యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
54 మంది క్రీడాకారులతో కూడిన 88 మంది సభ్యుల భారత బృందం టోక్యోకు చేరిక
గత సాయంత్రం ఈ బృందానికి స్ఫూర్తిదాయక వీడ్కోలు పలికిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్
Posted On:
18 JUL 2021 12:52PM by PIB Hyderabad
ఒలింపిక్స్లో పాల్గొనడానికి బయల్దేరిన, 54 మంది క్రీడాకారులతో కూడిన 88 మంది సభ్యుల భారత బృందం టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కుర్బే నగర ప్రతినిధులు విమానాశ్రయానికి వచ్చి భారత బృందానికి స్వాగతం పలికారు. ఈ బృందానికి శనివారం రాత్రి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారిక వీడ్కోలు లభించింది. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్ క్రీడాకారులకు వీడ్కోలు పలికారు.
ఈ బృందంలోని క్రీడాకారులు బ్యాడ్మింటన్, విలువిద్య, హాకీ, జుడో, ఈత, వెయిట్ లిఫ్టింగ్, జిమాస్టిక్స్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో పోటీ పడతారు. భారత్ నుంచి మొత్తం 127 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఇదే అతి పెద్ద బృందం.
టోక్యో ఒలింపిక్స్ మన దేశానికి ఒక చిరస్మరణీయ సందర్భమని, 135 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలు క్రీడాకారుల వెన్నంటే ఉంటాయని వీడ్కోలు కార్యక్రమంలో శ్రీ అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ సువర్ణ అవకాశం దక్కించుకున్న అతి కొద్దిమంది మీరని క్రీడాకారులతో చెప్పిన కేంద్ర మంత్రి, జీవితంలో మరింత ముందుకు దూసుకెళ్లడానికి మార్గం ఏర్పడిందని అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చెప్పినట్లు, ఒత్తిడికి లోను కాకుండా ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపాలని సూచించారు. క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ధృడంగా వ్యవహరించాలన్నారు. ఇది మెదడుతో చేసే యుద్ధమని, క్రీడాకారుల మనోస్థైర్యం వారి ఆటతీరులో ప్రతిఫలిస్తుందని శ్రీ ఠాకూర్ అన్నారు.
***
(Release ID: 1736563)
Visitor Counter : 194