రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వేల్లో ఆసుపత్రి నిర్వహణా సమాచార వ్యవస్థ

దక్షిణ మధ్యరైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం

Posted On: 11 DEC 2020 2:54PM by PIB Hyderabad

   రైల్వే సిబ్బంది, కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) ఆధారిత ప్రధాన సమాచార వ్యవస్థకు భారతీయ రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది.  ఆసుపత్రి నిర్వహణా సమాచార వ్యవస్థ (హెచ్.ఎం.ఐ.ఎస్.)పేరిట ఈ ప్రాజెక్టు మొదలైంది. రైల్వే బోర్డులోని  రైల్వే ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ బి. పి నందా 2020, డిసెంబరు 11న వర్చువల్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దక్షిణ మధ్యరైల్వే  జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సమక్షంలో  జరిగిన ఈ కార్యక్రమంలో  రైల్ టెల్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ చావ్లా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ (పి.సి.ఎం.డి.) డాక్టర్ ప్రసన్న కుమార్   పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా డాక్టర్ బి.పి. నందా మాట్లాడుతూ రైల్వే సిబ్బందికి, కార్మికులకు ఐ.టి. పరిజ్ఞానంతో ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలన్న కల ఇప్పటికి సాకారమైందని అన్నారు.  రైల్వేల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో హెచ్‌.ఎం.ఐ.ఎస్. గణనీయమైన మార్పులు తేగలదనిఆరోగ్యసేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని, వనరుల పారదర్శక వినియోగానికి దోహదపడుతుందని అన్నారు. దీనితో ఆసుపత్రులలో రోగులు వేచిఉండే వ్యవధి తగ్గిపోతుందనివైద్యుల బృందానికి మెడికల్ రికార్డులు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు. రైల్వేల్లో  వైద్యసేవలకు సంబంధించి విశిష్ట గుర్తింపు వ్యవస్థను (యు.ఎం.ఐ.డి.ని), హెచ్.ఎం.ఐ.ఎస్.ని ప్రారంభించే ప్రక్రియలో దక్షిణ మధ్య  రైల్వే  అందించిన సేవలు ఎంతో అభినందనీయమని నందా అన్నారు.

  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ .మాల్యా మాట్లాడుతూ, కొత్త ఐ.టి. ఆధారిత హెచ్.ఎం.ఐ.ఎస్. పథకంలో తాము పాలుపంచుకోవడం తమకెంతో గర్వకారణమన్నారు. భారీ సంఖ్యలో ఉన్న రైల్వే కార్మికుల, సంబంధిత లబ్ధిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా  ప్రారంభిస్తున్న మరో ఐ.టి. ఆధారిత ప్రాజెక్టుగా హెచ్.ఎం.ఐ.ఎస్. ప్రాజెక్టును మాల్యా అభివర్ణించారు.  దక్షిణ మధ్యరైల్వే అగ్రగామిగా ప్రారంభించిన  ఇ-ఆఫీస్, ఇ-డ్రాయింగ్ అప్రూవల్ వ్యవస్థ, యు.ఎం.ఐ.డి., వంటి అనేక ఐటి ఆధారిత ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఇప్పటికే అమలు చేశారన్నారు. హెచ్‌.ఎం.ఐ.ఎస్. ప్రాజెక్టును అమలుచేయడంతో ఎలెక్ట్రానిక్ మెడికల్ రికార్డుల వంటి భారీ స్థాయి సమాచారాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని, వ్యాధుల చికిత్సా విధానంలోనే కాకుండా, నిరోధక వ్యవస్థ రూపకల్పనలో కూడా వైద్య సిబ్బందికి ఈ వ్యవస్థ ఎంతో దోహపడుతుందని అన్నారు.  ఇది management షధ నిర్వహణను ఆర్థికంగా మరియు వనరుల నిర్వహణను బాగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. మందుల వినియోగ నిర్వహణ వ్యయాన్ని అదుపు చేయడంలోను, వనరుల సమర్థవినియోగంలోనూ ఇది ఉపయోపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు    రైల్ టెల్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ చావ్లా మాట్లాడుతూ, ఆరోగ్య సేవల్లో పనిచేసే  భాగస్వామ్యవర్గాలన్నింటికీ హెచ్.ఎం.ఐ.ఎస్. ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని, ప్రధాన ఆసుపత్రులను, అనుబంధ వైద్య కేంద్రాలతో అనుసంధానం చేస్తుందని అన్నారు. హెచ్.ఎం.ఐ.ఎస్. ప్రాజెక్టులో 20కిపైగా మాడ్యూల్స్ ఉంటాయని వైద్య సిబ్బందికి, లబ్ధిదారులకు ఎంతో ప్రయోజన చేకూర్చుతాయని అన్నారు.

