రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తుపాను తౌక్తే నేప‌థ్యంలో అన్వేష‌ణ‌, స‌హాయ కార్య‌క‌లాపాల్లో నిమ‌గ్న‌మైన త్రివిధ ద‌ళాల‌ను, భార‌తీయ కోస్ట్‌గార్డును కొనియాడిన ర‌క్ష‌ణ మంత్రి రాజ‌నాథ్ సింగ్‌

Posted On: 20 MAY 2021 1:36PM by PIB Hyderabad

తుపాను తౌక్తే కార‌ణంగా ప్ర‌భావ‌విత‌మైన ప్రాంతాల‌లో అన్వేష‌ణ‌, స‌హాయ కార్య‌క‌లాపాల‌లో పాల్గొంటున్న భార‌తీయ కోస్ట్ గార్డు, సాయుధ ద‌ళాల కృషిని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. స‌ముద్రంలో  చిక్క‌కుపోయిన వ్య‌క్తుల ప్రాణాల‌ను కాపాడినందుకు భార‌తీయ నావికాద‌ళం, భార‌తీయ కోస్ట్ గార్డును అభినందించ‌డ‌మేకాక‌, ప్ర‌భావిత‌మైన ప్రాంతాల‌లో భార‌తీయ సైనిక ద‌ళాల‌ను మోహ‌రించినందుకు, జాతీయ విప‌త్తు స్పంద‌నా ద‌ళాలు (ఎన్‌డిఆర్ఎఫ్‌) సిబ్బందిని ర‌వాణా చేసినందుకు భార‌తీయ వైమానిక ద‌ళాల‌ను ప్ర‌శంసించారు. 
త‌న‌కు నిత్యం ప‌రిస్థితిని వివ‌రిస్తున్న నావికాద‌ళాధిప‌తి అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌, సైన్యాధ్య‌క్షుడు జ‌న‌ర‌ల్ ఎంఎం నారావ‌నే, వైమానిక‌ద‌ళాధిప‌తి చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కెఎస్ భ‌దౌరియా, భార‌తీయ కోస్ట్‌గార్డ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కె.న‌ట‌రాజ‌న్‌తో రాజ్‌నాథ్ సింగ్ ట‌చ్‌లో ఉన్నారు. 
రానున్న తుపాను నేప‌థ్యంలో పౌర పాల‌నా అధికారుల‌కు సాధ్య‌మైనంత స‌హాయాన్ని అందించ‌వ‌ల‌సిందిగా సాయుధ ద‌ళాల‌ను మే 17, 2021నాడు జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో ఆదేశించిన విష‌యం గ‌మ‌నార్హం. 
భార‌తీయ నావికాద‌ళం (ఐఎన్‌), భార‌తీయ కోస్ట్‌గార్డ్ (ఐసిజి) త‌మ స‌ముద్ర‌, వైమానిక ద‌ళాల‌ను మోహ‌రించి  ముంబై తీరం వెంబ‌డ గ‌త కొద్ది రోజుల్లో నాలుగు నావ‌ల నుంచి 600మందికి పైగా వ్య‌క్తుల‌ను కాపాడారు. 
ముంబైకి 35 మైళ్ళ దూరంలో మే 17, 2021న మునిగిపోయిన అకామ‌డేష‌న్ బార్జ్ పి-305 నుంచి క‌నిపించ‌కుండా పోయిన 38మంది సిబ్బందిని వెతికేందుకు భార‌తీయ నావికాద‌ళ నావ‌లు, విమానాలు ప్ర‌స్తుతం సెర్చ్ అండ్ రెస్క్యూ (అన్వేష‌ణ‌, స‌హాయ -ఎస్ఎఆర్‌) కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు. ఐఎన్ఎస్ కొచ్చి, కోల్‌క‌తా, బియాస్‌, బేట్వా, టేజ్‌, పి81 స‌ముద్ర నిఘా విమానం, చేత‌క్‌, ఎఎల్‌హెచ్‌, సీకింగ్ హెలికాప్ట‌ర్లు కూడా ఎస్ఎఆర్ కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్న‌మై ఉన్నాయి. ర‌క్ష‌ణ‌, స‌హాయ కార్య‌క‌లాపాల‌లో తోడ్పాటును అందించ‌డం కోసం ఐఎన్ఎస్ త‌ల్వార్‌ను మ‌ళ్ళించారు. బార్జ్ పి-305కి చెందిన 186మంది వ్య‌క్తులను స‌జీవంగా మే 20,2021న ఉద‌యం 7 గంట‌ల‌కు కాపాడ‌గా, 37 మృత‌దేహాల‌ను రిక‌వ‌ర్ చేశారు. 
