ప్రధాన మంత్రి కార్యాలయం

గోవా కు చెందిన హెచ్ సిడ‌బ్ల్యుఎస్, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం ల‌బ్ధిదారుల‌ తో మాటామంతీ లో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం పాఠం

Posted On: 18 SEP 2021 2:04PM by PIB Hyderabad

గోవా కు చెందిన శక్తివంతుడు, ప్ర‌జాద‌ర‌ణ గ‌ల ముఖ్య‌మంత్రి శ్రీ ప్ర‌మోద్ సావంత్ గారు, కేంద్ర మంత్రివర్గం లో నా స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ గారు, కేంద్ర ప్ర‌భుత్వం లో మంత్రిమండ‌లి లో నా స‌హ‌చ‌రురాలు డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ గారు, గోవా కు చెందిన అందరు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు, అందరు క‌రోనా యోధులు, సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా!

 

గోయచ్చా మ్హాజా భావా బహిణీనో, తుమ్ చే అభినందన్.

శ్రీ గ‌ణేశ్ పండుగ సందర్భం లో మీ అందరి కి శుభాకాంక్ష‌లు! రేపు అనంత్ చ‌తుర్ద‌శి మంగళప్రద సందర్భం లో మ‌నం అందరం బ‌ప్పా కు వీడ్కోలు పలుకుతాం, చేతుల‌ కు అనంత సూత్రాన్ని కూడా క‌ట్టుకొంటాం. అనంత్ సూత్రం అంటే జీవితం లో సుఖ సంవృద్ధి, దీర్ఘాయుష్షు కు ఆశీస్సు లు ఉంటాయి అని అర్థం.

ఈ ప‌విత్ర దినాని కన్నా ముందే గోవా ప్ర‌జానీకం వారి చేతుల కు భుజానికి జీవన రక్ష సూత్రాన్ని, అదేనండి, టీకా ను ఇప్పించుకొనే పని ని పూర్తి చేసేసుకోవడం నాకు సంతోషాన్ని ఇస్తున్నది. గోవా లో అర్హ‌త క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రి కి టీకా మందు తాలూకు ఒక డోసు వేయడమైంది. క‌రోనా కు వ్యతిరేకం గా పోరాటం లో ఇది చాలా పెద్ద విషయం సుమా. దీనికి గాను గోవా లోని ప్ర‌జ‌లు అంద‌రి కి చాలా చాలా శుభాకాంక్ష‌లు.

సహచరులారా,

భార‌త‌దేశం వివిధత్వం లోని శక్తి దర్శనం అయ్యేటటువంటి రాష్ట్రం గోవా. ప్రాచ్య‌, పాశ్చాత్య ప్రాంతాల‌ కు చెందిన సంస్కృతులు, జీవ‌న ప్ర‌మాణాలు,అన్నపానాదులు, ఇక్క‌డ ఒకే చోటు లో క‌నుపిస్తూ ఉంటాయి. ఇక్క‌డ గ‌ణేశోత్స‌వాన్ని జరుపుతారు, దీపావ‌ళి ని కూడా సంబురం గా నిర్వ‌హించుకొంటారు. మరి క్రిస్ మస్ కాలం లో అయితే గోవా ప్రకాశం మరింత ఇనుమడిస్తుంది. ఇలా చేస్తూ గోవా తన సంప్ర‌దాయాన్ని సైతం పాటిస్తుంది. ఏక్ భార‌త్, శ్రేష్ఠ భార‌త్ భావన ను నిరంతరం పటిష్టపరచే గోవా సాధించే ప్ర‌తి ఒక్క కార్యసిద్ధి కేవలం నాకు ఒక్కడికే కాదు, యావత్తు దేశాని కి ఆనందాన్ని ఇస్తుంది, గ‌ర్వ‌ంతో నింపివేస్తుంది.

