ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మీద పోరులో ప్రాథమిక అంశాలు మరువకండి: ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కోవిడ్ యోధులకు మాస్కులు పంచిన హర్ష వర్ధన్


“వైరస్ మీద పోరులో అత్యంత సాధారణమైన మాస్కులే ఆయుధాలు”
“వైరస్ కొత్తరూపంతో పెరుగుతూ ఉంటే మనం నిర్లక్ష్యంగా మారాం”

ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యమివ్వండి: కార్పొరేట్, పారిశ్రామిక, సామాజిక, రాజకీయ సంస్థలకు డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి

“21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమంలో అందరూ పాల్గొనండి”

Posted On: 18 JUN 2021 4:19PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు తమ మంత్రిత్వశాఖలోనే  కోవిడ్ యోధులకు మాస్కులు పంపిణీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఇదే కేవలం లాంఛనమే అయినా, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, వివిధ్ అధికారపదవులలో ఉన్నవారు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని తమ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కోవిడ్ నియంత్రణ దిశలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అందరినీ కాపాడాలన్న ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావలన్నారు. ముందుగా కోవిడ్ యోధులకు, ఆ తరువాత మంత్రిత్వశాఖలోని ఉద్యోగులందరికీ మాస్కులు పంపిణీ చేయటం ఈ కార్యక్రమ లక్ష్యం.

ఈ కార్యక్రమం తనకు ఎంతగా ప్రీతిపాత్రమైందో వివరిస్తూ,  “నిరుడు ప్రభుత్వం రేయింబవళ్ళు కోవిడ్ నియంత్రణకు కృషి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కోవిడ్ కేసుల భారాన్ని గణనీయంగా తగ్గించటంలో మనం విజయం సాధించాం. అయితే, ఈ ఏడాది ఆరంభంలోనే టీకాలు అందుబాటులోకి రావటం, పరిస్థితులు కూడా మళ్ళీ మామూలుస్థితికి తిరిగి రావటం కారణంగా జనంలో కోవిడ్ నిరోధక ప్రవర్తనలో ఒక రకమైన నిర్లక్ష్యం కనిపించింది. కానీ వైరస్ మాత్రం కొత్త రూపం సంతరించుకొని మరింత విజృంభించి  మనల్ని దెబ్బతీసింది. ఇదంతా కలిసి రెండో వేవ్ గా మారింది” అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం గురించి చెబుతూ, ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలు లాక్ డౌన్ నుంచి క్రమంగా బైటపడుతుండగా మనం ఎంతమాత్రమూ అలసత్వం వహించి కేసులు పెరగటానికి కారణం కాకూడదన్న హెచ్చరికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

మాస్కులు ధరించటం అతి సామాన్యమైన పనే అయినా ఎంతో శక్తిమంతమైనదని, అన్ని రకాల కరోనా వైరస్ లనూ తరిమికొట్టగల బలమైన ఆయుధమని మంత్రి అభివర్ణించారు. కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల యజమానులు, సామాజిక సంస్థల  ధిపతులు, వివిధ మంత్రిత్వశాఖలు సైతం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. “ అందరికీ విజ్ఞప్తి చేస్త్తున్నా. మనమంతా మన ఉద్యోగులు, సిబ్బంది కోవిడ్ నుంచి పూర్తి సురక్షితంగా ఉండేట్టు చూద్దాం. అందరికీ మాస్కులు అందుబాటులో ఉండేటట్టు, వాడేటట్టు చూద్దాం.  సరిగా వాడకపోతే వాళ్లకు కోవిడ్ నియంత్రణ ప్రవర్తన గురించి మళ్ళీ  తెలియజెబుదాం. అదే విధంగా టీకాలు వేసుకోవటాన్ని కూడా ప్రోత్సహిద్దాం” అన్నారు.

ప్రజల అవసరాన్ని గుర్తించి సేవలందించటం ఇండియబ్ రెడ్ క్రాస్ సొసైటీకి 1920 నుంచి ఆనవాయితీగా వస్తున్నదని డాక్టర్ హర్షవర్ధన్ గుర్తు చేసుకున్నారు.  కేవలం అత్యవసర పరిస్థితులు, వైపరీత్యాలకే రెడ్ క్రాస్ సేవలు పరిమితం కాదని చెబుతూ అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న చరిత్ర ఉందన్నారు. విదేశీ సాయాన్ని దేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం చేరవేయటంలో ఎంతగానో సహకరించిందని చెప్పారు. ఇప్పుడుఈ మాస్కుల పంపిణీని కూడా రెడ్ క్రాస్ స్పాన్సర్ చేసిందన్నారు.

టీకాల వలన కోవిడ్ కు రక్షణ దొరకటం గురించి మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఇప్పటికే  ప్రపంచంలో నే అతిపెద్ద టీకాల కార్యక్రమం చేపట్టిందన్నారు. దీన్ని సార్వత్రికం చేయటానికి అన్నివిధాలా సిద్ధమైందని గుర్తు చేశారు. 18 ఏళ్ళు దాటిన వయోజనులందరికీ ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమం జూన్ 21న మొదలవుతుందన్నారు. ప్రతి భారతీయుడూ టీకాలు వేసుకొని ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి కుమారి ఆర్తి అహుజా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రెటరీ జనరల్ శ్రీ ఆర్ కె జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 *****



(Release ID: 1728406) Visitor Counter : 229