ప్రధాన మంత్రి కార్యాలయం

75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

Posted On: 15 AUG 2021 2:18PM by PIB Hyderabad


 

  1. నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్‌ పటేల్‌; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్‌ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.
  2. ఈ రోజు మనం స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నప్పటికీ దేశ విభజన సందర్భంగా భారతీయులందరి గుండెల్లో గుచ్చుకున్న ముళ్లు ఇంకా వేదనకు గురిచేస్తూనే ఉన్నాయి. గత శతాబ్దంలో చోటుచేసుకున్న అత్యంత విషాద ఉదంతాల్లో ఇదీ ఒకటి. స్వాంతంత్ర్యం పొందిన సంతోషంలో ఈ వేదనకు గురైన ప్రజలను అందరూ త్వరలోనే మరచిపోయారు. ఈ నేపథ్యంలో విభజన బాధితుల స్మారకంగా ఇకపై ఏటా ఆగస్టు 14ను ‘భయానక విభజన సంస్కరణ దినం’గా పాటించాలని నిన్ననే ఒక భావోద్వేగ నిర్ణయం తీసుకున్నాం. ఆనాడు అమానుష పరిస్థితులకు, దారుణ హింసకు గురై మరణించినవారికి కనీసం అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా జరగలేదు. కాబట్టి వారు ఎన్నటికీ మన జ్ఞాపకాల్లో సజీవులై నిలిచిపోవాలి. అందుకే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయం విభజన వేదనను ఎదుర్కొన్న దేశవాసులందరికీ ప్రతి భారతీయుడి తరఫున సగౌరవ నివాళి కాగలదు.
  3. ఆధునిక మౌలిక సదుపాయాలుసహా మౌలిక వసతుల నిర్మాణంలో సమగ్ర, సంపూర్ణ విధానం అనుసరించడం అవశ్యం. ఈ మేరకు ప్రధాన మంత్రి ‘గతి శక్తి’ పేరిట జాతీయ బృహత్‌ ప్రణాళికను త్వరలోనే ప్రారంభించనున్నాం. ఇది అత్యంత భారీ పథకం మాత్రమే కాకుండా  కోట్లాది దేశ ప్రజల కలలను సాకారం చేస్తుంది. ఆ మేరకు రూ.100 లక్షల కోట్లకుపైగా నిధులతో చేపట్టే ఈ పథకంతో లక్షలాది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
  4. మన శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశీయంగా రెండు (మేక్‌ ఇన్‌ ఇండియా) కోవిడ్‌ టీకాలను రూపొందించగలిగాం. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమాన్ని నేడు దేశంలో కొనసాగించడం మనకు గర్వకారణం.
  5. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్నీ పట్టిపీడిస్తున్న సంక్షోభ పరిస్థితుల్లో టీకాలు లభ్యం కావడం దాదాపు అసాధ్యం.. భారతదేశానికి అవి లభ్యమై ఉండవచ్చు/కాకపోయి కూడా ఉండవచ్చు. ఒకవేళ లభ్యమైనా సకాలంలో అందకపోవచ్చు. కానీ, ఇవాళ మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమం కొనసాగుతున్నదని గర్వంగా చాటుకోగలం. ఈ మేరకు ఇప్పటిదాకా 54 కోట్ల మందికిపైగా ప్రజలు టీకాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ‘కోవిన్‌’ వంటి ఆన్‌లైన్‌ వ్యవస్థలు, టీకాల పూర్తిపై డిజిటల్‌ ధ్రువీకరణ పత్రాలు ఇవాళ ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తున్నాయి.
  6. ప్రపంచ మహమ్మారి కరోనాపై పోరాటంలో మన వైద్యులు, నర్సులు, వైద్యసహాయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులతోపాటు టీకాల రూపకల్పనలో నిమగ్నమైన మన శాస్త్రవేత్తలు, సేవాభావంతో తమవంతు తోడ్పాటునిస్తూ స్ఫూర్తిని చాటుకున్న లక్షలాది దేశవాసులు... అందరూ మన గౌరవాదరాలకు అర్హులే.
