ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్ట‌ర్‌హ‌రేకృష్ణ మెహ‌తాబ్ ర‌చ‌న ‘ఒడిశా ఇతిహాస్‌’ హిందీ అనువాద గ్రంథాన్ని ఆవిష్క‌రించినప్ర‌ధాన మంత్రి‌


’‘ఉత్క‌ళ్ కేస‌రి’ అందించిన అమిత‌మైన తోడ్పాటు ను ప్రధానమంత్రి స్మ‌రించుకొన్నారు

స్వాతంత్య్రసంగ్రామానికి ఒడిశా తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్ర‌శంసించారు

చ‌రిత్రప్ర‌జ‌ల‌ తోనే ఏర్ప‌డింది; విదేశీ ఆలోచ‌న‌ ల ప్ర‌క్రియ వంశాల గాథ‌లను, మ‌హ‌లు ల‌నుచ‌రిత్ర‌ గా మార్చివేసింది:  ప్ర‌ధాన మంత్రి


యావ‌త్తుభార‌తదేశం చారిత్ర‌క శ‌క్తి కి ఒడిశా చ‌రిత్ర ప్రాతినిధ్యం వ‌హిస్తోంది:  ప్ర‌ధాన మంత్రి

Posted On: 09 APR 2021 2:02PM by PIB Hyderabad

ఉత్క‌ళ్ కేస‌రిడాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ ర‌చన అయిన ఒడిశా ఇతిహాస్తాలూకు హిందీ అనువాద గ్రంథాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించారు. ఇంత‌వ‌ర‌కు ఒడియా లోను, ఇంగ్లీషు లోను ల‌భ్య‌మ‌వుతూ వ‌చ్చిన ఈ గ్రంథాన్ని శ్రీ శంక‌ర్‌ లాల్ పురోహిత్ హిందీ భాష లోకి త‌ర్జుమా చేశారు. కేంద్ర మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, క‌ట‌క్ లోక్ స‌భ స‌భ్యుడు శ్రీ భ‌ర్తృహరి మహతాబ్ లు కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాల్గొన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో ప్ర‌సంగిస్తూ, దేశం దాదాపు గా ఏడాదిన్న‌ర క్రితం ఉత్క‌ళ్ కేస‌రిడాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ 120వ జ‌యంతి ని జరుపుకొన్న సంగతి ని గుర్తు కు తెచ్చారు. డాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ ర‌చించిన ప్ర‌ఖ్యాత గ్రంథం ‘ఒడిశా ఇతిహాస్‌’ తాలూకు హిందీ అనువాద గ్రంథాన్ని దేశ ప్ర‌జ‌ల కు శ్రీ న‌రేంద్ర మోదీ అంకితమిస్తూ, ఒడిశా కు చెందిన వైవిధ్య‌ భ‌రితం అయిన‌టువంటి, స‌మగ్రం అయిన‌టువంటి చ‌రిత్ర దేశ ప్ర‌జ‌ల కు అంద‌డం ముఖ్యం అన్నారు.

స్వాతంత్య్ర సంగ్రామానికి డాక్ట‌ర్ మ‌హ‌తాబ్ అందించిన తోడ్పాటు ను ప్ర‌ధాన మంత్రి స్మ‌రించుకొంటూ, స‌మాజం లో సంస్క‌ర‌ణ ను తీసుకు రావ‌డం కోసం డాక్ట‌ర్ మ‌హ‌తాబ్ చేసిన సంఘ‌ర్ష‌ణ ను ప్ర‌శంసించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కాలం లో డాక్ట‌ర్ మ‌హ‌తాబ్ తాను ఏ పార్టీ ద్వారా అయితే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ని పొందారో ఆ పార్టీ నే వ్య‌తిరేకించి జైలుకు వెళ్లార‌న్నారు. ‘‘స్వాతంత్య్రాన్ని, దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ ను కాపా‌డ‌టానికి ఆయన జైలు కు వెళ్ళారు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఇండియ‌న్ హిస్ట‌రీ కాంగ్రెస్ లో, ఒడిశా చ‌రిత్ర‌ ను జాతీయ వేదిక మీద‌కు తీసుకుపోవడం లో డాక్ట‌ర్ మ‌హ‌తాబ్‌ ముఖ్య‌ పాత్ర‌ ను పోషించార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. డాక్ట‌ర్ మ‌హ‌తాబ్ చేసిన కృషి ఒడిశా లో మ్యూజియ‌మ్‌, ప్రాచీన గ్రంథాలయం, పురావ‌స్తు అధ్య‌య‌న విభాగాలు ఏర్పాటు కావడానికి తోడ్పడింది అని ప్రధాన మంత్రి అన్నారు.

