రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మెట్రో రైల్ నెట్వ‌ర్క్‌లో ఆధునిక బ‌యోడైజెస్ట‌ర్ ఎంకె-11 సాంకేతిక‌త‌ను అమ‌లు చేసేందుకు మ‌హా_మెట్రోతో ఎం ఒయుపై సంత‌కాలు చేసిన డిఆర్‌డిఒ

Posted On: 05 JAN 2021 5:43PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాన ప‌రిశోథ‌న సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఒ), మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, భార‌త ప్ర‌భుత్వ సంయుక్త వ్యాపార సంస్థ అయిన మ‌హారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేష‌న్ (మ‌హా -మెట్రో) త‌మ త‌మ కేంద్రాల‌లో నీటి ప‌రిర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌కు డిఆర్‌డి ప‌ర్యావ‌ర‌ణ అనుకూల బ‌యోడైజెస్ట‌ర్ యూనిట్ల‌ను (మురికినీటి నాలాలు అవ‌స‌రం లేని పారిశుద్ధ్యం సాంకేతిక‌త‌) నెల‌కొల్పేందుకు క‌లిసి ప‌ని చేస్తున్నాయి. ఈ మేర‌కు మ‌హా -మెట్రో, డిఆర్‌డిఒ సంస్థ‌ల మ‌ధ్య‌న జ‌న‌వ‌రి 5, 2021న అవ‌గాహ‌న ప‌త్రం పై సంత‌కం చేశాయి. దీని ప్ర‌కారం డిఆర్‌డిఒ మెట్రో రైల్ నెట్‌వ‌ర్క్‌లో మాన‌వ వ్య‌ర్ధాల‌ను శుద్ధి చేసే త‌న ఆధునిక బ‌యోడైజెస్ట‌ర్ ఎంకె- 11 సాంకేతిక‌త‌ను అమ‌లు చేసేందుకు డిఆర్‌డిఒ సాంకేతిక తోడ్పాటును అందిస్తుంది. 
ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌,  డిఆర్‌డిఒ కేంద్ర కార్యాల‌యం, న్యూఢిల్లీ  -లైఫ్ సైన్సెస్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ ఎ.కె. సింగ్‌, మ‌హారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సిఎల్‌) మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బ్రిజేష్ దీక్షిత్ త‌మ సంస్థ‌ల త‌ర‌ఫున అవగాహ‌నా ప‌త్రాల‌ను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ అవ‌గాహ‌నా ప‌త్రంపై డిఆర్‌డిఇ, గ్వాలియ‌ర్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ డి.కె. దూబే, మ‌హా- మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, పూణె డైరెక్ట‌ర్ ఎస్‌.హెచ్. గాడ్గిల్ సంత‌కాలు చేశారు.
డిఆర్‌డిఒ రూపొందించిన బ‌యోడైజెస్ట‌ర్‌, దేశీయంగా, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌, త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన సాంకేతిక‌త‌నే కాక అత్య‌ధిక సంఖ్య‌లో డిఆర్‌డిఒ లైసెన్సీలు గ‌ల ప్ర‌త్యేక‌త దానికి ఉంది. 
త‌న ప్యాసెంజ‌ర్ కోచ్‌ల‌లో భారతీయ రైల్వేలు ఇప్ప‌టికే 2.4-ల‌క్ష‌ల బ‌యోడైజెస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం మ‌హా-మెట్రో కోసం, ఆ సాంకేతిక‌త‌ను నీటిని, స్థ‌లాన్ని ఆదా చేసేందుకు మెరుగుప‌ర‌చారు.
 క‌స్ట‌మైజ్ చేసిన ఎంకె-11 బ‌యోడైజెస్ట‌ర్‌ దాల్ స‌ర‌స్సులోని హౌజ్ బోట్ల‌లో ఉత్ప‌త్తి అయిన మాన‌వ వ్య‌ర్ధాల‌ను శుద్ధం చేయ‌డంలో ఎంత విజ‌య‌వంతంగా ప‌ని చేయ‌గ‌ల‌దో డిఆర్‌డిఒ సంస్థ జ‌మ్ము-కాశ్మీర్ ప‌రిపాల‌నా విభాగానికి ప్ర‌త్య‌క్షంగా రుజువు చేశారు. జె&కెకు చెందిన స‌ర‌స్సులు, జ‌ల‌మార్గ అభివృద్ధి అథారిటీ  నీటి కాలుష్యాన్ని త‌గ్గించేందుకు దాల్ స‌ర‌స్సు చుట్టూగ‌ల పౌర ఆవాసాల‌లో ఏర్పాటు చేసేందుకు 100 యూనిట్ల ఎంకె-11 బ‌యోడైజెస్ట‌ర్ల‌ను సేక‌రించే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. శ్రీ‌న‌గ‌ర్‌లో బ‌యోడైజెస్ట‌ర్ ఎంకె-11 అమ‌లును జె&కె హౌకోర్టు డిఎంఆర్‌సి మాజీ ఎండి డాక్ట‌ర్ ఇ. శ్రీ‌ధ‌ర‌న్ నేతృత్వంలో నియ‌మించిన నిపుణుల క‌మిటీ ప‌ర్య‌వేక్షిస్తోంది. ఒక‌వేళ ఇది పూర్తిగా అమ‌లు చేస్తే , ప‌ర్యావ‌ర‌ణ అనుకూల సాంకేతిక‌త దాల్ లేక్‌లోని కాలుష్యాన్ని చెప్పుకోద‌గినంత‌గా త‌గ్గిస్తుంది. 
బ‌యో-డిగ్ర‌డేష‌న్ సామ‌ర్ధ్యం, న‌మూనాలో మార్పులు, ద్వితీయ శుద్ధి మాడ్యూల్‌ను అద‌నంగా చేర్చ‌డం వంటి మెరుగుల‌తో ఈ సాంకేతిక‌త‌ను అభివృద్ధి ప‌రిచారు. జీవ ప్ర‌తిచ‌ర్య కాలాన్ని పెంచ‌డం ద్వారా, వ్య‌వ‌స్థ బ‌యో డిగ్ర‌డేష‌న్ సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు మ‌రింత మార్గాన్ని అందించే విధంగా కొత్త రియాక్ట‌ర్‌ను రూపొందించారు. ఈ సాంకేతిక‌త‌ను లేహ్‌-ల‌డాక్‌, సియాచిన్ గ్లేషియ‌ర్ స‌హా హిమాల‌య ప్రాంతాల‌లో ఎత్తైన ప్రదేశాల‌లో మోహ‌రించిన సైనిక ద‌ళాల కోసం ప్ర‌ధానంగా అభివృద్ధి చేశారు. 
డిడిఆర్‌&డి, డిఆర్‌డిఒ చైర్మ‌న్ అయిన డాక్ట‌ర్ జి స‌తీష్ రెడ్డి విజ‌య‌వంత‌మైన అమ‌లుకు ఇరు బృందాల‌కు శుభాకాంక్ష‌లు చెప్తూ, డాటా ల‌భ్యత‌, ఫీడ్‌బ్యాక్‌ల‌తో సాంకేతిక‌త‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం అవ‌స‌రం అవుతుంద‌న్నారు. 

***



(Release ID: 1686393) Visitor Counter : 201