పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

డ్రోన్ల వినియోగంపై నిబంధనలు సడలింపు!


2021 డ్రోన్ రూల్స్ వెలువరించిన పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ

Posted On: 26 AUG 2021 12:01PM by PIB Hyderabad

  మానవ రహిత విమాన వ్యవస్థకు (యు.ఎ.ఎస్.కు) సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2021 మార్చిలో నిబంధనలను వెలువరించింది. ఈ నిబంధనలు మరీ ఎక్కువ ఆంక్షలతో కూడుకుని ఉన్నాయని వివిధ సంస్థలు, స్టార్టప్ కంపెనీలు, ఇతర వినియోగదారులు భావించారు. ప్రతి అంశానికీ పేపర్లు సమర్పించడం, డ్రోన్లను వినియోగించిన ప్రతిసారీ అనుమతులు తప్పనిసరిగా పొందవలసిరావడం వంటి ఆంక్షలు ఉన్నాయని, డ్రోన్లను “స్వేచ్ఛగా ఎగురవేయగలిగే” గ్రీన్ జోన్లు చాలా తక్కువగా ఉన్నాయని ఆయా స్టార్టప్ కంపెనీలు, సంస్థలు అభిప్రాయపడ్డాయి. తమకు అందిన ఈ అభిప్రాయాలను ప్రాతిపదికగా చేసుకుని, 2021 సంవత్సరపు యు.ఎ.ఎస్. నిబంధనలను రద్దు చేయాలని, వాటి స్థానంలో సరళీకరించిన డ్రోన్ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  మానవ రహిత విమాన వ్యవస్థను (యు.ఎ.ఎస్.ను) మన సాధారణ భాషలో డ్రోన్లుగా వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవస్థతో ముడివడిన చాలా రంగాలకు ఈ డ్రోన్లు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి. వ్యవసాయం, గనుల తవ్వకం, మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందనా వ్యవస్థలు, రవాణా, జియో స్పేషియల్ మ్యాపింగ్, రక్షణ రంగం, పోలీసు విభాగం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో విస్తృత ప్రయోజనాలు అందుతున్నాయి. ఉపాధి కల్పన, ఆర్థిక ప్రగతి విషయాల్లో కూడా డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.  వినియోగ సౌలభ్యం బాగా పెరిగిన దృష్ట్యా, ప్రత్యేకించి మారు మూల ప్రాంతాలు, దుర్గమమైన ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగంతో ఎక్కువ ప్రయోజనాలు లభిస్తున్నాయి. సృజనాత్మక రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.), ఇంజినీరింగ్, గృహోపయోగ పరమైన అవసరాల్లోను డ్రోన్లకు గల సంప్రదాయపరమైన ఆవశ్యతకతను పరిశీలించినపుడు, 2030 కల్లా ప్రపంచ స్థాయి డ్రోన్ల కేంద్రంగా భారతదేశం రూపుదాల్చగలదని, అలాంటి శక్తి సామర్థ్యాలు దేశానికి ఉన్నాయని చెప్పవచ్చు.

2021వ సంవత్సపు డ్రోన్ నిబంధనలు- 30 కీలకాంశాలు

విశ్వాసబద్ధమైన హామీ, స్వీయ యోగ్యతా నిర్ధారణ, పరిమిత పర్యవేక్షణ ప్రాతిపదికలుగా ఈ నిబంధనలు రూపొందాయి.