 

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

ఈ ఘనమైనటువంటి సమయం లో నాకు నా స్నేహితుడు, సిసలైన క‌ర్మ‌యోగి స్వ‌ర్గీయ మ‌నోహ‌ర్ పర్రిక‌ర్ గారు గుర్తు కు రావ‌డం స‌హ‌జం. 100 సంవ‌త్స‌రాల లో అతి పెద్దదైన సంక్షోభం నుంచి గోవా ఏ విధం గా అయితే పోరాడిందో పర్రికర్ గారు గనక ఇవాళ మన మధ్య ఉండి ఉంటే అప్పుడు వారికి కూడాను మీ ఈ విజ‌యాని కి గాను మీ ఈ కార్యసాధన కు గాను చాలా గ‌ర్వ‌ం గా ఉండేది.

 

గోవా, ప్ర‌పంచం లో అత్యంత భారీది, అన్నింటి కంటే వేగం గా కొనసాగుతున్న టీకాకరణ ఉద్యమం అయినటువంటి సబ్ కో వ్యాక్సీన్, ముఫ్త్ వ్యాక్సీన్ (అందరికీ టీకామందు, ఉచితం గా టీకామందు) సఫలత లో ప్ర‌ముఖ పాత్ర ను పోషించింది. గ‌త కొద్ది నెల‌ల తో గోవా భారీ వ‌ర్షాల ను, తుపాను ను, వ‌ర‌ద‌ వంటి ప్రాకృతిక విపత్తుల‌ తో కూడా ను చాలా ధైర్యం తో పోరాటాన్ని సలిపింది. ఈ ప్రాకృతిక సవాళ్ల ను శ్రీ ప్ర‌మోద్ సావంత్ గారి నాయ‌క‌త్వం లో ఎంతో సాహ‌సోపేతం గా ఎదుర్కొంది. ఇటువంటి ప్రాకృతిక సవాళ్ల మ‌ధ్య క‌రోనా టీకాలను ఇప్పించే కార్యక్రమం జోరు ను కొన‌సాగించినందుకు గాను క‌రోనా పోరాట యోధుల కు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల కు, టీమ్ గోవా లో ప్ర‌తి ఒక్క‌రి కి చాలా చాలా అభినంద‌న‌ లు తెలియ‌జేస్తున్నాను.

 రోజు న అనేక మంది స‌హ‌చ‌రులు నాకు వెల్లడించిన అనుభ‌వాలు వింటూ ఉంటే ఈ టీకా కార్యక్రమం ఎంత కష్టమైందో స్పష్టం అయింది. న‌దుల‌ ను దాటుకొంటూ, టీకా మందు ను భద్రం గా కాపాడుతూ, దూర- దూర‌ ప్రాంతాల‌ కు చేరుకోవడం కోసం కర్తవ్య భావన అవసరపడుతుంది. సమాజం ప‌ట్ల భక్తి అవసరపడుతుంది, ఇంకా సాటి లేనటువంటి సాహసం అవసరపడుతుంది. మీరంద‌రు ఎలాంటి విరామమూ లేకుండా , అలసట ఎరుగక మాన‌వాళి కి సేవ‌లను అందిస్తున్నారు. మీ సేవ‌ల ను ఎప్ప‌టికీ ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది.

సహచరులారా,

గోవా ప్ర‌భుత్వం, పౌరులు, క‌రోనా పోరాట యోధులు, ముందువ‌రుస‌ లో నిలబడి పోరాడే కార్య‌క‌ర్త‌ లు స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్ ఎంత అద్భుత‌మైన విజ‌యాన్ని అందిస్తుందో నిరూపించారు. సామాజిక‌, భౌగోళిక స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డం లో వారు చూపిన స‌మ‌న్వ‌యం ప్ర‌శంస‌నీయం. ప్ర‌మోద్ గారూ, మీకు, మీ జట్టు కు అభినంద‌న‌ లు. రాష్ట్రం లోని సుదూర ప్రాంతాలు, స‌బ్ డివిజ‌న్ లలోనూ త్వ‌రితం గా టీకాకరణ ను పూర్తి చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

గోవా వేగం మంద‌గించ‌కుడా చూసినందుకు నాకు చాలా ఆనందం గా ఉంది. ఇప్పుడు ఈ క్ష‌ణం లో కూడా రాష్ట్రం లో రెండో డోసు కోసం టీకా పండుగ కొన‌సాగాలి అని మ‌నం కోరుకొంటున్నాం. ఈ అద్భుత కృషితోనే గోవా టీకాకరణ లో దేశం లోనే అగ్ర‌గామి గా నిలువ‌గ‌లిగింది. గోవా రాష్ట్ర జ‌నాభా కు మాత్ర‌మే కాదు, ప‌ర్యట‌కుల కు, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన కార్మికుల‌ కు కూడా టీకా ను ఇప్పించడం మ‌రింత ప్ర‌ధానాంశం.

