రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఆంఫోటెరిసిన్-బి డిమాండ్‌, సరఫరాను సమీక్షించి, లభ్యతను నిర్ధరించిన శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ


ఔషధాన్ని సక్రమంగా ఉపయోగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి అభ్యర్థన

Posted On: 18 MAY 2021 2:41PM by PIB Hyderabad

మ్యుకోర్‌మైకోసిస్‌ చికిత్సలో ఉపయోగించే ఆంఫోటెరిసిన్‌-బి కోసం దేశవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్‌, సరఫరాపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ సమీక్ష నిర్వహించారు. దేశీయ ఉత్పత్తిని పెంచడంతోపాటు, ప్రపంచ దేశాల నుంచి ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకునేలా తయారీదారులతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రూపొందించింది.

    దేశవ్యాప్తంగా ఆంఫోటెరిసిన్‌-బి సరఫరా అనేక రెట్లు పెరిగినట్లు మంత్రి గుర్తించారు. కానీ, ఈ ఔషధానికి ఆకస్మిక డిమాండ్‌ ఏర్పడింది. అవసరమైన రోగులకు ఈ మందును అందించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

    ఆంఫోటెరిసిన్‌-బి సరఫరా, పంపిణీ గొలుసును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. సాధ్యమైనంత త్వరగా ఔషధం లోటు భర్తీ అవుతుందని భావిస్తున్నారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఔషధాన్ని సక్రమంగా వినియోగించాలని శ్రీ మాండవీయ అన్ని రాష్ట్రాలను కోరారు.

***



(Release ID: 1719610) Visitor Counter : 234