  1. భద్రత, రక్షణపరమైన అంశాల సమతుల్యతను పాటిస్తూనే, సాధారణ స్థాయిని మించిన అగ్రశ్రేణి ప్రగతి యుగాన్ని సృష్టించేందుకే ఈ నిబంధనలు రూపొందించారు.  
  2. అనేక ముందస్తు ఆమోద ప్రక్రియలను రద్దు చేశారు.: విశిష్ట అధీకృత సంఖ్య, విశిష్ట ప్రొటోటైప్ గుర్తింపు సంఖ్య, తయారీ సర్టిఫికెట్, ఎగురవేసే అర్హతా నిర్ధారణ పత్రం, నిబంధనల అనుసరణ సర్టిఫికెట్, నిర్వహణా సర్టిఫికెట్, దిగుమతి సర్టిఫికెట్, ఉనికిలో ఉన్న డ్రోన్లకు ఆమోదం సర్టిఫికెట్, ఆపరేటర్ పర్మిట్, పరిశోధనా అభివృద్ధి సంస్థనుంచి అధీకృత పత్రం, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్, రిమోట్ పైలట్ ఇన్.స్ట్రక్టర్ అధీకృత సర్టిఫికెట్, డ్రోన్ పోర్ట్ ఆథరైజేషన్ పత్రం వంటి వాటిని రద్దు చేశారు.
  3. వివిధ పత్రాల సంఖ్య 25నుంచి 5కు తగ్గించారు.
  4. ఫీజుల సంఖ్య 72నుంచి 5కు తగ్గించారు.
  5. ఫీజు పరిమాణం సాధారణ స్థాయికి తగ్గింది. డ్రోన్ సైజుతో సంబంధం లేకుండా ఈ ఫీజును నిర్ణయించారు. ఉదాహరణకు,..రిమోట్ పైలట్ లైసెన్స్ ఫీజును (పెద్దసైజు డ్రోన్.కు) రూ. 3,000నుంచి, వంద రూపాయలకు తగ్గించారు. అన్ని సైజుల, రకాల డ్రోన్లకు ఇదే ఫీజును వర్తింపజేశారు. ఈ ఫీజు పదేళ్ల పాటు చెల్లుబాటవుతుంది.
  6. వినియోగదారులకు ప్రయోజనకరమైన రీతిలో ఉండే సింగిల్ విండో వ్యవస్థగా డిజిటల్ స్కై ఫ్లాట్ ఫాంను అభివృద్ధి చేస్తారు. ఇందులో మానవ ప్రమేయం కనీస స్థాయిలో మాత్రమే ఉంటుంది. చాలా వరకు అనుమతులను ఎవరికి వారు సొంతంగా పొందవచ్చు.
  7. ఈ నిబంధనలను వెలువరించిన 30 రోజుల్లోగా, గ్రీన్, యెల్లో, రెడ్ జోన్లను సూచిస్తూ ప్రతిస్పందిత గగనతల రేఖా చిత్రాన్ని డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారంపై ప్రదర్శిస్తారు.
  8. గ్రీన్ జోన్ పరిధిలో డ్రోన్లను వినియోగించేందుకు ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. గ్రీన్ జోన్ అంటే, భూ ఉపరితలంనుంచి 400 అడుగులు, లేదా 120 మీటర్లవరకూ ఎత్తువరకూ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని గగనతల రేఖా చిత్రంలో రెడ్ జోన్.గా గానీ, యెల్లో జోన్.గా గానీ సూచించరు.; ఇక భూ ఉపరితలంపైనుంచి 200 అడుగులు, 60 మీటర్ల ఎత్తువరకూ ఉన్న ప్రాంతంలో, అలాగే విమానాశ్రయం పరిధిలో 8నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతులు అవసరం లేదు. 
  9.  విమానాశ్రయ పరిధిలో,..యెల్లో జోన్ గా పరిగణించే ప్రాంతం ఎత్తును 45 కిలోమీటర్లనుంచి 12 కిలోమీటర్లకు తగ్గించారు.
  10. సూక్ష్మతరహా (మైక్రో) డ్రోన్లు, నానో డ్రోన్ల వినియోగానికి సంబంధించి రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం లేదు. (అయితే, డ్రోన్ వినియోగం వాణిజ్యేతర ప్రయోజనాలకోసమై ఉండాలి).  
  11. ఏదైనా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ జారీ ప్రక్రియకు ముందు భద్రతా పరమైన అనుమతి పొందాల్సిన అవసరం లేదు.
  12. పరిశోధన, అభివృద్ధి సంస్థల తరఫున పనిచేసే డ్రోన్లను గ్రీన్ జోన్ పరిధిలోని తమ సొంత, అద్దె ఆవరణల్లో వినియోగిస్తున్న పక్షంలో అలాంటి వాటికి టైప్ సర్టిఫికెట్, విభిన్న గుర్తింపు సంఖ్య, రిమోట్ పైలట్ లైసెన్స్ వంటివి అవసరం లేదు.
  13. ఇండియన్ డ్రోన్ కంపెనీల్లో విదేశీ యాజమాన్యంపై ఎలాంటి ఆంక్షలు లేవు.
  14. డ్రోన్ల ఎగుమతి ప్రక్రియను విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ (డి.జి.ఎఫ్.టి.) నియంత్రించవలసి ఉంటుంది.
