సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన.
దేశంలోని సుదూర కొండ ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిన పథకమని అభిప్రాయ పడ్డ నిపుణులు.
పిఎంజెడివై ఏడవ వార్షికోత్సవ సందర్భంగా పిఐబి గౌహతి ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహణ.
Posted On:
02 SEP 2021 3:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 2014లో ప్రారంభమైంది. అప్పుడే ఆర్ధికపరమైన సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమనే కార్యక్రమం మొదలైందని స్టేట్ బ్యాంక్ డిజిఎం సుషాంత కుమార్ సాహూ అన్నారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్ లో ఆయన మాట్లాడారు. గౌహతిలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడారు.
సామాన్య ప్రజలకు అందే ఆర్ధిక సేవల గురించి వివరంగా మాట్లాడిన శ్రీ సాహూ ఆర్ధిక సేవల పరిధిలోకి అందరినీ తీసుకురావడమనేది దేశంలో ఆర్ధికంగా వెనకబడినవర్గాలకు సంబంధించి విశ్వసనీయమైన ఆర్ధిక పరిష్కారంగా వుంటుందని అన్నారు. ఆర్ధిక రంగ ఉత్పత్తులైన క్రెడిట్, పెట్టుబడులు, బీమా, పింఛన్లు అనే వాటిద్వారా సామాన్య ప్రజలకు సేవలందించడం జరుగుతుందని అన్నారు. అస్సాంలో పిఎంజె డి వై పథకం ద్వారా రికార్డు స్థాయిలో బ్యాంకు అకౌంట్లు తెరిచినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో యాభై లక్షల నివాసగృహాలకుగాను ఈ ఏడాది జూన్ నాటికి ఒక కోటీ 90 లక్షల పిఎంజెడివై అకౌంట్లున్నట్టు ఆయన చెప్పారు. ఆయన తన ప్రసంగంలో పీఎం జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల విజయాలను వివరించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన భాగస్వాములందరూ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ తమ స్థాయిల్లో సరైన పద్ధతిలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలకు ఈ పథకం అందుబాటులోకి వచ్చేలా పని చేయాలని అప్పుడే ఈ ఉద్యమం విజయవంతంగా కొనసాగుతుందని శ్రీ సాహూ అన్నారు.
స్టేట్ బ్యాంకు డిజిఎం, కొలకత్తాకు చెందిన శ్రీమతి కుహు గంగూలీ మాట్లాడుతూ ఇంతవరకూ సిక్కిం రాష్ట్రంలో 86 వేల జన్ ధన్ అకౌంట్లను ప్రారంభించారని అన్నారు. ఈ పథకం ప్రయోజనాల గురించి మాట్లాడుతూ జన్ ధన్ యోజన పథకం దేశంలోని కొండ ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిందని, సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.
పిఎంజెడివై గురించి సిక్కిం కేంద్రీయ విశ్వవిద్యాలయ వాణిజ్య శాస్త్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ ఎస్. ఎస్ . మహాపాత్ర మాట్లాడారు. అందరికీ ఆర్ధిక సేవలు, ఆర్ధిక అభివృద్ధి గురించి ఆయన వివరంగా మాట్లాడారు. ఏడు సంవత్సరాల్లోనే దేశంలో అనేక మార్పులు వచ్చాయని, అందరినీ ఆర్ధిక సేవల పరిధిలోకి తెచ్చే వ్యవస్థ బలోపేతమైందని, అత్యంత పేదవారికి కూడా ఆర్ధిక సేవలందుతున్నాయని అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆత్మనిర్భర్ ప్యాకేజీ అమలు చేయడం జరిగిందని..అప్పుడు జన్ ధన్ పథకం ద్వారానే ఆయా సంక్షేమ పథకాలు లబ్ధిదారుల అకౌంట్లలోకి వెళ్లాయని అన్నారు.
పిఎంజెడివై కారణంగా దేశంలోని వెనకవడిన వర్గాలకు చెందిన ప్రజలు చాలా సులువుగా బ్యాంక అకౌంట్ ప్రారంభిస్తున్నారని దైనిక్ పూర్వోదయ్ ఎడిటర్ శ్రీ రవిశంకర్ రవి అన్నారు. బ్యాంకుల్లో అకౌంట్ ప్రారంభించాలంటే సమస్యలు ఎదుర్కొనేవారందరికీ ఈ పథకం కింద ఆ సమస్యలు పరిష్కారమయ్యాయని వారికి అకౌంట్లు ప్రారంభమయ్యాయని అన్నారు.
పిఐబికి చెందిన మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి శ్రీ గోపాజిత్ దాస్ స్వాగతోపన్యాసం ఇచ్చారు. గౌహతి పిఐబి మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి శ్రీమతి సుచరితా సాహూ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన ప్రతినిదులు, పిఐబి ఫీల్డ్ ఆఫీసు అధికారులు, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో అధికారులు ఈ వెబినార్లో పాల్గొన్నారు.
***
(Release ID: 1751903)
Visitor Counter : 159