  7. టోక్యో ఒలింపిక్‌ క్రీడల్లో మన యువతరం భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసింది. అలాంటి క్రీడాకారులందరూ ఇవాళ మన మధ్య ఉండటం గర్వకారణం. ఈ క్రీడాకారులందరూ మన హృదయ విజేతలు కావడమేగాక భారత యువతరానికి ఉత్తేజమిచ్చారు.
  8. మహమ్మారి విజృంభించిన వేళ నెలల తరబడి 80 కోట్లమంది పేదపౌరుల ఇళ్లలో పొయ్యి ఆరిపోకుండా భారతదేశం ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిన తీరు చూసి ప్రపంచం నివ్వెరపోవడమే కాదు... ఇదొక చర్చనీయాంశంగానూ మారింది.
  9. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా సోకినవారి సంఖ్య స్వల్పం; ఇతర దేశాల జనాభా సంఖ్య రీత్యా చూసినపుడు మన దేశంలో ఎంతోమంది పౌరుల ప్రాణాలను రక్షించగలిగాం. అయినప్పటికీ అది గర్వకారణమేమీ కాదు... దీన్నొక ఘనతగా భావించి చేతులు కట్టుకు కూర్చోలేం. మనముందు సవాళ్లు లేవని చెప్పడం మన ప్రగతి పథానికి మనమే అడ్డుగోడలు కట్టుకోవడం అవుతుంది.
  10. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటం మాత్రమేగాక ‘కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ అనే తారకమంత్రంతో ముందడుగు వేస్తున్నాం.
  11. భారత స్వాతంత్ర్యం 75 సంవత్సరాల సందర్భాన్ని మనం కేవలం ఓ వేడుకగా పరిమితం చేయరాదు. సరికొత్త తీర్మానాలతో కొత్త సంకల్పాల సాధనకు పునాదులు వేసుకుని ముందుకు సాగాలి. ఈ ప్రారంభం నుంచి 25 ఏళ్లపాటు సాగే స్వాతంత్ర్య శతాబ్ది వేడుకల కాలాన్ని నవభారత నిర్మాణంలో అమృత తుల్యం చేసుకోవాలి. ఈ అమృత కాలంలో మన సంకల్పాలను సాకారం చేసుకుని, భారత శతాబ్ది స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి.
  12. భారత దేశంతోపాటు పౌరుల సౌభాగ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చడమే ఈ ‘అమృత కాలం’ లక్ష్యం. సౌకర్యాల రీత్యా గ్రామాలు-పట్టణాల మధ్య అంతరంలేని భారతదేశాన్ని సృష్టించడమే ‘అమృత కాలం’ పరమోద్దేశం. పౌరుల జీవితాల్లో ప్రభుత్వ అనవసర జోక్యం లేకుండా చేయడమే ఈ ‘అమృత కాలం’ ధ్యేయం. ప్రపంచంలోని ప్రతి ఆధునిక సదుపాయం దేశంలో ఏర్పరచడమే ఈ ‘అమృత కాలం’ అంతిమ లక్ష్యం.
  13. ‘అమృత కాలం’ వ్యవధి 25 సంవత్సరాలు... కానీ, మన లక్ష్యాల సాధనకు అంత సమయం వేచి ఉండనక్కర్లేదు. ఆ కృషిని మనం ఇప్పుడే మొదలుపెట్టాలి... ఒక్క క్షణం కూడా వృథా చేయరాదు. ఇదే సరైన సమయం... మన దేశం మారాలంటే మొదట పౌరులుగా మనను మనం మార్చుకోవాలి. మారుతున్న కాలంతోపాటు ముందడుగు వేయాలి. మనమిప్పుడు “అందరి తోడ్పాటుతో అందరి ప్రగతి, అందరి విశ్వాసం” స్ఫూర్తితో అడుగులు వేస్తున్నాం. మన లక్ష్యాలను సాధించాలంటే “అందరి తోడ్పాటుతో అందరి ప్రగతి, అందరి విశ్వాసం” అనుసరణసహా “అందరి ప్రయత్నం” కూడా అత్యంత ముఖ్యమని ఇవాళ నేను ఎర్రకోట బురుజుల నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
  14. ఈ ‘భారత ప్రగతి పయనం’లో భాగంగా స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే నాటికి ‘స్వయం సమృద్ధ భారతం’ నిర్మాణ లక్ష్యాన్ని కూడా మనం సాధించాల్సి ఉంది.
  15. మనమిప్పుడు 100 శాతం గృహ విద్యుత్‌ కనెక్షన్లు అందేలా చేశాం. అలాగే ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణంలోనూ 100 శాతం లక్ష్యం దిశగా నిర్మాణాత్మక కృషి చేశాం. అదే తరహాలో మనమిప్పుడు పథకాల సంతృప్తీకరణను సాధించే లక్ష్యంతో ముందుకెళ్లాలి. ఇందుకోసం మన సుదీర్ఘ గడువును కాకుండా కొన్నేళ్లలోనే మన సంకల్పాలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలి.