చ‌రిత్ర ను గురించి మ‌రింత విశాల‌మైన అధ్య‌య‌నం జ‌ర‌గ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అని ప్ర‌ధాన మంత్రి నొక్కిచెప్పారు. చ‌రిత్ర అనేది కేవ‌లం గ‌తాన్ని గురించిన పాఠం గానే కాక భ‌విష్య‌త్తు కు కూడా అద్దం ప‌ట్టాలి అని ఆయన అన్నారు. దేశం ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ’ ను జ‌రుపుకొనేటప్పుడు ఈ విషయంపై శ్రద్ధ వహిస్తోంద‌ని, మ‌రి మ‌న స్వాతంత్య్ర పోరాటం తాలూకు చ‌రిత్ర కు జ‌వ‌ స‌త్వాల‌ను చేకూర్చుతోంద‌ని ఆయ‌న చెప్పారు. స్వాతంత్య్ర స‌మ‌రానికి చెందిన అనేక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు, క‌థ‌లు స‌రి అయిన రూపం లో దేశ ప్ర‌జ‌ల ముందుకు రాలేక‌పోవడం శోచనీయం అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. భార‌త‌దేశ సంప్ర‌దాయం లో చ‌రిత్ర అనేది ఒక్క రాజులకో, రాజ ప్రాసాదాల‌కో ప‌రిమితం కాదు అని ఆయ‌న అన్నారు. చ‌రిత్ర అనేది వేల సంవ‌త్స‌రాల తరబడి ప్ర‌జ‌ల ప్ర‌మేయం తో ఏర్ప‌డింది అని ఆయ‌న చెప్పారు. విదేశీ ఆలోచ‌న‌ల ప్ర‌క్రియ వంశాల క‌థ‌ల ను, మ‌హ‌లు లను చ‌రిత్ర గా మార్చివేసింది అని ఆయ‌న అన్నారు. మ‌నం ఆ కోవ‌కు చెందిన ప్ర‌జ‌లం కాద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొంటూ.. రామాయ‌ణ, మ‌హాభార‌తాల ను గురించి ఉదాహ‌ర‌ణ ఇచ్చారు. రామాయ‌ణం లో, మ‌హాభార‌తం లో చాలా వ‌ర‌కు సామాన్య ప్ర‌జ‌ల గురించే ఉందని ఆయ‌న అన్నారు. మ‌న జీవితాల లో, సామాన్య వ్య‌క్తే కేంద్ర బిందువు గా ఉన్నాదని ప్ర‌ధాన మంత్రి అన్నారు.‌

అది ‘పైకా’ తిరుగుబాటు కావ‌చ్చు, గంజామ్’ క్రాంతి కావ‌చ్చు, సంబ‌ల్‌పుర్ పోరు కావ‌చ్చు.. ఒడిశా గ‌డ్డ ఎల్ల‌ప్ప‌టికీ బ్రిటిషు పాల‌న‌ కు వ్య‌తిరేకం గా విప్ల‌వాగ్నికి కొత్త శ‌క్తి ని అందిస్తూ వ‌చ్చింది అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. సంబ‌ల్ పుర్ ఆందోళ‌న లో పాలుపంచుకొన్న సురేంద్ర సాయి మ‌నంద‌రికీ ఒక ప్రేర‌ణా మూర్తి అని ప్రధాన మంత్రి అన్నారు. పండిత్ గోపబంధు, ఆచార్య హ‌రిహ‌ర్‌, డాక్ట‌ర్ హ‌రేకృష్ణ మెహ‌తాబ్ ల వంటి నేత‌ ల అపార‌మైన తోడ్పాటు ను ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో స్మ‌రించుకొన్నారు. ర‌మాదేవి, మాల‌తీ దేవి, కోకిల దేవి, రాణి భాగ్య‌వ‌తి లు అందించిన తోడ్పాటు ను శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. అలాగే, ఆదివాసీ స‌ముదాయం వారి దేశ‌భ‌క్తి తోను, వారి ప‌రాక్ర‌మం తోను బ్రిటిషు వారి ని ముప్పుతిప్ప‌ లు పెట్టార‌ని కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. క్విట్ ఇండియా ఉద్య‌మం లో పాల్గొన్న ఆదివాసీ మ‌హా నేత ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్ జీ ని ప్ర‌ధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చుకొన్నారు.

