ప్రధాన మంత్రి కార్యాలయం

జనజాతీయ గౌరవ దినోత్సవ మహా సమ్మేళనంలో జనజాతీయ సామాజిక సంక్షేమం కోసం పలు కీలక పథకాలను ప్రధానమంత్రి శ్రీకారం


మధ్యప్రదేశ్‌లో ‘రేషన్‌ ఆప్‌కే గ్రామ్‌’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని;

మధ్యప్రదేశ్‌ సికిల్‌ సెల్‌ మిషన్‌కు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం;

దేశవ్యాప్తంగా 50 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలకు ప్రధాని శంకుస్థాపన;

“స్వాతంత్ర్యానంతరం తొలిసారి దేశంలోని గిరిజన సమాజం కళలు..
సంస్కృతిసహా స్వాతంత్ర్య ఉద్యమం-జాతి నిర్మాణంలో వారి పాత్రను
గుర్తించి సగర్వంగా స్మరించుకుంటూ భారీస్థాయిలో గౌరవిస్తున్నాం”

“స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరులు, వీరనారుల స్ఫూర్తిదాయక గాథలను వెలుగులోకి తెచ్చి కొత్త తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనదే”

“బాబాసాహెబ్‌ పురందరే దేశం ముందుంచిన ఛత్రపతి శివాజీ
మహరాజ్‌ ఆదర్శాలు నిరంతరం మనకు ప్రేరణనిస్తాయి”

“నేడు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లోనూ
పేదలకు ఇళ్లు.. మరుగుదొడ్లు.. ఉచిత విద్యుత్.. గ్యాస్ కనెక్షన్లు..
పాఠశాల.. రహదారి.. ఉచిత చికిత్స వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి”

““గిరిజన.. గ్రామీణ సమాజాల్లో పనిచేస్తూ ప్రజా పద్మ
పురస్కారం పొందినవారే నిజమైన జాతిరత్నాలు””

Posted On: 15 NOV 2021 3:15PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జనజాతీయ గౌరవ దినోత్సవ మహా సమ్మేళనంలో భాగంగా జనజాతీయ సామాజిక వర్గం సంక్షేమం లక్ష్యంగా పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో ‘రేషన్ ఆప్కే గ్రామ్’ పథకానికీ ప్రధాని శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ‘మధ్యప్రదేశ్‌ సికిల్‌ సెల్‌ (ఎర్రరక్తకణ అవకరం) మిషన్‌’ను కూడా ఆయన ప్రారంభించారు. అటుపైన దేశవ్యాప్తంగా 50 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌, ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌సహా శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ ప్రహ్లాద్‌ ఎస్‌.పటేల్‌, శ్రీ ఫగ్గన్‌ సింగ్‌ కులస్థే, డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ కూడా పాల్గొన్నారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- భారత్‌ ఇవాళ తొలి జనజాతీయ గౌరవ దినోత్సవం నిర్వహించుకుంటున్నదని చెప్పారు. ఈ మేరకు “స్వాతంత్ర్యానంతరం తొలిసారి దేశంలోని గిరిజన సమాజం కళలు.. సంస్కృతిసహా స్వాతంత్ర్య ఉద్యమం-జాతి నిర్మాణంలో వారి పాత్రను గుర్తించి సగర్వంగా స్మరించుకుంటూ భారీస్థాయిలో గౌరవిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. గిరిజన సమాజంతో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ- వారి ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన సుసంపన్నత గురించి ప్రస్తావించారు. గిరిజన సంస్కృతిలో వారి పాటలు, నృత్యాలన్నటిలోనూ ఒక జీవితకాలపు పాఠాలు అంతర్లీనంగా ఉంటాయని, ఆ మేరకు అవి మనకెంతో బోధిస్తాయని ప్రధాని వివరించారు.

   స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరులు, వీరనారుల స్ఫూర్తిదాయక గాథలను వెలుగులోకి తెచ్చి కొత్త తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనదేనని ప్రధానమంత్రి అన్నారు. మన దేశం బానిసత్వపు సంకెళ్లలో నలుగుతున్న సమయాన విదేశీ పాలనపై ఖాసీ-గారో ఉద్యమం, మిజో ఉద్యమం, కోల్‌ ఉద్యమం వంటి అనేక పోరాటాలు సాగాయని గుర్తుచేశారు. “గోండు మహారాణి వీర దుర్గావతి సాహసం… లేదా రాణి కమలాపతి నిరుపమాన త్యాగాలను దేశం ఎన్నటికీ మరువలేదు. అలాగే వీరులైన భిల్లులు భుజంభుజం కలిపి ఎన్నో త్యాగాలు చేశారు… అలాంటి వీరుల తోడ్పాటులేని వీర మహారాణా ప్రతాప్‌ పోరాట స్ఫూర్తిని కూడా  ఊహించలేం” అని ప్రధానమంత్రి వివరించారు.

