సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

నశా ముక్త భారత్ అభియాన్ వెబ్ సైట్.కు శ్రీకారం!


కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆవిష్కరణ
డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినం సందర్భంగా కార్యక్రమ నిర్వహణ..

సమూలంగా ఈ బెడదను నివారించేందుకు
భారత్ కట్టుబడి ఉందన్న కేంద్రమంత్రి

Posted On: 26 JUN 2021 6:27PM by PIB Hyderabad

దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన నశా ముక్త భారత్ అభియాన్ (ఎన్.ఎం.బి.ఎ.) కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తవర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు ఆవిష్కరించారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా శాఖ సహాయ మంత్రులు  కృష్ణపాల్ గుర్జార్, రాందాస్ అథావలే, రతన్ లాల్ కటారియాల సమక్షంలో వెబ్.సైట్ ఆవిష్కరణ జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు మందులు, మాదక ద్రవ్యాలనుంచి ప్రపంచాన్ని విముక్తి చేసేందుకు, వాటి దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మాదక ద్రవ్యాల డిమాండ్ ను తగ్గించేందుకు, వాటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది. 

    

మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినాన్ని పురస్కరించుకుని నశా ముక్త భారత్ శిఖరాగ్ర సమావేశం పేరిట ఆరు రోజుల కార్యక్రమాన్ని కూడా సామాజిక న్యాయం, సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది.  మాదక ద్రవ్యాల దుర్వినియోగం కట్టడికి చేపట్టే అనేక కార్యక్రమాలను సమావేశం ముగింపు రోజున ఎలెక్ట్రానిక్ పద్ధతిలో ప్రారంభించారు.

  కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల కార్యదర్శి ఆర్. సుబ్రమణ్యం ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేశారు. అదనపు కార్యదర్శి ఉపమా శ్రీవాత్సవ ప్రసంగించారు. ఎన్.ఎం.బి.ఎ. వివరాలను సంయుక్త కార్యదర్శి రాధికా చక్రవర్తి వివరించారు. అనంతతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

  ఈ రోజు జరిగిన  కార్యక్రమంలో కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా ఏ రూపంలో జరుగుతున్నా, వాటిని అరికట్టాలన్న సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు,  మాదక ద్రవ్యాల బెడదను కట్టడిచేసే పోరాటంలో భారతదేశం అన్నిరకాలుగా పోరాడుతుందని ప్రపంచానికి సందేశం ఇచ్చేందుకు మనం సమావేశమయ్యామని, అంతర్జాతీయ. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు. సామాజిక లక్ష్యాలను సాధించి తీరాలన్న మన చిత్తశుద్ధిని కూడా ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోందన్నారు. ప్రజా ప్రయోజనాలే ప్రాతిపదికగా మనం అనుసరించిన మార్గాలను, నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేస్తోందని కేంద్రమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాల బెడదను ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టుబెట్టాలన్న లక్ష్యానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

   దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య ఆరుకోట్లకు పైగానే ఉందని, మాదక ద్రవ్యాలను వినియోగదారుల్లో ఎక్కువ మంది పదినుంచి పదిహేడేళ్ల వయస్సు కలిగిన వారేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సమగ్ర సర్వే తెలియజేస్తున్నట్టు మంత్రి గెహ్లోట్ చెప్పారు.  మాదకద్రవ్యాల వినియోగాన్ని కట్టడి వ్యవహారాల్లో తమ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా పనిచేస్తుందని అన్నారు. మాదకద్రవ్యాలు, వాటి దుష్పరిణామాలు తదితర సమస్యల పరిష్కారానికి తమ శాఖ ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే జాతీయ కార్యాచరణ కార్యక్రమం (ఎన్.ఎ.పి.డి.డి.ఆర్.) కింద దేశవ్యాప్తంగా 500 స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. దేశాన్ని మాదకద్రవ్య రహితంగా తయారు చేసే కార్యక్రమాల్లో ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ క్రియాశీలంగా పాల్గొంటున్నాయన్నారు. మాదక ద్రవ్యాల దుష్పరిణాలను తెలియజెప్పేందుకు  ఈ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికి, ఆయా గ్రామాల సమీప ప్రాంతాలకు ళ్లారని, మాదక ద్రవ్యాల వినియోగంతో బాధితులైన వారికి పునరావాసం కల్పించేందుకు వంలటీర్లు సహాయ పడ్డారని కేంద్రమంత్రి వివరించారు. దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి సంక్షోభం తలెత్తినప్పటికీ, నశా ముక్త భారత్ అభియాన్ పథకం కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మంచి ఊపుతో కొనసాగాయని అన్నారు. మాదక ద్రవ్యాల బెడదను ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నివారించగలం కాబట్టి, నశా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాల్లో సామాన్య ప్రజలు కూడా పాలుపంచుకోవాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి రాందాస్ అథావలే మాట్లాడుతూ, మాదకద్రవ్యాల బెడద కారణంగా పెద్దసంఖ్యలో ప్రజల జీవితాలు విచ్ఛిన్నమయ్యాయని, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మనం అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాలకు తావులేని విధంగా దేశాన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఉందని, ఈ లక్ష్య సాధనకే తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 

Description: https://ci5.googleusercontent.com/proxy/WVCtS86lbBP81Wb9D2Fsfvuvpu0wfuqXUbtV6AvuQ0HwTJY2DP2ZJbIc3oBrNBxaxDO8pmQLR8JUp7FY8IUm43Jy_Uha3FaDLojmhltCJ1iUvPP7WdV2dgVxaQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056J0L.jpg

   మరో మంత్రి రతన్ లాల్ కటారియా మాట్లాడుతూ, ప్రపంచం యావత్తూ మాదకద్రవ్యాల బెడదను ఎదుర్కొంటోందని, ఎవరైనా మాదక ద్రవ్యాల వ్యసనానికి బానిస అయితే, అది సదరు వ్యక్తిపైనే కాకుండా, కుటుంబాన్ని దెబ్బతీస్తోందని, చివరకు సమాజంలో మెజారిటీ వర్గానికి నష్టం కలిగించి, తీవ్ర సమస్యగా పరిణమిస్తుందని అన్నారు. మాదక ద్రవ్యాల సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ తీర్మానించుకుందని చెప్పారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణకు సంబంధించిన అన్ని అంశాలపై తమ మంత్రిత్వ శాఖ సమన్వయకర్తగా పర్యవేక్షణ సాగిస్తుందని అన్నారు. సమస్య తీవ్రత, తీసుకోవలసిన నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వ్యసనపరులకు చికిత్స, బాధితులకు పునరావాసం, అవగాహనా కార్యక్రమ సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలను తమ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. అలాగే మాదకద్రవ్యాల వ్యసనపరులకోసం చికిత్సా కేంద్రాలను నిర్వహించేందుకు తమ శాఖ తీర్మానించుకుందని చెప్పారు. మాదకద్రవ్యాల నివారణ చర్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.  మాదకద్రవ్యాలకు చోటులేని సమాజాన్ని సాధించేందుకు మనం ప్రతిన బూనాలని కేంద్రమంత్రి కటారియా విజ్ఞప్తి చేశారు.

  మరో మంత్రి కృష్ణపాల్ గుర్జార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వాణిజ్యం ప్రమాదకరమైమ మలుపు తీసుకుంటున్న ప్రపంచంలో మనం నివసిస్తున్నామని, మాదక ద్రవ్యాలు, మత్తుమందులు వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడమేకాక, ఆ వ్యక్తి కుటుంబాన్ని, సమాజాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం సమాజానికేకాక, దేశానికే ఆందోళనకరంగా పరిణమిస్తోందన్నారు. మాదకద్రవ్యాల  వినియోగం తగ్గించడం, వ్యవసనపరులైన బాధితులకు పునరావాసం కల్పించడమే లక్ష్యాలుగా తమ మంత్రిత్వ శాఖ పలు రకాల పథకాలను తీసుకువచ్చిందన్నారు. కర్తవ్య నిర్వహణలో తాము పూర్తి కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నామని గుర్జార్ తెలిపారు.