సహచరులారా,

దేశం లోని వైద్యులు, వైద్య సిబ్బంది, పాల‌నయంత్రాంగం లోని ప్ర‌తి ఒక్క‌రి కి ఈ సంద‌ర్భం లో ప్ర‌శంస‌ల ను అందించాల‌నుకొంటున్నాను. మీ అంద‌రి కృషి ఫ‌లితంగానే భార‌త‌ నిన్న ఒక్క రోజులోనే 2.5 కోట్ల కు పైబ‌డిన వ్యాక్సీన్ లను అందించి, రికార్డు ను న‌మోదు చేసింది. సంప‌న్న‌మైన‌, శ‌క్తివంత‌మైనవి గా చెప్పుకొనే దేశాలు దీనిని సాధించ‌ లేక‌పోయాయి. కోవిడ్ డాష్ బోర్డు ను ఎంత‌గా అనుస‌రించి, టీకాల కార్య‌క్ర‌మం లో పెరుగుతున్న భాగ‌స్వామ్యం తో ఉత్సుక‌త అనుభ‌విస్తున్నదో మ‌నం నిన్న చూశాం.

నిన్న ప్ర‌తి ఒక్క గంట‌ కు 15 ల‌క్ష‌ల‌ కు పైబ‌డి, ప్ర‌తి నిముషం 26 వేల‌ కు పైబ‌డి, ప్ర‌తి ఒక్క సెక‌ను కు 425 మంది వంతు న ప్ర‌జ‌ల‌ కు టీకామందు ను ఇప్పించారు. దేశం లోని ప్ర‌తి ఒక్క భాగం లో విస్త‌రించిన ల‌క్ష‌ కు పైగా టీకాకరణ కేంద్రాలు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాయి. భార‌త‌దేశాని కి చెందిన సొంత టీకా లు, టీకాకరణ కేంద్రాల అతి పెద్ద నెట్ వ‌ర్క్, నిపుణులైన‌ మాన‌వ వ‌న‌రులు మ‌న‌ సామ‌ర్థ్యాన్ని ప్ర‌పంచానికి ప్ర‌ద‌ర్శించి చూపారు.

సహచరులారా,

నిన్న మ‌నం సాధించిన విజ‌యం కేవ‌లం గ‌ణాంకాలు అనే కాక, భార‌త‌దేశం సామ‌ర్థ్యం ఏమిటో ప్ర‌పంచం గ్రహించేటట్టు చేసిన ఘ‌న‌త‌ కూడాను. ప్ర‌తి ఒక్క భార‌తీయుని విధినిర్వ‌హ‌ణ‌ కు నిద‌ర్శ‌నం.

సహచరులారా,

ఈ రోజు నేను నా మ‌న‌సు ను కూడా ఆవిష్క‌రిస్తున్నాను. ఎన్నో పుట్టిన‌ రోజులు వ‌స్తాయి, పోతాయి...కాని నేను ఎప్పుడూ వేడుక‌ల‌ కు దూరం గా ఉంటాను. అయితే ఈ వ‌య‌స్సు లో నిన్న నాకు ఒక భావోద్వేగం ఏర్ప‌డింది. జన్మ దిన వేడుక‌ల ను నిర్వ‌హించుకొనేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. ప్ర‌జ‌లు కూడా ఎన్నో విధాలు గా ఆ వేడుక‌ల ను జరుపుకొంటారు. నేను అలాంటి వేడుక‌ల ను త‌ప్పు ప‌ట్టే వ్య‌క్తి ని కాదు. కానీ మీ అంద‌రి కృషి ఫ‌లితం గా నిన్నటి రోజు నా జీవితం లో అత్యంత విశేష‌మైన రోజు గా మారిపోయింది.