రైల్వేలలో హెచ్.ఎం.ఐ.ఎస్. ప్రాజెక్టు గురించి:

 రైల్ టెల్ కార్పొరేషన్ సహకారంతో హెచ్.ఎం.ఐ.ఎస్. ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఆసుపత్రి నిర్వహణ, పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఏకగవాక్ష (సింగిల్ విండో) విధానాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఆసుపత్రి సేవలు, వ్యాధి నిర్ధారణ, మందుల సదుపాయం, వైద్య పరీక్షలు, పారిశ్రామిక ఆరోగ్యం తదితర అంశాలకు ఈ సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ కింది ప్రధాన లక్ష్యాలను ప్రాజెక్టు నెరవేరుస్తుంది.:

     

•             అన్ని ఆరోగ్య నిర్వహణా సదుపాయాలను, వాటి వనరులను సమర్థంగా నిర్వహించడం

•             పరిపాలనా వ్యవస్థకు అనుసంధానించిన అన్ని ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించడం

•             లబ్ధిదారులకు నాణ్యమైన ఆరోగ్యరక్షణ సేవలను అందించడం

•             రోగి వైద్య పరీక్షల వ్యవధిని, చికిత్సా వ్యవధిని మెరుగుపరచడం

•             రోగులందరి ఎలెక్ట్రానిక్ మెడికల్ రికార్డులను (ఇ.ఎం.ఆర్.లను) రూపొందించి, వాటిని సజావుగా నిర్వహించడం.

  రైల్వేల్లో హెచ్.ఎం.ఐ.ఎస్. ప్రాజెక్టును అమలకోసం  ప్రస్తుతం 3 మాడ్యూల్స్.ను పరిగణనలోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్, అవుట్ పేషంట్ (ఒ.పి.డి.) డాక్టర్-డెస్క్, ఔషధ విభాగాలకు సంబంధించిన మాడ్యూల్స్ ఎంపిక చేసుకున్నారు. లాలాగూడలోని కేంద్రీయ ఆసుపత్రిలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ఈ మాడ్యూల్స్.ను అమలు చేయనున్నారు. అనంతరం దక్షిణమధ్య రైల్వేలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ వీటిని క్రియాశీలకంగా అమలు చేయబోతున్నారు. లబ్ధిదారు వివరాలను సులభంగా నమోదు చేయడానికి విశిష్టమైన మెడికల్ గుర్తింపు వ్యవస్థతో కూడిన రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఉపకరిస్తుంది. ఈ మాడ్యూల్.తో  రోగి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇక రోగికి వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ వివరాలు, ఎలెక్ట్రానిక్ మెడికల్ రికార్డుల తయారీ అంశాలకు ఒ.పి.డి. డెస్క్ మాడ్యూల్ వర్తిస్తుంది. డాక్టర్ నిర్దేశించే మందులు తదితర అంశాలకు ఔషధ విభాగం మాడ్యూల్ వర్తిస్తుంది.


****


(Release ID: 1680110) Visitor Counter : 284