ఆ త‌ర్వాత దేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం కారణంగా, ఉత్త‌రాఖండ్ తో పాటు దేశంలో విలువైన స‌మ‌యం వృధా అయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఆయన తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, “ఆ 10 సంవత్సరాల కాలంలో దేశంలో మౌలిక సదుపాయాల పేరుతో కుంభకోణాలు, మోసాలు జరిగాయి.  దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు మేము రెండు రెట్లు ఎక్కువగా కష్టపడ్డాము, నేటికీ కష్టపడుతూనే ఉన్నాము." అని పేర్కొన్నారు.  మారిన వ్య‌వ‌హార శైలి గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ,  “ఈరోజు,  భారతదేశం ఆధునిక మౌలిక సదుపాయాలపై వంద లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది.  ఈ రోజు భారతదేశ విధానం ‘గతిశక్తి’, రెండు లేదా మూడు రెట్లు వేగంగా పని చేయడం." అని వివరించారు. 

 

అనుసంధానత వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, కేదార్‌నాథ్ దుర్ఘటనకు ముందు 2012 లో 5 లక్షల 70 వేల మంది దర్శనం చేసుకున్నారని చెప్పారు.  ఆ సమయంలో అది ఒక రికార్డు.  అయితే కరోనా పరిస్థితి ప్రారంభానికి ముందు, 2019 లో, కేదార్‌నాథ్‌ ను సందర్శించడానికి 10 లక్షలకు పైగా ప్రజలు వచ్చారు.  “కేదార్ ధామ్ పునర్నిర్మాణం - దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ను పెంచడంతో పాటు, అక్కడి ప్రజలకు ఉపాధి, స్వయం ఉపాధి కోసం అనేక అవకాశాలను కూడా అందించింది”, అని ఆయన పేర్కొన్నారు. 

 

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం పట్ల ప్రధానమంత్రి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఇది పూర్తి కాగానే, ఢిల్లీ నుండి డెహ్రాడూన్‌ కు ప్రయాణించడానికి పట్టే సమయం దాదాపు సగానికి తగ్గుతుంది." అని ఆయన తెలియజేశారు.  “మన పర్వతాలు మన విశ్వాసం, మన సంస్కృతి యొక్క బలమైన కోటలు మాత్రమే కాదు, అవి మన దేశ భద్రతకు కూడా కోటలు.  పర్వతాలలో నివసించే ప్రజల జీవనాన్ని సులభతరం చేయడం అనేది దేశ ముఖ్య ప్రాధాన్యతల్లో ఒకటి. అయితే, దురదృష్టవశాత్తు, దశాబ్దాలుగా ప్రభుత్వ అధికారంలో ఉన్న వారిలో, ఈ ఆలోచనా విధానం ఎక్కడా కనబడలేదు.” అని ఆయన పేర్కొన్నారు. 

 

2007 నుండి 2014 మధ్య, అభివృద్ధి వేగాన్ని ప్రధానమంత్రి పోల్చి చెబుతూ, ఈ ఏడేళ్ళ కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్‌ లో 288 కిలోమీటర్ల జాతీయ రహదారులను మాత్రమే నిర్మించిందని పేర్కొన్నారు.  కాగా,  ప్రస్తుత ప్రభుత్వం, గడచిన ఏడేళ్ల కాలంలో ఉత్తరాఖండ్‌లో 2 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారిని నిర్మించిందని ఆయన తెలియజేశారు. 

 

సరిహద్దు పర్వత ప్రాంతాల మౌలిక సదుపాయాలపై గత ప్రభుత్వాలు తీసుకోవలసినంత తీవ్రంగా శ్రద్ధ వహించలేదని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.  "సరిహద్దు వెంబడి రహదారులు, వంతెనలు నిర్మించాలి, వారు ఈ విషయమై దృష్టి పెట్టలేదు." అని ఆయన విమర్శించారు.  ఒకే ర్యాంకు, ఒకే పింఛను; ఆధునిక ఆయుధాలు; ఉగ్రవాదులకు తగిన విధంగా బుద్ది చెప్పడం వంటి కీలకమైన అంశాలపై వారు సక్రమంగా స్పందించక పోవడం ప్రతి స్థాయిలో సైన్యాన్ని నైతికంగా దెబ్బతీసిందని,  శ్రీ మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.  "ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రపంచంలో ఏ దేశం ఒత్తిడికి లోను కాదు.  దేశమే ప్రధమం. ఎల్లప్పుడూ ప్రధమం. అనే మంత్రాన్ని అనుసరించే వ్యక్తులం మనం", అని ఆయన స్పష్టం చెప్పారు. 