వ్యాక్సినేష‌న్ రికార్డు విజ‌యం కూడా గ‌త ఏడాదిన్న‌ర‌, రెండేళ్లు గా త‌మ ప్రాణాల‌ ను కూడా లెక్క చేయ‌కుండా రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తూ క‌రోనా పై పోరాటం లో దేశ ప్ర‌జ‌ల‌కు స‌హాయ‌ప‌డిన వైద్య రంగం లోని వారికే ద‌క్కుతుంది. ఈ గెలుపు నకు ప్ర‌తి ఒక్క‌రు ఎంతో సేవ అందించారు. ప్ర‌జ‌లు కూడా సేవాభావం తో దీనిలో పాల్గొన్నారు. వారంద‌రి ద‌యాగుణం, విధినిర్వ‌హ‌ణ ప‌ట్ల క‌ట్టుబాటు తోనే ఒక్క రోజు లో 2.5 కోట్ల వ్యాక్సినేష‌న్ రికార్డు సాధ్య‌ం అయింది.

ప్ర‌తి ఒక్క వ్యాక్సిన్ డోసు ఒక జీవితాన్ని కాపాడుతుంది అని నేను న‌మ్ముతున్నాను. ఇంత త‌క్కువ స‌మ‌యం లో 2.5 కోట్ల మంది పైగా ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం గొప్ప సంతృప్తి ని అందిస్తుంది. అందుకే నిన్నటి జ‌న్మ‌దినం ఒక మ‌ర‌పురాని రోజు గా నా హృద‌యాన్ని తాకింది. ఇందుకు ఎన్ని ధ‌న్య‌వాదాలు తెలిపినా త‌క్కువే. ప్ర‌తి ఒక్క దేశ‌వాసి కి నేను హృద‌య‌పూర్వ‌కంగా అభివాదం చేస్తూ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

భార‌త‌దేశ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఆరోగ్యానికే కాదు, జీవ‌నోపాధి కి కూడా ర‌క్ష‌ణ క‌వ‌చం. హిమాచ‌ల్ కూడా తొలి డోసు లో 100 శాతం వ్యాక్సినేష‌న్ ల‌క్ష్యాన్ని సాధించింది. అదే విధంగా గోవా, చండీగ‌ఢ్‌, ల‌క్ష దీవుల్లో కూడా అర్హ‌త గ‌ల ప్ర‌తి ఒక్క‌రి కి తొలి డోసు వ్యాక్సినేశన్ అందింది. త్వ‌ర‌లో తొలి వ్యాక్సిన్ డోస్ విష‌యం లో సిక్కిమ్ 100 శాతం క‌వ‌రేజి ల‌క్ష్యాన్ని సాధించ‌బోతోంది. అండ‌మాన్- నికోబార్‌, కేర‌ళ‌, ల‌ద్దాఖ్‌, ఉత్త‌రాఖండ్‌, దాద్ రా న‌గ‌ర్ హ‌వేలి లు కూడా ఈ విజ‌యానికి ఎంతో దూరం లో లేవు.

సహచరులారా,

దీనికి పెద్ద‌గా ప్ర‌చారం జ‌ర‌గ‌క‌పోయినా ప‌ర్యాట‌క రంగం తో అధికం గా అనుసంధాన‌మైన రాష్ట్రాల లో టీకాకరణ కు భార‌తదేశం ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చింది. రాజ‌కీయం అవుతుంద‌న్న ఆలోచ‌న‌ తో మేం మొద‌ట్లో ఈ విష‌యం చెప్ప‌లేదు. మ‌న టూరిజం ప్రాంతాలు త్వ‌ర‌గా తెరచుకోవాలి అంటే ఇది ప్ర‌ధానమైన విషయం. ఈ రోజు ఉత్త‌రాఖండ్ లో చార్ ధామ్ యాత్ర కూడా సాధ్య‌మ‌వుతోంది. ఇన్ని ప్ర‌య‌త్నాల మ‌ధ్య గోవా సాధించిన 100 శాతం టీకాకరణ కు కూడా ప్రాధాన్యం ఉంది.

