నీతి ఆయోగ్

భారత్ సృజనాత్మక సూచిక రెండవ నివేదిక విడుదల

నీతీ ఆయోగ్ ఆవిష్కరించిన జాబితాలో ఢిల్లీ నెంబర్-1

తమతమ కేటగిరీలలో కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాలకు అగ్రస్థానాలు

Posted On: 20 JAN 2021 6:32PM by PIB Hyderabad

  భారత్ సృజనాత్మక సూచిక (ఇండియా ఇన్నవేషన్ ఇండెక్స్) రెండవ సంకలన నివేదిక ఈ రోజు విడుదలైంది. నీతీ ఆయోగ్, ఇన్ స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్ నెస్ కలసి ఉమ్మడిగా వర్చువల్ పద్ధతిలో ఈ నివేదికను విడదల చేశాయి. సృజనాత్మకతలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల  సామర్థ్యం, పనితీరుపై నిశిత పరిశీలనతో ఈ నివేదికను రూపొందించారు. తొలి సంకలన నివేదికను గత ఏడాది అక్టోబరులో వెలువడింది.

   2020వ సంవత్సరపు భారత్ సృజనాత్మక సూచికా నివేదికను నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ ఆవిష్కరించారు. నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్, వ్యవసాయ విభాగం సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) అమితా కాంత్, సైన్స్, టెక్నాలజీ సలహాదారు నీరజ్ సిన్హా, ఇన్ స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్ నెస్ అధిపతి డాక్టర్ అమిత్ కపూర్ సమక్షంలో నివేదిక ఆవిష్కరణ జరిగింది.     

  విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా విభాగం కార్యదర్శి డాక్టర్ శేఖర్ సి. మాండే, జీవ సాంకేతిక పరిజ్ఞాన విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, భూగోళ శాస్త్రాల అధ్యయన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.ఎన్. రాజీవన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, గణాంక వ్యవహారాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ డాక్టర్ క్షత్రపతి శివాజీ తదితరులు  కార్యక్రమానికి హాజరయ్యరు.

https://ci3.googleusercontent.com/proxy/LU6GjZZ1D5P3CPjb0y_lPw_j0yfvKy9W6rPuwx86i0L7pCjqzxUZmG84_L9bmRR3KGkfYd5DOyh4W5wi5UV3NAkgtcL6ZxcOadWPsJSrtbg93eHwR5rPfnbegA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018QX3.jpg

 

  వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీ తత్వం ఉన్నత స్థాయిలోనే ఉన్నట్టు సృజనాత్మక సూచిక రెండవ సంకలన నివేదిక కూడా సూచిస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమతమ సామర్థ్య అంశాలు, సృజనాత్మక పనితీరు ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మెరుగుపరుచుకునేందుకు వాటి మధ్య పోటీ తర్వం ఉన్నత స్థాయిలో ఉండటం ఎంతో ఆవశ్యకం.

   ‘ప్రధాన రాష్ట్రాల’ విభాగంలో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థాయిని కొనసాగిస్తుండగా, మహారాష్ట్ర తమిళనాడును అధిగమించి 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 10 అగ్రశ్రేణి రాష్ట్రాల్లో తెలంగాణ, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఉన్నాయి. పెట్టుబడుల ఒప్పందాలు, నమోదైన భౌగోళిక సూచికలు, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ.ల) ప్రవాహం వంటి అంశాల్లో సామర్థ్యం, పెరిగిన సృజనాత్మక పరిజ్ఞాన సామర్థ్యాలతో కర్ణాటక రాష్ట్రం సృజనాత్మకత రంగంలో అగ్రస్థానంలో నిలవగలిగింది. ఈ సారి ‘ప్రధాన రాష్ట్రాల’ కేటగిరీలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి 4 దక్షిణాది రాష్ట్రాలు ఐదు అగ్రస్థానాల్లో చోటును సంపాదించగలిగాయి.

  దేశం మొత్తమ్మీద ఢిల్లీ తొలి స్థానాన్ని దక్కించుకోగా, చండీగఢ్ మాత్రం 2019 తర్వాత ముందుకు దూసుకుపోయి ఈ సారి రెండవ స్థానం ఆక్రమించింది. ‘ఈశాన్య ప్రాంతం/పర్వతమయ రాష్ట్రాల’ కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్ రెండవ స్థానంనుంచి ఎదిగి మొదటి స్థానం ఆక్రమించింది. ఇదే కేటగిరీలో 2019లో అగ్రస్థానంలో ఉండిన సిక్కిం రాష్ట్రం, 4వ స్థానంతో సరిపెట్టుకుంది. 