  16. అలాగే మనం మరింత ముందుకు వెళ్లడంలో భాగంగా 100 శాతం గ్రామాలకు రోడ్లు, 100 శాతం ఇళ్లకు బ్యాంకు ఖాతా, 100 శాతం లబ్ధిదారులకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు, ఉజ్వల్‌ పథకం కింద అర్హులైన 100 శాతం వ్యక్తులకు గ్యాస్‌ కనెక్షన్‌, 100 శాతం లబ్ధిదారులకు నివాసం లక్ష్యాలను కూడా సాధించాలి.
  17. మొత్తంమీద మన నూటికినూరు శాతం లక్ష్యాల సాధన ధోరణితో ముందుకు సాగాలి. ఇప్పటిదాకా మనం సందుగొందుల్లో, పాదచారుల బాటమీద, బండ్లపైన కూరగాయలు, వస్తువులు అమ్ముకునే వీధి వర్తకుల గురించి ఆలోచించలేదు. ఈ సహ పౌరులంతా ఇప్పుడు ‘స్వనిధి’ పథకంతో బ్యాంకింగ్‌ వ్యవస్థతో అనుసంధానించబడ్డారు.
  18. ప్రతి పౌరుడూ ప్రభుత్వం అమలు చేసే పరివర్తనాత్మక పథకాలతో ముడిపడే లక్ష్యంతో మనం ముందుకు వెళ్లాలి. గడచిన కొన్నేళ్లలో మా ప్రభుత్వం గ్రామాలకు రహదారులు వేయడంతోపాటు విద్యుత్‌ సదుపాయం కల్పించింది. ఇప్పుడు ఈ గ్రామాలు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ డేటా, ఇంటర్నెట్‌తో మరింత బలోపేతమయ్యాయి.
  19. జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభించిన రెండేళ్లలోనే 4.5 కోట్ల కుటుంబాలకు కొళాయిల ద్వారా నీరు సరఫరా కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ప్రయోజనాన్ని చిట్టచివరి పౌరుడి వరకూ చేర్చగలగడమే మన విజయానికి నిదర్శనం.
  20. మా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినవాటిలో పౌష్టికాహారం కూడా ఒకటి. అలాగే వ్యాధినిరోధం-ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య-శ్రేయో మౌలిక వసతుల కల్పనకూ కృషిచేస్తోంది.
  21. దేశంలో వెనుకబడిన వర్గాలు, రంగాలకూ మనం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక అవసరాలు తీర్చడంపై శ్రద్ధ మాత్రమే కాకుండా దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, సాధారణ ప్రజానీకంలోని పేదలకు రిజర్వేషన్లు కూడా కల్పించాం. ఇటీవలే ఓబీసీ వర్గాలకు అఖిలభారత కోటా కింద వైద్య విద్యలోనూ రిజర్వేషన్‌ కల్పించాం. దీంతోపాటు రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితా రూపొందించుకునే వీలు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం కూడా తెచ్చాం.
  22. రేషన్ షాపులో బియ్యం, మధ్యాహ్న భోజన బియ్యంసహా ప్రతి పథకం ద్వారా సరఫరా చేసే బియ్యంలో పౌష్టిక విలువలను 2024 నాటికి పెంచుతాం
  23. నియోజకవర్గ విభజన కోసం జమ్ముకశ్మీర్‌లోనే కమిషన్‌ ఏర్పాటు చేయబడింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు కూడా సాగుతున్నాయి.
  24. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో లద్దాఖ్‌లో పరివర్తనాత్మక దశ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఒకవైపు లద్దాఖ్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకుంటుండగా మరోవైపు ‘సింధు కేంద్రీయ విశ్వవిద్యాలయం’ ఏర్పాటుతో ఈ ప్రాంతం ఉన్నత విద్యకు కూడలి కానుంది.