పర్యటన రంగం పున‌రుజ్జీవం లో గోవా పాత్ర కీల‌కం. హోట‌ల్ ప‌రిశ్ర‌మ ఉద్యోగులు, టాక్సీ డ్రైవ‌ర్ లు, హాక‌ర్ లు, దుకాణ‌దారులు ప్ర‌తి ఒక్క‌రు టీకామందు ను ఇప్పించుకొన్నట్లు అయితే ప‌ర్యట‌కులు కూడా భ‌ద్ర‌త భావం తో ఇక్క‌డ‌ కు రాగలుగుతారు. ప్ర‌జ‌ల‌ కు టీకామందు ర‌క్ష‌ణ ఉన్న ప్ర‌పంచం లోని అతి కొద్ది అంత‌ర్జాతీయ ప‌ర్యట‌క గ‌మ్యాల్లో ఇప్పుడు గోవా కూడా చేరింది.

సహచరులారా,

గ‌తం లో వ‌లెనే ఇక్క‌డ ప‌ర్యట‌క కార్య‌క‌లాపాలు ప్రారంభం కావాల‌ని మేం కోరుకొంటున్నాం. రాబోయే టూరిజమ్ సీజ‌న్ లో ప్ర‌పంచం ఇక్క‌డ‌ కు త‌ర‌లివ‌చ్చి ఆనందిస్తుంది. సంపూర్ణ‌ టీకాకరణ తో పాటు కరోనా కు సంబంధించిన అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల ను తీసుకొన్న‌ప్పుడే ఇది సాధ్య‌పడుతుంది. ప్ర‌స్తుతం సంక్రమణ త‌గ్గుముఖం ప‌ట్టింది, కానీ మ‌నం వైర‌స్ ను తేలిక గా తీసుకో కూడ‌దు. భ‌ద్ర‌త‌ పై, ఆరోగ్యరక్షణ పై ఎంత ఎక్కువ‌ గా దృష్టి సారిస్తే అంత ఎక్కువ మంది ప‌ర్యట‌కులు ఇక్క‌డ‌ కు తరలివస్తారు.

సహచరులారా,

విదేశీ ప‌ర్యట‌కుల‌ ను ప్రోత్స‌హించ‌డానికి ఇటీవ‌ల కేంద్ర‌ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌ల ను తీసుకొంది. దేశాన్ని సంద‌ర్శించే 5 ల‌క్ష‌ల మంది ప‌ర్యట‌కుల‌ కు ఉచిత వీజాల ను ఇవ్వాలి అని భార‌తదేశం నిర్ణ‌యించింది. ప‌ర్యట‌న, ర‌వాణా రంగాల‌ తో సంబంధం ఉన్న వారంద‌రికీ 100 శాతం ప్ర‌భుత్వ పూచీకత్తు తో 10 ల‌క్ష‌ల రూపాయల రుణాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది. రిజిస్టర్ అయినటువంటి టూరిస్ట్ గైడ్ ల‌కు ఒక ల‌క్ష రూపాయల రుణాన్ని ఇవ్వడం జరుగుతున్నది. దేశం లోని ప‌ర్యట‌న రంగం త్వ‌రిత పురోగ‌తి కి స‌హాయ‌ప‌డే ప్ర‌తి ఒక్క చ‌ర్య ను తీసుకోవాల‌నే క‌ట్టుబాటు తో ప్రభుత్వం ఉంది.

మిత్రులారా,

గోవా లో పర్యటన రంగాన్ని ఆక‌ర్ష‌ణీయం గా మలచడానికి, అక్కడి రైతుల కు, మ‌త్స్య‌కారులకు, ఇత‌రుల ప్ర‌యోజ‌నం కలిగించడం కోసం మౌలిక సదుపాయాల డబల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క రెట్టింపు శ‌క్తి లభిస్తున్నది. ప్రత్యేకించి గోవా లో క‌నెక్టివిటీ తో ముడిపడ్డ మౌలిక‌ సదుపాయాల రంగం మీద గోవా ఇదివరకు ఎన్నడు ఎరుగనంత స్థాయి లో పని జ‌రుగుతోంది. మోపా లో నిర్మాణం అవుతున్న కొత్త విమానాశ్ర‌యం రాబోయే కొద్ది నెల‌ల్లోనే సిద్ధం కానుంది. ఈ విమానాశ్ర‌యాన్ని జాతీయ ర‌హ‌దారి తో కలపడం కోసం 12,000 కోట్ల రూపాయల ఖర్చు తో ఆరు దోవ ల ఆధునిక కనెక్టింగ్ హైవే ను నిర్మించ‌డం జరుగుతున్నది. కేవలం నేశనల్ హైవే నిర్మాణానికే గత సంవ‌త్స‌రాల లో గోవా లో వేల కొద్దీ కోట్ల రూపాయ‌ల పెట్టుబడి పెట్టడమైంది.