  15. దిగుమతి ప్రక్రియకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డి.జి.సి.ఎ.) అనుమతి ఉండాలనే నిబంధనను రద్దు చేశారు.
  16. 2021వ సంవత్సరపు నిబంధనల ప్రకారం డోన్ల కవరేజీని 300 కేజీలనుంచి 500 కేజీలకు పెంచారు. ఇది డ్రోన్ టాక్సిస్.కు కూడా వర్తిస్తుంది.
  17. డ్రోన్ శిక్షణకు సంబంధించిన అవసరాలను డి.జి.సి.ఎ. నిర్ణయిస్తుంది. డ్రోన్ స్కూళ్లను పర్యవేక్షిస్తుంది. డ్రోన్ పైలట్ లైసెన్స్.ను అన్.లైన్ ద్వారా అందిస్తుంది.
  18. అధీకృత డ్రోన్ స్కూలునుంచి డిజిటల్ స్కై ప్లాట్.ఫాం ద్వారా రిమోట్ పైలట్ సర్టిఫికెట్ అందిన 15 రోజుల వ్యవధిలోగా సదరు లైసెన్సును డి.జి.సి.ఎ. జారీ చేస్తుంది.
  19. టైప్ సర్టిఫికెట్.ను జారీ చేసేందుకుగాను,.. డ్రోన్లను పరీక్షించే ప్రక్రియను భారతీయ నాణ్యతా ప్రమాణాల మండలిగానీ, అధీకృత పరీక్షా సంస్థగానీ నిర్వహిస్తుంది.
  20. డ్రోన్.ను భారతదేశంలో వినియోగించాల్సినపుడు మాత్రమే టైప్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. పూర్తిగా ఎగుమతులకోసమే ఉద్దేశించిన డ్రోన్ల తయారీని, దిగుమతిని టైప్ సర్టిఫికేషన్, విశిష్ట గుర్తింపు సంఖ్య జారీనుంచి మినహాయించారు.
  21. నానో, మోడల్ డ్రోన్స్.ను (పరిశోధన, వినోదం కోసం తయారైన వాటిని) టైప్ సర్టిఫికేషన్ ప్రక్రియనుంచి మినహాయించారు.
  22. డ్రోన్ల తయారీదార్లు, దిగుమతి దార్లు తమ తమ డ్రోన్లకు సంబంధించిన విశిష్ట గుర్తింపు సంఖ్యలను డిజిటల్ స్కై ప్లాట్ ఫాంపై,. స్వీయ సర్టిఫికేషన్ మార్గంలో పొందడానికి వీలుంటుంది.
  23. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ రద్దు వంటి అంశాలకు సంబంధించి సులభతరమైన ప్రక్రియను డిజిటల్ స్కై ప్లాట్.ఫాంపై ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు.
  24. 2021 నవంబరు 30నాటికి లేదా అంతకు ముందు భారతదేశంలో ఉన్న డ్రోన్లకు విశిష్ట గుర్తింపు సంఖ్యను డిజిటల్ స్కై ఫ్లాట్.ఫాం ద్వారా జారీ చేస్తారు. అయితే సదరు డ్రోన్లకు డ్రోన్ గుర్తింపు సంఖ్య (డి.ఎ.ఎన్.), జి.ఎస్.టి. చెల్లింపు ఇన్వాయిస్ ఉండి తీరాలి. అలాగే  డి.జి.సి.ఎ. ఆమోదం పొందిన డ్రోన్ల జాబితా పరిధిలోనే సదరు డ్రోన్ ఉండి తీరాలి.
  25. డిజిటల్ స్కై ప్లాట్ ఫాం.ను వినియోగదారులు సొంతంగా పర్యవేక్షించుకునేందుకు సంబంధించి, ప్రమాణబద్ధమైన నిర్వహణా నిబంధనలు (ఎస్.ఒ.పి.), శిక్షణా విధానాల నియమావళి (టి.పి.ఎం.) తదితర అంశాలను డి.జి.సి.ఎ. నిర్దేశిస్తుంది.
  26. నిర్దేశిత పద్ధతులను పాటించని సందర్భాల్లో తప్ప ఇందుకు ఎలాంటి ముందస్తు ఆమోదాలు అవసరం లేదు. 
  27. ఉల్లంఘనలపై విధించే గరిష్టస్థాయి జరిమానా మొత్తాన్ని లక్ష రూపాయలకు తగ్గించారు.
  28. ‘అనుమతి లేనిదే–డ్రోన్ ఎగురవేత కుదరదు’, వాస్తవ కాల మార్గదర్శక దీపం, జియో ఫెన్సింగ్ వంటి భద్రతాంశాలను, రక్షణపరమైన అంశాలను భవిష్యత్తులో నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు. ఈ నిబంధనలను పాటించేందుకు వీలుగా పరిశ్రమకు ఆరు నెలల వ్యవధిని కేటాయిస్తారు. 
  29. సామగ్రి బట్వాడా లక్ష్యంగా డ్రోన్ కారిడార్లకు రూపకల్పన చేస్తారు.
  30. వివిధ సంస్థలు, స్టార్టప్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య వర్గాలకు ప్రమేయం కల్పించడం ద్వారా డ్రోన్ ప్రోత్సాహక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రగతి కాముక నియంత్రణా వ్యవస్థ ఏర్పాటుకు వీలుగా ఈ మండలి ఏర్పాటవుతుంది.

 

***



(Release ID: 1749397) Visitor Counter : 428