 

అభివృద్ది విధానాల్లో కేవలం ఒక కులం, ఒక మతం వంటి వివక్షతతో కూడిన రాజకీయాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి విమర్శించారు.  ప్రజలను బలంగా ఉండనివ్వకుండా, వారి అవసరాల కోసం ప్రభుత్వంపై ఆధారపడేలా చేసే వక్రబుద్ధి రాజకీయాలపై కూడా ఆయన దాడి చేశారు.  భిన్నమైన మార్గాన్ని అవలంబించిన తమ ప్రభుత్వ ఆలోచనను ప్రధానమంత్రి స్పష్టంగా వివరించారు.  “ఇది ఒక సంక్లిష్టమైన మార్గం, కష్టమైనదే కానీ,  ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించినది, ఇది దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినది.  అందరితో కలిసి - అందరి అభివృద్ధి - అనేదే ఆ విధానం.  మేము ఎలాంటి పథకాలు తీసుకువచ్చినా, తరతమ భేదం లేకుండా అందరి కోసం తీసుకువస్తామని చెప్పాము.  ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రాతిపదికగా చేసుకోకుండా ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చాము.  దేశాన్ని బలోపేతం చేయడమే మా విధానం”, అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

 

“అమృత్ కాల్ సమయంలో దేశ పురోగతి రెట్టించిన వేగంతో ముందుకు సాగుతోంది.  ఇది ఇప్పుడు ఆగదు , ఈ అవకాశాన్ని జార విడుచుకోదు, బదులుగా,  మేము మరింత విశ్వాసం, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతాము." అని, ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించే ముందు హామీ ఇచ్చారు. 

 

అనంతరం ఈ ఉద్వేగభరితమైన కవితతో ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు. 

 

जहाँ पवन बहे संकल्प लिए,

जहाँ पर्वत गर्व सिखाते हैं

जहाँ ऊँचे नीचे सब रस्ते

बस भक्ति के सुर में गाते हैं 

उस देव भूमि के ध्यान से ही
 
उस देव भूमि के ध्यान से ही
 
मैं सदा धन्य हो जाता हूँ 

है भाग्य मेरा

सौभाग्य मेरा

मैं तुमको शीश नवाता हूँ


तुम आँचल हो भारत माँ का

जीवन की धूप में छाँव हो तुम 

बस छूने से ही तर जाएँ 

सबसे पवित्र वो धरा हो तुम 

बस लिए समर्पण तन मन से 

मैं देव भूमि में आता हूँ 

मैं देव भूमि में आता हूँ 

है भाग्य मेरा 

सौभाग्य मेरा 

मैं तुमको शीश नवाता हूँ


जहाँ अंजुली में गंगा जल हो 

जहाँ हर एक मन बस निश्छल हो 

जहाँ गाँव गाँव में देश भक्त 

जहाँ नारी में सच्चा बल हो 

उस देवभूमि का आशीर्वाद लिए
 
मैं चलता जाता हूँ 

उस देवभूमि का आशीर्वाद 

मैं चलता जाता हूँ

है भाग्य मेरा

सौभाग्य मेरा

मैं तुमको शीश नवाता हूँ


मंडवे की रोटी 

हुड़के की थाप 

हर एक मन करता

शिवजी का जाप 

ऋषि मुनियों की है 

ये तपो भूमि 

कितने वीरों की 

ये जन्म भूमि 

मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ


***


DS/AK



(Release ID: 1778133) Visitor Counter : 151