  25. ఈశాన్య భారతంలో పర్యాటకం, సాహస క్రీడలు, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మూలికల పెంపకం, చమురుతీత రంగాల వృద్ధికి అపార అవకాశాలున్నాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ దేశాభివృద్ధి పథంలో దీన్నొక భాగం చేయాలి. అయితే, ఈ కార్యాన్ని మనం ‘అమృత్ కాలం’లోని దశాబ్దాల వ్యవధిలోగానే సాధించాలి. సామర్థ్యానికి తగిన అవకాశం అందరికీ కల్పించడమే వాస్తవ ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ మేరకు అది జమ్ముకశ్మీర్‌ అయినా సరే... అభివృద్ధి సమతౌల్యం ఇప్పుడు  క్షేత్రస్థాయిలో సుస్పష్టమవుతోంది.
  26. దేశంలో... తూర్పు, ఈశాన్యం, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, మొత్తం హిమాలయ ప్రాంతం, మన తీర ప్రాంతం, గిరిజన ప్రాంతం... ఏదైనా సరే- అది భారత భవిష్యత్‌ ప్రగతికి లోతైన పునాది కాగలదు.
  27. అనుసంధానానికి సంబంధించి నేడు ఈశాన్యం భారతంలో కొత్త చరిత్ర లిఖించబడుతోంది. ఇది అటు హృదయాలు-ఇటు మౌలిక వసతుల సమ్మేళనం. ఈ మేరకు రైలు మార్గాలతో అన్ని ఈశాన్య రాష్ట్రాల రాజధానుల అనుసంధానం త్వరలోనే పూర్తికానుంది.
  28. ‘తూర్పు కార్యాచరణ’ విధానం ప్రకారం... ఇవాళ ఈశాన్య భారతం, బంగ్లాదేశ్, మయన్మార్, ఆగ్నేయాసియా కూడా అనుసంధానం అవుతున్నాయి. కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాల ఫలితంగా నేడు ఈశాన్య భారతంలో శ్రేష్ఠ భారత నిర్మాణం, దీర్ఘకాలిక శాంతి స్థాపన దిశగా ఉత్సాహం బహుముఖంగా ఇనుమడించింది.
  29. మన గ్రామాల ప్రగతి పయనంలో కొత్త దశకు మనమిప్పుడు ప్రత్యక్ష సాక్షులం. ఇది ఒక్క విద్యుత్‌, నీటి సరఫరాలకు మాత్రమే పరిమితం కాకుండా డిజిటల్‌ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం విషయంలోనూ కొనసాగుతోంది. దేశంలోని 110కిపైగా ప్రగతికాముక జిల్లాల్లో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, రోడ్లు, ఉపాధి సంబంధిత పథకాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. ఈ జిల్లాల్లో అధికశాతం గిరిజన ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం.
  30. మన చిన్నరైతులకు తోడ్పాటుపై మనమిప్పుడు శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ప్రభుత్వ పథకాలు- డీబీటీ లేదా వ్యవసాయ రైలు వంటివి ఏవైనప్పటికీ... వీటిద్వారా వారికి గరిష్ఠ లబ్ధి కలిగేలా చూడటం అవసరం.
  31. కిసాన్ రైల్ చిన్న రైతుల కు సాయపడగలదు. ఈ ఆధునిక సదుపాయం ద్వారా ఉత్పాదన ను తక్కువ ఖర్చు తో సుదూర ప్రాంతాల కు చేరవేయవచ్చును. కమలం, శాహీ లిచీ, భుత్ జొలోకియాచిల్లీస్, బ్లాక్ రైస్ లేదా పసుపు లను ప్రపంచం లో ని వివిధ దేశాల కు ఎగుమతి చేయడం జరుగుతున్నది.
  32. ప్రభుత్వం ప్రస్తుతం చిన్న రైతుల సంక్షేమం పై శ్రద్ధ తీసుకొంటున్నది. 10 కోట్ల రైతు కుటుంబాలు 1.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా వారి బ్యాంకు ఖాతాల ద్వారా నేరు గా అందుకొన్నాయి.
  33. స్వామిత్వ యోజనభారతదేశం లోని గ్రామీణ ప్రాంతాల లో ప్రజల జీవనం లో మార్పు ను తీసుకువస్తున్నది. మన పల్లెల పౌరులు వారి భూమి ని మేప్ చేసుకోవడం లో డ్రోన్ తోడ్పడుతున్నది. అలాగే వారు వేరు వేరు పథకాల కోసం, రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చును.