   దేవిధంగా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను భవిష్యత్తరాలతో సంధానించడంలో శివసాహిర్‌ బాబాసాహెబ్‌ పురందరే పోషించిన పాత్ర సదా స్మరణీయమని ప్రధానమంత్రి అన్నారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రసిద్ధ చరిత్రకారుడు ఇవాళ ఉదయం కన్నుమూసిన నేపథ్యంలో ప్రధాని ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. “బాబాసాహెబ్‌ పురందరే దేశం ముందుంచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శాలు నిరంతరం మనకు ప్రేరణనిస్తాయి. బాబాసాహెబ్‌ పురందరే గారికి నేను హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “జాతి నిర్మాణంలో గిరిజన సమాజం పోషించిన పాత్ర గురించి మనమివాళ జాతీయ వేదికలపై చర్చిస్తుంటే కొందరు ఆశ్చర్యపోతున్నారు. భారతదేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో గిరిజన సమాజం ఎంతగా కృషిచేసిందో అటువంటివారు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు” అన్నారు. గిరిజన సమాజం పాత్ర గురించి ఇంతవరకూ ఎవరూ దేశప్రజలకు చెప్పకపోవడం… చెప్పినా అది అత్యంత పరిమిత సమాచారం మాత్రమే కావడం అందుకు కారణమని పేర్కొన్నారు. “స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలపాటు దేశాన్ని పాలించినవారు తమ స్వార్థ రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినందువల్లే ఇలా జరిగింది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అయితే, నేడు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, ఉచిత విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు, పాఠశాల, రహదారి, ఉచిత చికిత్స వంటి అన్ని సౌకర్యాలూ  లభిస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు.

   న్ని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రగతికాముక జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. సంపద, వనరులపరంగా దేశంలోని గిరిజన ప్రాంతాలు సదా సుసంపన్నమైనవని ఆయన వ్యాఖ్యానించారు. కానీ,  “గతంలో ప్రభుత్వాలను నడిపినవారు ఈ ప్రాంతాలను దోచుకునే విధానాన్ని అనుసరించారు. దీనికి భిన్నంగా మేము ఈ ప్రాంతాల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునే విధానాన్ని అనుసరిస్తున్నాం” అని ప్రధాని చెప్పారు. అటవీ చట్టాలను మార్చడం ద్వారా గిరిజన సమాజానికి అటవీ సంపద ఏ విధంగా అందుబాటులోకి వచ్చిందీ ఆయన విశదీకరించారు.

   టీవల పద్మ అవార్డుల ప్రదాన వేడుక నిర్వహించిన సంగతిని ప్రధాని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గిరిజన సమాజం నుంచి అవార్డు స్వీకరించేందుకు రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న  వారిని చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందన్నారు. గిరిజన, గ్రామీణ సమాజాల్లో తమదైన కృషి కొనసాగిస్తున్నవారే దేశానికి నిజమైన జాతిరత్నాలని కొనియాడారు. నేడు గిరిజన కళాకారుల ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభిస్తోందని, ఇంతకుముందు అడవులలో పండించే 8 లేదా 10 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లభించేదని, ఇవాళ 90కి మించి అటవీ ఉత్పత్తులకు ‘ఎంఎస్‌పి’ ఇవ్వబడిందని గుర్తుచేశారు. అలాగే ఇటువంటి జిల్లాలకు 150కిపైగా వైద్య కళాశాలలు మంజూరు చేయబడినట్లు తెలిపారు. వీటితోపాటు 2500కి మించి వన్‌ధన్‌ వికాస్ కేంద్రాలతో 37 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు సంధానించబడి ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా 7 లక్షల ఉద్యోగాల సృష్టికి వీలు కల్పిస్తూ 20 లక్షల భూమి ‘పట్టాలు’ ఇవ్వబడ్డాయన్నారు. అదేవిధంగా గిరిజన యువతకు నైపుణ్య కల్పన, విద్యపై ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతోందని తెలిపారు. గడచిన 7 సంవత్సరాల్లో 9 కొత్త గిరిజన పరిశోధన సంస్థలు అదనంగా జోడించబడ్డాయన్నారు. నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యమివ్వడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందని ప్రధానమంత్రి అన్నారు.

***

DS/AK



(Release ID: 1772153) Visitor Counter : 165