ఉత్త‌ర గోవా ను ద‌క్షిణ గోవా తో జతపరచడం కోసం ఝురీ వంతెన ను కూడా రాబోయే కొద్ది నెల‌ల్లో ప్రారంభం కానుండ‌డం ఎంతో ఆనంద‌క‌ర‌మైన అంశం. మీ అంద‌రికీ తెలిసిన‌ట్టుగానే, ఈ వంతెన ప‌ణజీ ని మార్గో తో క‌లుపుతుంది. గోవా విముక్తి సంగ్రామం తాలూకు అపూర్వ గాథ కు సాక్షి గా ఉన్న అగౌడా కోట ను సైతం త్వ‌ర‌లోనే ప్రజానీకం కోసం మళ్లీ తెర‌వ‌డం జరుగుతుంది అని నాకు చెప్పారు.

సోద‌ర సోద‌రీమ‌ణులారా,

మ‌నోహ‌ర్ పర్రిక‌ర్ గారు వదలి వెళ్లిన‌ గోవా అభివృద్ధి ని డాక్ట‌ర్ ప్ర‌మోద్ గారు, ఆయ‌న బృందం పూర్తి అంకిత భావం తో ముందుకు తీసుకు పోతున్నారు. స్వాతంత్ర్య దినోత్స‌వం వెలుగుల్లో దేశం స‌రికొత్త‌ స్వ‌యం స‌ంవృద్ధి సంక‌ల్పం తో ముందుకు పోతున్న స‌మ‌యం లో గోవా కూడా స్వ‌యంపూర్ణ గోవాప్ర‌తినను పూనింది. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్, స్వ‌యంపూర్ణ గోవా తాలూకు ఈ సంక‌ల్పం లో భాగం గా 50 కి పైగా కంపోనెంట్స్ నిర్మాణ పనులు మొదలయ్యాయి అని నాకు చెప్పారు. జాతీయ ల‌క్ష్యాలను సాధించేందుకు, యువ‌త‌ కోసం ఉపాధి తాలూకు కొత్త అవ‌కాశాలను క‌ల్పించేందుకు గోవా ఎంత గంభీరం గా ప్ర‌య‌త్నిస్తున్నదీ ఇది సూచిస్తున్నది.

సహచరులారా,

ఈ రోజు టీకాకరణ ఒక్క విషయం లోనే కాదు, అభివృద్ధి కొల‌మానాల లో కూడా దేశం లో అగ్ర‌గామి రాష్ట్రాల లో ఒక‌టి గా గోవా నిలచింది. గోవా లోని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల‌న్నీ సంపూర్ణం గా బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హిత ప్ర‌దేశాలు కానున్నాయి. విద్యుత్తు, నీరు వంటి క‌నీస సౌకర్యాల విష‌యం లోనూ సంతృప్తిక‌రమైనటువంటి కృషి జ‌రిగింది. దేశం లో 100 శాతం విద్యుతీక‌ర‌ణ జ‌రిగిన ఏకైక రాష్ట్రం గోవా. ఇళ్ల‌ కు నల్లా నీటి సరఫరా విష‌యం లో కూడా గోవా అద్భుతాల ను సాధించింది. గ్రామీణ గోవా లో ప్ర‌తి ఇంటి కి నల్లా నీటి ని అందించేందుకు జ‌రిగిన కృషి అమోఘం. జ‌ల్ జీవ‌న్ మిశన్ లో భాగం గా గ‌త రెండేళ్ల లో దేశం లో 5 కోట్ల కుటుంబాల‌ కు పైప్ డ్ వాట‌ర్ స‌దుపాయం క‌ల్పించ‌డం జ‌రిగింది. గోవా సాధిస్తున్న పురోగ‌తి ని చూస్తుంటే స‌త్ప‌రిపాల‌నకు‌, “జీవ‌న స‌ర‌ళ‌తకు గోవా ప్ర‌భుత్వం ప్రాధాన్య‌ాన్ని ఇస్తున్నది అనే విష‌యం స్ప‌ష్టం అవుతోంది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా,