  34. సహకార వాదం చట్టాలు, నిబంధనల నెట్ వర్క్ తో కూడిన ఒక వ్యవస్థ మాత్రమే కాదు, సహకారవాదం అనేది ఒక స్ఫూర్తి, సంస్కృతి, సామూహిక వృద్ధి తాలూకు ఒక మన:ప్రవృత్తి గా ఉంటున్నాయి. విడి గా ఒక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయడం ద్వారా సహకార వాదం సశక్తీకరణ కు మేం అడుగులు వేశాం.
  35. రాబోయే కాలం లో, మనం దేశం లోని చిన్న రైతుల సామూహిక శక్తి ని పెంచితీరాలి. వారికి కొత్త సదుపాయాల ను అందుబాటులోకి తీసుకు రావాలి. ఈ రైతుల సశక్తీకరణ కోసం మేం స్వామిత్వ యోజన ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాం.
  36. స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవ్ను 75 వారాల పాటు వేడుక గా జరపాలి అని మేం నిర్ణయించాం. అవి మార్చి నెల 12న మొదలయ్యాయి. మరి 2023వ సంవత్సరం లో ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. మనం కొత్త ఉత్సాహం తో ముందుకు సాగవలసి ఉంది. మరి ఈ కారణం గా దేశం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొంది.
  37. స్వాతంత్ర్యం తాలూకు 75 వారాల అమృత్ మహోత్సవ్కాలం లో 75 వందే భారత్ రైళ్లు దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతాన్ని జోడిస్తాయి. దేశం లో కొత్త విమానాశ్రయాలు రూపుదిద్దుకొంటున్న వేగం, మారుమూల ప్రాంతాల ను కలుపుతున్న ఉడాన్ పథకం ఇంతకు మందు కని విని ఎరుగనివి.
  38. ప్రపంచ శ్రేణి ఉత్పత్తుల ను తయారు చేయడం కోసం మనం అత్యాధునికమైన ఆవిష్కరణల ను, ఆధునిక సాంకేతిక విజ్ఞ‌ానాన్ని వినియోగించుకొంటూ కలసికట్టు గా పనిచేయవలసి ఉంది.
  39. జన్ ఔషధి యోజనలో భాగం గా, పేద ప్రజలు, ఆపన్నులు ప్రస్తుతం తక్కువ ధరల లో మందుల ను అందుకొంటున్నారు. 75,000 కు పైగా హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను నిర్మించడం జరిగింది. మరి మేం బ్లాకు స్థాయి లో ఒక హాస్పిటల్స్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నాం.
  40. మన అభివృద్ధి పరమైన పురోగతి కి మరింత జోరు ను అందించడం కోసం, మనం మన తయారీ పైన, ఎగుమతుల పైన మనం దృష్టి ని సారించాలి.
  41. కరోనా కారణం గా తలెత్తిన సరికొత్త ఆర్థిక స్థితిగతుల నేపథ్యం లో మన మేక్ ఇన్ ఇండియాప్రచార ఉద్యమాన్ని నిలదొక్కుకొనేటట్టు చూడటానికిగాను దేశం ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటించింది. ఈ పథకం ద్వారా అమలులోకి తీసుకు వచ్చిన పరివర్తన కు ఒక ఉదాహరణ గా ఇలెక్ట్రానిక్ మేన్యుఫాక్చరింగ్ సెక్టర్ నిలుస్తోంది. ఏడు సంవత్సరాల క్రితం, మనం సుమారు 8 బిలియన్ డాలర్ ల విలువైన మొబైల్ ఫోన్ లను దిగుమతి చేసుకొంటూ ఉండే వాళ్లం. అయితే ప్రస్తుతం దిగుమతి చెప్పుకోదగ్గ స్థాయి లో తగ్గింది, అంతే కాదు, మనం ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ ల విలువైన మొబైల్ ఫోన్ లను ఎగుమతి చేస్తున్నాం కూడాను.
  42. అభివృద్ధి పథం లో ముందు కు సాగిపోతూ, భారతదేశం తన తయారీ ని, ఎగుమతుల ను.. ఈ రెంటినీ వృద్ధి చేసుకోవలసి ఉంది. కొన్ని రోజుల కిందటే, మీరు గమనించారు, భారతదేశం తన ఒకటో దేశవాళీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను పరీక్షల కోసం సముద్రం లోకి పంపింది. ఇవాళ భారతదేశం తన సొంత దేశవాళీ యుద్ధ విమానాన్ని, తన సొంత జలాంతర్గామి ని తీర్చిదిద్దుకొంటున్నది. గగన్ యాన్ భారతదేశం పతాకాన్ని అంతరిక్షం లో ఆవిష్కరించడానికి సన్నద్ధం గా ఉంది. స్వదేశీ తయారీ లో మనకు ఉన్న అంతులేనటువంటి సామర్థ్యాల కు ఇదే ఒక రుజువు.
