ఆర్థిక మంత్రిత్వ శాఖ
సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశం కానున్న కేంద్ర ఆర్థిక మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2021 4:25PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 15 నవంబర్ 2021 సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు, ముఖ్య కార్యదర్శులు మరియు ఆర్థిక కార్యదర్శులు కూడా సదస్సులో పాల్గొంటారు.
కోవిడ్-19 సమస్యతో దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. అయితే, అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత ఆర్థిక రంగం పుంజుకుని అభివృద్ధి పధంలో పయనిస్తోంది. ఆర్థిక రంగం పుంజుకుని అభివృద్ధి సాదిస్తున్నదని చెప్పడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అనేక ఆర్థిక సూచీలు కోవిడ్ ముందునాటి స్థాయికి చేరుకున్నాయి. భారతదేశ ఆర్థిక రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. దేశ జీడీపీ పెరుగుదల 9.5%గా ఉంటుందని ప్రపంచ ద్రవ్య నిధి, 8.3%గా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేశాయి.
పెట్టుబడుల రంగ పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంది. పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో $64 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. విదేశీ మూలధన పెట్టుబడుల వేగం పుంజుకునేలా చేయాలన్న లక్ష్యంతో 2021-22 బడ్జెట్ లో వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించి, విధానాలను క్రమబద్ధీకరించడానికి, సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను ప్రకటించింది.
దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి అవసరమైన పరిస్థితిని కల్పించడానికి అమలు చేయాల్సిన చర్యలపై అభిప్రాయాలను సేకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయించారు. పరస్పర సహకారంతో దేశ ఆర్థిక రంగ అభివృద్ధికి కృషి చేయాలన్న ఆలోచనతో కేంద్ర మంత్రి ఉన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానం, సులభతర వాణిజ్యం, వేగంగా అనుమతులు జారీ చేయడం, స్థానిక సంస్థల స్థాయి వరకు సాధించిన ప్రగతి వల్ల పెట్టుబడులను మరింత ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం కలుగుతుంది.
సోమవారం జరిగే సమావేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అమలు చేయాల్సిన చర్యలపై రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్వీకరిస్తారు. వీటి ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన కార్యాచరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది.
(రిలీజ్ ఐడి: 1771248)
సందర్శకుల సూచీ సంఖ్య : : 177