ఒడిశా చ‌రిత్ర యావ‌ద్భార‌త‌దేశ చారిత్ర‌క శ‌క్తి కి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. చరిత్ర లో ప్ర‌తిఫ‌లించిన ఈ బ‌లం వ‌ర్త‌మానం తో, భ‌విష్య‌త్తు అవ‌కాశాల‌ తో ముడిప‌డి ఉంద‌ని, ఇది మ‌న‌కు ఒక మార్గ‌ద‌ర్శి వలె పనిచేస్తుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

రాష్ట్రం అభివృద్ధి ని గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, వ్యాపార‌ అయినా, ప‌రిశ్ర‌మ అయినా వాటికి మొట్ట‌మొద‌ట గా కావ‌ల‌సింది మౌలిక స‌దుపాయాలు అన్నారు. ఒడిశా లో వేల‌కొద్దీ కిలో మీట‌ర్ల జాతీయ రాజ‌మార్గాలు, కోస్తా స‌ముద్ర‌తీర రాజ‌మార్గాలు నిర్మాణం లో ఉన్నాయ‌ని, ఇవి రాష్ట్రం లోని అనేక ప్రాంతాల ను క‌లిపేందుకు తోడ్ప‌డుతాయ‌ని వివ‌రించారు. అంతేకాకుండా, గ‌డ‌చిన 6-7 సంవ‌త్స‌రాల కాలం లో వంద‌ల కొద్దీ కిలో మీట‌ర్ల మేర రైలు మార్గాల‌ ను వేయ‌డ‌మైంద‌ని ఆయ‌న చెప్పారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తరువాత ప‌రిశ్ర‌మ‌ రంగానికి ప్రాధాన్యాన్ని ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ దిశ లో ప‌రిశ్ర‌మ‌ల ను, కంపెనీల ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. రాష్ట్రం లోని ఉక్కు రంగం లో, చ‌మురు రంగం లో గ‌ల అపార‌మైన అవ‌కాశాల‌ ను వినియోగించుకోవ‌డం కోసం వేల కొద్దీ కోట్ల రూపాయలు పెట్టుబ‌డి పెట్ట‌డ‌మైంద‌ని చెప్పారు. అదే మాదిరి గా ఒడిశా కు చెందిన మ‌త్స్య‌కారుల జీవితాల‌ ను మెరుగు ప‌ర‌చ‌డం కోసం నీలి విప్ల‌వం ద్వారా కృషి జ‌రుగుతోంద‌న్నారు.

నైపుణ్య రంగం లో అమ‌ల‌వుతున్న ప్ర‌యాస‌ల‌ ను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు. రాష్ట్రం లో యువ‌త మేలు కోసం ఐఐటి భువ‌నేశ్వ‌ర్‌, ఐఐఎస్ఇఆర్ బ్రహ్మపుర్‌, ఇండియ‌న్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్కిల్స్‌, ఐఐటి సమ్బల్‌ పుర్ ల వంటి సంస్థ‌ల‌ కు శంకుస్థాప‌న చేయ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు.

ఒడిశా చ‌రిత్ర ను, ఒడిశా వైభ‌వాన్ని ప్ర‌పంచం లో అన్ని మూల‌ల‌ కు తీసుకు పోవాల‌ని ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ ను ఒక సిస‌లైన ప్ర‌జా ఉద్య‌మం గా మ‌ల‌చాలంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ప్ర‌చార ఉద్య‌మం స్వాతంత్య్ర సంగ్రామం కాలం లో పెల్లుబికిన శ‌క్తి వ‌లెనే ఇనుమడించగ‌ల‌ద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్యక్తం చేశారు.

***



(Release ID: 1710673) Visitor Counter : 179