  43. తయారీదారు సంస్థల కు నేను చెప్పదలచుకొన్నాను.. మీరు తయారు చేసే ప్రతి ఒక్క ఉత్పాదన భారతదేశానికి ఒక బ్రాండ్ అంబాసడర్ గా ఉంటుంది అని. ఆ ఉత్పాదన ఉపయోగం లో ఉన్నంత కాలం కొనుగోలుదారు అంటారు - అవును, ఇది భారతదేశం లో తయారు అయింది అని.
  44. క్లిష్టమైన విధానాల రూపం లో ప్రభుత్వం వైపు నుంచి అతి గా ఉన్నటువంటి జోక్యాన్ని మనం ఆపివేయవలసి ఉంది. ప్రస్తుతం, మేం అవసరం లేనటువంటి అంగీకారాల ను రద్దు చేశాం.
  45. మేం ఈజ్ ఆఫ్ లివింగ్కు, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఉత్తేజాన్ని ఇవ్వగల పన్నుల సంబంధి సంస్కరణల ను పరిచయం చేశాం. ఈ సంస్కరణల ను అమలు లోకి తీసుకు రావడం కోసం సుపరిపాలన, స్మార్ట్ గవర్నెన్స్ అవసరపడుతాయి. ప్రస్తుతం, భారతదేశం పరిపాలన లో ఒక కొత్త అధ్యాయాన్ని ఎలా లిఖిస్తున్నదీ ప్రపంచం గమనిస్తున్నది.
  46. అధికారిగణం లో ప్రజలే ప్రధానం అనేటటువంటి దృక్పథాన్ని ప్రవేశపెట్టడం కోసం మేం మిశన్ కర్మయోగిని, సామర్థ్య నిర్మాణం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.
  47. ప్రస్తుతం దేశం 21వ శతాబ్ది అవసరాల ను తీర్చడం కోసం ఒక నూతన జాతీయ విద్య విధానాన్ని కూడా అనుసరిస్తోంది. ఇక మన పిల్లలు నైపుణ్యాలు కొరవడ్డాయనో, లేక భాష పరమైనటువంటి అడ్డుగోడల నడుమ చిక్కుకుపోయో పయనాన్ని ఆపివేయబోరు. ఈ కొత్త జాతీయ విద్య విధానం ఒక రకం గా పేదరికానికి వ్యతిరేకం గా పోరాడడానికి కూడా ఒక గొప్ప సాధనం గా ఉండబోతున్నది. పేదరికానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి గెలవడానికి విద్య, మాతృభాష తాలూకు ప్రతిష్ట, ప్రాముఖ్యం కూడా ఒక ప్రాతిపదిక.
  48. బేటీ బచావో, బేటీ పఢావోకార్యక్రమాన్ని పటిష్టపరచే దిశ లో ఒక అడుగు గా మన కుమార్తెలు ఇక సైనిక్ స్కూల్స్ లో సైతం చదువుకోగలుగుతారు. ప్రస్తుతం, అది విద్య కావచ్చు లేదా ఒలింపిక్స్ కావచ్చు .. మన కుమార్తెలు గొప్పగా రాణిస్తున్నారు. వారు సమాన అవకాశాల ను అందుకోవాలని మరి వారు సురక్షితం గా ఉన్నామని, గౌరవాన్ని పొందుతున్నామని భావించేటట్టు మనం జాగ్రత లు తీసుకోవలసి ఉంది.
  49. పల్లెల లోని 8 కోట్ల కు పైగా సోదరీమణులు స్వయం సహాయ సమూహాల తో అనుబంధాన్ని కలిగివున్నారు; వారు ఉన్నత శ్రేణి ఉత్పాదనల ను రూపొందిస్తున్నారు కూడాను. వారి ఉత్పాదనల కు దేశ విదేశాల లో ఒక భారీ బజారు అందుబాటులో ఉండేటట్టు చూడడానికి ప్రభుత్వం కూడా ఒక ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ను సిద్ధం చేస్తుంది. వోకల్ ఫార్ లోకల్ మంత్రం తో దేశం ముందంజ వేస్తూ ఉంటే, ఈ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ స్వయం సహాయ సమూహాల మహిళ ల ఉత్పత్తుల ను దేశం లోని మారుమూల ప్రాంతాల లో నివసించే ప్రజల తో పాటు విదేశాల లో నివసించే ప్రజల వద్దకు కూడా చేర్చుతుంది. మరి దీని పరిధి చాలా విస్తారం గా ఉండబోతున్నది.
  50. భారతదేశం ఇంధన ఉత్పత్తిలో స్వతంత్రంగా లేదు. ఇంధన దిగుమతి కోసం రూ.12 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, భారత దేశం ఇంధన ఉత్పత్తిలో కూడా ఆత్మనిర్భర్ గా మారేలా చూడాలి.

