వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ చట్టాలు రైతుల లబ్ధి కోసం, భారతీయ వ్యవసాయాన్ని బలోపేతం చేయడం కోసం ఉద్దేశించినవి - నరేంద్ర సింగ్ తోమర్
ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌతేషియా సభ్యులతో సంభాషించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో రైతులకు లబ్ది చేకూర్చేందుకు గత ఆరేళ్ళల్లో ఎన్నో చర్యలు తీసుకున్నాం - వ్యవసాయ మంత్రి
Posted On:
22 DEC 2020 4:29PM by PIB Hyderabad
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిదని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి పెట్టారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ఆయన మంగళవారంనాడు ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌతి ఏషియాకు చెందిన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతు ఉత్పత్తి వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహ, సులభతర) చట్టం 2020, ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) చట్టం 2020, నిత్యావసర వస్తువుల సవరణ చట్టం 2020 అన్నవి దేశంలో నేటి వరకూ వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన భారీ సంస్కరణలని ఆయన వివరించారు. ఈ సంస్కరణలు రైతులకు మార్కెట్ స్వేచ్ఛను కల్పించడమే కాక, వ్యాపారాన్ని ప్రోత్సహించడం, సాంకేతికతను అందుకునేందుకు సౌలభ్యాన్ని కల్పిస్తాయని, ఇవి వ్యవసాయాన్ని పరివర్తనకు లోను చేస్తాయన్నారు. భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం కావడంతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అన్న సూత్రంపై పని చేస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు వ్యవసాయ చట్టాల కింద అనేక అంశాలను సవివరంగా చెప్పడమే కాక, అవి రైతులకు ఎలా లబ్ధి చేకూరుస్తాయి, నూతన వాతావరణ వ్యవస్థలో భారతీయ వ్యవసాయం మెరుగుపడటానికి ఎలా దారి తీస్తాయి అన్న విషయాలను వివరించారు. ఈ సంస్కరణల చట్టాలను చేయాలన్న నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని, దాదాపు దశాబ్దాలుగా వివిధ నిపుణుల, వివిధ కమిటీలు/ బృందాల సూచనలపై చర్చలు జరిగిన తర్వాత మాత్రమే తీసుకున్నవన్నారు. కనీస మద్దతు గురించి మాట్లాడుతూ, ఎంఎస్పి అనేది పాలనాపరమైన నిర్ణయమని, ఇది కొనసాగుతుందని మంత్రి చెప్పారు. పలుసార్లు ఎంఎస్పిని పెంచడం ద్వారా, సేకరణను బహుళంగా పెంచడం ద్వారా - 2020-21 ఖారీఫ్ కాలం సహా మోడీ ప్రభుత్వం ఎంఎస్ పి పట్ల తన నిబద్ధతను చాటుకుందన్నారు. ఎంఎస్పి పెరుగుదలను రైతుల ఉత్పత్తి వ్యయంపై కనీసం 1.5 శాతం అధికంగా రైతుకు చెందాలన్న ఫార్ములా ఆధారంగా మోడీ ప్రభుత్వం ఎంఎస్పి పెంపును ప్రకటించిందన్నారు. ఇది ఇచ్చిన హామీని నెరవేర్చడం.
గత ఆరేళ్ళుగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రైతాంగ సంక్షేమం కోసం తీసుకున్న పలు చర్యలను, సంస్కరణలను వ్యవసాయ మంత్రి రేఖామాత్రంగా వివరించారు. భారతీయ వ్యవసాయం ఆహార కొరత నుంచి ఆహార మిగులనే స్థితికి వచ్చిందన్నారు. కనుక ఈ రంగాన్ని అంటే ఆర్థిక వ్యవస్థ వెన్నుముకను ప్రోత్సహించేందుకు రైతు అనుకూల సంస్కరణలు అవసరమని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ రంగం మరింత బలోపేతం అవడం కోసం రైతాంగ అనుకూల విధానాలను రూపొందించేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు అన్ని రకాలుగా కృషి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)ని ఏర్పాటు చేసిందని, దీని కింద ఏడాదికి రూ. 6,000లను లబ్దిదారు అకౌంటుకు మూడు ఇన్స్టాలమెంట్లలో బదిలీ చేసిందన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి రూ. 95979 కోట్ల రూపాయిలను నేటి వరకు విడుదల చేశారని, 10.59 కోట్ల రైతాంగ కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పిఎం-కిసాన్ లబ్ధిదారులకు రాయితీపై రుణాలను ఇచ్చే ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారన్నారు. రసాయినాల వినియోగాన్ని తగ్గించేందుకు,మృత్తికాసార తత్త్వాన్ని మెరుగుపరిచేందుకు, మొత్తంగా పంట దిగుబడి పెంచేందుకు, వ్యవసాయ ప్రయోజనాల కోసం యూరియా ఉపయోగాన్ని తగ్గించేందుకు 2015-16 నుంచి వేపపూత పూసిన యూరియాను ప్రవేశపెట్టారని వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్)ను 9 ఆగస్టు, 2020న ప్రారంభించారన్నారు. ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడుల కోసం ఈ నిధి లక్ష్యం మధ్య నుంచి దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్ చేయడం. రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్పిఒలు) గురించి కూడా తోమర్ మాట్లాడారు. దాదాపు 10,000 ఎఫ్పిఒల ఏర్పాటు, ప్రోత్సహం కోసం మొత్తం రూ. 6965 కోట్ల నిధితో 29.02.2020న పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఐదేళ్ళలో 10,000 ఎఫ్పిఒల ఏర్పాటు చేయాలని లక్ష్యించారు.
సంస్కరణలను రైతుల ప్రయోజనం కోసమే చేపట్టడం జరిగిందని, ఇవి భారతీయ వ్యవసాయ రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతాయని మంత్రి పునరుద్ఘాటించారు. రైతు యూనియన్లతో ప్రభుత్వం అనేక దఫాలుగా చర్చలు జరిపిందని, ఎటువంటి షరతులు లేకుండా వివిదాస్పద అంశాలపై, ప్రతి క్లాజుపై చర్చించడాన్ని కొనసాగిస్తుందన్నారు.
***
(Release ID: 1682793)
Visitor Counter : 1017