ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో అనుసరించాల్సిన త్రిముఖ వ్యూహంపై రాష్ట్రాలకు కేంద్రం సూచన


టీకాల కార్యక్రమం వేగవంతం చేయాలని పిలుపు

Posted On: 06 MAR 2021 3:05PM by PIB Hyderabad

రాష్టాల ఆరోగ్య కార్యదర్శులు, జాతీయ ఆరోగ్యమిషన్ ఎండీలతో ఈ రోజు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్య కార్యదర్శి  డాక్టర్ వినోద్ కే పాల్ ఈ రోజు కోవిడ్ పై సమీక్షా సమావేశం జరిపారు. హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఎనిమిది రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసుల పెరుగుదల నమోదైన నేపథ్యంలో ఈ సమీక్ష జరిపింది.

ఢిల్లీలో 9 జిల్లాలు, హర్యానాలో 15, ఆంధ్రప్రదేశ్ లో 10. ఒడిశాలో 10, హిమాచల్ ప్రదేశ్ లో 9, ఉత్తరాఖండ్ లో 7, గోవాలో 2, చందీగఢ్ లో 1 జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. అదే సమయంలో ఈ జిల్లాల్లో పరీక్షలు పెంచాల్సిన అవసరాన్ని కూడా కేంద్రం సూచించింది. వీటివలన ఇతర రాష్ట్రాలకు కూడా కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున  జాగ్రత్తలు అవసరమని కేంద్రం చెప్పింది.  జిల్లాల్లో తీరుతెన్నులను రాష్ట్రాలు సమావేశానికి తెలియజేశాయి.  

రాష్ట్రాలకు చేసిన నిర్దిష్టసూచనలు

  • పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందిఉంచు అనే త్రిముఖ వ్యూహాన్ని కొనసాగించటం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టాలి .

  • పరీక్షల సంఖ్య తగ్గిన రాష్ట్రాలలో పరీక్షలు పెంచాలి

  • ఆర్ టి –పిసిఆర్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలి

  • నిఘా మీద మళ్లీ దృష్టిపెట్టటం ద్వారా ఎంపిక చేసిన జిల్లాల్లో  కఠినంగా నియంత్రణ అమలు చేయాలి  

  • ఒక్కో పాజిటివ్ కేసుకూ సోకే అవకాశమున్న కనీసం 20 మందిని గుర్తించి పరీక్షలు జరపాలి    

  • ఎక్కువ మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో చికిత్స మీద దృష్టి సారించాలి

  •  కేసులు పెరిగేకొద్దీ మరణాలు కూడా పెరిగే అవకాశం ఉన్నందున మౌలిక సదుపాయాలను, సమర్థవంతమైన చికిత్సను పెంచుకోవాలి.

  • అందుబాటులో ఉన్న టీకా డోసులు సమర్థంగా వాడుకుంటూ క్లిష్టమైన జిల్లాలమీద దృష్టిపెట్టాలి  

  • ప్రైవేట్ ఆస్పత్రులతో సమన్వయం చేసుకుంటూ ఒక్కోవిడత 15 నుంచి 28 రోజులకు సరిపడేలా టీకాల టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి  

  • కోవిడ్ పరంగా  తీసుకోవాల్సిన జాగ్రత్తలమీద ప్రచారం చేపట్టాలి, పకడ్బందీగా అమలు చేయాలి.

  • చికిత్సలో ఉన్నవారిని వేరుచేసి వైద్యపరమైన పర్యవేక్షణ చేపట్టటం ద్వారా పరిస్థితి క్షీణిస్తున్నవారిని గుర్తించి చికిత్స అందించాలి   

ఎక్కడైనా వ్యాధి వ్యాపించే పరిస్థితి కనబడుతున్నప్పుడు వెంటనే వ్యాప్తి నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. 

 

****



(Release ID: 1702899) Visitor Counter : 213