51. జాతీయ భద్రతతో పాటు పర్యావరణ భద్రతకు కూడా మేం సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. జీవ వైవిధ్యం కావచ్చు, భూ తటస్థత, వాతావరణ మార్పులు లేదా నీటి రీ సైక్లింగ్, ఆర్గానిక్ వ్యవసాయం వంటి అన్ని రంగాల్లోనూ ఇండియా పురోగమిస్తోంది.

 

52. 21వ శతాబ్దిలోని ఈ దశాబ్దిలో భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థను మరింత ఉత్తేజితం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. సముద్రాల్లోని అపరిమిత అవకాశాలను మరింతగా అన్వేషించడం మా ఉత్సాహవంతమైన డీప్ ఓషన్ మిషన్ ఫలితమే. సాగర జలాల్లో దాగి ఉన్న ఖనిజ సంపద, థర్మల్ విద్యుత్ దేశ ఆర్థికాభివృద్ధిని మరింత నూతన శిఖరాలకు చేర్చగలుగుతాయి.

 

53.   ప్ర‌పంచ భవిష్యత్తు హరిత హైడ్రోజెన్. అందుకోసమే నేషనల్ హైడ్రోజెన్ మిషన్ ను నేను ప్రకటిస్తున్నాను.

 

54. ఈ అమృత కాలంలో మనం భారత్ ను ప్రపంచ హరిత హైడ్రోజెన్ ఉత్పత్తి కేంద్రంగాను, ఎగుమతి దేశంగాను తీర్చిదిద్దాలి. ఇది ఇంధన స్వయంసమృద్ధి విభాగంలో భారతదేశం మరింత పురోగమించడానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన పరివర్తనకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ రోజున మన స్టార్టప్ లు, యువతకు హరిత వృద్ధి నుంచి హరిత ఉపాధి దిశగా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

 

55. భారతదేశం విద్యుత్ మొబిలిటీ దిశగా కూడా ప్రయాణం ప్రారంభించింది. రైల్వేల నూరు శాతం విద్యుదీకరణ మరింత వేగంగా పురోగమిస్తోంది. 2030 నాటికి జీరో కార్బన్ వ్యర్థాల వ్యవస్థగా మారాలన్న లక్ష్యాన్ని భారతీయ రైల్వే నిర్దేశించుకుంది.

 

56.  భారతదేశం సర్కులర్ ఎకానమీ కార్యక్రమానికి కూడా (మిషన్ సర్కులర్ ఎకానమీ) ప్రాధాన్యం ఇస్తోంది. మేం ప్రకటించిన వాహన తుక్కు (స్క్రాప్) విధానం ఇందుకు ఉదాహరణ. జి-20 దేశాల్లో వాతావరణ లక్ష్యాల సాధన దిశగా వేగంగా పురోగమిస్తున్న దేశం భారత్ ఒక్కటే.

 

57. భారతదేశం ఈ దశాబ్ది చివరికి 450 గిగావాట్లు - 2030 నాటికి 450 గిగావాట్లు - పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో 100 గిగావాట్ల లక్ష్యాన్ని భారతదేశం నిర్దేశిత సమయం కన్నా ముందుగానే సాధించింది.

 

58. దశాబ్దాలు, శతాబ్దాలుగా అగ్గి రాజేస్తున్న పలు రంగాల్లో సమస్యలు పరిష్కరించేందుకు నేడు భారతదేశం కృషి చేస్తోంది. 370వ అధికరణం రద్దు,  పలు రకాల పన్నుల  నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు ప్రకటించిన జిఎస్ టి అమలు, మన సైనిక సోదరులకు “ఒక ర్యాంకు-ఒక పింఛన్” పై నిర్ణయం, రామ్ జన్మభూమి సమస్యకు శాంతియుత పరిష్కారం వంటివి గత కొద్ది సంవత్సరాల కాలంలో వాస్తవ రూపం దాల్చాయి.

 

59. త్రిపురలో దశాబ్దాలుగా నలుగుతున్న బ్రూ-రియాంగ్ సమస్య పరిష్కారం కావచ్చు లేదా ఒబిసి కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడం లేదా స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా జమ్ము-కశ్మీర్ లో బిడిసి, డిడిసి ఎన్నికల నిర్వహణ కావచ్చు అన్ని రకాల సంకల్పాలను భారత్ ఆత్మస్థైర్యంలో సాధించింది.