   సృజనాత్మక ఉత్పాదక అంశాలను ఐదు ప్రమాణాల ప్రాతిపదికగా లెక్కిస్తారు. ఉత్పత్తిని మాత్రం రెండు ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు.  ‘మానవ వనరుల వినియోగం’, ‘పెట్టుబడి’, ‘వృత్తిపరమైన నైపుణ్య సిబ్బంది’, ‘వాణిజ్య వాతావరణం’, ‘భద్రత, న్యాయపరమైన వాతావరణం’  వంటివాటిని సృజనాత్మక ఉత్పాదక అంశాల లెక్కింపునకు ప్రమాణాలుగా గుర్తించారు. ‘నైపుణ్య ఉత్పత్తి’, ‘నైపుణ్య పంపిణీ’ వంటి అంశాలను పనితీరుకు, ఉత్పాదన శక్తికి ప్రమాణాలుగా గుర్తించారు.

 

https://ci3.googleusercontent.com/proxy/RSJSpN21MzDnCd2ML6iapdPA4B5H2QBBwVuy9lMdIPB728GJ52876sRW7o6TGvb_CzCzYr0JleyYf25qhk9QGQP9UERMliPeWeNqqJVLJ4cpu-UOYP7izzsOsQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BDOH.jpg

   సృజనాత్మక సూచిక నివేదిక విడుదల కార్యక్రంలో నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ,.. ‘సృజనాత్మకత సానుకూల వ్యవస్థలో వివిధ భాగస్వామ్య వర్గాల మధ్య సమన్వయానికి భారత్ సృజనాత్మక సూచిక దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ తత్వంతో కూడిన సుపరిపాలన వైపు భారతదేశం మరలేందుకు వీలు కలుగుతుందన్నారు. దేశంలో సృజనాత్మక వాతావరణం మరింత బలోపేతమయ్యేందుకు ఇది శుభారంభమని అన్నారు. సృజనాత్మకతలో ప్రపంచానికే సారథ్యంవహించేలా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఇదే ఉత్తమ మార్గమన్నారు.

  నీతీ ఆయోగ్ సి.ఇ.ఒ. అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, సృజనాత్మకతలో వివిధ రాష్ట్రాల ఉత్పాదక సామర్థ్యాన్ని లెక్కించేందుకు భారత్ సృజనాత్మక సూచిక సరైన ప్రయత్నమని, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో యంత్రాగ వ్యవస్థల సమర్థ వినియోగానికి ఇది వీలు కలిగిస్తుందని, స్వావలంబతో కూడిన ఆత్మనిర్భర్ భారత్  లక్ష్య సాధనకు దోహదపడుతుందని అన్నారు.

   నీతీ ఆయోగ్ సలహాదారు నీరజ్ సిన్హా మాట్లాడుతూ, సృజనాత్మకతలో ఆయా రాష్ట్రాలు తమ పనితీరును, సామర్థ్యాన్ని గుర్తించడంలో ఈ సృజనాత్మక సూచిక కీలపాత్ర పోషిస్తుందని, రాష్ట్రాలు తమ విభిన్నమైన బలాలను సానుకూలంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇన్ స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్ నెస్ అధిపతి డాక్టర్ అమిత్ కపూర్ కూడా ప్రసంగించారు.

  భారతదేశపు సృజనాత్మక వాతావరణాన్ని మధింపు చేసి, ఇందుకు నిర్విరామంగా పనిచేసే ఒక వ్యవస్థను సృష్టించడానికి భారత్ సృజనాత్మక సూచిక విధానాన్ని రూపొందించారు. సృజనాత్మక రంగంలో ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరు ఆధారంగా, వాటికి ర్యాంకులను కూడా ఈ సూచిక నిర్ణయిస్తుంది. సృజనాత్మకతను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాల రూపకల్పనకు  కూడా దోహదపడుతుంది.  

  అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య ‘పోటీ తత్వంతో కూడిన ఫెడరల్ స్వభావాన్ని’ అలవర్చడమే లక్ష్యంగా నీతీ ఆయోగ్ పనిచేస్తోంది. భారత సృజనాత్మక సూచిక వ్యవస్థను ఉత్ఫ్రేరకంగా వినియోగించుకుని సృజనాత్మకత ఉత్పాదకతను పెంచేందుకు నీతీ ఆయోగ్ చిత్తశుద్ధితో పనిచేస్తోంది.

 సృజనాత్మక సూచిక నివేదిక పూర్తి పత్రాన్ని ఇక్కడ చూడవచ్చు.: https://niti.gov.in/sites/default/files/2021-01/IndiaInnovationReport2020Book.pdf

 

********



(Release ID: 1690611) Visitor Counter : 329