క‌రోనా క‌ష్ట‌కాలం లో గోవా ప్ర‌భుత్వం స‌త్ప‌రిపాల‌న‌ కు క‌ట్టుబాటు ను ప్ర‌ద‌ర్శించింది. ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతున్నప్పటికీ గోవా బృందం కేంద్ర‌ ప్ర‌భుత్వం పంపిన స‌హాయాన్ని ఎలాంటి వివ‌క్ష లేకుండా ప్ర‌తి ఒక్క‌రి కి అంద‌జేసింది. నిరుపేద‌ల కు, రైతుల కు, మ‌త్స్య‌కారుల‌ కు స‌హాయాన్ని అందించ‌డంలో వెనుకాడ‌ లేదు. నెల‌ల త‌ర‌బ‌డి సంపూర్ణమైనటువంటి చిత్త‌శుద్ధి తో పేద కుటుంబాల‌ కు ఉచిత రేష‌ను ను అందించడమైంది. ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ లు అందడం తో గోవా లోని అనేక సోద‌రీమ‌ణులకు క‌ష్ట‌ కాలం లో ఊర‌ట లభించింది.

గోవా లోని రైతు కుటుంబాల కు పిఎమ్ కిసాన్ స‌మ్మాన్ నిధి ద్వారా కోట్లాది రూపాయ‌లు నేరు గా బ్యాంకు ఖాతాల లోకి జమ అయ్యాయి. క‌రోనా స‌మ‌యం లో కూడా చిన్న‌త‌ర‌హా రైతులంద‌రూ ఉద్య‌మ స్ఫూర్తి తో కిసాన్ క్రెడిట్ కార్డుల ను అందుకొన్నారు. అంతే కాదు, గోవా లో అధిక సంఖ్య‌ లో రైతుల కు, మ‌త్స్య‌కారుల కు తొలి సారి కిసాన్ క్రెడిట్ కార్డు స‌దుపాయం అందింది. పిఎమ్ స్వ‌నిధి యోజ‌న లో భాగం గా గోవా లోని వీధి వ్యాపారులంద‌రికీ రుణాలు అందించే పని జరుగుతున్నది. ఈ ప్ర‌య‌త్నాల‌న్నిటి కారణం గా గోవా వాసుల కు వ‌ర‌ద‌ ల కాలం లో కూడా ను ఎంతో స‌హాయ‌ం లభించింది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా,

గోవా అప‌రిమిత అవ‌కాశాల గ‌డ్డ. గోవా దేశం లోని ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అది బ్రాండ్ ఇండియా కు బ‌ల‌మైన గుర్తింపుగా కూడా ఉంది. గోవా పోషిస్తున్నటువంటి ఈ పాత్ర‌ ను మ‌రింత‌ విస్త‌రించ‌వ‌ల‌సిన బాధ్య‌త మ‌న అంద‌రి మీద ఉంది. గోవా లో ఈ రోజు న జ‌రుగుతున్నటువంటి మంచి కృషి నిరంతరం గా కొన‌సాగ‌డం ఎంతో అవ‌సరం. దీర్ఘ విరామం త‌రువాత గోవా కు రాజ‌కీయ స్థిర‌త్వం, స‌త్ప‌రిపాల‌న ల ప్ర‌యోజ‌నాలు అందుతున్నాయి.

ఈ విషయం లో గోవా ప్ర‌జ‌లు ఇదే స్ఫూర్తి ని కొన‌సాగిస్తార‌ని ఆకాంక్షిస్తూ మీ అంద‌రి కి మ‌రో సారి చాలా చాలా అభినంద‌న‌ లు. ప్ర‌మోద్ గారి కి, ఆయ‌న బృందాని కి శుభాకాంక్ష లు.

సగల్యాంక్ దేవ్ బరేం కరూఁ.

ధ‌న్య‌వాదాలు.

అస్వీకరణ : ఇది ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగాని కి రమారమి అనువాదం. సిసలు ప్రసంగం హిందీ భాష లో ఉంది.

 

 

***



(Release ID: 1756362) Visitor Counter : 182