గుజ‌రాత్ తీర ప్రాంతంలో స‌పోర్ట్ స్టేష‌న్ 3కు , డ్రిల్ షిప్ సాగ‌ర్ భూష‌నణ్ ఐఎన్ఎస్ త‌ల్వార్  తోడ్పాటును అందించింది. ప్ర‌స్తుతం వాటిని ఒఎన్‌జిసి స‌హాయ‌క నావ‌లు ముంబై దిశ‌గా జాగ్ర‌త్త‌గా లాక్కొని తీసుకువెడుతున్నారు. ఈ నావ‌లకు చెందిన 300మందికి పైగా సిబ్బందికి ముంబైకి చెందిన నావికాద‌ళ హెలికాప్ట‌ర్లు ఆహారాన్ని, నీటిని అందించాయి. 
కేర‌ళ‌, గోవా, ల‌క్ష‌ద్వీప తీరాల నుంచి  కొట్టుకుపోయిన భార‌తీయ ఫిషింగ్ ప‌డ‌వ‌లైన బ‌ధ్రియా, జీస‌స్‌, మిలాద్‌, క్రైస్ట్ భ‌వ‌న్‌, పిర‌యానాయ‌కి, నోవాస్ ఆర్క్‌ల సిబ్బందిని ఎస్ఎఆర్ కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్న‌మై ఉన్న‌ భార‌తీయ కోస్ట్ గార్డ్ నావ‌లు సుర‌క్షితంగా వెన‌క్కి తీసుకువ‌చ్చాయి. న్యూ మంగ‌ళూర్ పోర్ట్ నుంచి సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్‌పిఎం) కార్య‌క‌లాపాల కోసం ఎంవి కోర‌మాండ‌ల్ స‌పోర్ట‌ర్ - IXకు చెందిన తొమ్మిదిమంది సిబ్బందిని అక్క‌డి నుంచి ర‌క్షిత స్థానాల‌కు త‌ర‌లించేందుకు కోస్ట్‌గార్డ్‌, నావికాద‌ళ నావ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేశాయి. 
విద్యుత్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ముంబైకి ఉత్త‌రం నుంచి కొట్టుకుపోయిన ఎంవి గాల్ క‌న‌స్ట్ర‌క్ట‌ర్ లో ఉన్న 137 సిబ్బందిని ఐసిజిఎస్ సామ్రాట్‌, దామ‌న్ నుంచి వ‌చ్చిన‌ రెండు భార‌తీయ కోస్ట్ గార్డ్ హెలికాప్ట‌ర్లు,  ఐఎన్ఎస్ షిక్రా, ముంబై నుంచి ఞ‌క భార‌తీయ నావికాద‌ళ సీకింగ్ హెలో ర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాయి. 
అంత‌కు ముందు,  ఎన్‌డిఆర్ఎఫ్ కు చెందిన 400మంది సిబ్బందిని, 60 ట‌న్నుల ప‌రిక‌రాల‌ను అహ్మ‌దాబాద్‌కు ర‌వాణా చేసేందుకు భార‌తీయ వైమానికా ద‌ళం,సి-130జె, ఎఎన్‌-32 విమానాల‌ను మోహ‌రించింది. భార‌తీయ సైనిక ద‌ళం డ‌య్యూ కు ఇంజ‌నీర్ టాస్క్ ఫోర్స్‌తో క‌లిపి పంపేందుకు రెండు కాల‌మ్‌ల‌ను జామ్‌న‌గ‌ర్ నుంచి సంఘ‌టిత ప‌రిచారు. త‌క్ష‌ణ స్పంద‌న కోసం జునాగ‌ఢ్‌కు మ‌రో రెండు కాల‌మ్‌ల‌ను పంపారు. ర‌హ‌దారుల‌ను శుభ్రం చేయ‌డంతో పాట, బాధితుల‌కు ఆహారాన్ని, ఆశ్ర‌యాన్ని సైన్యం అందిస్తోంది. 

 

****



(Release ID: 1720348) Visitor Counter : 166