  ప్రారంభోపన్యాసం సందర్భంగా సామాజిక న్యాయ శాఖ కార్యదర్శి ఆర్. సుబ్రమణ్యం మాట్లాడుతూ, 'నశా ముక్త భారత్ అభియాన్' (ఎన్.ఎం.బి.ఎ.) పథకంపై అవగాహనకోసం తాము గత ఏడాది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించామని, క్షేత్రస్థాయిలో చాలావరకు పనిని అతితక్కువ వ్యవధిలోనే పూర్తి చేశామని చెప్పారు. మాదద్రవ్యాల బెడద ఎక్కువగా ఉన్న 272 జిల్లాలలను ఎన్.బి.ఎం.బి.ఎ. కార్యక్రమం కింద ఎంపిక చేశారని, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా దాదాపు 8వేలమంది యువజనులు ఇంటింటి ముంగిటికి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్విహిస్తున్నామని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకునే, ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా, వంద జిల్లాలను మాదద్రవ్య రహితంగా త్వరలో ప్రకటించబోతున్నామని ఆయన తెలిపారు.

   ఈ రోజు ప్రారంభమైన నశా ముక్త భారత్ అభియాన్ వెబ్ సైట్లో ఈ పథకంపై సవివరమైన సమాచారం అందుబాటులో ఉంటుందని, పథకం చేపట్టే కార్యకలాపాలు, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల గ్యాలరీ వెబ్ సైట్.లో ఉంటాయని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేసే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంస్థల సమాచార సామగ్రి కూడా ఇందులో ఉంటుందన్నారు. వెబ్.సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా, నశా ముక్త భారత్ శిఖరాగ్ర సదస్సు ప్రచురణ అయిన నెలవారీ సమాచార లేఖను కూడా కేంద్రమంత్రి తవార్ చంద్ గెహ్లోట్ ఈ రోజు ప్రారంభించారు. వారంరోజులపాటు జరిగిన సమావేశపు కార్యక్రమాలను, నశా ముక్త భారత్ అభియాన్ పథకం కోసం దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమాలను ఈ సమాచార లేఖ వివరిస్తుంది. ఈ పథకం మొదలైనప్పటినుంచి  ఇప్పటివరకూ చేపట్టిన కార్యకలాపాలను, క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాన్ని కూడా కేంద్రమంత్రి గెహ్లాట్ ప్రారంభించారు.

   నశాముక్త భారత్ అభియాన్ పథకం కార్యకలాపాలకోసం తమ, తమ జిల్లాల్లో పనిచేసే మాస్టర్ వాలంటీర్లతో మంత్రి ముచ్చటించడంతో కార్యక్రమం ముగిసింది. వారిని ఐదు జిల్లాలనుంచి ఎంపిక చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా తలెత్తిన దుష్పరిణాలను అధిగమించి, ఆరోగ్యకరంగా, ఆనందంగా జీవితం గడుపుతున్న ముగ్గురు వ్యక్తులతో కూడా మంత్రి ముచ్చటించారు.  

  ‘నశా ముక్త భారత్ అభియాన్’ లేదా, ‘మాదక ద్రవ్య రహిత భారత్’ అనే పథకం కింద అవగాహనా కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టు 15వ తేదీన దేశంలోని 272 జిల్లాల్లో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మాదక ద్రవ్యాల బెడదను అరికట్టడం, పర్యవసానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, వివిధ విద్యా సంస్థలతో కలసి పనిచేయడం, బాధితులకు చికిత్సా సదుపాయాలను బలోపేతం చేయడం, పునరావారం కల్పించడం, కౌన్సెలింగ్ సదుపాయాలు కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు.



(Release ID: 1730639) Visitor Counter : 395