 

60. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ సంబంధాలు ఎంతగానో మారిపోయాయి. కరోనా అనంతర కాలంలో మరో కొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవించే ఆస్కారం ఉంది. కరోనా సమయంలో భారతదేశం చేసిన కృషిని ప్రపంచం యావత్తు వీక్షించి ప్రశంసించింది. ఈ రోజు సరికొత్త చొరవల కోసం ప్రపంచం యావత్తు భారత్ వైపు చూస్తోంది. వాటిలో అత్యంత ప్రధానమైన రెండు అంశాలు -ఉగ్రవాదం, విస్తరణ ధోరణి. భారత్ ఈ రెండు సవాళ్లకు వ్యతిరేకంగా శక్తివంతమైన పోరాటం సాగిస్తూ అదుపులో ఉంచగలుగుతోంది. భారతదేశం తనపై గల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి మా రక్షణ సంసిద్ధత కూడా అంతే బలమైనది.

 

61. మన యువత “ఏదైనా సాధించగలం” అనే తరం. వారు ఏదైనా అంశంపై మనసు కేంద్రీకరించి ప్రతీ ఒక్కటీ సాధించగలుగుతారు. మన పనులే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మేం ఈ రోజున భారత స్వాతంత్ర్య 100 సంవత్సరాల వేడుకకు (శత వార్షికోత్సవం) ఒక థీమ్ ను నిర్దేశిస్తున్నాం.

62. నేను జ్యోతిష పండితుడను కాను. కాని సరైన కార్యాచరణ అందించే ఫలాలపై విశ్వాసం గల వ్యక్తిని. నా దేశ యువత పట్ల నాకు నమ్మకం ఉంది. నా దేశ సోదరీమణులు, కుమార్తులు, రైతులు, దేశానికి చెందిన వృత్తి నిపుణులపై నమ్మకం గల వాడిని. “ఏదైనా సాధించగలం” అనే ఈ తరం అసాధారణ లక్ష్యాలను కూడా సాధించగలదు.

 

63. ఈ 21వ శతాబ్దిలో భారతదేశం కలలు, ఆకాంక్షలను సాధించుకోగల మన సంకల్పాన్ని ఏ శక్తి నిలువరించలేదు. మన బలమే మన తేజం, మన బలమే మన సంఘీభావం. మన తేజమే జాతి ప్రధానం - ఎల్లప్పుడూ ప్రధానం అనే స్ఫూర్తికి మూలం. మన ఉమ్మడి కలలు, మన ఉమ్మడి సంకల్పం, ఉమ్మడి కృషికి ఇదే సరైన సమయం. విజయం దిశగా అడుగేసే సమయం ఇదే.

 

64. గొప్ప తాత్వికవేత్త శ్రీ అరబిందో 150వ జయంతి సంవత్సరం ఇది. 2022లో ఆయన 150వ జయంతి వేడుకలు మనం నిర్వహించుకోబోతున్నాం. భారతదేశ మహోన్నత భవిష్యత్తును దర్శించిన దార్శనికుడు శ్రీ అరబిందో. మనం ఇంతకు ముందెన్నడూ లేనంత బలవంతులం కావాలి అని ఆయన చెబుతూ ఉండే వారు. మన అలవాట్లు మార్చుకోవాలి. మనని మనం  తిరిగి మేల్కొలుపుకోవాలి.

 

65. స్వామి వివేకానంద భారత మహోజ్వల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉండే వారు. భారతమాత అద్భుత శక్తి తన ముందు తన కళ్ల ముందు కదలాడుతుండగా వీలైనంత దూరంగా గతంలోకి చూడండి ఆయన చెప్పే వారు. ప్రతీ వసంతంలో వచ్చే నీటిని ఆస్వాదిస్తూనే ముందుకు చూడమనే వారు. భారత్ ను ఉజ్వలంగా, ఉన్నతంగా, గతం కన్నా మెరుగైనదిగా తీర్చిదిద్దేందుకు   ముందుకు సాగండి. దేశానికి గల ఆపారమైన సామర్థ్యంపై విశ్వాసం ఉంచి ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మనం ముందుకు సాగాలి. కొత్త తరం మౌలిక వసతుల కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రపంచ శ్రేణి తయారీ కోసం మనందరం సంఘటితంగా పని చేయాలి. అత్యాధునిక ఆవిష్కరణల కోసం అందరం కలిసి కృషి చేయాలి. కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాల కోసం అందరం కలిసి కృషి చేయాలి.

 

 

***

 



(Release ID: 1746102) Visitor Counter : 5896